breaking news
india-china war
-
సభలో ‘చైనా’ రగడ!
న్యూఢిల్లీ: ‘చైనా రగడ’ సోమవారం లోక్సభను కుదిపేసింది. 2020 నాటి భారత్, చైనా ఘర్షణలకు సంబంధించి విపక్ష నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలు తీవ్ర గందరగోళానికి దారితీశాయి. వాటికి సంబంధించి ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణె పుస్తకంలోని పలు అంశాలను రాహుల్ సభలో ప్రస్తావించడం కలకలం రేపింది. విపక్ష నేత వ్యాఖ్యలను కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్తో పాటు బీజేపీ సభ్యులు తీవ్రంగా ఖండించారు. ప్రచురణ కాని పుస్తకంలోని అంశాలను ఉటంకించడాన్ని ఆక్షేపించారు.సభను ఆయన తప్పుదోవ పట్టిస్తున్నారంటూ దుయ్యబట్టారు. నరవణె పుస్తకం గురించిన ఉటంకింపులను అనుమతించబోనని స్పీకర్ ఓం బిర్లా ప్రకటించినా రాహుల్ పట్టించుకోలేదు. పలువురు విపక్ష నేతలు ఆయనకు మద్దతుగా నిలవడంతో గందరగోళం నెలకొంది. అధికార, విపక్ష సభ్యులు పోటాపోటీ నినాదాలతో హోరెత్తించారు. దాంతో సభ రెండుసార్లు వాయిదా పడింది. అయినా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో సభను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు.ఒక్క వాక్యానికే భయమెందుకు?సోమవారం లోక్సభ సమావేశమై రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ చేపట్టింది. బీజేపీ సభ్యుడు తేజస్వి సూర్య మాట్లాడుతూ కాంగ్రెస్ దేశభక్తిపై పలు ప్రశ్నాస్త్రాలు సంధించారు. అనంతరం ప్రసంగించిన రాహుల్ వాటిపై మండిపడ్డారు. ‘‘నెహ్రూ–చైనా అంశంపై మాట్లాడాలని నేను అనుకోలేదు. కానీ కనుక సూర్య చేసిన విమర్శలకు బదులుగా దానిపై మాట్లాడక తప్పడం లేదు. నెహ్రూ కేవలం తాను రాజనీతిజ్ఞుడినని చెప్పుకునేందుకు వేలాది ఎకరాల భూభాగాన్ని చైనాకు సరెండర్ చేశారని నిరాధారణ ఆరోపణలకు దిగుతున్నారు’’ అన్నారు. ఆ క్రమంలో 2020 భారత్, చైనా గాల్వాన్ ఘర్షణల గురించి జనరల్ నరవణె తన పుస్తకంలో రాసిన అంశాలను ఉటంకించారు. అందుకు అమిత్ షా తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఆ పుస్తకం ప్రచురణ అయిందో లేదో ముందుగా రాహుల్ స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. దాంతో మొదలైన రగడ 50 నిమిషాలకు పైగా కొనసాగింది. ఈ అంశానికి సంబంధించి ఎలాంటి పుస్తకం, వార్తా పత్రిక క్లిప్పింగ్ తాలూకు అంశాలనూ సభలో ప్రస్తావించడానికి అనుమతి లేదని ఓం బిర్లా స్పష్టం చేశారు. వాటి ప్రస్తావనకు అడ్డంకులేమీ లేవని రాహుల్ వాదించారు. నరవణె పుస్తకం ప్రచురితం కాలేదని రాజ్నాథ్ అభ్యంతరం తెలిపారు. దానిపై ఒక మేగజైన్లో వచ్చిన వ్యాసంలోని అంశాలనే ఉటంకిస్తున్నానని రాహుల్ బదులిచ్చారు. ‘‘ఉగ్రవాదంపై రాజీలేని పోరు చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటారు. నేను ఒక్క వాక్యం చదివితే ఎందుకంతగా బెంబేలెత్తిపోతున్నారు?’’ అంటూ ఎద్దేవా చేశారు. ఆ పుస్తక ప్రస్తావనను అనుమతించడం లేదని ఓం బిర్లా పునరుద్ఘాటించారు. ‘అయితే నేనేం మాట్లాడాలో మీరే చెప్పండి’ అని రాహుల్ అనడంతో, ‘నేనేమీ మీ సలహాదారును కాదు’ అంటూ స్పీకర్ ఆగ్రహించారు. స్పీకర్ రూలింగ్కు కట్టుబ డకుంటే ఏం చర్యలు తీసుకోవాలో సభ నిర్ణయించాల్సి వస్తుందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజిజు హెచ్చరించారు. అయినా రాహుల్ వెనక్కు తగ్గకపోవడంతో పుస్తక ప్రస్తావన తగదంటూ ఆయన్ను బిర్లా పదేపదే వారించారు. పుస్తకాన్ని ప్రచురించొద్దంటూ నరవణెను కేంద్రం బెదిరించిందంటూ రాహుల్ తప్పుడు ఆరోపణలకు దిగుతున్నారని, సభను తప్పుదోవ పట్టిస్తున్నారని రాజ్నాథ్ మండిపడ్డారు. అదే నిజమైతే దానిపై నరవణె కోర్టుకు ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. రాహుల్కు సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ మద్దతుగా నిలిచారు. ఆయనను మాట్లాడేందుకు అనుమతించాలని డిమాండ్ చేశారు. వెంటనే అధికార, విపక్ష సభ్యులు పోటాపోటీ నినాదాలకు దిగారు. గందరగోళం నడుమ సభను మధ్యాహ్నం మూడింటిదాకా స్పీకర్ వాయిదా వేశారు. అనంతరం కూడా ఇండో–చైనా సరిహద్దు అంశాన్ని లేవనెత్తేందుకు రాహుల్ తిరిగి ప్రయత్నించారు. అందుకు అధికార పక్ష సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. సైన్యాన్ని న్యూనతపరిచే వ్యాఖ్యలకు దిగొద్దని రాహుల్కు రిజిజు సూచించారు. ప్రతిష్టంభన నడుమ సభ సాయంత్రం నాలుగింటిదాకా వాయిదా పడింది. మోదీకి, మంత్రులకు నచ్చదు!సభ మళ్లీ సమావేశమయ్యాక రాహుల్ తన ప్రసంగం కొనసాగించారు. తాను లేవనెత్తుతున్నది జాతీయ భద్రతకు సంబంధించిన అంశమని చెప్పారు. ‘‘సహజంగానే ప్రధాని మోదీకి, రక్షణ మంత్రికి ఇది నచ్చదు. అందుకే నన్ను మాట్లాడనివ్వడం లేదు’’ అంటూ దుయ్యబట్టారు. మహువా మొయిత్రా, కల్యాణ్ బెనర్జీ (టీఎంసీ), మనోజ్ ఝా (ఆర్జేడీ) తదితర విపక్ష సభ్యులు రాహుల్కు బాసటగా నిలిచారు.మోదీ, రాజ్నాథ్ దోషులుగా తేలతారనే...సభలో నన్ను అడ్డుకున్నారు: రాహుల్‘‘2020లో చైనాతో ఘర్షణ సందర్భంగా మన సైనిక బలగాల నమ్మకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్ వమ్ము చేశారు. ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణె పుస్తకంలోని అంశాలు వెలుగులోకి వస్తే ఆ ఉదంతంలో వారిద్దరూ దోషులుగా రుజువవుతారు. ఆ భయంతోనే నేను సదరు అంశాలను ప్రస్తావించకుండా బీజేపీ సభ్యులు లోక్సభలో పదేపదే అడ్డుకున్నారు’’ అని విపక్ష నేత రాహుల్గాంధీ ఆరోపించారు. సోమవారం సభ వాయిదా పడ్డాక పార్లమెంటు ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘మోదీ, రాజ్నాథ్ గురించి ఆ పుస్తకంలో నరవణె రాశారు. చైనాతో ఘర్షణకు సంబంధించి వారిద్దరూ తనకు ఏం చెప్పిందీ, ఎలాంటి ఆదేశాలిచ్చిందీ స్పష్టంగా పేర్కొన్నారు. దాన్నే నేను సభలో ప్రస్తావించా. ఆ రెండు మూడు వాక్యాల్లో విషయమంతా స్పష్టంగా బయటపడిపోయేది. పైగా వాటిని రాసింది నాటి ఆర్మీ చీఫ్! కానీ ఆ మాత్రానికే మోదీ సర్కారు బెంబేలెత్తిపోతోంది. ఎందుకంటే అది వెలుగులోకి వస్తే వారిద్దరి బండారం బయటపడుతుంది’’ అన్నారు. 