breaking news
kader khan
-
వేశ్యావాటికలో పుట్టిన నటుడు
మురికికూపాల్లో కూడా మాటలు పూస్తాయి.కష్టాలు చితక్కొట్టిన వేళ్లు కలాన్ని దృఢంగా పట్టుకోవడానికి చూస్తాయి.‘జిస్కా కోయీ నహీ ఉస్కాతో ఖుదా హై యారో’ (ఎవరూ లేనివారికి భగవంతుడే తోడు) అని‘మొకద్దర్ కా సికిందర్’లో ఒక డైలాగ్.ఖాదర్ ఖాన్కి దేవుని తోడు తప్ప మరేతోడూ లేదు. మాటను ఊతంగా చేసుకుని అతడు ఎక్కిన ఎత్తు తలెత్తి చూడతగ్గది! చెట్టు మీద కాయకూ సముద్రంలో ఉప్పుకూ సంబంధం ఉందో లేదో కాని ఖాదర్ ఖాన్కూ మన అల్లు రామలింగయ్యకు మాత్రం సంబంధం ఉంది. నిజానికి ఖాదర్ ఖాన్ తన ఇంట్లో ఫొటో పెట్టుకోదగ్గ మేలు అల్లు రామలింగయ్య చేశారనే చెప్పాలి. కథ ఇది. తెలుగులో ‘ఊరికి మొనగాడు’ (1981) సినిమా చాలా పెద్ద హిట్. హిందీలో దానిని ‘హిమ్మత్ వాలా’ (1983)గా రీమేక్ చేశారు. దర్శకుడు తెలుగును తీర్చిదిద్దిన రాఘవేంద్రరావే. అప్పటికి హిందీలో ఖాదర్ఖాన్ నటుడుగా, రచయితగా గుర్తింపు పొందాడు. నటుడుగా నెగెటివ్ రోల్స్, అప్రధానమైన రోల్స్ చేస్తున్నాడు. రచయితగా హిట్ సినిమాలు ఇస్తున్నాడు. దక్షిణాది సినిమాలు హిందీలో రీమేక్ అయితే కొత్తగా రాస్తున్న రచయితవైపు చూడటం సహజం. అలా రాఘవేంద్రరావు దృష్టి ఖాదర్ ఖాన్ మీద పడింది. తెలుగు సినిమా చూసి సంభాషణల సారం అర్థం చేసుకొని హిందీ వెర్షన్కు డైలాగ్స్ రాశాడు ఖాదర్ ఖాన్. ఆ డైలాగ్స్ను క్యాసెట్లో రీడింగ్ ఇచ్చి మద్రాసు పంపాడు. వాటిని విన్న రాఘవేంద్రరావు వెంటనే బాంబేకి (అప్పట్లో అలానే పిలిచేవారు) ఫ్లయిట్ కట్టుకుని వెళ్లి ఖాదర్ఖాన్ని కలిశారు. ‘డైలాగ్స్ చాలా బాగా రాశావు. హీరో జితేంద్ర కాబట్టి, విలన్ అంజాద్ఖాన్ కాబట్టి దిగుల్లేదు. కాని అల్లు రామలింగయ్య పాత్రకు నువ్వు రాసిన డైలాగులు చెప్పే యాక్టర్ హిందీలో ఎవరు? ఆ ఫ్లో, ఆ టైమింగ్ నువ్వు చదువుతుంటే ఆ పాత్ర నీదే అనిపించింది. నువ్వు చెయ్ దానిని’ అన్నారు. ‘నేనా... కామెడీయా’ అన్నాడు ఖాదర్ ఖాన్. ‘నువ్వే... కామెడీవే. నువ్వు చేస్తే హిందీలో అల్లు రామలింగయ్య అంతటివాడివవుతావు’ అన్నారు రాఘవేంద్రరావు. ‘హిమ్మత్వాలా’లో ఖాదర్ ఖాన్ ఆ పాత్ర చేశాడు. ఏ ముహూర్తాన చేశాడో చనిపోయేనాటి వరకు కామెడీ కింగ్గానే బతికాడు. అతడికి ఆ హాస్యకిరీటం