తొలి మహిళా సీజే కన్నుమూత
న్యూఢిల్లీ: భారత్లో ఒక హైకోర్టుకు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ లీలాసేథ్(86) కన్నుమూశారు. ఆమె నోయిడాలోని తన నివాసంలో ఉండగా శుక్రవారం రాత్రి గుండె పోటు రావడంతో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు చెప్పారు. తన అవయవాలను దానం చేస్తానని లీలా చనిపోయే ముందు వాగ్దానం చేయడంతో ఆమె భౌతిక కాయానికి అంత్యక్రియలు నిర్వహించమని తెలిపారు. లీలా లండన్ బార్ పరీక్షలో ప్రథమ స్థానం సాధించిన తొలి భారత మహిళగా నిలిచారు.
ఢిల్లీ హైకోర్టు తొలి మహిళా న్యాయమూర్తిగా, హిమాచల్ప్రదేశ్ హైకోర్టులో తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించారు. నిర్భయ ఉదంతం తరువాత, లైంగిక నేరాలకు పాల్పడే వారిపై విచారణ త్వరగా పూర్తయ్యేలా న్యాయ శాస్త్రంలో సవరణల్ని సిఫార్సు చేయడానికి నియమించిన జస్టిస్ వర్మ కమిటీలో లీలా కూడా సభ్యురాలు. తన స్వీయ చరిత్ర ‘ఆన్ బ్యాలెన్స్’ బాగా అమ్ముడుపోయిన పుస్తకంగా నిలిచింది. లీలా సేథ్ కుమారుడు విక్రమ్ సేథ్ రచయితే. ఆమె మృతి పట్ల ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు.