కోటిలింగాల రేవు వద్ద ఉద్రిక్తత
రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నగరంలోని కోటిలింగాల రేవు వద్ద శుక్రవారం ఉద్రిక్తత నెలకొంది. గోదావరి నది గట్టు వెంటే ఉన్న 100 గుడిసెలను తొలగించేందుకు రెవెన్యూ ఉన్నతాధికారులు సన్నద్దమైయ్యారు. దాంతో ఆగ్రహించిన గుడిసెవాసులు తమకు ప్రత్యామ్నాయం చూపించి... ఆ తర్వాతే గుడిసెలను తొలగించాలని వారు ఉన్నతాధికారులను డిమాండ్ చేశారు.
అయితే ఉన్నతాధికారులు మాత్రం గుడిసెవాసుల డిమాండ్ను పట్టించుకోకుండా తమ పని తాము చేసుకుని పోతున్నారు. దాంతో వారి చర్యలను అడ్డుకునేందుకు గుడిసె వాసులు ప్రయత్నిస్తున్నారు. దాంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తహసీల్దార్ ఎం గోపాలకృష్ణా నేతృత్వంలో ఈ ఆక్రమణల తొలగింపు కార్యక్రమం కొనసాగుతోంది.