breaking news
IVR systems
-
ఓటిక్కడ.. ఓటరక్కడ
‘హలో..నేను శేరిలింగంపల్లి అభ్యర్థిని మాట్లాడుతున్నాను.. మీ ఓటు మా పార్టీకే వేయండి’ అని అమరావతిలో ఉన్న ఓ వ్యక్తికి ఫోన్ రావడంతో అవాక్కయ్యాడు. ‘మీకు, మీ కుటుంబ సభ్యులకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు.. ఇట్లు మీ కుత్బుల్లాపూర్ నియోజకవర్గ అభ్యర్థి’ ఈ సందేశం చదివాక విజయవాడలో ఓ వ్యక్తి అయోమయంలో పడ్డాడు. తెలంగాణ ఎన్నికలకు ఆంధ్రాలో ప్రచారమేంటి.. అనుకుంటున్నారా? ఎన్నికల ప్రచారానికి అభ్యర్థులు ఆశ్రయిస్తున్న ఆధునిక పద్ధతులే ఇందుకు కారణం. అసలు విషయం ఏంటంటే.. ఐవీఆర్ ద్వారా రికార్డు సందేశాలను, వాట్సాప్, ఎస్సెమ్మెస్ ద్వారా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని అభ్యర్థులు ప్రచారం చేసుకుంటున్నారు. ఈ కారణంగా ఇందులో చాలా ఫోన్లు, సందేశాలు ఏపీకి వెళుతున్నాయి. కారణం ఏంటి? తెలంగాణలో.. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతాల్లో ఆంధ్రా ప్రాంతానికి చెందినవారు అధికంగా స్థిరపడ్డారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉండగానే.. వీరంతా అటు తమ సొంత జిల్లాల్లో, ఇటు హైదరాబాద్లోని తమ నియోజకవర్గాల్లో ఓటు నమోదు చేయించుకున్నారు. ఇలాంటి ఓటర్లు దాదాపు 20 లక్షలకుపైగానే ఉంటారు. వృత్తి, ఉపాధి, వ్యాపారం, స్థానికత తదితర కారణాల వల్ల రాష్ట్ర విభజన నేపథ్యంలో వీరిలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు, చిన్నవ్యాపారులు, పారిశ్రామిక కూలీలు తిరిగి ఏపీకి వెళ్లిపోయారు. వీరందరి ఫోన్లలో ఇపుడు తెలంగాణ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఎవరు చేస్తున్నారు? కూకట్పల్లి, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, కుత్బుల్లాపూర్, ఉప్పల్, మల్కాజిగిరి, మేడ్చల్, ఎల్బీనగర్, జూబ్లీహిల్స్, ఇబ్రహీంపట్నం తదితర ప్రాంతాల్లో సెటిలర్లు అధికంగా ఉన్నారు. ఏపీలో రియల్ ఎస్టేట్ ఊపందుకోవడంతో అమరావతి పరిసర ప్రాంతాలవారు, కొత్త పరిశ్రమలు నెలకొల్పాలన్న ఆశతో ఎంట్రాప్రెన్యూర్లు, ఇలా రకరకాల కారణాలతో రాజధానిని వీడారు. వీరందరి ఫోన్లకి ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పొద్దుపోయే దాకా ఏదో ఒక సమయంలో సందేశాలు, రికార్డెడ్ వాయిస్కాల్స్ వస్తున్నాయి. మరోవైపు ఇలాంటి ఓట్లను తొలగించాలని ఏపీలో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. గతవారం విచారణకు వచ్చిన సందర్భంగా అనుమానాస్పదంగా ఉన్న దాదాపు 19 లక్షల ఓట్లపై విచారణ జరిపిస్తామని ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి సిసోడియా న్యాయస్థానానికి హామీ ఇచ్చారు. 