నావికాదళంలో అత్యున్నత అధికారిగా హైదరాబాద్ కుర్రాడు!
హైదరాబాద్ నగరానికి చెందిన ఓ యువకుడు భారత నావికాదళంలో సబ్ లెఫ్టినెంట్ అధికారిగా బాధ్యతలు చేపట్టాడు. హైదరాబాద్ బంజారాహిల్స్లోని ముఫకం జా కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (ఎంజేసీఈటీ) నుంచి మహ్మద్ అబూబకర్ 2022 సివిల్ ఇంజినీరింగ్లో గ్రాడ్యుయేట్ అయ్యారు. కళాశాలలో ఉన్న సమయంలో చదువుతోపాటు క్రీడల్లోనూ ఆయన తనదైన ప్రతిభను చూపారు. ఆటలన్నా, పోటీలన్నా ముందుండేవాడు. అదే తత్వం అతని లక్ష్యాన్ని చేరుకునేలా చేసింది. రాష్ట్రం నుంచి ప్రాతినిథ్యం.. అబూబకర్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ (ఎస్ఎస్బీ)లో అర్హత సాధించారు. కేరళలోని ఎజిమలలోని ఇండియన్ నావల్ అకాడమీలో కఠినమైన శిక్షణ పొందారు. మే 31న పాసింగ్ అవుట్ పరేడ్లో పాల్గొన్న అతను అధికారికంగా భారత నావికాదళంలో అధికారిగా చేరారు. అబూబాకర్ కళాశాల సమయంలోనూ క్రీడల్లో ముందుండేవాడు. అంతేకాకుండా రాష్ట్రం తరుపున సైతం పోటీల్లో పాల్గొన్నారు. కళాశాలలో సివిల్ ఇంజినీరింగ్ విభాగంలో స్పోర్ట్స్ కో–ఆర్డినేటర్గా వ్యవహరించిన అబుబాకర్ నైనిటాల్లో జరిగిన 7–ఎ–సైడ్ జాతీయ స్థాయి ఫుట్బాల్ టోర్నమెంట్లో, ఇండో–నేపాల్ అంతర్జాతీయ ఫుట్బాల్ టోర్నమెంట్లో ఎంజేసీఈటీ, తెలంగాణ రాష్ట్రం తరుపున రెండింటికీ ప్రాతినిధ్యం వహించాడు. లక్ష్యం కోసం ముందుకు..అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి అవసరమైన కఠోరశ్రమ ఎంతో అవసరం. ఒకవైపు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించడం వల్లనే తనకు ఈ అవకాశం లభించిందని అంటున్నారు అబుబాకర్. తన ఈ ప్రయాణంలో కళాశాల యాజమాన్యం ప్రోత్సాహం ఎంతో ఉందన్నారు. భారత సాయుధ దళాలకు అవసరమైన అధికారిగా నిలపడంలో, మార్గదర్శకత్వం చూపడంలో అవసరమైన శిక్షణ అందించడంలో సహాయపడిన ఫిజికల్ డైరెక్టర్ మహ్మద్ యూసుఫుద్దీన్, స్పోర్ట్స్ చైర్మన్ అమీర్ జావీద్ తదితరుల సేవలను ఆయన గుర్తుచేశారు. తనతోపాటు ఇటీవలి కాలంలో తమ కళాశాల నుండి దాదాపు 25 మందికి పైగా విద్యార్థులు రక్షణ, ప్రభుత్వ రంగ సంస్థలు, పౌర పరిపాలనతో సహా వివిధ ప్రభుత్వ సేవల్లో ప్రతిష్టాత్మక పదవులను అలంకరించారన్నారు. నావికాదళంలో పనిచేయడాన్ని తాను ఎంతో గర్వంగా భావిస్తున్నానని అన్నారు. యువత సైతం తమ ఆలోచనలను సుసాధ్యం చేసుకోవడానికి అవసరమైన లక్ష్యాలను ఏర్పచుకోవాలన్నారు. (చదవండి: పుస్తకాలతో మరోసారి..! ఆ అభిరుచిని అస్సలు వదులుకోవద్దు)