breaking news
magistrates
-
అరెస్టుకు కారణం ఎక్కడ?.. తప్పంతా మాదే: ఏపీ హైకోర్టు
మాచర్ల మాజీ మున్సిపల్ చైర్మన్ తురకా కిషోర్ అరెస్ట్ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అరెస్టుకు కారణం ఏంటన్నది ఎక్కడా పోలీసులు ప్రస్తావించలేదని, అలాంటప్పుడు అది ఇల్లీగల్ అరెస్ట్ అవుతుంది కదా అని వ్యాఖ్యానించింది. సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ నేత, మాచర్ల మాజీ మున్సిపల్ చైర్మన్ తురకా కిషోర్ తరఫున దాఖలైన హెబియస్ కార్పస్ పిటిషన్పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా అరెస్ట్పై కీలక వ్యాఖ్యలు చేసిన అత్యున్నత న్యాయస్థానం.. అదే సమయంలో రిమాండ్ రిపోర్టును పరిశీలిస్తూ మెజిస్ట్రేట్ల తీరుపైనా అసహనం వ్యక్తం చేసింది. ‘‘ఈ కేసులో గ్రౌండ్ ఆఫ్ అరెస్ట్(అరెస్టుకు కారణం) ఎక్కడుంది?. గ్రౌండ్స్ ఆఫ్ అరెస్టు ఓరల్గా(నోటిమాటగా) చెప్తే కుదరదు. గ్రౌండ్స్ ఆఫ్ అరెస్టుకు సంబంధించి ఇన్ రిటర్న్గా(రాతపూర్వకంగా) సర్వ్ చేయాలి. లేకపోతే అది ఇల్లీగల్ అరెస్ట్ అవుతుంది’’ అని పోలీసులను ఉద్దేశించి వ్యాఖ్యానించింది. అదే సమయంలో.. తురకా కిషోర్ పై పెట్టిన అక్రమ కేసులు లిస్టు చదివి వినిపించిన ధర్మాసనం.. 3, 4, 5 , 6 ఏళ్ల కిందటి నాటి ఘటనల్లో తాజాగా కేసులు నమోదు చేశారంటూ వ్యాఖ్యానించింది. ‘‘ఎఫ్ఐఆర్లు నమోదు చేసి వెంటనే పీటీ వారెంట్లు వేసి అరెస్టు చేశారు. మరీ అంత అర్జెంటుగా పీటీ వారెంట్లో వేయాల్సిన అవసరం ఏముంది?. రెంటచింతల కేసులో పోలీసులు అంత అర్జెంటుగా అరెస్టు ఎందుకు అరెస్ట్ చేశారు?. అసలు రెంటచింతల కేసులో రిమాండ్ రిపోర్టు అర్థం కావటం లేదు. తప్పు మీది కాదు... తప్పు అంతా మాదే. మేజిస్ట్రేట్లకు సరైన శిక్షణ ఇవ్వలేకపోయాం’’ అని అసహనం వ్యక్తం చేసిన ధర్మాసనం తదుపరి విచారణ రేపటికి(గురువారానికి) వాయిదా వేసింది.అన్ని కేసుల్లో(12) బెయిల్ రావడంతో తురకా కిషోర్ జులై 30వ తేదీన ఉదయం గుంటూరు జైలు నుంచి విడుదలయ్యారు. అయితే అనూహ్యంగా ఎంట్రీ ఇచ్చిన పోలీసులు.. కుటుంబ సభ్యులను నెట్టిపడేసి మరీ బలవంతంగా ఆయన్ని లాక్కెల్లారు. ఏడు నెలల తర్వాత కోర్టులు ఊరట ఇవ్వడంతోనే ఆయన విడుదల అయ్యారని, అయినప్పటికీ పోలీసులు అక్రమ నిర్బంధానికి పాల్పడ్డారంటూ కుటుంబ సభ్యులు హైకోర్టును ఆశ్రయించారు. -
అరెస్ట్.. రిమాండ్.. ఇష్టా‘రాజ్యం’కాదు
అరెస్టు అనేది ఒక వ్యక్తికి అవమానం కలిగించేది. స్వేచ్ఛను హరించేది. జీవితాంతం అరెస్ట్కు సంబంధించిన జ్ఞాపకాలు వెంటాడుతూనే ఉంటాయి. ఇది జీవితాంతం ఒక మాయని మచ్చలా మిగిలిపోతుంది. ఇది చట్టసంస్కర్తలకూ, పోలీసులకూ తెలుసు. చట్టసంస్కర్తలకు – పోలీసులకు మధ్య ఈ విషయమై ఓ పోరాటం నడుస్తోంది.కానీ పోలీస్ వ్యవస్థ ఇప్పటికీ తన పాఠాన్ని నేర్చుకోలేదు. ఆ పాఠం క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సీఆర్పీసీ)లో స్పష్టంగా ఉంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఆరు దశాబ్దాలు గడిచినప్పటికీ, పోలీసులు ఇంకా తమ వలస పాలన తరహా మానసిక స్థితి నుంచి బయటపడలేదు. పోలీస్ వ్యవస్థను ఇంకా ప్రజలకు మిత్రుడిగా కాకుండా వేధింపులకు, అణచివేతకు హేతువుగా భావిస్తున్నారు. అరెస్టు అనే తీవ్రమైన అధికారాన్ని వినియోగించడంలో జాగ్రత్త అవసరమని కోర్టులు ఎన్నిసార్లు హెచ్చరించినా, అది అనుకున్న ఫలితాన్ని ఇవ్వలేదు.అరెస్టు చేసే అధికారం పోలీసుల వ్యవస్థకు ఒక లెక్కలేని తనాన్ని కలిగిస్తోంది. అదే విధంగా మేజిస్ట్రేట్ వ్యవస్థ విఫలమవడం కూడా దీనికి సహకరిస్తోంది. అరెస్టు అధికారం పోలీస్ అవినీతికి ఒక లాభదాయకమైన వనరుగా మారింది. ముందు అరెస్టు చేసి, తర్వాత విచారణ జరపాలనే దురదృష్టకర ధోరణి పెరిగిపోతోంది. మానవత్వాన్ని అర్థం చేసుకోలేని పోలీస్ అధికారులకు, ఒక పద్ధతి ప్రకారం కాకుండా ఇష్టానుసారం పనిచేసే వారికి ఒక ఆచరణ సాధనంగా అరెస్టుల ప్రక్రియ మారిపోయింది.లా కమిషన్లు, పోలీసు కమిషన్లు, ఈ కోర్టు ఎన్నో తీర్పుల్లో అరెస్టు అధికారాన్ని వినియోగించేటప్పుడు వ్యక్తిగత స్వేచ్ఛ– సమాజ శాంతి మధ్య సమతౌల్యాన్ని కాపాడాల్సిన అవసరాన్ని పదే పదే గుర్తుచేశాయి. పోలీసు అధికారులు తాము అరెస్టు చేసే అధికారాన్ని కలిగి ఉన్నామని భావిస్తూ అరెస్టు చేస్తుంటారు. అరెస్టు వ్యక్తి స్వేచ్ఛను హరిస్తుంది. అవమానాన్ని కలిగిస్తుంది. కనుక మేము దీనిని భిన్నంగా భావిస్తాం. కేవలం ఒక నాన్–బెయిలబుల్ అలాగే గుర్తింపు ఇవ్వదగిన నేరం (నాన్–బెయిలబుల్ అండ్ కాగ్నిజబుల్– తీవ్రమైన) జరిగిందని పోలీసులు నమ్మడమే ఆధారంగా అరెస్టు చేయకూడదు. అరెస్టు చేయగల అధికారాన్ని కలిగి ఉండటం ఒక విషయం. అయితే, ఆ అధికారాన్ని వినియోగించడానికి న్యాయసమ్మతమైన కారణం కలిగి ఉండటం ఇంకొక విషయం.