పెట్టిన చేతులు తెలుగు వారివి అయినందుకు మనం సంతోషపడాలి. ఖాదర్ ఖాన్ తెర జీవితం నవ్వులతో పండింది కాని అతడి బాల్యం కన్నీటి ఉప్పదనంతో బిరుసెక్కిపోయింది. అప్ఘనిస్తాన్లో కొండగాలికి పుట్టిన ముగ్గురు కొడుకులు చనిపోతే మిగిలిన నాలుగో కొడుకైనా బతకాలి అని చెప్పి ఆరేడేళ్ల ఖాదర్ఖాన్ను వెంటబెట్టుకుని అతని తల్లిదండ్రులు కాబూల్ నుంచి బాంబేకి వచ్చిపడ్డారు బిడారుతో కలిసి. చేతిలో చిల్లిగవ్వ లేదు. చిల్లి లేని గవ్వ కూడా ఆ నగరంలో ఊరికే రాదు. అందుకు కష్టపడాలి. కష్టపడాల్సిన తండ్రి భార్యను, బిడ్డను వదిలేసి వేరే పెళ్లి చేసుకున్నాడు. తల్లీకొడుకులకు వేరే దారి లేక వేశ్యవాటికకు ఆసియా ఖండంలోనే పేరుపడ్డ కామాటిపుర మొదటి వీథిలో చిన్నగదిలోకి వచ్చి చేరారు. చుట్టూ వేశ్యలు, విటులు, తార్పుడుగాళ్లు, తాగుబోతులు, తగాదాలు, అల్లర్లు, అలగా జనాల బతుకు ఆక్రందనలు వీటిని వింటూ ఖాదర్ ఖాన్ పెరిగాడు. పెద్దలు తల్లికి మరో పెళ్లి చేస్తే మారుతండ్రి చేతిలో బాధలు పడ్డాడు. చదువు మానేద్దామనుకుంటే తల్లి ఒట్టు వేయించుకుంది– చదవాల్సిందేనని. ఒక పఠాన్ కంఠాన్ని తెగ్గోసుకోగలడుకాని మాట తప్పలేడు. తల్లి మాట కోసం టెక్నికల్ విద్యను పూర్తి చేసిన ఖాదర్ఖాన్ పిల్లలకు ట్యూషన్లు చెబుతూ కాలేజీలో పాఠాలు చెప్తూ ఖాళీ సమయాల్లో నాటకాలు వేస్తూ ముంబై మహానగరంలో ఉనికికి ప్రయత్నించాడు. అతడి దర్శకత్వంలో అప్పటికి పైకి రాని రాజేశ్ ఖన్నా నటించాడు. ఆ పరిచయంతో దర్శకుడు మన్మోహన్ దేశాయ్కు పరిచయం చేశాడు. అలా ‘రోటీ’ (1974) రచయితగా ఖాదర్ ఖాన్కు గుర్తింపు తెచ్చిన తొలి సినిమా అయ్యింది. అయితే అసలు కథ ఇంకా మొదలుకావాల్సి ఉంది. ఆ వెంటనే మన్మోహన్ దేశాయ్ ‘అమర్ అక్బర్ ఆంటోని’ తలపెట్టాడు. అందులో ఒక మాస్ క్యారెక్టర్ అమితాబ్ చేయాలని ఖాదర్ ఖాన్కు చెప్పాడు. అప్పటి వరకు హిందీలో మాస్ క్యారెక్టర్లు వేరే తరహాగా ఉండేవి. ఖాదర్ ఖాన్ ఆ పాత్రను, భాషను మార్చాడు. కామటిపురాలో అలగా జనం మాట్లాడే ‘అపున్’, ‘దారు’, ‘బేవ్డా’ వంటి మాటలు పెట్టాడు. ఆ దిగువ భాష జనానికి పట్టింది. ఒక ట్రెండ్గా సెటిల్ అయ్యింది. యాంగ్రి యంగ్మేన్ అమితాబ్ను మాస్ హీరో అమితాబ్గా మార్చిన పెన్ ఖాదర్ ఖాన్దే. ఆ తర్వాత వాళ్లిద్దరూ మంచి ఫ్రెండ్స్ అయ్యారు. వాళ్ల కాంబినేషన్లో ‘మొకద్దర్ కా సికిందర్’, ‘మిస్టర్ నట్వర్లాల్’, ‘యారానా’, ‘కూలీ’ వంటి సూపర్ హిట్స్ వచ్చాయి. ‘లావారిస్’ సినిమాలో అమితాబ్ ఒక ఫైట్లో సకల భాషల రౌడీలను కొడతాడు– ఆ భాషలు మాట్లాడుతూ. తెలుగు కూడా మాట్లాడటం తమాషాగా ఉంటుంది. జనం కేరింతలు కొట్టే ఈ తమాషాలు ఖాదర్ ఖాన్వే. ఖాదర్ ఖాన్ తెలుగు నుంచి రీమేక్ అయిన చాలా సినిమాలకు రాశాడు. తెలుగు నటులు పోషించిన పాత్రలను పోషించాడు. ‘జస్టిస్ చౌదరి’ (జస్టిస్ చౌదరి), ‘జాని దోస్త్’ (అడవి సింహాలు), ‘మవ్వాలి’ (చుట్టాలున్నారు జాగ్రత్త), ‘తోఫా’ (దేవత), ‘మక్సద్’ (ముందడుగు), ‘హైసియత్’ (సీతారాములు), ‘ఖైదీ’ (ఖైదీ), ‘సింఘాసన్’ (సింహాసనం) ఇవన్నీ ఖాదర్ ఖాన్ రాసి, నటించిన సినిమాలు. ఖాదర్ ఖాన్ హిందీ సినిమా రంగంలో చాలామందికి సుదీర్ఘమైన కెరీర్ ఇచ్చాడు. డేవిడ్ ధావన్ వంటి దర్శకుడు తయారవడంలో ఖాదర్ ఖాన్ పాత్ర ఉంది. కథల వరుస ఎలా ఉండాలో అని అగమ్యంగా ఉన్న నటుడు గోవిందాని కామెడీ బాట పట్టించినవాడు ఖాదర్ ఖాన్. గోవిందా, ఖాదర్ ఖాన్, శక్తికపూర్లు కలిసి 1990లలో ఒక పదేళ్ల పాటు తెర మీద చాలా సందడి చేశారు. అది టేస్ట్ ఉన్న కామెడీ కాకపోవచ్చు కాని నవ్వొచ్చే కామెడీయే. ఖాదర్ ఖాన్ కోపం మనిషి. పటాటోపాలు నచ్చని మనిషి. అమితాబ్ తన స్టేటస్ను పెంచుకోవడంలో భాగంగా తనను అందరూ ‘సర్జీ’ అని పిలవాలని బాలీవుడ్లో ఆదేశాలు జారీ చేసినప్పుడు ‘అతన్ని నేను అమిత్ అని పిలవడం అలవాటు. నా అలవాటును మార్చుకోను. అతనితో పని చేయను’ అని తెగేసి చెప్పి అలాగే ఉన్న నటుడు ఖాదర్ ఖాన్. ‘నా చేతి వాచీ లక్ష రూపాయలు తెలుసా’ అని గోవిందా ఫోజు కొడితే ‘నా చేతివాచీ నూట యాభయ్యే. అది కూడా కరెక్ట్ టైమే చూపిస్తుంది’ అని వాత వేసినవాడు అతను. కాలం మారాక ఖాదర్ఖాన్ మెల్లగా సినిమాలకు దూరంగా ఉన్నాడు. ఉర్దూ, అరబ్బీలు నేర్పే ఇన్స్టిట్యూషన్ నడిపాడు. పేద ముస్లింలు హజ్ యాత్ర చేయడానికి సాయపడే సంస్థను నిర్వహించాడు. ఆయన పిల్లలు కెనడాలో స్థిరపడ్డారు. అక్కడే ఆయన డిసెంబర్ 31, 2018న 81వ ఏట కన్ను మూశాడు. గట్టి ఎదురుదెబ్బలను, గొప్ప జీవితానుభవాలను సిరా చుక్కలుగా మార్చుకోగలిగినవాడు రచయితగా రాణించగలడని, సులువు తెలిసినవాడు నటుడుగా వెలగగలడని చెప్పినవాడు ఖాదర్ ఖాన్. రాసి రాసి అలసిపోయిన ఆ నట రచయితకు వీడ్కోలు చెప్పి అతడు పూయించిన నవ్వులను పెదాల మీదకు తెచ్చుకోవడమే అతనికి మనం అర్పించగలిగిన నివాళి. – కె. -