2020లో చైనా చొచ్చుకొస్తున్నప్పుడు మోదీ 56 అంగుళాల ఛాతీ ఏమైపోయిందంటూ ఎద్దేవా చేశారు. ‘‘అలాంటి పరిస్థితుల్లో దేశాన్ని నడిపే నాయకుడు స్పష్టంగా దిశానిర్దేశం చేయాలి. అంతే తప్ప నిర్ణయాలను ఇతరుల భుజస్కంధాలపై నెట్టి బాధ్యతల నుంచి తప్పించుకోవద్దు. కానీ మోదీ చేసింది సరిగ్గా అదే! ఆర్మీ మాజీ చీఫ్ రాసిన పుస్తకాన్ని ప్రచురణ కూడా కానివ్వడం లేదు’’ అని రాహుల్ ఆరోపించారు.నిబంధనల దుర్వినియోగం: కాంగ్రెస్సభలో విపక్ష నేత రాహుల్గాంధీని మోదీ సర్కారు అవహేళన చేసిందని కాంగ్రెస్ ఆరోపించింది. పైగా ఆయన గొంతు నొక్కేందుకు నిబంధనలను కూడా దుర్వినియోగం చేస్తోందంటూ మండిపడింది. నరవణె పుస్తకంలోని నిజాలు వెలుగులోకి వస్తాయన్న భయంతోనే చౌకబారు చేష్టలకు దిగారని కాంగ్రెస్ సీనియర్ నేత కె.సి.వేణుగోపాల్ ఆరోపించారు. ఇది నయా ఫాసిజానికి తిరుగులేని తార్కాణమంటూ ధ్వజమెత్తారు.పార్లమెంటును కించపరిచారువిపక్ష నేత రాహుల్గాంధీ తన ప్రవర్తనతో పార్లమెంటు గౌరవానికే భంగం కలిగించారని బీజేపీ దుయ్యబట్టింది. అంతేగాక భారత్–చైనా సరిహద్దు అంశంపై నిరాధారణ ఆరోపణలు, బాధ్యతారహిత వ్యాఖ్యలతో సైనికుల ఆత్మస్థైర్యాన్ని కూడా దెబ్బ తీశారంటూ ఆక్షేపించింది. రాహుల్ పూర్తిగా భారత వ్యతిరేక శక్తుల భాష మాట్లాడుతున్నారని మంత్రులు, బీజేపీ నేతలు మండిపడ్డారు. సభలో రాహుల్ ప్రవర్తన భారత్ పరువును మంటగలిపేందుకు పక్కా పథకం ప్రకారం పన్నిన కుట్రలో భాగమేనని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజిజు ఆరోపించారు. పార్లమెంటు ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడారు. విలువైన సభా సమయాన్ని రాహుల్ వ్యర్థపరిచారని మండిపడ్డారు. ‘‘జాతీయ భద్రతతో ఆటలాడొద్దు. దాన్ని రాజకీయ ఆయుధంగా మార్చుకోవద్దు’’ అంటూ హెచ్చరించారు. కాంగ్రెస్ హయాంలో భారత భూభాగాన్ని చైనాకు కోల్పోయినందుకు రాహుల్ తక్షణం దేశానికి క్షమాపణ క్షమాపణ చెప్పాలని రిజిజు డిమాండ్ చేశారు. రాహుల్ ఏకంగా నిండు సభలోనే మన దేశ శత్రువుల భాష మాట్లాడుతున్నారంటూ కేంద్ర మంత్రి గిరిరాజ్సింగ్ మండిపడ్డారు.ఆ పుస్తకంలో ఏముంది?లోక్సభలో విపక్ష నేత రాహుల్గాంధీ, మంత్రుల నడు మ రగడకు కేంద్ర బిందువుగా మారిన ఆర్మీ మాజీ చీఫ్ ఎంఎం నరవణె పుస్తకంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆయన తన సైనిక జీవితం తాలూకు జ్ఞాపకాలకు ‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’ పేరిట పుస్తక రూపమిచ్చారు. పెంగ్విన్ పబ్లిషింగ్ హౌజ్ దాన్ని ప్రచురించాల్సి ఉంది. అందుకు రక్షణ శాఖ అనుమతి కోసం ఏడాదికి పైగా ఎదురు చూస్తున్నట్టు నరవణె గత అక్టోబర్లో పేర్కొన్నారు! ఈ నేపథ్యంలో ఆ పుస్తకంపై ద కారవాన్ మేగజైన్ గత నెలలో కవర్ పేజీ వ్యాసం ప్రచురించింది. రాహుల్ సోమవారం సభలో ఉటంకించింది ఆ వ్యాసంలోని అంశాలనే! తద్వారా, గాల్వాన్ ఘర్షణ వంటి అతి కీలక ఉదంతంపై సరైన నిర్ణయం తీసుకోవడంలో మోదీ సర్కారు తాత్సారం చేసిందని చెప్పేందుకు ఆయన ప్రయత్నించారు.