breaking news
jssk
-
గర్భిణులకు తోడుగా జననీ శిశు సురక్ష
సాక్షి, కర్నూలు(హాస్పిటల్): మాతాశిశు మరణాలు తగ్గించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయి. మహిళకు కడుపులో బిడ్డ పడినప్పటి నుంచి జన్మించే వరకు, ఆ తర్వాత టీకాలు పూర్తయ్యే దాకా పలు పథకాల ద్వారా లబ్ధిచేకూరుస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మహిళ సురక్షితంగా ప్రసవం అయ్యేందుకు జననీ శిశు సురక్ష పథకాన్ని కొనసాగిస్తున్నారు. ఆసుపత్రికి వచ్చిన మహిళ ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా ఈ పథకం ద్వారా నిధులు ఖర్చు చేస్తారు. జిల్లాలో 87 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 18 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, 20 ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలు, ఒక జిల్లా ఆసుపత్రి, ఒక బోధనాసుపత్రి పనిచేస్తున్నాయి. దీంతో పాటు జిల్లాలో 16 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 3,486 అంగన్వాడీ కేంద్రాలు, 63 మినీ అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో నమోదైన గర్భిణులను ఏఎన్ఎంలు, ఆశాలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స చేయిస్తున్నారు. ఈ మేరకు జిల్లాలో ప్రతి సంవత్సరం ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందే గర్భిణిల సంఖ్య 42 వేల వరకు ఉంటోంది. జిల్లాలో ప్రతి సంవత్సరం 200కు పైగా మాతాశిశు మరణాలు జరుగుతున్నాయి. అందులో శిశు మరణాలే అధికంగా ఉంటున్నాయి. ప్రధానంగా గ్రామీణ పేద మహిళలు గర్భం దాల్చిన తర్వాత అవసరమైన పౌష్టికాహారం తీసుకోవడం లేదు. కొందరికి చిన్న వయస్సునే పెళ్లి జరుగుతుండటంతో వారు ప్రసవ సమయంలో వివిధ సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో సిజేరియన్ల సంఖ్య కూడా పెరుగుతోంది. ఆర్థిక ఇబ్బందులతో పేద కుటు ంబాల్లోని గర్భిణిలు అవసరమైన ఆహారం అందడం లేదు. మందుల కొనుగోలుకూ వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితిని గుర్తించిన ప్రభు త్వం ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆహారం, మందులు అందిస్తోంది. వారికి వైద్యపరీక్షలూ చేయిస్తోంది. ప్రసవ సమయంలో ఖర్చు లేకుండా.. ప్రసవ సమయంలో పేద గర్భిణులకు ఎలాంటి ఖర్చు లేకుండా జననీ శిశు సురక్ష కార్యక్రమం (జేఎస్ఎస్కే) ఆదుకుంటోంది. ప్రభుత్వ ఆసుపత్రికి 108 అంబులెన్స్లో ఉచితంగా గర్భిణి వచ్చే అవకాశం ఉంది. ఇలా వచ్చిన గర్భిణికి ఆసుపత్రిలో జేఎస్ఎస్కే ద్వారా ఖర్చులేకుండా ప్రసవం చేసుకునే అవకాశం ఉంది. గర్భిణిలకు అవసరమైన మందులు, రక్తం, వైద్యపరీక్షలు, ఆహారం కోసం ఈ నిధుల ద్వారా ఖర్చు చేసుకునే అవకాశం ఉంది. ఈ మేరకు జిల్లాలోని ప్రతి ప్రాథమిక, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, జిల్లా ఆసుపత్రి, బోధనాసుపత్రులకు ప్రభుత్వం ఏటా కోట్ల రూపాయల నిధులు జారీ చేస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో 3కోట్ల49లక్షల 11వేలను కేటాయించింది. జేఎస్ఎస్కేతో ప్రయోజనం గర్భిణులకు స్కానింగ్ కోసం ఒకసారికి రూ.200ను ఇవ్వవచ్చు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో స్కానింగ్ యంత్రం లేకపోతే బయట చేయించుకుంటే ఈ డబ్బు చెల్లించవచ్చు. రక్త పరీక్షలకు అవసరమైతే రూ.200 ఖర్చు చేయవచ్చు. సాధారణ ప్రసవం అయిన వారికి ఆహారం కోసం మూడురోజులకు రోజుకు రూ.100 చొప్పున రూ.300. సిజేరియన్ ప్రసవం అయిన వారికి పౌష్టికాహారం కోసం ఏడు రోజులకు రోజుకు రూ.100 చొప్పున రూ.700 ఖర్చు చేయవచ్చు. సాధారణ ప్రసవం అయిన వారికి మందుల కోసం రూ.350, సిజేరియన్ అయిన వారికి రూ.1,600 ఖర్చు చేయవచ్చు. ఆసుపత్రి అభివృద్ధి సొసైటీకి ఈ నిధులను పంపిస్తారు. వీటిని మెడికల్ ఆఫీసర్ ఖాతాలో ఉంచుకుని నిబంధనల మేరకు వెచ్చించాల్సి ఉంటుంది. -