పోలీస్ అధికారుల వద్ద అరెస్టు చేసే అధికారంతో పాటు, ఎందుకు అరెస్టు చేయాల్సి వచ్చిందో తెలుపగల న్యాయసమ్మతమైన కారణాలు ఉండాలి. కేవలం ఎవరో ఒకరు చేసిన ఆరోపణల ఆధారంగా ఒక వ్యక్తిని యాదృచ్ఛికంగా అరెస్టు చేయడం అనేది చెల్లదు. ఆరోపణల ప్రామాణికతపై కొంత విచారణ చేసిన తర్వాత పోలీసు అధికారికి న్యాయమైన సంతృప్తి వచ్చినపుడే అరెస్టు చేయడం సమంజసం, ఇది ఒక సరైన, సముచిత నిర్ణయం అవుతుంది. ఇలాంటి స్పష్టమైన న్యాయపరమైన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా అరెస్టుల విషయంలో పరిపక్వత కనబడడంలేదు. అరెస్టుల సంఖ్య తక్కువ కావడంలేదు.చివరకు పార్లమెంట్ రంగంలోకి దిగి, లా కమిషన్ 2001లో సమర్పించిన 177వ నివేదిక సిఫార్సులకు అనుగుణంగా క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సీఆర్పీసీ)లోని సెక్షన్ 41ను ప్రస్తుత రూపంలో అమలు చేసింది. ఇక్కడ గమనించాల్సిన మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే లా కమిషన్ ఇదే సిఫార్సును 1994లో ఇచ్చిన 152,154వ నివేదికలలోనూ చేసింది. అరెస్టు చేసే విషయంలో చట్టంలో చేసిన సవరణలను పూర్తి పారదర్శకత (ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ) ఆధారంగా రూపొందించడం జరిగింది. అంటే చిన్న నేరం చేశారన్న కారణంతోనే ఒకరిని వెంటనే అరెస్టు చేయకూడదు. నేరం తీవ్రత, వ్యక్తి నుంచి వచ్చే ముప్పు, విచారణకు సహకరిస్తాడా లేదా వంటి అంశాలన్నిటిని పరిగణనలోకి తీసుకుని అరెస్టు చేయాలా వద్దా అనే నిర్ణయం తీసుకోవాలి.వారెంటు లేకుండా పోలీసులు అరెస్టు చేసిన నిందితుడిని భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 22(2) అలాగే సీఆర్పీసీ సెక్షన్ 57 ప్రకారం అవసరమైన ప్రయాణ సమయాన్ని మినహాయించి, ఎట్టి పరిస్థితుల్లోనూ 24 గంటల లోపల మేజిస్ట్రేట్ ముందు హాజరు పరచాలి. ఇది నిందితుని హక్కు. ఒక కేసు దర్యాప్తు సమయంలో 24 గంటల కంటే ఎక్కువగా నిందితుడిని పోలీసు కస్టడీలో ఉంచాలంటే, అది సీఆర్పీసీ సెక్షన్ 167 ప్రకారం మేజిస్ట్రేట్ అనుమతితో మాత్రమే సాధ్యమవుతుంది. ఈ కస్టడీ అనుమతిని మంజూరు చేయడం అనేది చాలా బాధ్యతగల, సున్నితమైన న్యాయపరమైన కార్యం. ఇది వ్యక్తిగత స్వేచ్ఛను ప్రభావితం చేస్తుంది కాబట్టి దీన్ని అత్యంత జాగ్రత్తతో ఉపయోగించాలి. అయితే అనుభవంలో చూస్తుంటే, పలుమార్లు మేజిస్ట్రేట్లు ఈ అనుమతిని నిర్లక్ష్యంగా, మామూలుగా, అషామాషీగా మంజూరు చేస్తున్నారు.మేజిస్ట్రేట్ సీఆర్పీసీ సెక్షన్ 167 ప్రకారం నిందితుడిని రిమాండు చేయాలంటే ముందుగా ఆ అరెస్ట్ చట్టబద్ధమైనదా? రాజ్యాంగ హక్కులను పాటించడం జరిగిందా? అనే విషయాలపై సంతృప్తి చెందాలి. పోలీసు అధికారి చేసిన అరెస్ట్ సీఆర్పీసీ సెక్షన్ 41 లో పేర్కొన్న నిబంధనలకు అనుగుణంగా లేకపోతే, మేజిస్ట్రేట్ అతనికి రిమాండు విధించకుండా విడుదల చేయాలి. అంటే, ఒక నిందితుడిని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచినప్పుడు, పోలీసు అధికారి అరెస్ట్ చేసిన కారణాలు, ఆధారాలు అలాగే తాను ఆ మేరకు తీసుకున్న నిర్ణయాలను మేజిస్ట్రేట్కు వివరించాలి. మేజిస్ట్రేట్ ఆ వివరాలన్నింటినీ పరిశీలించి, న్యాయపరమైన సంతృప్తి పొందిన తరువాత మాత్రమే రిమాండ్ అనుమతించాలి. మేజిస్ట్రేట్ తన ‘సంతృప్తి’ని తన ఆదేశంలో స్పష్టంగా (చిన్నగా అయినా సరే) నమోదు చేయాలి. ఇది కేవలం పోలీస్ అధికారి చెప్పిన మాటల ఆధారంగా కాకూడదు.ఉదాహరణకు, ఒక నిందితుడిని మరో నేరాన్ని చేయకుండా అడ్డుకోవడానికి, సాక్ష్యాలను ధ్వంసం చేయకుండా నిలువరించడానికి లేదా ఇతరులను బెదిరించకుండా నివారించడానికి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉందని పోలీస్ భావిస్తే, అలాంటి నిర్దిష్ట కారణాలు, ఆ ఆధారాలను మేజిస్ట్రేట్ ముందు సమర్పించాలి. మేజిస్ట్రేట్ వాటిని పరిశీలించి, తాను ఆయా అంశాల పట్ల సంతృప్తి పొందుతున్నట్లు లిఖితపూర్వకంగా నమోదు చేసిన తరువాత మాత్రమే రిమాండ్ విధించాలి.దోషిగా ఆరోపణలు ఉన్న వ్యక్తి శిక్షార్హత గల నేరాన్ని (శిక్ష ఏడేళ్ల కన్నా తక్కువ లేదా ఏడేళ్ల వరకు ఉండవచ్చు జరిమానాతో కలిపి లేదా కాకుండా) చేసాడని పోలీసు అధికారికి అనిపించినంత మాత్రాన, అదే ఏకైక కారణంగా అతడిని అరెస్టు చేయ కూడదు. అలాంటి సందర్భాల్లో, పోలీసు అధికారి అరెస్టు అవసరమనే విషయంలో మరింత సంతృప్తి పొందాలి. అంటే..ఆ వ్యక్తి మరిన్ని నేరాలు చేయకుండా నివారించడానికి,కేసు సమగ్రంగా దర్యాప్తు చేయడానికి,నేరానికి సంబంధించిన సాక్ష్యాలను ధ్వంసం చేయకుండా అడ్డుకోవడానికి,సాక్ష్యులను మోసం చేయకుండా నిరోధించడానికినిజాలు చెప్పదలచిన సాక్షులను భయపెట్టి, ప్రలోభ పెట్టి లేదా బెదిరించి నిజాలు బయటపెట్టకుండా చేసే ప్రయత్నాలను అడ్డుకోవడానికి,లేదా అతన్ని అరెస్టు చేయకపోతే కోర్టులో అవసరమైనప్పుడు అతని హాజరు విషయంలో విఫలమవుతామని భావించినప్పుడు.. మాత్రమే.. అరెస్టు చేయవచ్చు. అయితే పోలీసు అధికారి ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని తన నిర్ణయం వెనుక ఉన్న కారణాలను రాతపూర్వకంగా నమోదు చేయాలి. అంతే కాదు, అరెస్టు చేయకపోతే కూడా, ఎందుకు అరెస్టు చేయలేదన్న కారణాలను కూడా లిఖితపూర్వకంగా నమోదు చేయాల్సిన బాధ్యత ఉంది. మరింత వివరంగా చెప్పాలంటే, పోలీసు అధికారి తనను తాను ఇలా ప్రశ్నించుకోవాలి:ఎందుకు అరెస్టు? నిజంగా అరెస్టు అవసరమా? అది ఎలాంటి ప్రయోజనం ఇస్తుంది? ఏ లక్ష్యాన్ని సాధిస్తుంది?ఈ ప్రశ్నలకు సమాధానాలు తీసుకుని, పైన పేర్కొన్న నిబంధనల్లో కనీసం ఒక నిబంధన విషయంలో సంతృప్తి పొందినప్పుడే అరెస్టు అధికారం వినియోగించాలి. ఇందుకు సంబంధించిన సమాచారం, సాక్ష్యాలకు ప్రామాణికత ఉండాలి. పోలీసులు ఎవ్వరినైనా అరెస్ట్ చేయాలంటే, కేవలం ఆ వ్యక్తి నేరం చేశారని అనిపిస్తే చాలదు. సీఆర్పీసీ 41 (ఏ)లో సబ్–క్లాజ్ (ఏ) నుండి (ఈ) వరకూ పేర్కొన్న పరిస్థితులు (అంశాల్లో) ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ అంశాల్లో సంతృప్తి పొందుతున్నామా? లేదా? అన్న విషయాన్ని నిర్ధారించుకుని, అరెస్ట్ అవసరం అని తార్కికంగా తేల్చుకున్నప్పుడే అరెస్ట్ జరగాలి.ఇంకొక ముఖ్యమైన నిబంధనగా భావించదగిన సీఆర్పీసీ సెక్షన్ 41ఏ.. అనవసరమైన అరెస్టులను నివారించేందుకు, అరెస్ట్కు గురవుతాయన్న భయాన్ని తగ్గించేందుకు ఉద్దేశించినది. ఈ నిబంధనను చైతన్యవంతంగా అమలు చేయాల్సిన అవసరం ఉంది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సవరణ చట్టం, 2008 (యాక్ట్ 5 ఆఫ్ 2009) ద్వారా సెక్షన్ 6 కింద అనుసంధానమైన ఈ కీలక సెక్షన్ 41ఏ ఏమి చెబుతోందో ఈ సందర్భంగా చర్చించుకోవడం సందర్భోచితం.41ఏ. పోలీసు అధికారి ముందు హాజరు కావాలనే నోటీసు :–(1) సెక్షన్ 41(1) ప్రకారం ఒక సమంజసమైన ఫిర్యాదు లేదా విశ్వసనీయ సమాచారం అందిన మీదట, ఆ వ్యక్తి కాగ్నిజబుల్ అఫెన్స్ (గుర్తింపదగిన తీవ్ర నేరం) చేశాడనే సమంజసమైన అనుమానం ఉండి, సంబంధిత వ్యక్తిని అరెస్ట్ చేయాల్సిన అవసరం లేని ప్రతి సందర్భంలో పోలీసు అధికారి ఆ వ్యక్తిని తాను పేర్కొన్న స్థలానికి హాజరు కావాలంటూ నోటీసు జారీ చేయాలి. ఈ నోటీసులో హాజరు కావాల్సిన తేదీ, సమయం, స్థలాన్ని స్పష్టంగా పేర్కొనాలి. ఈ విధంగా, పోలీసు అధికారికి అరెస్ట్ చేయాల్సిన అవసరం లేని పరిస్థితుల్లో నేరుగా అరెస్ట్ చేయకుండా, ముందుగా వ్యక్తికి హాజరు కావాలనే నోటీసు జారీ చేయడం తప్పనిసరి.(2) అలాంటి నోటీసు ఎవరైనా వ్యక్తికి జారీ అయినప్పుడు, ఆ వ్యక్తి ఆ నోటీసులో పేర్కొన్న నిబంధనలకు లోబడిన విధంగా సహకరించాలి. దీనిని ఒక బాధ్యతగా పరిగణించాలి.(3) అట్టి వ్యక్తి నోటీసులో అంశాలను తూ.చా. తప్పకుండా పాటిస్తూ, ఇదే విధానాన్ని కొనసాగిస్తే, ఆ నోటీసులో పేర్కొన్న నేరానికి సంబంధించి అతడిని అరెస్టు చేయరాదు. అయితే, ఆ వ్యక్తిని అరెస్టు చేయవలసిన అవసరం ఉందన్న అభిప్రాయం పోలీసు అధికారి కలిగి ఉంటే, దానికి సంబంధించిన కారణాలను లిఖితపూర్వకంగా నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ లిఖితపూర్వక కారణాల ప్రాతిపదికనే అతడిని అరెస్టు చేయవచ్చు.(4) ఒక వ్యక్తి నోటీసులో పేర్కొన్న నిబంధనలను ఎప్పుడైనా పాటించకపోతే లేదా అతను తనకు తాను పోలీసుల ముందు హాజరుకావడానికి ఇష్టపడకపోతే, అటువంటి సందర్భాల్లో, సంబంధిత నోటీసులో పేర్కొన్న నేరానికి సంబంధించి, ఒక అర్హత కలిగిన న్యాయస్థానం జారీ చేసిన ఉత్తర్వులకు లోబడే, పోలీసులు అతడిని అరెస్టు చేయవచ్చు. పై విధానాన్ని బట్టి, సీఆర్పీసీ సెక్షన్ 41(1) ప్రకారం ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడం అవసరం లేని అన్ని సందర్భాల్లో, పోలీసు అధికారి తప్పనిసరిగా నిందితుడికి ఒక నోటీసు జారీ చేయాలి. అందులో పోలీసు అధికారిని ఎక్కడ, ఎప్పుడు కలవాలో స్పష్టంగా పేర్కొనాలి. చట్టం ప్రకారం, నిందితుడు ఆ నోటీసు నిబంధనలను పాటించి పోలీసు అధికారిని కలవాలి. ఇకపోతే, నిందితుడు ఆ నోటీసు నిబంధనలను పాటిస్తే, సాధారణంగా అతన్ని అరెస్ట్ చేయకూడదు. అయితే, అరెస్టు అవసరమని పోలీసులు భావిస్తే, దానికి కారణాలు రాసి ఉంచాలి. ఈ దశలో కూడా, అరెస్టు చేయడానికి ముందు, సీఆర్పీసీ సెక్షన్ 41 లో పేర్కొన్న షరతులను పాటించాలి. న్యాయమూర్తి సమీక్షకు అది తప్పనిసరిగా లోబడి ఉండాలి.మా అభిప్రాయం ప్రకారం, మేజిస్ట్రేట్ ఉత్తర్వులు లేకుండా అలాగే వారెంట్ లేకుండా నిందితుడిని అరెస్ట్ చేయడానికి పోలీసు అధికారికి అధికారం కల్పించిన క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సీఆర్పీసీ) సెక్షన్ 41 లోని నిబంధనలు నిజాయితీగా అమలయితే, పోలీసులు ఉద్దేశపూర్వకంగా లేదా తెలియక చేసిన తప్పులను సరిదిద్దుకోవచ్చు. ముందస్తు బెయిల్ కోసం కోర్టుకు వచ్చే కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుతుంది. మేము ప్రత్యేకంగా చెప్పదలచుకున్న విషయం ఏమిటంటే, సీఆర్పీసీ సెక్షన్ 41లో పేర్కొన్న కారణాలను కేసు డైరీలో యాంత్రికంగా పునరావృతం చేయడం అనే ఆచారాన్ని నిరుత్సాహ పర్చాలి. విడనాడాలి.