breaking news
Isuzu Motors India Private Limited
-
ఇసుజు కార్ల ప్లాంట్ విస్తరణ
వరదయ్యపాళెం(చిత్తూరు జిల్లా): శ్రీసిటీలోని జపనీస్ యుటిలిటీ వాహన తయారీదారు ఇసుజు మోటార్స్ ఇండియా పరిశ్రమలో అదనపు ఉత్పత్తుల యూనిట్ను సోమవారం లాంఛనంగా ప్రారంభించారు. కంపెనీ ఆవరణలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో జపాన్ కాన్సుల్ జనరల్ కొజిరో యఖియామా, ఇసుజు మోటార్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ టోరూ నకాటా, మిట్సుబిషి కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, సీఈఓ ఇవారో టోయిడి శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డిలు ముఖ్య అతిథులుగా పాల్గొని రూ. 400కోట్ల పెట్టుబడులతో అదనపు ఉత్పత్తి కేంద్రంగా ఏర్పాటు చేసిన ప్రెస్షాప్ సదుపాయం, ఇంజన్ అసెంబ్లింగ్ యూనిట్లను ప్రారంభించారు. ఈ రెండవ దశ కార్యకలాపాల ప్రారంభం భారత్లోని ఇసుజు ప్రయాణంలో అతి ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుందని జపాన్ కాన్సుల్ జనరల్ తెలిపారు. అంతర్జాతీయ తయారీ కేంద్రాలలో ఒకటిగా ఈ ప్లాంటును తీర్చిదిద్దడానికి ఇసుజు చేస్తున్న ప్రయత్నాలను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నామన్నారు. అనివార్య పరిస్థితుల్లో ఈ కార్యక్రమానికి హాజరు కాలేక పోయిన రాష్ట్ర పరిశ్రమల శాఖామంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పంపిన అభినందన సందేశాన్ని శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి చదివి వినిపించారు. మంత్రి తన సందేశంలో ఇసుజుకు అన్నివిధాలా రాష్ట్ర ప్రభుత్వం మద్దతు, భరోసా ఇస్తుందని తెలిపారు. రాష్ట్రంలో ఆటో మొబైల్ తయారీకి ఇసుజు ఒక ప్రామాణికంగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి కార్ల పరిశ్రమ ఇసుజు అంటూ శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి వ్యాఖ్యానించారు. టోరూ నకాటా మాట్లాడుతూ.. పోటీ మార్కెట్లో అత్యుత్తమ శ్రేణి ఉత్పత్తులు, సేవలను అందించడానికి ఇసుజు ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉంటుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా తమ ఉత్పత్తుల నాణ్యత, విశ్వసనీయతకు భరోసా అందిస్తామన్నారు. రెండవ దశ కార్యకలాపాలు తమ వృద్ధిని మరింత వేగవంతం చేయడంతో పాటు అంతర్జాతీయ మార్కెట్ సామర్థ్యాన్ని విస్తరించనుందని పేర్కొన్నారు. -
ఏపీలో ఇసుజు పికప్ ట్రక్స్ తయారీ ప్లాంట్
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్లో పికప్ ట్రక్స్ తయారీ ఫ్యాక్టరీ నిర్మాణం చేపడుతున్నామని ఇసుజు మోటార్స్ ఇండియా ప్రయివేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరక్టర్ టకాషి కికుచి తెలిపారు. నగరంలో సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నెల్లూరు జిల్లా శ్రీ సిటి వద్ద ఉన్న తడలో 107 ఎకరాల్లో పికప్ ట్రక్స్ తయారీ కంపెనీ పనులు జరుగుతున్నాయని చెప్పారు. రూ.3 వేట కోట్లు పెట్టుబడితో నిర్మించనున్నా ఫ్యాక్టరీలో 3వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించానున్నామన్నారు. 2016 నాటికి పూర్తి స్థాయిలో ఈ ఫ్యాక్టరీ వినియోగంలోకి రానుందని చెప్పారు. ఏడాదికి 50 వేల యూనిట్ల తయారీ లక్ష్యమన్నారు. జపాన్ పర్యటన సందర్భంగా సీఎం చంద్రబాబుతో ఇసుజు ట్రక్స్ తయారీ ఫ్యాక్టరీ, ఉపాధి తదితర విషయాలు చర్చిస్తామన్నారు. ప్రస్తుతం ఇసుజు వెహికల్స్ విడిభాగాలు దిగుమతి చేసుకుని చైన్నై హిందుస్థాన్ కంపెనీలో వాహనాలను ఉత్పత్తి చేస్తున్నామన్నారు. 11 మంది డీలర్షిప్ల ద్వారా రాష్ట్ర మార్కెట్లో తమ వెహికల్స్ అమ్ముడవుతున్నాయని చెప్పారు. 2016 నాటికి 60 డీలర్షిప్లు పెంచుతామన్నారు. సమావేశంలో ఇసుజు మోటార్స్ ఇండియా ప్రయివేట్ లిమిటెడ్ డిప్యూటీ మేనేజింగ్ డైరక్టర్ శిగెరు వాకాబాయషి, జనరల్ మేనేజర్ శంకర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.