breaking news
Mining irregularities
-
యరపతినేనికి షాక్..
-
యరపతినేని అక్రమ మైనింగ్పై సీబీ‘ఐ’
సాక్షి, అమరావతి: గుంటూరు జిల్లా పిడుగురాళ్ల, నడికుడి, కేశానుపల్లి, దాచేపల్లి, కొండమోడులతో పాటు మరికొన్ని చోట్ల తెలుగుదేశం పార్టీకి చెందిన గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు భారీ స్థాయిలో అక్రమ మైనింగ్కు పాల్పడ్డారని నిర్ధారణ అయిన నేపథ్యంలో.. ఈ వ్యవహారంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాలని సీబీఐని కోరాలని నిర్ణయించినట్లు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. ఈ విషయాన్ని ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్(ఏజీ) ఎస్.శ్రీరామ్ బుధవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చాగరి ప్రవీణ్కుమార్, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణ మూర్తితో కూడిన ధర్మాసనం ముందు ప్రస్తావిం చారు. యరపతినేని మైనింగ్ అక్రమాలపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ మాజీ ఎమ్మెల్సీ టీజీవీ కృష్ణారెడ్డి హైకోర్టులో ఓ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారని, ఈ పిటిషన్పై తీర్పును వెలువరించాల్సి ఉందని ఆయన ధర్మాసనానికి గుర్తు చేశారు. ఇప్పుడు ఈ కేసులో కోర్టు తీర్పు అవసరం లేదని, ప్రభుత్వమే యరపతినేని అక్రమాలపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని నిర్ణయించిందని, ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తనకు అధికారిక సమాచారం ఇచ్చారని ఆయన ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. గత విచారణలో కోర్టు వ్యక్తం చేసిన అభిప్రాయాలను.. ఈ కేసులో భారీ అక్రమాలు జరిగినట్లు లభించిన ప్రాథమిక ఆధారాలను.. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ప్రతిపక్ష పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే కావడంతో సీఐడీ దర్యాప్తును కొనసాగిస్తే అది కక్ష సాధింపుగా భావించేందుకు అవకాశం ఉందని.. దీంతో సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని నిర్ణయించిందని చెప్పారు. అందువల్ల టీజీవీ కృష్ణారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని రీ ఓపెన్ చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనికి సానుకూలంగా స్పందించిన హైకోర్టు కృష్ణారెడ్డి వ్యాజ్యాన్ని సోమవారం రీ ఓపెన్ చేస్తామని తెలిపింది. యరపతినేని ఎలాంటి అనుమతులు తీసుకోకుండా అక్రమంగా లైమ్స్టోన్ తవ్వకాలు చేస్తున్నారని, కోట్ల రూపాయల మేర ప్రభుత్వానికి పన్నులు, సీనరేజీ చార్జీలు ఎగవేశారంటూ మాజీ ఎమ్మెల్సీ టీజీవీ కృష్ణారెడ్డి 2016లో హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అలాగే యరపతినేని అక్రమ మైనింగ్పై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ ఆయన హైకోర్టులో ఓ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. ఇటీవల ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన ధర్మాసనం యరపతినేని అక్రమ మైనింగ్పై దర్యాప్తు జరపాలని కేంద్ర దర్యాప్తు సంస్థలను మీరే ఎందుకు కోరకూడదని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సీబీఐ విచారణ కోరాలని నిర్ణయించింది. -
మైనింగ్ అక్రమాలకు ఇక చెక్
సాక్షి, హైదరాబాద్: ఖనిజాల వెలికితీతలో అక్రమాలకు అడ్డుకట్ట వేసే ఉద్దేశంతో ‘ప్రాజెక్ట్ సుదూర్ దృష్టి’కి శ్రీకారం చుట్టినట్లు కేంద్ర గనులశాఖ సంయుక్త కార్యదర్శి సుభాష్ చంద్ర వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పించిన ‘డిజిటల్ ఇండియా’లో భాగంగా ఈ ప్రాజెక్టును చేపట్టినట్లు వివరించారు. కేంద్ర గనులశాఖ పరిధిలోని ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ (ఐబీఎం), నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్సీ) గురువారం హైదరాబాద్లో ‘ప్రాజెక్టు సుదూర్ దృష్టి’పై పరస్పర అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నాయి. ఐబీఎం, ఎన్ఆర్ఎస్సీ అధికారులు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గనులశాఖ ప్రతినిధులు పాల్గొన్న ఈ కార్యక్రమానికి సుభాష్ చంద్ర ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిమితంగా ఉన్న సహజ వనరులను బాధ్యతాయుతంగా, సమర్థంగా వినియోగించుకుంటూ సుస్థిర అభివృద్ధి దిశగా అడుగులు వేయాలన్నారు. నూతన సాంకేతికతతో ఖనిజాల వెలికితీతలో అక్రమాలను అరికట్టడం సాధ్యమవుతుందని.. మైనర్ మినరల్స్ వెలికితీతలోనూ ఈ సాంకేతికతను వినియోగించుకునే దిశగా రాష్ట్రాలను ప్రోత్సహిస్తామన్నారు. ఐబీఎం, ఎన్ఆర్ఎస్ఏ ఒప్పందాన్ని చరిత్రాత్మకమైనదిగా అభివర్ణించారు. శాటిలైట్ సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వినియోగించుకోవాలనే ప్రధాని ఆదేశాల మేరకు మూడు నెలల వ్యవధిలోనే 30కిపైగా సంస్థలతో ఎంవోయూలు కుదుర్చుకున్నట్లు ఎన్ఆర్ఎస్సీ డెరైక్టర్ వీకే దద్వాల్ వెల్లడించారు. 1974 మొదలుకుని ఇప్పటి వరకు ఎన్ఆర్ఎస్సీ ఏరియల్ సర్వే ద్వారా అనేక అంశాలపై సమాచారం సేకరించామన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాటర్గ్రిడ్ ప్రాజెక్టుకు సాంకేతిక సహకారం అందిస్తున్నట్లు తెలిపారు. గనుల తవ్వకాలను పర్యవేక్షించేందుకు ఐబీఎం అధికారులను రెండు బ్యాచ్లుగా విభజించి శిక్షణ ఇస్తున్నామని దద్వాల్ వెల్లడించారు. ఐబీఎం కంట్రోలర్ జనరల్ ఆర్కే సిన్హా మాట్లాడుతూ గనుల తవ్వకాల పర్యవేక్షణలో ఇకపై భౌతిక తనిఖీల అవసరం లేకుండా సుదూర్ దృష్టి ప్రాజెక్టు తోడ్పడుతుందన్నారు.