నిర్ణయాన్ని నాకే వదిలారు: నరవణె2020 జూన్15 రాత్రి తూర్పు లద్దాఖ్లోని గాల్వన్ లోయలో భారత, చైనా సైనిక దళాల మధ్య భారీ ఘర్షణ జరిగింది. వాటిలో కల్నల్ సంతోష్కుమార్తో సహా 20 మంది భారత సైనికులు అమరులయ్యారు. చైనావైపు కూడా భారీగా ప్రాణనష్టం జరిగి నా డ్రాగన్ దేశం ఆ వివరాలను బయ టికి రానివ్వ లేదు. ఆ ఘర్షణల సమయంలో నరవణె ఆర్మీ చీఫ్గా ఉన్నారు. ఉద్రిక్తతలు పెచ్చరిల్లుతున్న వేళ 2020 ఆగస్టు 31న రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్తో తన భేటీ గురించి పుస్తకంలో నరవణె రాశారు. ‘‘(గాల్వాన్ ఉద్రిక్తతలపై) ప్రధాని మోదీతో మాట్లాడానని రాజ్నాథ్ నాకు చెప్పారు. ‘అది పూర్తిగా సైనిక నిర్ణయం. మీకు ఏది సరైందనిపిస్తే అలా చేయండి’ అన్నారు. దాంతో బాధ్యతంతా పూర్తి గా నాపైనే పడింది. ‘చైనా దూకుడును అడ్డుకు నేందుకు) నేనే సరైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఏం చేయాలా అని కొద్ది నిమిషాలు మౌనంగా ఉండిపో యాను’’ అని అందులో నరవణె రాసుకొచ్చి నట్టు కారవాన్ వ్యాసం పేర్కొంది. ‘‘పుస్తకం బ్యాక్ కవర్పై 1999 కార్గిల్ యుద్ధ సమయంలో ఆర్మీ చీఫ్గా చేసిన జనరల్ వి.పి.మాలిక్ రాసిన అభిప్రాయం కూడా ఆసక్తికరంగా ఉంది. ‘గాల్వన్ లోయ ఘర్షణ, దానికి ముందు, తర్వాత జరిగిన పలు ఉదంతాల గురించి పుస్తకంలో రాసిన అంశాలు చదువుతుంటే పాఠకులంతా భావోద్వేగాలతో ఊగిపోవడం ఖాయం’ అని మాలిక్ రాసుకొ చ్చారు’’ అంటూ వ్యాసం ముక్తా్తయించింది. -
ఓటమి నేర్పిన పాఠాలు
భారత్–చైనా యుద్ధానికి 60 ఏళ్లు! నాయకత్వ వైఫల్యాలు, సన్నద్ధంగా లేని సైన్యం కారణంగా భారత్ అందులో పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. ఇప్పుడిక ప్రశ్న ఏమిటంటే 1962 నాటి ఆ యుద్ధం నుంచి మనం ఏమైనా పాఠాలు నేర్చుకున్నామా అని! నేర్చుకున్నామనే చెప్పాలి. అయితే ఆ పాఠాలు చొరబాట్లను ఎదుర్కోడానికి మాత్రమే పనికొచ్చేవి. సరిహద్దు సమస్యల్ని పరిష్కారించుకోడానికైతే మిగిలి ఉన్న మార్గం ఒక్కటే. 1959–60 ప్రతిపాదనల ప్రకారం... ఇరుదేశాలు ‘ఇచ్చిపుచ్చుకునే’ ధోరణిలో ముందుకు వెళ్లడం! అక్సాయ్ చిన్ను చైనాకు వదిలేసి, అరుణాచల్ ప్రదేశ్ను భారత్ ఉంచుకోవడం. అంటే సరిహద్దు రేఖల్ని ఉన్నవి ఉన్నట్లుగా ఇరు దేశాలు అంగీకరించడం! సరైన ఆయుధాలు, దుర్భేద్యమైన సైనిక దుస్తులు లేకుండా ఈశాన్య సరిహద్దు ప్రాంతం (నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ ఏజెన్సీ – ఎన్.ఇ.ఎఫ్.ఎ.)లో గస్తీ కాస్తున్న భారత దళాలు ఒక హఠాత్పరిణామంగా 1962 అక్టోబర్ రాత్రి 19–20 తేదీల మధ్య చైనా జరిపిన చొరబాటు దాడులతో అనేక ప్రాధాన్య స్థావరాలను కోల్పోయాయి. ఆశ్చర్యకరంగా, చైనా సైని కుల్ని వెనక్కి తరిమికొట్టే బాధ్యత... దానికి ఎంతమాత్రమూ తగని ‘గజరాజ్ కోర్’ సేనాని, నెహ్రూ మనిషిగా పరిగణన పొందిన లెఫ్ట్నెంట్ జనరల్ బి.ఎం.కౌల్పై పడింది! ఆ అయోమయంలో ఆయన వెంటనే ఢిల్లీ వెళ్లిపోయారు. ఈశాన్య సరిహద్దు ప్రాంతంలో వ్యూహమంటూ లేని మన గందరగోళం గురించి ఢిల్లీలోని రాజకీయ దిగ్గజాలకు నివేదించడం ఆయన ఉద్దేశం. ఈశాన్య భారతదేశానికి, టిబెట్కు మధ్య ఉన్న మక్మహన్ సరిహద్దు రేఖ వెంబడే చైనా మూకల చొరబాట్లు కొనసాగుతూ ఉండటంతో ఢిల్లీ వెళ్లిన కౌల్ మళ్లీ తిరిగిరాలేదు. సైనిక దళాల మోహరింపు, యుద్ధ ప్రణాళికలకు వ్యూహరచన జరుగుతుండే ఢిల్లీలోనూ అయోమయం నెలకొంది. చైనా వెన్నుపోటు పొడిచిందని నెహ్రూ, ఆయన అనుచరులు ఆ తర్వాత వాదిస్తూ వచ్చారు కానీ, మావో నేతృత్వంలోని కమ్యూనిస్టు నాయకత్వం ఏం చేయనుందో 1950ల చివరి నుంచీ చాలినన్ని హెచ్చరికలు కనిపిస్తూనే ఉన్నాయి. చైనాను బుజ్జగించడానికి టిబెట్ స్వాతంత్య్రానికి మద్దతు ఇవ్వడం మానేస్తామని భారత్ ఇచ్చిన హామీపై 1954లో ‘పంచశీల’ ఒప్పందానికి చైనా అంగీకారం తెలిపింది. అయినప్పటికీ అక్సాయ్ చిన్లోగానీ, తవాంగ్లో మక్మహన్ నియంత్రణ రేఖను మీరిన భాగాన్ని కూడా తనదేనన్న వాదననుగానీ చైనా వదులుకోలేదు. 1959లో లోంగ్జులో జరిగిన వాగ్వివాదాలను భారత్ తేలిగ్గా తీసుకుంది. లోంగ్జులో వందలాది భారత సైనిక దళాలు తమ భూభాగం లోకి ప్రవేశించాయంటూ చైనాలోని భారత రాయబార కార్యాలయా నికి చైనా నిరసన పత్రం పంపినప్పుడు భారత్ ఏమాత్రం దీటైన జవాబు ఇవ్వలేకపోయింది. మావో, కృశ్చేవ్ల మధ్య కుదిరిన ఒప్పం దాన్ని అనుసరించి సోవియట్ వైమానిక, భూ ఉపరితల సేనల సహ కారంతో టిబెట్ భూభాగంపై చైనా తన సైనిక బలగాలను స్థిరంగా పెంచు కుంటూ పోయింది. ఆ పరిణామాన్ని కూడా భారత్ పట్టించు కోలేదు. 1959లో అమెరికా సాయంతో టిబెట్ నుంచి భారత్కు తప్పించుకున్న దలైలామా, ఆయన అనుచరులు భారత్లో ఆశ్రయం పొందడం చైనాకు ఆగ్రహం తెప్పించింది. నిజానికి ముందుగా అనుకున్నది వారు అమెరికా వెళ్తారని. అన్నిటినీ మించి చైనా కోపానికి కారణమైన అంశం... అమెరికా కార్యకలాపాలకు భారత్ ఒక ప్రధాన కేంద్రం అవడం. సీఐఏ శిక్షణ పొందిన సాయుధ టిబెటన్ తిరుగు బాటు దళాల్ని టిబెట్లోకి పంపించేందుకు భారత్ను అమెరికా ఒక ‘లాంచ్ ప్యాడ్’గా ఉపయోగించుకుంది. ఇక స్వదేశంలో ఒత్తిళ్లకు లోనైన నెహ్రూ భారత భూభాగాలలోంచి చైనీయులను విసిరి బయట పడేయమని భారత సైన్యాన్ని ఆదేశించారు. ఆ దూకుడులో ఆయన చైనా ప్రధాని చౌ ఎన్–లై 1960లో ఇండియా పర్యటించినప్పుడు చేసిన ప్రతిపాదనలను సైతం విస్మరించారు. అక్సాయ్ చిన్ ప్రాంతాన్ని చైనాకు ఉంచి, మక్మహన్ రేఖకు దక్షిణ వైపున ఉన్న ప్రాంతాన్ని భారత్ తీసుకోవడం ద్వారా సరిహద్దు వివాదాన్ని పరిష్కరించుకోవాలన్నదే ఆ ప్రతిపాదన. నిజానికి 1962 భారత్–చైనా యుద్ధంలో మన సేనలు మెరుగైన ప్రతిఘటననే ఇచ్చాయి. సరిహద్దు వెంబడి ప్రాధాన్య స్థావరాలపై తమ పట్టును కోల్పోకుండా ఉండేందుకు వీరోచితంగా పోరాడాయి. మన సేనాపతులు తమ సైనికులపై ఎన్ని నెపాలు మోపినా గానీ, ఆ సైనికుల అసమాన శౌర్య పరాక్రమాలకు ఎన్నో నిదర్శనాలు కనిపి స్తాయి. అలాగైతే ఎందుకు ఓడిపోయాం? చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ థాపర్, జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ (ఈస్ట్రన్ కమాండ్) లెఫ్ట్నెంట్ జనరల్ ఎల్.పి.సేన్ల నిస్పృహ కలిగించే పాత్రతో పాటుగా, నెహ్రూ నిర్ణయం కూడా మన పరాజయానికి కారణమైంది. ఇంటెలిజెన్స్ చీఫ్ బి.ఎన్.