2024 వరకు ఇంతే.. రాష్ట్ర విభజనకు ముందు ఏపీ తెలంగాణ రెండూ ఆంధ్రప్రదేశ్ సర్కిల్ పరిధిలోనే ఉండేవి. తరువాత రెండుగా విడిపోయాయి. కానీ, సర్కిల్ పరిధిలో ముందుగా చేసుకున్న ఒప్పందాల ప్రకారం.. 2024 వరకు ఈ రెండు ప్రాంతాల్లో ఎలాంటి రోమింగ్ చార్జీలు పడవు. ఈ కారణంగా అభ్యర్థులు వివిధ మార్గాల ద్వారా తాము సేకరించిన ఫోన్ నంబర్లకు ప్రచార సందేశాలు పంపుతుండటంతో ఈ పరిస్థితి తలెత్తుతోంది. రెండుచోట్లా ఓట్లు ఉండటం, ఏపీ తెలంగాణకు 2024 దాకా రోమింగ్ చార్జీలు పడకపోవడమూ మరో కారణం. అయినా, ఇపుడు దాదాపు అన్ని మొబైల్ నెట్వర్క్లు దేశవ్యాప్తంగా ఒకే రకమైన కాల్ఛార్జీలు వసూలు చేయడం కూడా వీరికి కలిసివస్తోంది. ముంపు మండలాలదీ అదే పరిస్థితి! విభజన చట్టం ప్రకారం ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ముంపు ప్రాంతాలుగా పరిగణిస్తూ ఏపీకి కేంద్రం బదిలీ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఏడు మండలాలు తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో అంతర్భాగంగా ఉండేవి. భద్రాచలం నియోజకవర్గంలోని భద్రాచలం పట్టణం మినహా మిగతా మండలం అంతా, చింతూరు, కూనవరం, వరరామచంద్రాపురం మండలాలు, పినపాక పరిధిలోని బూర్గంపాడు, అశ్వారావుపేట నియోజకవర్గంలోని కుక్కునూరు, వేలేరుపాడు మండలాలను ఏపీలో కలిపారు. ఈ ఏడు మండలాల్లో 211 గ్రామాలు, 34 వేల కుటుంబాలు ఉన్నాయి. ఈ ఓటర్లను కూడా భద్రాచలం, పినపాక, అశ్వారావుపేట నుంచి పోటీ పడుతోన్న వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు తమకు ఓటువేసి గెలిపించాలని ఎస్సెమ్మెస్లు, వాయిస్కాల్స్ ద్వారా కోరుతున్నారు. 34వేల కుటుంబాల్లో దాదాపు 1.20 లక్షల ఓట్లు ఉండొచ్చని అంచనా. -
ఐవీఆర్ఎస్..అంతా గ్యాస్
వీరవాసరం, న్యూస్లైన్:టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తన పార్టీలోని నాయకులు, కార్యకర్తలనే కాదు ప్రజల అభిప్రాయాలనూ కరివేపాకులా తీసిపారేశారు. అత్యాధునిక ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ (ఐవీఆర్ఎస్)తో మీ నియోజకవర్గ అభ్యర్థిని మీరే నిర్ణయించుకోండంటూ హడావుడి చేసిన చంద్రబాబు.. సీట్ల కేటాయింపులో చివరికి తను అనుకున్నవారికే ఇచ్చారు. జిల్లా టీడీపీలో ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్. స్వయంగా టీడీపీ నేతలే అధినేత వైఖరిని తప్పుపడుతున్నారు. నియోజకవర్గాల్లోని ఓటర్లతో ఫోన్లో మాట్లాడి అభిప్రాయాలు తెలుసుకుని, ఎక్కువ మంది ఎవరి పేరు చెబితే వారికే టికెట్ ఇస్తామని డాంబికాలు