breaking news
Kids specials story
-
వానదేవుడి చిరునవ్వు
పులిచెర్ల పల్లెలో నెలరోజులుగా వాన జాడే లేదు. పొలాలు బీళ్లు వారాయి. రైతు రామయ్య తాత దిగులుగా గట్టు మీద కూర్చున్నాడు. ‘ఈ ఏడు విత్తనాలు మొలకెత్తేలా లేవు‘ అని నిట్టూర్చాడు. అది చూసిన చిన్నారి గౌరికీ, చిన్నోడుకు ఒక ఆలోచన వచ్చింది.‘వానదేవుడు మనల్ని మర్చిపోయాడేమో. మనమే పిలవాలి’ అంది గౌరి. పిల్లలందరూ కలిశారు. వానదేవుడికి ఉత్తరం రాశారు. ‘దేవుడా, మా తాతలు ఏడవొద్దు. నువ్వు నవ్వితే చాలు, మా పొలం పచ్చగా నవ్వుతుంది.’ ఆ ఉత్తరాన్ని అరటి ఆకులో పెట్టి, చెరువు గట్టున ఉన్న రావిచెట్టు తొర్రలో దాచారు. తర్వాత ఊరంతా తిరిగి వాన పాటలు పాడారు.‘ఎలుకమ్మ ఎలుకమ్మ ఎండలేలా... వానమ్మ వానమ్మ వచ్చెయ్యమ్మా...‘ పిల్లల పాటలు, వాళ్ల మంచి మనసు చూసి వానదేవుడికి ముచ్చటేసింది. ఆ రోజు సాయంత్రమే ఆకాశంలో మబ్బులు ముసిరాయి. మెరుపులు మెరిశాయి. టప్టప్మంటూ చినుకులు పడ్డాయి. రామయ్య తాత ఆనందంతో గెంతాడు. ‘చూడండి, పిల్లల మనసు వానదేవుడికి నచ్చింది!’ పొలాలన్నీ తడిశాయి. విత్తనాలు మొలకెత్తాయి. ఊరంతా పచ్చగా నవ్వింది.నీతి: చిన్నారుల స్వచ్ఛమైన ప్రేమకు, ఐక్యతకు దేవుళ్లు కూడా తలవంచుతారు. -
రెక్కల రాకెట్: ఎవరెస్ట్ దాటిన బాతు!
పిల్లలూ, మీకో సూపర్ పక్షి కథ చెప్పనా? ఊపిరి ఆడని ఎత్తులో, వణికించే చలిలో, ఎవరెస్ట్ పైనుంచి టప్ అని దూకేసే బాతు గురించి! బార్ హెడెడ్ గూస్. ‘చారల తల బాతు’ అని కూడా అనొచ్చు. తల మీద రెండు నల్ల చారలు. అదే దీని గుర్తు. రాకెట్లా ఎవరెస్ట్ శిఖరం పై నుంచి అంటే తొమ్మిది కిలోమీటర్ల ఎత్తులో హాయిగా ఎగురుతుంది. మనకు అక్కడ ఊపిరి ఆడదు. దీనికి మాత్రం అది రాజమార్గం!ఎందుకు అంత కష్టపడుతుంది?చలికాలం వస్తే మంగోలియా, టిబెట్లో పూర్తిగా మంచు. తినడానికి గడ్డిపోచ కూడా దొరకదు. అందుకే సెప్టెంబర్ వచ్చిందంటే చాలు, ‘పదండి ఇండియా యాత్ర వెళ్దాం’ అని ఐదు వేల మంది నేస్తాలతో బయల్దేరుతుంది ఈ బాతు. మధ్యలో హిమాలయాలు అడ్డొస్తే? ‘దాటేద్దాం పద’ అని పైనుంచి వెళ్లిపోతుంది. దీనివి గొప్ప ఊపిరితిత్తులు. మనకన్నా మూడు రెట్లు ఎక్కువ గాలిని పీల్చుకుంటుంది. బలమైన గుండె. నిమిషానికి నాలుగు వందల సార్లు కొట్టుకుంటుంది. కొండల మధ్య, లోయల మధ్య పైకి కిందికి ఊగుతూ శక్తిని పొదుపు చేస్తుంది.ప్రపంచంలోనే గొప్పది... ‘ప్రపంచంలో అత్యంత ఎత్తులో ఎగిరే పక్షి’ అని దీనికి పేరుంది. శాస్త్రవేత్తలు పరిశీలిస్తే ఎనిమిది గంటల్లో హిమాలయాలు దాటేసింది. కాబట్టి నెక్స్ట్ టైమ్ ‘‘నేను చేయలేను’’ అనిపిస్తే ఈ చారల తల బాతుని గుర్తు తెచ్చుకోండి. రెక్కలు లేకపోయినా పర్లేదు, గుండె ధైర్యం ఉంటే చాలు. -
భయం వేస్తే వీపు తట్టేదెందుకో తెలుసా?
సడన్గా మనం భయపడినప్పుడు అమ్మో, నాన్నో వచ్చి వీపు తడతారు కదా. ఎందుకో తెలుసా? మన వీపు మీద చాలా సున్నితమైన నరాలు ఉంటాయి. పెద్దలు తట్టినప్పుడు ఆ నరాలు మెదడుకు కబురు పంపిస్తాయి... ‘భయపడకు, నీ పక్కన నీవాళ్లు ఉన్నారు’ అని.ఆ సిగ్నల్ రాగానే మన మెదడు ‘సేఫ్’ అని ఫీల్ అవుతుంది. భయం వేస్తే మన గుండె వేగంగా కొట్టుకుంటుంది. వీపు మీద లయగా తడితే ఆ తట్లు గుండెకి ‘మెల్లగా కొట్టుకో’ అని మెసేజ్ చేస్తాయి. డాక్టర్లు దీన్ని ‘టచ్ థెరపీ’ అంటారు.పూర్వం అడవిలో మనుషులు గుంపులుగా తిరిగేవాళ్లు. క్రూరమృగాలు తమను పసిగట్టకుండా మెల్లగా నడిచేవారు. అప్పుడు చిన్నపిల్లలు ఏడుస్తే పెద్దవాళ్లు వీపు తట్టి ‘ష్... పడుకో. పులి వస్తుంది’ అని కాపాడేవాళ్లు. ఆ అలవాటు ఇప్పటికీ మన రక్తంలోనే ఉంది. కాబట్టి నెక్ట్స్ టైమ్ భయం వేస్తే, పెద్దల దగ్గరికి పరిగెత్తి వీపు అప్పగించేయండి. తట్టు ఫ్రీ... భయం పరార్. -
రోబో అంకుల్! చాక్లెట్ కావాలా... చిప్స్ కావాలా?