మాలిక్ సలహాపై భారత వైమానిక దళాలను రంగంలోకి దింపేందుకు నెహ్రూ అనుమతించలేదు. అలా చేస్తే చైనాను మరింతగా రెచ్చగొట్టినట్లు అవుతుందని నెహ్రూ భావించారు! అదొక పెద్ద తప్పిదంగా చరిత్రలో నిలిచిపోయింది. భారత్–చైనా యుద్ధం జరిగి 60 ఏళ్లయింది. ఇప్పుడిక అసలు ప్రశ్న ఏమిటంటే 1962 నాటి ఆ యుద్ధం నుంచి మనం ఏవైనా పాఠాలు నేర్చుకున్నామా అని! నేర్చుకున్నామని చెప్పడమే న్యాయంగా ఉంటుంది. ఇందుకు అనేక ఉదాహరణలను చూపవచ్చు. ముఖ్యంగా, 1967లోనే చైనా నాథు లా పాస్, చో లా పాస్ మార్గాలు వెళ్లే హిమాలయ సరిహద్దు ప్రాంతాల్లో భారత్కు వ్యతిరేకంగా కండలు తిప్పడం మొదలు పెట్టీ పెట్టగానే అక్కడి జననల్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ మేజర్ జనరల్ సగత్ సింగ్ తన అధీనంలోని కంచె లోపలి భాగంలోకి ఎలాంటి విదేశీ చొరబాట్లను అనుమతించబోనని తన పై అధికారులకు ముందస్తు సమాచారం పంపించారు. అంటే తనిక ఎలాంటి ఆదేశాల కోసమూ ఎదురు చూడబోయేది లేదని. 20 ఏళ్ల పాటు నిశ్శబ్దంగా ఉండిపోయిన చైనా 1986–87లో అరుణాచల్ ప్రదేశ్లోని సోమ్డోరోంగ్ లోయలోకి చొరబడింది. ఆర్మీ చీఫ్ జనరల్ సుందర్జీ మెరుపు వేగంతో ప్రతిస్పందించి భారత సేనల్ని గగనతలం గుండా సోమ్డోరోంగ్పై దింపారు. మన సైన్యం చైనా సేనల్ని చుట్టుముట్టింది. ప్రత్యర్థి మూకలు మారు మాట్లాడకుండా వెన కడుగు వేశాయి. ఆ ఘటన ప్రధాని రాజీవ్ గాంధీ రక్తాన్ని ఉత్తేజంతో ఉరకలెత్తించింది. అనంతర పరిణామంగా 1988లో జరిగిన రాజీవ్ చైనా పర్యటన, ఆ సందర్భంగా రెండు దేశాల మధ్య వరుసగా కుది రిన అనేక ఒప్పందాలు ప్రాముఖ్యాన్ని సంతరించుకున్నాయి. ఇటీవల 2020లో గల్వాన్ లోయలో చైనా చొరబాట్లకు కూడా భారత్ మునుప టంత వేగంగానే స్పందించింది. చైనా మితిమీరి, పరిస్థితి ముదిరితే కనుక గల్వాన్లో మన సైనికులు దెబ్బకు దెబ్బ తీసిన విధంగానే వాణిజ్య పరమైన ఆంక్షలను విధించేందుకు కూడా భారత్ సిద్ధమైంది. గగనతలం నుంచి పోరుకు సైతం సన్నద్ధం అయింది. గతం నుంచి మనం ఇంకా నేర్చుకోవలసింది ఏమైనా ఉందీ అంటే అది చైనా ఉద్దేశాలను మరింతగా అర్థం చేసుకోగలగడం. అక్సాయ్ చిన్పై చైనా తన నియంత్రణను వదులుకునేలా చేయడానికి బీజింగ్తో భారత్ దౌత్యపరమైన సంభాషణలు జరపడం వల్ల ఏమాత్రం ప్రయోజనం లేదు. అక్సాయ్ చిన్ వ్యూహాత్మకంగా చైనాకు ఎంతో ప్రాముఖ్యమైనది. ముఖ్య నదులు, యురేనియం నిక్షేపాలు ఉన్న ప్రాంతం అది. అక్కడి నుంచే జి 219 హైవే వెళుతుంది. చైనాలోని రెండు కీలక ప్రాంతాలైన షిన్జాంగ్, టిబెట్లను ఆ దారి కలుపుతుంది. మరైతే అక్సాయ్ చిన్ సమస్యకు పరిష్కారం ఏమిటి? ముందుకు వెళ్లే దారేది? ఒక మార్గం అయితే ఉంది. 1959–60 ప్రతిపాదనల ప్రకారం ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వెళ్లడం. అప్పుడిక అక్సాయ్ చిన్ చైనాకు, అరుణాచల్ ప్రదేశ్ భౌగోళిక ప్రాంతాలు భారత్ భూభాగానికి వస్తాయి. అంటే సరిహద్దు రేఖల్ని ఉన్నవి ఉన్నట్లుగా ఇరు దేశాలు అంగీకరించడం. ప్రస్తుతం రెండు దేశాలకు శక్తిమంతమైన నాయకులే ఉన్నారు కనుక సరిహద్దు వివాదాలను పరిష్కరించుకుని, రాజకీ యంగా సరళమైన మనుగడ సాగించవచ్చు. అయితే వారు అలా చేయ డానికి సిద్ధంగా ఉన్నారా అన్నదే ప్రశ్న. మరూఫ్ రజా వ్యాసకర్త వ్యూహాత్మక వ్యవహారాల విశ్లేషకులు (‘ది ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
డ్రాగన్ శకం ముగిసింది!
