రావేలా..!
♦ మంత్రి రావెల కిషోర్బాబు దర్శన భాగ్యానికి నోచని నియోజకవర్గ ప్రజలు
♦ అమాత్యులను ఎక్కడ కలవాలో తెలియని అయోమయ పరిస్థితి
♦ జిల్లాలో సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలదీ అదే దుస్థితి
♦ ఫైళ్లు తీసుకొని హైదరాబాద్ రావాలంటూ అధికారులకు ఆదేశాలు
♦ ఆయన వ్యవహార శైలిపై గుర్రుగా ఉన్న ఓ ప్రధాన సామాజిక వర్గం
మంత్రి హోదాలో ఉన్న తెలివైన రాజకీయ నేత తొట్టతొలుత తన నియోజకవర్గంలోని పరిస్థితులను చక్కదిద్దుకుంటారు. నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యే కశ్రద్ధ చూపుతారు. అవసరమైతే నియోజకవర్గ కేం ద్రంలో తన కార్యాలయాన్ని ఏర్పాటు చేసి సిబ్బందిని నియమిస్తారు. నెలలో రెండు లేదా మూడు సార్లు నియోజకవర్గానికి వచ్చిపోతూ సమస్యలను పరిష్కరిస్తూ ప్రజల అభిమానానికి పాత్రుడవుతారు.
మంత్రిగా ఉన్న రావెల కిషోర్బాబు వ్యవహార శైలి భిన్నంగా ఉంది. ఆయన అందుబాటులో ఉండటం లేదని నియోజకవర్గ ప్రజలు అసంతృప్తితో ఉన్నారు. ఆయన గెలుపే లక్ష్యంగా శ్రమిం చిన తమనే పక్కన పెట్టారని ఓ ప్రధాన సామాజికవర్గం గుర్రు గా ఉంది. జిల్లాకు వచ్చిన సమయంలో సైతం ఆయనను కలవాలంటే చుక్కలు కనిపిస్తున్నాయని పార్టీ నాయకులు, కార్యకర్తలు వాపోతున్నారు. ఫైళ్లు పట్టుకుని హైదరాబాద్ రావాలని ఆదేశిస్తున్నారని అధికారులు ఆవేదన చెందుతున్నారు.
సాక్షి ప్రతినిధి, గుంటూరు : ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి తొలిసారి పోటీ చేసి గెలుపొంది రాష్ట్ర కేబినెట్లో కూర్చున్న మంత్రి రావెలను గుంటూరులో కలవాలంటే ప్రజలు, పార్టీనేతలు నానా అగచాట్లు పడాల్సిందే. ము ఖ్యంగా నియోజకవర్గంలో ఆయనకు కార్యాలయం లేకపోవడంతో గుంటూ రు వచ్చిన ప్రతిసారీ హాయ్ల్యాండ్, లేదా ఐబీలోనో బసచేస్తున్నారు. రోజు ల తరబడి తిరిగినా ఆయనను కలిసే భాగ్యానికి నోచుకోవడం లేదు. ఒక వేళ కలిసినా, వ్యక్తిగత సమస్యలు కాదుకదా, కనీసం సామాజిక సమస్యల పరి ష్కారానికి కూడా మంత్రి ఆసక్తి చూపడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.
అధికారుల బాధలు వర్ణనాతీతం...
ప్రతిసారీ అధికారులను ఫైళ్లు తీసుకుని హైదరాబాద్ రమ్మంటూ ఆదేశాలు జారీ చేస్తున్నారు. అక్కడా ఉదయం నుంచి రాత్రి వరకు వేచిచూడక తప్పడం లేదని అధికారులు అంటున్నారు. పొరబాటున ఏ అధికారి అయినా వెళ్లకుంటే ఇక అంతే. ఫోన్లో జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయడంతో అక్కడి నుంచి అక్షింతలు పడుతున్నాయి. పొద్దు పోయాక సమావేశాలు నిర్వహిస్తుండటంతో తిరిగి స్వగ్రామానికి రావడానికి అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటివరకు హైదరాబాద్ రమ్మన్న వారి జాబితాలో మండల అధికారుల నుంచి పీడీల వరకు ఉన్నారు.
గుర్రుగా ఉన్న ప్రధాన సామాజికవర్గ నేతలు
ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి తొలిసారి పోటీ చేసిన రావెలను గెలిపించడానికి అక్కడ ప్రాబల్యం కలిగిన ఓ సామాజికవర్గం గట్టిగా కృషి చేసింది. మొదట్లో ఆ సామాజికవర్గంలోని ఒకరిద్దరి ఆదేశాలు, సూచనలు పాటిం చినా, తరువాత పక్కన పెట్టడంతో వారంతా గుర్రుగా ఉన్నారు. ఇక సొంత సామాజికవర్గం నేతలు కూడా మంత్రిపై రుసరుసలాడుతున్నారు. నెలలో రెండు మూడుసార్లు నియోజకవర్గంలోని అధికారులతో జిల్లా కేంద్రంలో సమీక్షలు నిర్వహిస్తున్నప్పటికీ అభివృద్ధి జాడలు కనిపించడంలేదు.
వచ్చేందుకు వెనకడుగు ...
అనతికాలంలోనే అన్ని వర్గాల అసమ్మతిని కూడగట్టుకున్న రావెల నియోజకవర్గ కేంద్రం ప్రత్తిపాడు రావాలంటేనే సంకోచిస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. నాలుగు నెలల క్రితం ప్రత్తిపాడులో జరిగిన స్వచ్ఛ ప్రత్తిపాడు సభకు మినహా, అధికారికంగా మరే ప్రభుత్వ కార్యక్రమానికీ హాజరు కాలేదు. ఇతర మండలాలకు వెళ్లే సమ యంలో, అనుకోకుండా మండలంలోని కోయవారిపాలెం, గనికపూడి, గొట్టిపాడు గ్రామాల్లో ఓ పది నిమిషాలపాటు పర్యటించినప్పటికీ అవి ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలు కాదు. ఆ సందర్భంగా అక్కడి సమస్యలను పరిష్కరించనూ లేదు.