పిల్లలూ... మనం షాపుకెళితే ‘చాక్లెట్ కావాలా... చిప్స్ కావాలా’ అని అంకుల్ అడుగుతాడు. కాని ఇక్కడ అంకుల్ లేడు రోబో ఉంది. అందుకే ఈ షాపు పేరు ‘గెలాక్సీ రోబో కియోస్క్’.2026 జూలై 17న చైనాలోని బీజింగ్లో తీసిన ఫోటో ఇది. ఈ షాపులో ఏం కావాలన్నా రోబోనే అమ్ముతుంది. జ్యూస్ బాటిల్స్, నీళ్లు, చిన్న బొమ్మలు.... ఏవైనా సరే. పిల్లలు క్యూలో నిలబడి స్క్రీన్ పై ఏది కావాలో టచ్ చేస్తే, లోపల ఉన్న రోబో ఆ వస్తువును తీసి ఇస్తుంది. చూశారా ఎంత బాగుందో! పిల్లలకు ఇది కొత్త అనుభవం. ‘వావ్! రోబో మనకు జ్యూస్ ఇస్తోంది‘ అని సంతోషంగా చూస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి రోబో షాపులు ఇంకా ఎక్కువ అవుతాయట. అప్పుడు మన ఊళ్లో కూడా వస్తాయేమో! అన్నట్టు ఈ రోబో పేరు ‘హ్యూమనాయిడ్ సెల్లర్ రోబో’. అంటే మనిషిలా నిలబడి సామాన్లు అమ్మే రోబో. బీజింగ్లోని ‘గెలాక్సీ’ కంపెనీ దీనిని తయారు చేసింది. వెల దాదాపు 15 లక్షల నుంచి 25 లక్షల వరకు. ఒకసారి ఫుల్ చార్జ్ చేస్తే 8 నుంచి 12 గంటల వరకు ఆగకుండా పని చేస్తుంది. లోపల కెమెరా, సెన్సార్లు ఉంటాయి. మీరు ఏ బటన్ నొక్కితే ఆ వస్తువును తీసి ఇస్తుంది. అలసి΄ోదు, కోప్పడదు, లెక్క తప్పదు! -
తడిసిన పుస్తకం.. మూడు రోజుల కూలీ!
అబ్రహాం లింకన్ కి 11 ఏళ్లు ఉన్నప్పుడు ఇండియానాలోని పిజన్ క్రీక్ దగ్గర ఉండేవాడు. చదువంటే పిచ్చి. పక్క ఊరిలో జోసియా క్రాఫోర్డ్ అనే రైతు దగ్గర ‘ద లైఫ్ ఆఫ్ జార్జ్ వాషింగ్టన్’ అనే పుస్తకం ఉందని తెలిసింది. లింకన్ బతిమాలి తెచ్చుకున్నాడు. ఆ రాత్రి వర్షం. గుడిసె కప్పులో నుంచి నీళ్లు కారి, పుస్తకం తడిసి నాశనం అయ్యింది.తెల్లారి లింకన్ ఏడుస్తూ క్రాఫోర్డ్ దగ్గరికి వెళ్లి, ‘నేను పుస్తకం పాడు చేశాను సార్’ అని ఒప్పుకున్నాడు. క్రాఫోర్డ్ దానికి ‘సరే, మూడు రోజులు నా పొలంలో పని చెయ్. అప్పు తీరిపోతుంది’ అన్నాడు. 11 ఏళ్ల లింకన్ మొక్కజొన్న పొలంలో, పందుల షెడ్డులో మూడు రోజులు కూలి చేశాడు. పుస్తకానికి ఖరీదు కట్టాడు. ఆ పుస్తకాన్ని మళ్లీ ఎండబెట్టి, అట్ట వేసి, పూర్తిగా చదివాడు. నిజాయితీ ఉన్నవాడు పైకి వస్తాడని ఈ ఘటన చెబుతోంది. -
దురాశ తగదు
హేలాపురి అడవి దగ్గర్లో రామయ్య, సీతమ్మ అనే వృద్ధ దంపతులు ఓ గుడిసెలో కాపురం ఉంటున్నారు. కడుపేదలైన ఆ దంపతులకు పిల్లలు లేరు. రామయ్య అడవిలో కట్టెలు కొట్టి సంతలో అమ్మి డబ్బులు తీసుకువచ్చేవాడు. ఆ కొద్ది డబ్బుతోనే వారి ఆహారం, మిగిలిన అవసరాలు తీర్చుకునేవారు. ఒకనాడు వర్షంపడుతూ ఉండటంతో రామయ్య అడవిలో కట్టెలు కొట్టడానికి వెళ్లలేకపోయాడు. సీతమ్మ కుండలో చెయ్యి పెడితే, ఆమె చేతికి రెండు గుప్పెళ్ల బియ్యం దొరికాయి. ఆ బియ్యాన్నే ఆమె దంచి పిండి చేసి ఒకే ఒక్క రొట్టె చేసింది. పళ్లెం ముందుపెట్టుకొని ఆ దంపతులిద్దరూ రొట్టెని పంచుకుని తిందామనుకునేంతలో గుడిసె తలుపు చప్పుడైంది. తలుపు తెరిచి చూస్తే గుమ్మంలో వర్షానికి తడిసిన ఓ సాధువు కనిపించాడు. ఆ దంపతులు సాధువును లోపలికి ఆహ్వానించి పొడి బట్టలిచ్చారు. సాధువు ఆకలి మీద ఉండటం గమనించిన రామయ్య.. ఆయన ముందు రొట్టె ఉన్న పళ్లాన్ని ఉంచాడు. ‘‘మీరిద్దరూ తిన్నారా నాయనా?’’ అని సాధువు అడిగితే, ‘‘తమరు తినండి స్వామీ.. మేము తర్వాత తింటాం’’ అన్నారా దంపతులు. వారివద్ద తినడానికి మరో రొట్టె లేదని గ్రహించిన సాధువు... ‘‘మీరు కూడా రండి. ఈ రొట్టెనే తలాకొంచెం పంచుకుని తిందాం. కొయ్యడానికి చాకు పట్టుకురా!’’ అన్నాడు. రామయ్య చాకు తీసుకురాగానే రొట్టెను చాకుతో ముక్కలుగా కోశాడు. విచిత్రంగా ముక్కలు కోసినా కూడా రొట్టె మళ్లీ పూర్తి రొట్టెగా మారిపోయింది. మళ్లీ ఆ రొట్టెను ఎన్ని ముక్కలుగా కోసినా అది మొత్తం పూర్తి రొట్టెగానే ఉండిపోసాగింది. ముగ్గురూ సంతృప్తిగా రొట్టె ముక్కలు తిన్న తర్వాత కూడా అది పూర్తి రొట్టెగానే ఉండిపోయింది. ‘‘నాయనా! మీ కోసం చేసుకున్న రొట్టెను నాకు పెట్టి, మీరు పస్తులుందామనుకున్నారు కదూ! ఇకపై మీరేనాడూ పస్తులుండవలసిన అవసరం లేదు. ఈ రొట్టెను ఎంతకాలం, ఎంతమంది తిన్నా ఇది అందరికీ సరిపోతుంది. ఈ రొట్టెను పరోపకారానికి మాత్రమే వాడాలి. మీ స్వార్థానికి కాదు సుమా అని చెప్పి ఆ సాధువు ఆ దంపతులను ఆశీర్వదించి వాన తగ్గడంతో అడవిలోకి వెళ్లిపోయాడు.’’ ఆరోజు నుంచి రామయ్య, సీతమ్మ దంపతులు ఆ రొట్టెను ముక్కలుగా చేసి తమ ఆకలిని తీర్చుకోవడమే కాకుండా... గంపెడు ముక్కలు చేసి అడవిలో ఆకలిగొన్న వేటగాళ్లకు, కట్టెలు కొట్టుకునే వాళ్లకు, బాటసారులకు పంచసాగారు. ఎంతమందికి ఎంతకాలం పంచినా ఆ రొట్టె మాత్రం తరిగిపోవడం లేదు. ఇలా కొంతకాలం గడిచింది. ఒకనాడు సీతమ్మ..‘‘ ఏమయ్యా! ఎంతకాలం ఈ రొట్టె ముక్కలను ఎంతమందికని ఉచితంగా పంచుతాం! ఇకపై రొట్టె ముక్కలిచ్చిన వాళ్ల దగ్గర నుంచి తృణమో, పణమో పుచ్చుకుందాం. ఏమంటావు!’’ అన్నది. రామయ్య కాదని చెప్పలేకపోయాడు. ఆరోజు రొట్టె ముక్కలను గంప నిండా పెట్టుకొని అడవిలోని యాత్రికులకు, వేటగాళ్లకు, కట్టెలు కొట్టుకునే వాళ్లకు ఇచ్చి.. వాళ్ల దగ్గర డబ్బులు తీసుకున్నది సీతమ్మ. గంప నిండా తీసుకొచ్చిన రొట్టె ముక్కలు అయిపోయాయి. ఇంటికి వెళ్లిన తర్వాత సంచి తెరిచి చూసుకుంటే రొట్టె ముక్కలు తిన్నవాళ్లు ఇచ్చిన డబ్బులు మాయమైపోయాయి. సాధువు మంత్రించి ఇచ్చిన రొట్టె కూడా మాయమైపోయింది. ఆ రొట్టెను పరోపకారానికి తప్ప తమ స్వార్థానికి ఉపయోగించవద్దని సాధువు చెప్పిన మాటను పాటించనందుకు తమకు తగిన శాస్తే జరిగిందని గ్రహించి విచారపడ్డారు ఆ దంపతులు. తిరిగి ఆనాటి నుంచి రామయ్య కష్టపడి అడవిలో కట్టెలు కొట్టి, సంతలో అమ్మి డబ్బులు తీసుకువస్తేనే వాళ్లు ఇంత తిండి తినగలుగుతున్నారు. దురాశ ఎప్పుడూ దుఃఖానికి చేటు కదా! -
పులి మేక స్నేహ గీతం
‘‘కుక్క–పిల్లి, పిల్లి–ఎలుక, పులి–మేక’’ వంటి జాతి తారతమ్యాలు ఉన్న జంతువులు... ఎప్పుడూ ఒకదాన్ని చూస్తే ఒకటి పరుగుతీస్తాయి. ఒకటి పారిపోవడానికి, మరొకటి పట్టుకోవడానికి..! ఆ వైరం, తారతమ్యం జన్మతః వస్తుంది. కానీ ఈ పులి–మేకలది జన్మజన్మల బంధమై ఉంటుంది. జూలో ఆహారంగా వేసిన మేకతోనే దోస్తానీ చేసింది పులి. పెద్దన్న పెద్ద మనసుని అర్థం చేసుకుంది మేక. ఒకే ఎన్క్లోజర్లో... ‘దోస్తుమేరా దోస్తు’ అంటూ తిరిగాయి. కలిసి ఎన్నో ఊసులాడుకున్నాయి. ‘కలిసుంటే కలదు సుఖం’ అంటూ పాటలు కూడా పాడుకున్నాయి. వాటి అనురాగాన్ని చూసిన వారంతా ‘అహో’ అంటూ ముచ్చటపడ్డారు. పులికి అముర్ అని, మేకకు టుమర్ అని పేర్లు కూడా పెట్టారు. ఇదంతా ఏడాది క్రితం కథ. అంత అన్యోన్యంగా ఉన్న ఈ జంటకు ఏమైందో ఏమో కానీ ఒకదానిపై ఒకటి కాలుదువ్వుకున్నాయి. దాంతో జాగ్రత్తపడ్డ జ్యూ సిబ్బంది.. రెండింటిని పక్కపక్క ఎన్క్లోజర్ల్లోకి మార్చేశారు. అయితే ఈ మధ్య మిస్టర్ అముర్(పులి)... టుమర్(మేక)ను కలుసుకోవడానికి ఎన్క్లోజర్ దగ్గరకు వస్తోంది. దాంతో కళ్లు కళ్లు ప్లస్.. అంటూ ఆ ఎన్క్లోజర్ ఊసల్లోంచే ఒకదాన్ని ఒకటి ప్రేమించుకుంటున్నాయి. ‘‘ఆనాటి హృదయాల ఆనంద గీతం ఇదేలే.. ఇదేలే..’’ అంటూ డ్యూయెట్ వేసుకుంటున్నాయి. అన్నట్టు ఈ దోస్తానులు ఎక్కడ ఉన్నాయో చెప్పలేదు కదూ..! రష్యాలోని మాస్కోలో ప్రిమోర్స్కీ సఫార్ పార్క్లో జీవిస్తున్నాయి.