ఈ తీర్పులో మా ప్రయత్నం ఏమిటంటే, పోలీసులు అనవసరంగా నిందితులను అరెస్ట్ చేయకుండా, మేజిస్ట్రేట్లు కూడా అనాలోచితంగా లేదా యాంత్రికంగా శిక్షించకుండా (రిమాండ్లు విధించకుండా) ఉండాలనే లక్ష్యంతోనే మేము ఈ వ్యాఖ్యలు చేస్తూ, ఆయా అంశాల అమలుకు మేము కింద సూచనలు ఇస్తున్నాము. ప్రతి పోలీస్ అధికారికి, సెక్షన్ 41(1)(బీ)(ఐఐ) కింద పేర్కొన్న నిర్దిష్ట ఉపఖండాలతో కూడిన తనిఖీ జాబితా (చెక్లిస్ట్) అందించాలి. ఈ చర్య, అరెస్టు చేసే సమయంలో అవసరమైన ప్రమాణాలను పోలీసులు గుర్తించేందుకు దోహదపడుతుంది. పోలీసు అధికారి నిందితుడిని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తున్నప్పుడు లేదా రిమాండ్ను కోరుతున్నప్పుడు అరెస్ట్ అవసరం అయిన కారణాలు అలాగే ఆధారాలను స్పష్టంగా వివరించాలి. అంతేకాకుండా, తనిఖీ జాబితాను సమర్పించి, దాన్ని సరిగ్గా నింపినట్టు చూపించాలి.నిందితుడిని రిమాండ్కు పంపేందుకు అనుమతి ఇచ్చే ముందు ‘పై విధంగా’ పోలీసు అధికారి సమర్పించిన నివేదికను మేజిస్ట్రేట్ పరిశీలించాలి. ఆ నివేదిక ఆధారంగా తగిన సంతృప్తిని వ్యక్తపరచి, లిఖితపూర్వకంగా నమోదుచేసిన తరువాత మాత్రమే, నిందితునికి రిమాండ్ విధించాలి. నిందితుడిని అరెస్ట్ చేయకూడదని తీసుకున్న నిర్ణయం, కేసు దాఖలైన తేదీ నుంచి రెండు వారాల్లోగా మేజిస్ట్రేట్కు పంపించాలి. అలాగే, ఒక నకలును మేజిస్ట్రేట్కి అందించాలి. అవసరమైతే, జిల్లాకు చెందిన పోలీసు సూపరింటెండెంట్ లిఖిత రూపంలో కారణాలు నమోదు చేసి, ఆ గడువును పొడిగించవచ్చు.కేసు దాఖలు చేసిన తేదీ నుంచి రెండు వారాల వ్యవధిలోగా నిందితుడికి సీఆర్పీసీ సెక్షన్ 41ఏ ప్రకారం హాజరుకై నోటీసు జారీ చేయాలి. ఈ గడువును, అవసరమైతే, జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) లిఖితపూర్వకంగా కారణాలు నమోదు చేసి పొడిగించవచ్చు.పై సూచనలను పాటించడంలో వైఫల్యం ఉన్నట్లయితే, సంబంధిత పోలీసు అధికారులు శాఖాపరమైన చర్యలు ఎదుర్కొనాల్సి ఉంటుంది. దీనితోపాటు సంబంధిత న్యాయ పరిధి (జ్యూరిస్డిక్షన్) కలిగిన హైకోర్టులో దాఖలయ్యే కోర్టు ధిక్కరణ కేసులో శిక్షకు గురయ్యే అవకాశమూ ఉంటుంది.సంబంధిత కారణాలను రికార్డు చేయకుండా నిందితునికి రిమాండ్ విధిస్తే, సంబంధిత రాష్ట్ర హైకోర్టు ద్వారా సంబంధిత జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కూడా శాఖాపరమైన చర్యలను ఎదుర్కొనాల్సి ఉంటుంది. ఈ తీర్పు ప్రతిని రాష్ట్ర ప్రభుత్వాలు అలాగే కేంద్ర పాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులు, పోలీస్ డైరెక్టర్ జనరల్స్కు, అలాగే అన్ని హైకోర్టుల రిజిస్ట్రార్ జనరల్కు పంపించాలని మేము ఆదేశిస్తున్నాము. తద్వారా వారు దీన్ని ఇతరులకు పంపించి, అమలులోకి తీసుకురాగలుగుతారు.1. అరెస్టు అనేది ఒక వ్యక్తికి అవమానం కలిగించేది. స్వేచ్ఛను హరించేది. జీవితాంతం అరెస్ట్కు సంబంధించిన జ్ఞాపకాలు వెంటాడుతూనే ఉంటాయి. ఇది జీవితాంతం ఒక మాయని మచ్చలా మిగిలిపోతుంది. ఇది చట్టసంస్కర్తలకూ, పోలీసులకూ తెలుసు. చట్టసంస్కర్తలకు– పోలీసులకు మధ్య ఈ విషయమై ఓ పోరాటం నడుస్తోంది. కానీ పోలీస్ వ్యవస్థ ఇప్పటికీ తన పాఠాన్ని నేర్చుకోలేదు. ఆ పాఠం క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సీఆర్పీసీ)లో స్పష్టంగా ఉంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఆరు దశాబ్దాలు గడిచినప్పటికీ, పోలీసులు ఇంకా తమ వలస పాలన తరహా మానసిక స్థితి నుంచి బయటపడలేదు.2. అరెస్టు చేసే అధికారం పోలీసుల వ్యవస్థకు ఒక లెక్కలేని తనాన్ని కలిగిస్తోంది. అదే విధంగా మేజిస్ట్రేట్ వ్యవస్థ విఫలమవడం కూడా దీనికి సహకరిస్తోంది. అరెస్టు అధికారం పోలీస్ అవినీతికి ఒక లాభ దాయకమైన వనరుగా మారింది. ముందు అరెస్టు చేసి, తర్వాత విచారణ జరపాలనే దురదృష్టకర ధోరణి పెరిగిపోతోంది. మానవత్వాన్ని అర్థం చేసుకోలేని పోలీస్ అధికారులకు, ఒక పద్ధతి ప్రకారం కాకుండా ఇష్టానుసారం పనిచేసే వారికి ఒక ఆచరణ సాధనంగా అరెస్టుల ప్రక్రియ మారిపోయింది.3. పోలీస్ అధికారుల వద్ద అరెస్టు చేసే అధికారంతో పాటు, ఎందుకు అరెస్టు చేయాల్సి వచ్చిందో తెలుపగల న్యాయసమ్మతమైన కారణాలు ఉండాలి. కేవలం ఎవరో ఒకరు చేసిన ఆరోపణల ఆధారంగా ఒక వ్యక్తిని యాదృచ్ఛికంగా అరెస్టు చేయడం అనేది చెల్లదు.4. దోషిగా ఆరోపణలు ఉన్న వ్యక్తి శిక్షార్హత గల నేరాన్ని (శిక్ష ఏడేళ్ల కన్నా తక్కువ లేదా ఏడేళ్ల వరకు ఉండవచ్చు జరిమానాతో కలిపి లేదా కాకుండా) చేశాడని పోలీసు అధికారికి అనిపించినంత మాత్రాన, అదే ఏకైక కారణంగా అతడిని అరెస్టు చేయకూడదు. 