ప్రముఖ నటుడు కన్నుమూత
ముంబై: బాలీవుడ్ సీనియర్ నటుడు, రచయిత ఖాదర్ ఖాన్(81) కన్నుమూశారు. సుదీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన కెనడాలో తుదిశ్వాస విడిచారని ఖాదర్ ఖాన్ కుమారుడు సర్ఫరాజ్ వెల్లడించారు. కుటుంబ సభ్యులందరూ కెనడాలోనే ఉన్నందున అక్కడే అంత్యక్రియలు నిర్వహిస్తామని తెలిపారు. ‘డిసెంబర్ 31 సాయంత్రం ఆరు గంటలకు మా తండ్రి కన్నుమూశారు. చాలా కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన గత 16-17 వారాలుగా ఆస్పత్రిలో ఉన్నారు. పరిస్థితి విషమించి శుక్రవారం తుదిశ్వాస విడిచారు. కెనడాలోనే అంత్యక్రియలు జరుపుతామ’ని పీటీఐ వార్తా సంస్థతో సర్ఫరాజ్ చెప్పారు. ఖాదర్ ఖాన్ మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ, బాలీవుడ్ దిగ్గజ నటుడు అమిత్బాబ్ బచ్చన్ సంతాపం ప్రకటించారు. తన అద్భుత నటనతో వెండి తెరకు మరింత మెరుగులు దిద్దారని మోదీ పేర్కొన్నారు. రచయితగా కూడా గొప్ప సినిమాలు అందించారని కొనియాడారు. ఖాదర్ ఖాన్ మరణ వార్త కలచివేసిందని అమితాబ్ అన్నారు. గొప్ప ప్రతిభావంతుడైన ఆయనను కోల్పోవడం బాధాకరమని ట్వీట్ చేశారు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన దో ఔర్ దో పాంచ్, ముకద్దర్ కా సికిందర్, మిస్టర్ నట్వర్లాల్, సుహాగ్, షహేన్షా సినిమా ఘన విజయం సాధించాయి. అఫ్గానిస్థాన్లోని కాబూల్లో జన్మించిన ఖాదర్ ఖాన్ 1973లో వచ్చిన ‘ధాగ్’ చిత్రంతో బాలీవుడ్లోకి అడుగుపెట్టారు. 300లకు పైగా చిత్రాల్లో నటించారు. 250పైగా సినిమాలకు డైలాగులు రాశారు. మాటల రచయితగా ఆయన మొదటి సినిమా ‘జవానీ దివానీ’. హాస్య పాత్రలకు పేరుగాంచిన ఖాన్.. దర్శకుడు డేవిడ్ ధావన్ సినిమాల్లో ఎక్కువగా నటించారు. అమితాబ్తో పాటు రాజేశ్ ఖన్నా, జితేంద్ర, ఫిరోజ్ ఖాన్, అనిల్ కపూర్, గోవిందా తదితర ప్రముఖ నటులతో ఆయన తెర పంచుకున్నారు. -
కోల్కతా కేసులో ప్రధాన రేపిస్టు దొరికాడు