పలికిన బాబు చివరకు ఎప్పటిలా తన రెండు నాల్కల ధోరణిలాగే సీట్లను కేటాయించాలని ఆ పార్టీ నాయకులు చెవులు కొరుక్కుంటున్నారు. జిల్లాలో ఐవీఆర్ఎస్ ద్వారా ఎవరిని ఎంపిక చేశారా అని పరిశీలిస్తే ఒక్కరు కూడా లేరట. మేం సూచించిన అభ్యర్థులకు కాకుండా పార్టీ పెద్దలు అనుకున్న వాళ్లకే టికెట్లు కేటాయించడం జరిగిందని వాపోతున్నారు. ఐవీఆర్ఎస్ విధానం అంటూ మాయమాటలు చెప్పి పార్టీ నాయకులను మభ్యపెట్టడం ఎంతవరకు సమంజసం అంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భీమవరం అసెంబ్లీ నియోజకవర్గానికి మొదట్లో మెంటే పార్థసారథి, పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు), పోలిశెట్టి సత్యనారాయణ (దాస్)ల పేర్లను ఫోన్ల ద్వారా వినిపించారు. తర్వాత చెరుకువాడ శ్రీరంగనాథరాజు, పులపర్తి రామాంజనేయులు పేర్లతో ఫోన్ రింగ్ మోగించారు. వీరిలో ఒకరి పేరు సూచించమని అడిగితే ఎక్కువ మంది మెంటే పార్థసారథి పేరు సూచించారు. ఆ తర్వాత పోలిశెట్టి దాస్ పేరును కార్యకర్తలు, ఓటర్లు సూచించారట. తీరా భీమవరం టీడీపీ అభ్యర్థిగా పులపర్తి రామాంజనేయులుకు కేటాయించడంతో తెలుగు తమ్ముళ్లు అవాక్కయ్యారు. అధినేత తీరుపై నిప్పులు చెరుగుతున్నారు. పాలకొల్లు నియోజకవర్గంలో డాక్టర్ త్సవటపల్లి సత్యనారాయణ(బాబ్జి), నిమ్మల రామానాయుడు పేర్లను ఐవీఆర్ఎస్ ద్వారా వినిపించగా అత్యధికంగా బాబ్జీ పేరును సూచించారట. చివరకు సీటు మాత్రం రామానాయుడుకు చంద్రబాబు కట్టబెట్టారు. నరసాపురంలో కోటిపల్లి సురేష్, చినిమిల్లి సత్యనారాయణ, భూపతి నరేష్ల పేర్లు వినిపించగా టికెట్ విషయానికి వచ్చేసరికి వారెవరినీ కాదని ఐవీఆర్ఎస్ జాబితాలో లేని బండారు మాధవనాయుడికి కట్టబెట్టడం విశేషం. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో కొట్టు సత్యనారాయణ, ఈలి నాని, యర్రా నారాయణస్వామి కుమారుడు నవీన్ పేర్లను ఐవీఆర్ఎస్ ద్వారా వినిపించారు. తీరా ఈ సీటు బీజేపీకి కేటాయించారు. చింతలపూడి, కొవ్వూరు నియోజకవర్గాల్లో కూడా ఐవీఆర్ఎస్ జాబితాలో లేని వారికే సీట్లను కట్టబెట్టారు. మిగిలిన నియోజకవర్గాల్లోనూ ప్రజలు, కార్యకర్తలు సూచించిన వారికి కాకుండా ఇతరులకు టికెట్లు ఇచ్చారు. ప్రజల నిర్ణయాలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్టు కలరింగ్ ఇవ్వడానికే చంద్రబాబు ఐవీఆర్ఎస్ను తీసుకొచ్చారని, తన వర్గం మీడియాతో కావాల్సినంత ప్రచారం జరిపించుకున్న తర్వాత తన నిర్ణయాలనే ప్రజలపై రుద్దారని టీడీపీ నేతలు బాహాటంగా తెలుపుతున్నారు. ప్రజలను మభ్యపెట్టడంలో మా ‘బాబు’ ఎవరికీ అందరంటూ తమ్ముళ్లే విమర్శిస్తున్నారు.