5. ఒక నిందితుడిని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచినప్పుడు, పోలీసు అధికారి అరెస్ట్ చేసిన కారణాలు, ఆధారాలు అలాగే తాను ఆ మేరకు తీసుకున్న నిర్ణయాలను మేజిస్ట్రేట్కు వివరించాలి. మేజిస్ట్రేట్ ఆ వివరాలన్నింటినీ పరిశీలించి, న్యాయపరమైన సంతృప్తి పొందిన తరువాత మాత్రమే రిమాండ్ అనుమతించాలి. మేజిస్ట్రేట్ తన ‘సంతృప్తి’ని తన ఆదేశంలో స్పష్టంగా (చిన్నగా అయినా సరే) నమోదు చేయాలి. ఇది కేవలం పోలీస్ అధికారి చెప్పిన మాటల ఆధారంగా కాకూడదు.6. మా అభిప్రాయం ప్రకారం, మేజిస్ట్రేట్ ఉత్తర్వులు లేకుండా, అలాగే వారెంట్ లేకుండా నిందితుడిని అరెస్ట్ చేయడానికి పోలీసు అధికారికి అధికారం కల్పించిన క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సీఆర్పీసీ) సెక్షన్ 41 లోని నిబంధనలు నిజాయితీగా అమలయితే, పోలీసులు ఉద్దేశపూర్వకంగా లేదా తెలియక చేసిన తప్పులను సరిదిద్దుకోవచ్చు.7. ఈ తీర్పులో మా ప్రయత్నం ఏమిటంటే, పోలీసులు అనవసరంగా నిందితులను అరెస్ట్ చేయకుండా, మేజిస్ట్రేట్లు కూడా అనాలోచితంగా లేదా యాంత్రికంగా శిక్షించకుండా (రిమాండ్లు విధించకుండా) ఉండాలనే లక్ష్యంతోనే మేము ఈ వ్యాఖ్యలు చేస్తూ, ఆయా అంశాల అమలుకు కింద సూచనలు ఇస్తున్నాము.8. మా సూచనలను పాటించడంలో వైఫల్యం ఉన్నట్లయితే, సంబంధిత పోలీసు అధికారులు శాఖాపరమైన చర్యలు ఎదుర్కొనాల్సి ఉంటుంది. దీనితోపాటు సంబంధిత న్యాయ పరిధి (జ్యూరిస్డిక్షన్) కలిగిన హైకోర్టులో దాఖలయ్యే కోర్టు ధిక్కరణ కేసులో శిక్షకు గురయ్యే అవకాశమూ ఉంటుంది. – సుప్రీం కోర్టు ఆఫ్ ఇండియా -
ఆర్డర్.. ఆర్డర్ 'రిమాండ్లకీ రూల్సున్నాయ్'!
సాక్షి, అమరావతి: ఏడేళ్ల కన్నా తక్కువ శిక్ష పడే కేసుల్లో నిందితులకు ఆయా కోర్టుల మేజిస్ట్రేట్లు యాంత్రికంగా రిమాండ్ విధిస్తున్న సంఘటనలు పెరిగిపోతున్న నేపథ్యంలో హైకోర్టు స్పందించింది. యాంత్రిక రిమాండ్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ ప్రతి రోజూ పిటిషన్లు దాఖలవుతుండడంతో మేజిస్ట్రేస్టేట్లకు పరిపాలనాపరంగా మార్గదర్శకాలను నిర్దేశించింది. ఈ మేరకు స్పష్టమైన మార్గదర్శకాలతో ప్రత్యేక సర్క్యులర్ జారీ చేసింది. ఏడేళ్ల కన్నా తక్కువ శిక్షపడే నేరాల్లో ఎలాపడితే అలా రిమాండ్ ఇవ్వడానికి వీల్లేదని.. అర్నేష్కుమార్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన నిర్దేశాలను తు.చ. తప్పక అనుసరించాలని తేల్చిచెప్పింది. అలాగే, ఇమ్రాన్ప్రతాప్ గాది వర్సెస్ స్టేట్ ఆఫ్ గుజరాత్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సైతం పాటించి తీరాల్సిందేనని స్పష్టం చేసింది. ⇒ రిమాండ్ విధించేటప్పుడు మార్గదర్శకాలు పాటించాలని.. పోలీసులు చట్టప్రకారం నడుచుకున్నారా? లేదా..? చూడాలని, చాలా కేసుల్లో సుప్రీం నిర్దేశించిన సూత్రాలను పాటించకుండా రిమాండ్ విధిస్తుండడంతో అనవసరమైన అరెస్టులు, శిక్షా నిబంధనల దుర్వినియోగానికి దారితీస్తోందని పేర్కొంది. ⇒ ప్రసంగాలు, రచనలు, కళల వ్యక్తీకరణలకు సంబంధించి (3–7 ఏళ్లు శిక్షపడే నేరాలు) పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసేముందు డీఎస్పీ ఆమోదంతో.. బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 173(3) కింద ప్రాథమిక విచారణ జరపాలని, 14 రోజుల్లో దానిని ముగించాలని ఇమ్రాన్ప్రతాప్ గాది కేసులో సుప్రీంకోర్టు పేర్కొన్నదని... దీనిప్రకారం రాష్ట్రంలోని మేజిస్ట్రేస్టేట్లందరూ రిమాండ్ విధించే ముందు ముఖ్యంగా సోషల్ మీడియా పోస్టులు, వ్యాఖ్యలకు సంబంధించిన కేసుల్లో దర్యాప్తు అధికారి... అర్నేష్కుమార్, ఇమ్రాన్ప్రతాప్ గాది కేసుల్లో సుప్రీం ఇచ్చిన ఆదేశాలను పాటించారా? లేదా? అన్నది చూడాలని హైకోర్టు తేల్చిచెప్పింది. ⇒ నిందితులు పదేపదే నేరాలు చేస్తున్నారా? రిమాండ్ ఇవ్వకుంటే సాక్షులను ప్రభావితం చేసి, సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని.. అందుకని పోలీసు కస్టోడియల్ విచారణ అవసరమని మేజిస్ట్రేస్టేట్లు సంతృప్తి చెందాల్సి ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ ఆదేశాలను మేజిస్ట్రేస్టేట్లందరూ పాటించి తీరాల్సిందేనని ఆదేశించింది. ఉల్లంఘిస్తే తీవ్ర పర్యవసానాలతో పాటు శాఖాపరమైన విచారణతో పాటు కోర్టు ధిక్కార చర్యలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుందని మేజిస్ట్రేస్టేట్లకు హెచ్చరించింది. ఈ మేరకు హైకోర్టు శనివారం సర్క్యులర్ జారీ చేసింది.చంద్రబాబు సర్కారుకు ఝలక్..! పోలీసు రాజ్యానికి చెక్!ఏడాది కాలంగా తీవ్ర నిర్బంధంతో... తాలిబాన్ల మాదిరిగా పాలన సాగిస్తున్న చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వానికి హైకోర్టు తాజా మార్గదర్శకాలు చెంపపెట్టులాంటివే. రెడ్బుక్ రాజ్యాంగంతో.. ఎలాంటి నిబంధనలు పాటించకుండా, లెక్కలేనితనంతో చెలరేగుతున్న పోలీసుల తీరుకు అడ్డుకట్ట పడనుంది. కక్షసాధింపు చర్యలకు దిగుతూ ఎడాపెడా అరెస్టులకు పాల్పడుతున్న ఖాకీలకు చెంపపెట్టు అని పరిశీలకులు పేర్కొంటున్నారు. హైకోర్టు తాజా మార్గదర్శకాలతో ఇకపై అడ్డగోలు అరెస్టులు, నిబంధనలకు విరుద్ధంగా రిమాండ్లు కుదరదని వివరిస్తున్నారు.