కోల్కతా: నాలుగేళ్ల కిందట ఓ యువతిపై లైంగిక దాడికి పాల్పడిన గ్యాంగ్లోని కీలక నిందితుడు పట్టుబడ్డాడు. ఉత్తరప్రదేశ్ లోని ఘజియా బాద్ జిల్లాలో పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. అతడితోపాటు అలీ అనే మరో నేరస్తుడిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 2012 ఫిబ్రవరి 6న ఓ ఆంగ్లో-ఇండియన్ మహిళకు తుపాకీ గురిపెట్టి కోల్ కతాలో ఐదుగురు వ్యక్తులు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి కాదర్ ఖాన్ అనే వ్యక్తి కీలక నిందితుడు. మిగితావారు దొరికినప్పటికీ ఇతడు మాత్రం తప్పించుకోని తిరుగుతూ చివరకు పోలీసులకు పట్టుబడ్డాడు. -
సంచలన రేప్ కేసులో నిందితుడి అరెస్టు
దేశమంతా విస్తుపోయేలా పశ్చిమబెంగాల్ రాజధాని కోల్కతాలోని పార్క్స్ట్రీట్లో జరిగిన దారుణ అత్యాచారం కేసులో ప్రధాన నిందితుడిని నాలుగేళ్ల తర్వాత పోలీసులు అరెస్టు చేశారు. ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్ జిల్లాలో ఖాదర్ ఖాన్ అనే ఈ నిందితుడు అరెస్టయ్యాడు. అతడితో పాటు అతడి అనుచరుడు అలీఖాన్ను కూడా కోల్కతా పోలీసుల ప్రత్యేక బృందం ఢిల్లీ పోలీసులతో కలిసి నిర్వహించిన సంయుక్త ఆపరేషన్లో అరెస్టుచేసింది. ఘజియాబాద్లోని ఒక అపార్టుమెంటులో దాక్కుని ఉండగా వారిని పట్టుకున్నట్లు బృందంలోని ఒక అధికారి తెలిపారు. వాళ్లిద్దరినీ ట్రాన్సిట్ రిమాండ్ మీద తీసుకొచ్చి శనివారం నాడు కోల్కతా కోర్టులో ప్రవేశపెడతామన్నారు. ఇద్దరు పిల్లల తల్లి అయిన బాధితురాలిపై 2012 ఫిబ్రవరి 6వ తేదీన కోల్కతాలోని పార్క్ స్ట్రీట్ ప్రాంతంలో సామూహిక అత్యాచారం జరిగింది. ఆమెను ఇంటివద్ద దింపుతామన్న ఐదుగురు వ్యక్తులు కారులో ఎక్కించుకుని ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన కాదర్ ఖాన్ నాలుగేళ్లుగా తప్పించుకుని తిరుగుతున్నాడు. అతడిపై విశ్వసనీయ సమాచారం అందడంతో.. అతడి మొబైల్ సిగ్నళ్లను ట్రాక్ చేసి పట్టుకున్నారు. తొలుత అతడు ఢిల్లీ సమీపంలో ఉన్నట్లు సెల్ సిగ్నళ్ల ద్వారా తెలిసింది. కోల్కతా సీపీ రాజీవ్ కుమార్ సూచనల మేరకు ప్రత్యేక బృందం అతడి వెంట పడింది. కొన్నాళ్ల పాటు బంగ్లాదేశ్లో తలదాచుకున్న కాదర్.. తర్వాత నేపాల్ మీదుగా ఢిల్లీకి వచ్చాడు. అతడి కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడటంతో అతడి ఆనుపానులు తెలిశాయి.