లక్ష్యం చేరని సురక్ష
- సక్రమంగా అమలు కాని జేఎస్ఎస్కే, జేఎస్వై - జిల్లాలో మిగిలిపోతున్న రెండు పథకాల నిధులు - పేద గర్భిణులకు అవగాహన కల్పించని అధికారులు - ప్రభుత్వాస్పత్రుల్లో అరకొరగా గైనకాలజిస్టులు రామచంద్రపురం : జాతీయ ఆరోగ్య మిషన్లో భాగంగా నిరుపేదలైన తల్లీబిడ్డల సంక్షేమం కోసం కేంద్రం ప్రవేశపెట్టిన జననీ శిశు సురక్ష కార్యక్రమాన్ని (జేఎస్ఎస్కే) జిల్లాలో అమలు చేయటంలో అధికారులు విఫలమవుతున్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో సురక్షిత ప్రసవానికి అయ్యే మొత్తం ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందన్న అవగాహనను పేదగర్భిణులకు కల్పించలేకపోవడంతో వారు ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. పేద మహిళలకు ప్రభుత్వాస్పత్రుల్లో మెరుగైన వైద్యసేవలందించి తల్లీబిడ్డలకు మంచి ఆరోగ్యం ఇవ్వాలనేది జేఎస్ఎస్కే లక్ష్యం. ఈ పథకం కింద గర్భిణులు ఆస్పత్రుల్లో చేరేందుకు అంబులెన్స్ సౌకర్యం కల్పిస్తారు. శస్త్రచికిత్స, రక్త పరీక్షలు, రక్తం ఎక్కించాల్సి వస్తే ఆ ఖర్చును కూడా ప్రభుత్వమే భరిస్తుంది. శిశువుకు అవసరమైన మందులన్నింటినీ ఉచితంగానే ఇచ్చి, బాలింతను ఆస్పత్రి నుంచి ఇంటికి సురక్షితంగా పంపిస్తారు. ఈ పథకానికి నిధులను ప్రభుత్వం సకాలంలో విడుదల చేస్తోంది. జిల్లాలో 11 ప్రభుత్వాస్పత్రులతో పాటు 24 గంటలూ పనిచేసే 33 పీహెచ్సీలలో ఈ పథకం అమలులో ఉంది. రాజమండ్రి జిల్లా ఆస్పత్రి, అమలాపురం, రామచంద్రపురం, తుని, రాజోలు, కొత్తపేట, రంపచోడవరం, పెద్దాపురం, ప్రత్తిపాడు, వై.రామవరం, అనపర్తి ఏరియా ఆస్పత్రులకు గత ఏడాది ఈ పథకం కింద రూ.6.76 కోట్లు విడుదల చేయగా రూ.4.30 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. డబ్బులు గుంజుతున్న సిబ్బంది జేఎస్ఎస్కే సక్రమంగా అమలు జరగాలంటే ప్రభుత్వాస్పత్రుల్లో గైనకాలజిస్టులు ఉండి తీరాలి. కాకినాడ జీజీహెచ్ మినహా 250 పడకలున్న రాజమండ్రి ప్రభుత్వాస్పత్రిలో ఆరుగురు గైనకాలజిస్టులుండాలి. కానీ ప్రస్తుతం ఇద్దరే ఉన్నారు. 100 పడకల రామచంద్రపురం, అమలాపురం, తుని ఏరియా ఆసుపత్రుల్లో నలుగురు చొప్పున ఉండాల్సి ఉండగా ఇద్దరు లేక ఒక్కొక్కరు మాత్రమే ఉన్నారు. పెద్దాపురం, కొత్తపేట ఏరియా ఆస్పత్రుల్లో ఒక్కొక్కరే ఉండగా ప్రత్తిపాడు, వై.రామవరం, రంపచోడవరం, అనపర్తి ఏరియా ఆస్పత్రుల్లో అసలు గైనకాలజిస్టులే లేరు. జేఎస్ఎస్కే ద్వారా ప్రభుత్వాస్పత్రికి ప్రైవేటు డాక్టర ్లను తీసుకువచ్చి సిజేరియన్ చేయించే అవకాశముంది. శస్త్రచికిత్స చేసిన వైద్యునికి రూ.1200 నుంచి రూ.1700, మత్తు వైద్యునికి రూ.1000 నుంచి రూ.1500 వరకు ప్రభుత్వం చెల్లిస్తుంది. అయితే దీన్ని అవకాశంగా మలచుకుని ప్రభుత్వాస్పత్రిలో సిజేరియన్ చేయించుకున్న పేద గర్భిణుల నుంచి సిబ్బంది రూ.2500 నుంచి రూ.3 వేల వరకు గుంజుతున్నారనే ఆరోపణలున్నాయి. నిబంధనలే ప్రతిబంధకం.. పేద మహిళల కోసం కేంద్రమే అమలు చేస్తున్న జననీ సురక్ష యోజన (జేఎస్వై) కూడా ఆశించిన ప్రయోజానానికి ఎడంగానే ఉంది. ఈ పథకం కింద ప్రభుత్వాస్పత్రుల్లో పురుడు పోసుకున్న పేద మహిళలకు ఖర్చులుగా గ్రామీణులకు రూ.800, పట్టణవాసులకు రూ.600 చెల్లిస్తారు. 2013 ఏప్రిల్ నుంచి 2014 మార్చి వరకు ఈ పథకం కింద రూ.కోటీ 53 లక్షలు విడుదల కాగా కేవలం రూ.44 లక్షలు మాత్రమే ఖర్చు చేసినట్టు తెలుస్తోంది. పేదమహిళలకు అవగాహన లేకపోవటం, అర్థం లేని నిబంధనలు, సిబ్బంది నిర్లక్ష్యం వల్ల కూడా పేదమహిళలకు దక్కాల్సిన సాయం దూరమవుతోంది. గర్భిణుల్లో పేదలకు సురక్షితమైన వైద్యంతో పాటు ఒకింత ఆర్థిక ఊతం కూడా అందించే ఈ పథకాల గురించి విస్తృతంగా ప్రచారం చేయాలి.