⇒ కూటమి సర్కారు వచ్చాక తమ పనితీరును, వారి నేతలను విమర్శిస్తూ సోషల్ మీడియా పోస్టులు, వ్యాఖ్యలు పెట్టినవారిపై.. మరీ ప్రధానంగా ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలు, నాయకులపై అడ్డగోలుగా కేసు నమోదు చేస్తోంది. వ్యంగ్య ప్రదర్శన ఇచ్చినా సహించలేక కేసులు పెట్టింది. సోషల్మీడియా పోస్టులను అత్యంత కఠినమైన వ్యవస్థీకృత నేరం పరిధిలోకి తీసుకొచ్చింది. పెద్దసంఖ్యలో అరెస్ట్లు చేసి జైలుకు కూడా పంపింది. బెయిల్ రాకుండా చేసేందుకు ప్రభుత్వం ఏకంగా సుప్రీంకోర్టు వరకు వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. అయితే, హైకోర్టు పలు సందర్భాల్లో సోషల్ మీడియా పోస్టులకు వ్యవస్థీకృత నేరం కింద ఎలా కేసు పెడతారంటూ నిలదీసింది. అవి ఆ నేరం కిందకు రావని సైతం తెలిపింది. అయినా కూడా పోలీసులు వ్యవస్థీకృత నేరం కింద కేసులు నమోదు చేస్తూనే ఉన్నారు. ⇒ ఇక సోషల్ మీడియా యాక్టివిస్టులను పోలీసులు అరెస్ట్ చేసి మేజిస్ట్రేట్ల ఎదుట ప్రవేశపెట్టగా చాలామంది యాంత్రికంగా రిమాండ్ ఉత్తర్వులు ఇచ్చారు. ఏడేళ్ల కన్నా తక్కువ శిక్ష పడే కేసుల్లో కూడా సహేతుక కారణాలను వెల్లడించకుండానే రిమాండ్ ఇవ్వడం మొదలుపెట్టారు. దీంతో పలువురు నిందితులు తమ రిమాండ్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్లు వేశారు. మొన్నటిదాక కూడా రిమాండ్ ఉత్తర్వులపై ప్రతి రోజూ పిటిషన్లు దాఖలవుతూనే వచ్చాయి.హైకోర్టు ఎన్ని వ్యాఖ్యలు చేసినా పట్టించుకోని మేజిస్ట్రేట్లుఈ వ్యాజ్యాల విచారణ సందర్భంగా హైకోర్టులోని పలువురు న్యాయమూర్తులు.. మేజిస్ట్రేట్ల తీరుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. యాంత్రికంగా రిమాండ్ విధించడం సరికాదని హితవు పలికారు. కొన్ని సందర్భాల్లో ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. అర్నేష్కుమార్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను పాటించి తీరాలని చెప్పినా ప్రయోజనం లేకపోయింది. అయినా, యాంత్రికంగా, సహేతుక కారణాలను తెలియజేయకుండా రిమాండ్లు విధించడం కొనసాగిస్తూ వచ్చారు. దీంతో హైకోర్టు చివరకు మేజిస్ట్రేట్లకు పరిపాలనా పరమైన ఉత్తర్వులు ఇవ్వక తప్పలేదు. ఈ క్రమంలో అర్నేష్కుమార్, ఇమ్రాన్ ప్రతాప్ గాది కేసుల్లో సుప్రీం ఇచ్చిన ఆదేశాలను అమలు చేసి తీరాల్సిందేనని, లేదంటే పర్యవసనాలు తీవ్రంగా ఉంటాయని మేజిస్ట్రేట్లకు తేల్చి చెప్పింది.ఇదీ అర్నేష్కుమార్ కేసు...బిహార్ కు చెందిన అర్నేష్ కుమార్ కట్నం కోసం వేధిస్తున్నట్లు అతడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఐపీసీ సెక్షన్ 498ఎ, వరకట్న నిషేధ చట్టంలోని సెక్షన్ 4 కింద కేసులు నమోదు చేశారు. అర్నేష్ ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఈ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం అరెస్టుల విషయంలో కీలక మార్గదర్శకాలు జారీ చేసి వాటిని పాటించాల్సిందేనని కింది కోర్టులు, పోలీసులను ఆదేశించింది. 2014లో సుప్రీంకోర్టు ఇచ్చిన ముఖ్యమైన తీర్పు ఇది. అందులోని మార్గదర్శకాలు..1. సాధారణంగా ఏడేళ్ల కంటే తక్కువ శిక్ష విధించే నేరాల్లో నిందితులను అరెస్ట్ చేయకూడదు. ఒకవేళ అరెస్టు చేయాలనుకుంటే.. ముందుగా నిందితుడికి వారిపై వచ్చిన ఆరోపణలకు సంబంధించిన సమాచారం ఇవ్వాలి. అలాగే వారి హక్కుల గురించి వివరించాలి.2. అరెస్టు చేయడానికి కారణాలను తప్పకుండా రికార్డు చేయాలి.3. పోలీసులు కేసు దర్యాప్తు చేసేటప్పుడు ఈ మార్గదర్శకాలను పాటించాలి.4. న్యాయమూర్తులు కూడా ఈ మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకొని, అవసరమైతే ముందస్తు బెయిల్ మంజూరు చేయాలి. -
సోషల్ మీడియా అరెస్టులు.. ఏపీ జడ్జిలకు హైకోర్టు సంచలన ఆదేశాలు
ఏపీలో అడ్డగోలుగా జరుగుతున్న సోషల్ మీడియా అరెస్టులలో జరుగుతున్న ఉల్లంఘనలపై ఉన్నత న్యాయస్థానం కన్నెర్ర జేసింది. ఈ తరహా అరెస్టులు, రిమాండ్లను కట్టడి చేసే దిశగా అడుగులేసింది. ఒకవైపు ఏపీ జడ్జిలకు స్పష్టమైన మార్గదర్శకాలను విడుదల చేస్తూనే.. ఇంకోవైపు హెచ్చరికలూ జారీ చేసింది. సాక్షి, విజయవాడ: ఏపీలో సోషల్ మీడియా అరెస్టులు, రిమాండ్ల విధింపు విషయంలో జరుగుతున్న అడ్డగోలు ఉల్లంఘనలపై ఉన్నత న్యాయస్థానం కన్నెర్ర జేసింది. ఈ క్రమంలోనే ఏపీ జడ్జిలకు సంచలన ఆదేశాలు జారీ చేసింది. రిమాండ్ విధింపు విషయంలో స్పష్టమైన మార్గదర్శకాలను విడుదల చేస్తూనే.. ఇంకోవైపు హెచ్చరికలూ జారీ చేసింది. సోషల్ మీడియాలో పోస్టులు చేశారనే అభియోగాలతో ఈ ఏడాది కాలంలో ఏపీలో లెక్కలేనని అరెస్టులు జరిగాయి. అయితే.. ఇలాంటి కేసుల్లో సుప్రీం కోర్టు మార్గదర్శకాలను చాలావరకు జడ్జిలు పాటించడం లేదని ఉన్నత న్యాయస్థానం గుర్తించింది. ఈ క్రమంలో న్యాయమూర్తులకు హైకోర్టు రిజిస్ట్రార్ తరఫున తాజాగా ప్రత్యేక సర్క్యులర్ జారీ చేయించింది. ‘‘సుప్రీం కోర్టు నిర్దేశించిన సూత్రాలను పాటించకుండా కొందరు జడ్జిలు రిమాండ్లు విధిస్తున్నారు. అనేక కేసుల్లో సుప్రీంకోర్టు నిర్దేశించిన సూత్రాలు పాటించడం లేదని మా దృష్టికి వచ్చింది. ఇది అనవసరమైన అరెస్టులు, శిక్షా నిబంధనల దుర్వినియోగానికి దారితీస్తోంది. రిమాండ్ విధించేటప్పుడు తప్పనిసరిగా సుప్రీం గైడ్లైన్స్ పాటించాలి. ఆర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును అనుసరించి మార్గదర్శకాలు కచ్చితంగా పాటించాలి. ఇమ్రాన్ ప్రతాప్ గాంధీ వర్సెస్ స్టేట్ ఆఫ్ గుజరాత్ కేసులో సుప్రీంకోర్టు చెప్పినట్లు.. ప్రాథమిక విచారణ లేకుండా ప్రసంగాలు, రచనల, కళాత్మక వ్యక్తీకరణపై ఎఫ్ఐఆర్లు పెట్టకూడదు. డీఎస్పీ ఆమోదించాకే విచారించాలి. రిమాండ్కు ఆదేశించే ముందు పోలీసులు చట్టాన్ని పాటించారా? లేదా? పరిశీలించాలి. మొత్తం 14 రోజుల్లోనే విచారణ పూర్తిచేయాలి.. అని తాజా సర్క్యులర్లో హైకోర్టు పేర్కొంది. జ్యుడిషియల్ మేజిస్ట్రేట్లు ఖచ్చితంగా ఈ సర్క్యులర్ అమలు చేయాలని, ఉల్లంఘిస్తే తీవ్రంగా పరిగణిస్తామని, కోర్టు ధిక్కరణ ఎదుర్కోవాల్సి ఉంటుందని, సదరు మెజిస్ట్రేట్లు శాఖాపరమైన చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హైకోర్టు తీవ్రంగా హెచ్చరించింది. మరోవైపు.. ఇంతకు ముందు ఈ తరహా అరెస్టుల విషయంలో పోలీసుల తీరుపైనా ఉన్నత న్యాయస్థానం అసహనం, ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. -
పదవీ విరమణ వయసు పెంపు సాధ్యం కాదు
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా న్యాయాధికారుల పదవీ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచడం సాధ్యం కాదని హైకోర్టు తీర్పునిచ్చింది. హైకోర్టు న్యాయమూర్తి పదవీ విరమణ వయస్సు 62 సంవత్సరాలని, న్యాయాధికారుల పదవీ విరమణ వయస్సు దీనితో సమానంగా ఉండటానికి రాజ్యాంగ నిబంధనలు అంగీకరించవని స్పష్టం చేసింది. ఈ తేడా సహేతుకమైనదేనని, దీనిని అలాగే కొనసాగించాలని ఆల్ ఇండియా జడ్జిల అసోసియేషన్ కేసులో సుప్రీం కోర్టు స్పష్టంగా చెప్పిందని హైకోర్టు గుర్తు చేసింది. న్యాయాధికారుల రిటైర్మెంట్ వయస్సు పెంపుపై ఫుల్ కోర్టు (పాలనాపరమైన నిర్ణయాల కోసం హైకోర్టు న్యాయమూర్తులందరు సమావేశమవడం) నిర్ణయం తీసుకోజాలదని తేల్చి చెప్పింది. ఆ నిర్ణయాధికారం ఫుల్కోర్టుకు లేదని, అలా చేయడం సుప్రీంకోర్టు తీర్పును అతిక్రమించడమే అవుతుందని స్పష్టం చేసింది. పైపెచ్చు ఏపీ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ చట్టంలోని సెక్షన్ 3(1ఏ) ప్రకారం న్యాయాధికారుల పదవీ విరమణ వయస్సు 60 ఏళ్లుగానే ఉందని, దానిని సవరించనప్పుడు 62 ఏళ్లకు పెంచడం సాధ్యం కాదంది. ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తే సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘించడమే అవుతుందని తెలిపింది. విశ్రాంత న్యాయాధికారి కె.సుధామణి దాఖలు చేసిన పిటిషన్ను కొట్టేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు ధర్మాసనం శుక్రవారం తీర్పు వెలువరించింది. విజయనగరం జిల్లా మొదటి అదనపు జిల్లా జడ్జిగా పనిచేస్తున్న కె.సుధామణి వయసు 60 ఏళ్లకు చేరుకోవడంతో ఆమెకు పదవీ విరమణ వర్తింపజేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీనిని సవాలు చేస్తూ సుధామణి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. న్యాయాధికారుల రిటైర్మెంట్ వయస్సును 62 ఏళ్లకు పెంచాలని కోరారు. ఈ వ్యాజ్యంపై సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫు న్యాయవాది జె. సుధీర్ వాదనలు వినిపించారు. హైకోర్టు తరఫు న్యాయవాది ఎన్.అశ్వనీ కుమార్ వాదనలు వినిపించారు. -
రిమాండ్ కారణాలను రికార్డ్ చేయాల్సిందే
సాక్షి, అమరావతి: నిందితుడిని రిమాండ్కు పంపే సమయంలో అందుకుగల కారణాలను మేజిస్ట్రేట్లు తప్పనిసరిగా రికార్డ్చేసి తీరాల్సిందేనని హైకోర్టు తేల్చిచెప్పింది. వారు యాంత్రికంగా వ్యవహరించకుండా కేసు పూర్వాపరాలను పరిగణనలోకి తీసుకుని ఆ తరువాతే సహేతుక ఉత్తర్వులు జారీచేయాలని స్పష్టంచేసింది. రిమాండ్ ఉత్తర్వులు లోపభూయిష్టంగా ఉన్నట్లు తాము (హైకోర్టు) గమనించినా, నిందితుల తరఫున తమ దృష్టికి తీసుకొచ్చినా ఆ మేజిస్ట్రేట్పై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హైకోర్టు హెచ్చరించింది. -
సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించాల్సిందే
సాక్షి, అమరావతి: వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం పోలీసులు హాజరుపరిచినప్పుడు మేజిస్ట్రేట్లు యాంత్రికంగా వ్యవహరించ కుండా.. అర్నేష్కుమార్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను పాటించాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ విషయంలో తమ పరిధిలోని మేజిస్ట్రేట్లకు స్పష్టమైన ఆదేశాలు జారీచేస్తామంది. అర్నేష్కుమార్ కేసులో తీర్పును అమలు చేయని మేజిస్ట్రేట్లపై శాఖాపరమైన చర్యలు తీసుకోవచ్చని సుప్రీంకోర్టు చెప్పిన విషయాన్ని గుర్తుచేసింది. అర్నేష్కుమార్ తీర్పును మేజిస్ట్రేట్లు పాటించడం లేదనే విషయం తమ దృష్టికి వచ్చిందని తెలిపింది. ఈ విషయంలో తగిన ఆదేశాలు ఇస్తామంటూ తీర్పును వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ ఆకుల వెంకటశేషసాయిలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. మీడియాకు సంబంధించిన వ్యక్తులతోపాటు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్న వారిపై పోలీసులు ఏకపక్షంగా కేసులు నమోదు చేస్తున్నారని, ఎఫ్ఐఆర్ను 24 గంటల్లో అప్లోడ్ చేయడం లేదంటూ టీవీ 5 న్యూస్ చానల్ యజమాని బొల్లినేని రాజగోపాల్నాయుడు హైకోర్టులో దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్)పై మంగళవారం సీజే ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. పిటిషనర్ న్యాయవాది ఉమేశ్చంద్ర.. సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద నోటీసు ఇవ్వకుండా పోలీసులు నేరుగా అరెస్ట్ చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. ఎఫ్ఐఆర్లను 24 గంటల్లో వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతున్నామని తెలిపారు. పిటిషనర్ అభ్యర్థనలను ఓసారి గమనించాలంటూ ఏజీ చదివి వినిపించారు. వాటిని పరిశీలించిన ధర్మాసనం.. పిటిషనర్ అభ్యర్థనలు అస్పష్టంగా, పసలేకుండా ఉన్నాయని తెలిపింది. పోలీసు అధికారం లేని రాష్ట్రం మనుగడ సాధించలేదని పేర్కొంది. -
‘మెజిస్ట్రేట్లు జిల్లా జడ్జీలుగా డైరెక్ట్ రిక్రూట్మెంట్కు అర్హులు కారు’
న్యూఢిల్లీ: మెజిస్ట్రేట్లు, సివిల్ జడ్జీలు తదితర న్యాయ వ్యవస్థలోని దిగువ విభాగానికి చెందిన వారు జిల్లా జడ్జీల డైరెక్ట్ రిక్రూట్మెంట్కు అర్హులు కారని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ పిటిషన్ పెండింగ్లో ఉన్న కాలంలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా జిల్లా జడ్జీలుగా విధుల్లో చేరిన జ్యూడీషియల్ అధికారులు.. మళ్లీ తమ పాత హోదాకు తిరిగివెళ్లాలని ఆదేశించింది. మెజిస్ట్రేట్లు, సివిల్ న్యాయమూర్తులు మెరిట్తో, సీనియారిటీతో పదోన్నతుల ద్వారా కానీ, లిమిటెడ్ కాంపిటీటివ్ పరీక్ష ద్వారా కానీ జిల్లా జడ్జీలుగా నియామకం కావచ్చని పేర్కొంది. సాధారణంగా ఏడేళ్ల పాటు వరుసగా న్యాయవాద వృత్తిలో కొనసాగినవారు మాత్రమే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా జిల్లా జడ్జీలు అయ్యేందుకు అర్హులవుతారు. జ్యూడీషియల్ అధికారులుగా విధుల్లో చేరకముందు, ఏడేళ్ల వరుస సర్వీసు ఉన్నప్పటికీ.. వారు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా జిల్లా జడ్జీలు అయ్యేందుకు అర్హులు కాబోరని ధర్మాసనం స్పష్టం చేసింది. జిల్లా జడ్జీల నియామకానికి సంబంధించిన ఆర్టికల్ 233కి ధర్మాసనం వివరణ ఇచ్చింది. -
న్యాయాధికారుల వేతనం మూడు రెట్లు
న్యూఢిల్లీ: దిగువ కోర్టుల న్యాయాధికారుల వేతనాన్ని మూడురెట్ల వరకు పెంచాలని రెండో నేషనల్ జ్యుడీషియల్ కమిషన్ సిఫారసు చేసింది. పింఛను, అలవెన్సుల మొత్తాన్ని 2016 ఏడాదినుంచి అమలయ్యేలా పెంచాలని సూచించింది. సుప్రీంకోర్టు ఆమోదిస్తే ఇవి అమలుల్లోకి రావచ్చు. 2017లో ఏర్పాటైన ఈ కమిషన్ తన నివేదికను జనవరి 29న సుప్రీంకోర్టు రిజిస్ట్రీకి సమర్పించినట్లు ఒక ప్రకటనలో తెలిపింది. సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ పి.వెంకట రామారెడ్డి నేతృత్వంలోని ఈ కమిషన్ దిగువ కోర్టుల్లో జడ్జీల వ్యవస్థ, పని విధానాలను పరిశీలించింది. తుది నివేదిక ప్రకారం.. జూనియర్ సివిల్ జడ్జి/ ఫస్ట్క్లాస్ మేజిస్ట్రేట్ వేతనాన్ని రూ.27,700 నుంచి రూ.77,840కు పెంచాలి. ఆపై సీనియర్ సివిల్ జడ్జి వేతనం రూ.1,11,000 లేదా, అంతకంటే ఎక్కువ.. జిల్లా జడ్జీల ప్రారంభ వేతనం రూ.1,44,840 ఉండాలి. జిల్లా జడ్జీల వేతనం గరిష్టంగా రూ.2,24,100 ఉండాలి. చివరి వేతనంలో 50 శాతం పింఛనుగా ఇవ్వాలి. -
డ్రంకెన్ డ్రైవ్లో 39 కేసులు నమోదు
మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారికి చెక్ చెప్పేందుకు ఎల్బీనగర్, ఉప్పల్ ట్రాఫిక్ పోలీసు విభాగం అధికారులు శుక్ర, శని, ఆదివారాలలో నిర్వహించిన డ్రంకన్ డ్రైవ్లో 39 కేసులను నమోదు చేసి సోమవారం కోర్టులో హాజరు పరిచారు. మేజిస్ట్రేట్ పుష్పా దేశ్ముఖ్ డ్రంక్ అండ్ డ్రై వ్లో పట్టుబడిన వాహనదారుల తల్లిదండ్రులు, భార్యలను పిలిపించి వారికి కౌన్సిలింగ్ నిర్వహించి, మద్యం సేవించి వాహనాలు నడిపిన 37 మందికి రూ.2వేల జరిమానా, అతిగా మద్యం సేవించి వాహనాలు నడిపిన ఇద్దరికి నాలుగు రోజుల ట్రాఫిక్ విధులు నిర్వహించాలని తీర్పు చెప్పారు.