గతమెంతో ఘనకీర్తి..?! భవిష్యత్తులో చైనా ఇదేవిధంగా చెప్పుకోవాల్సిన దుస్థితి వస్తుందేమో. పిన్ను నుంచి పెద్ద యంత్రం వరకు ఏ ఉత్పత్తిని అయినా తయారు చేయగలదు చైనా. అందుకే అంత వేగంగా ఎదిగి ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కాగలిగింది. కానీ, కరోనాతో, అమెరికాతో వాణిజ్య కయ్యం కారణంగా చైనా పరిస్థితి మారిపోనుందని నిపుణులు, పారిశ్రామికవేత్తల మాటలను పరిశీలిస్తే అర్థమైపోతోంది. ‘ప్రపంచానికి పరిశ్రమగా చైనా రోజులు ముగిసినట్టే’.. ఈ మాటలు అన్నది ఎవరో కాదు... ఫాక్స్కాన్ బాస్ యంగ్ లీ!. దీనికి కారణంగా ట్రేడ్ వార్ (వాణిజ్య యుద్ధం)ను ఆయన పేర్కొన్నారు. యాపిల్ ఐఫోన్ల నుంచి, డెల్ కంప్యూటర్లు, ల్యాప్టాప్లు ఇలా ఒకటేమిటి అన్నింటికీ తయారీ కేంద్రం చైనాయే. యాపిల్ కు ప్రధాన తయారీ భాగస్వాముల్లో ఒకటైన ఫాక్స్కాన్ తోపాటుచైనా కేంద్రంగా విస్తరించిన డజను వరకు టెక్నాలజీ కంపెనీలు ఇప్పుడు చైనా బయట వైపునకు చూస్తున్నాయి. చైనా మార్కెట్కు, యూఎస్ మార్కెట్కు సరఫరా వ్యవస్థలను వేర్వేరుగా నిర్వహించాల్సిన ఆవశ్యకతను మారిన పరిస్థితుల్లో అవి అవగతం చేసుకున్నాయి. చైనా బయట క్రమంగా మరింత తయారీ సామర్థ్యాన్ని ఏర్పాటు చేసుకోనున్నట్టు హాన్ హాయ్ ప్రెసిషన్ ఇండస్ట్రీ కంపెనీ (ఫాక్స్ కాన్ గా ట్రేడయ్యే సంస్థ) చైర్మన్ యుంగ్ లీ తెలిపారు. ప్రస్తుతానికి మొత్తం తయారీ సామర్థ్యంలో 30 శాతం చైనా బయట ఈ సంస్థ ఏర్పాటు చేసుకుంది. గతేడాది జూన్ నాటికి ఇది 25 శాతమే. ఏడాదిలో చైనా వెలుపల 5 శాతం తయారీని పెంచుకున్న ఈ సంస్థ.. భవిష్యత్తులో దీన్ని మరింతగా పెంచుకునే ప్రణాళికలతో ఉంది. చైనాలో తయారై అమెరికాలోకి ప్రవేశించే ఉత్పత్తులపై పెరిగే టారిఫ్ల భారం పడకుండా ఉండేందుకు గాను ఫాక్స్ కాన్ సంస్థ భారత్, ఆగ్నేయాసియా, ఇతర ప్రాంతాలకు తయారీని తరలించే ప్రయత్నాల్లో ఉన్నట్టు కంపెనీ ఫలితాల ప్రకటన సందర్బంగా యంగ్ లీ స్వయంగా మీడియాకు వెల్లడించారు. ‘‘భారత్ లేదా ఆగ్నేయాసియా లేదా అమెరికా.. ఏదైనా సరే ఆయా ప్రాంతాల్లో తయారీ ఎకోసిస్టమ్ ఉంది’’ అని లీ పేర్కొన్నారు. అయితే, ఫాక్స్ కాన్ తయారీలో చైనా ఇక ముందూ కీలకపాత్ర పోషిస్తుందని స్పష్టం చేశారు. కాకపోతే ప్రపంచానికి తయారీ కేంద్రంగా చైనా దశకం ముగిసినట్టేనని వ్యాఖ్యానించారు. భారత్ లో ఫాక్స్ కాన్ విస్తరణ అమెరికా, చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రం కావడంతో ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి సంస్థలు తమ తయారీ కేంద్రాలను చైనా బయట కూడా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరాన్ని గుర్తించాయి. అవసరమైతే యాపిల్ ఉత్పత్తులను పూర్తిగా చైనా బయట తయారు చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని యంగ్ లీ గతేడాదే ఓ సందర్భంలో చెప్పడం గమనార్హం. దీర్ఘకాలంలో చైనాకు ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రానిక్ తయారీ కేంద్రాలు ఏర్పాటు కావడం తథ్యమని లీ మాటలతో స్పష్టమవుతోంది. ఫాక్స్కాన్ కు మన దేశంలోనూ తయారీ కేంద్రాలున్నాయి. మరిన్ని పెట్టుబడులతో సామర్థ్య విస్తరణ చేయనున్నట్టు ఈ సంస్థ ఇటీవలే ప్రకటించింది కూడా. భారత్ లో తయారీకి అమెరికాకు చెందిన యాపిల్ ప్రాధాన్యం ఇస్తోంది. దీంతో యాపిల్ తయారీ భాగస్వామిగా ఫాక్స్కాన్ సంస్థ భారత మార్కెట్ పట్ల విస్తరణ ప్రణాళికలతో ఉంది. అమెరికాకు సరఫరా చేసే ఉత్పత్తుల తయారీకి భారత్ ను ప్రధానంగా ఫాక్స్కాన్ పరిశీలిస్తుండడం గమనార్హం. యాపిల్ ఐపాడ్, మ్యాక్ ఉత్పత్తులకు డిమాండ్ కారణంగా ఫాక్స్ కాన్ జూన్ క్వార్టర్ లో 5,835 కోట్ల భారీ లాభాన్ని ప్రకటించడం గమనార్హం. ఈ సంస్థ తైవాన్ కు చెందినది. టెన్సెంట్ హోల్డింగ్స్కు చెందిన వీచాట్ వినియోగాన్ని అమెరికా పౌరులు వినియోగించకుండా నిషేధిస్తూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆదేశాలు జారీ చేయడం తెలిసిందే. పోటీతత్వంతో స్వావలంబన భారత్ భారత్ తన అవసరాలను దేశీయంగా తీర్చుకునేందుకు (ఆత్మ నిర్భర్) దేశీయ పరిశ్రమ కచ్చితంగా మరింత పోటీనిచ్చే విధంగా మారాల్సిన అవసరం ఉందని మాజీ కేంద్ర వాణిజ్య మంత్రి సురేష్ ప్రభు అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలు రక్షణాత్మక విధానాలను అవలంబిస్తున్నతరుణంలో.. భారత్ కూడా తన అవసరాలకు తనపైనే ఆధారపడాల్సిన అవసరం ఉందన్నారు. స్వేచ్ఛాయుత మార్కెట్ కలిగిన అమెరికా సైతం రక్షణాత్మక విధానాలను అనుసరిస్తున్న విషయాన్ని ప్రభు గుర్తు చేశారు. కనుక రానున్న రోజుల్లో ఆత్మనిర్భర్ కు మరే ప్రత్యామ్నాయం లేదని పేర్కొన్నారు. ‘‘మన పరిశ్రమలను మరింత పోటీయుతంగా మార్చాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పోటీతత్వం మన పరిశ్రమల సమర్థతను పెంచుతుంది. ఆ పోటీయే మనకు మేలు చేస్తుందని నేను నమ్ముతున్నాను’’ అంటూ పీహెచ్ డీ చాంబర్ ఆఫ్ కామర్స్ నిర్వహంచిన కార్యక్రమంలో భాగంగా పేర్కొన్నారు. ఉద్యోగ కల్పనకు కేంద్రం ఎన్నో విధాానాలను అమలు చేసినట్టు ప్రభు చెప్పారు. చైనా ఉత్పత్తులకు తగ్గిన ఆదరణ! న్యూఢిల్లీ: చైనా తయారీ ఉత్పత్తుల పట్ల భారతీయుల్లో ఆసక్తి తగ్గుతోందని సోషల్ మీడియా వేదిక లోకల్సర్కిల్స్ తన సర్వేలో వెల్లడించింది. నవంబరు 10–15 మధ్య దేశవ్యాప్తంగా 204 జిల్లాల్లో ఈ సర్వే చేపట్టారు. దీని ప్రకారం సర్వేలో పాలుపంచుకున్న వారిలో పండుగల సీజన్లో కేవలం 29 శాతం మంది మాత్రమే చైనా ఉత్పత్తులను కొనుగోలు చేశారు. గతేడాది ఈ సంఖ్య 48 శాతం ఉంది. 2019లో చేపట్టిన సర్వేలో 14,000 మందికిపైగా పాల్గొన్నారు. 2019తో పోలిస్తే ప్రస్తుత సీజన్లో చైనా ఉత్పత్తులను కొనుగోలు చేసిన వారి సంఖ్య 40 శాతం తగ్గిందని లోకల్సర్కిల్స్ ఫౌండర్ సచిన్ తపారియా తెలిపారు. ఈ ఏడాది చైనా ఉత్పత్తులు కొన్నవారిలో 71 శాతం మంది తాము స్పృహతో కొనుగోలు చేయలేదని స్పష్టం చేశారు. డబ్బుకు తగ్గ విలువ కాబట్టే ఆసక్తి చూపామని 66% మంది తెలిపారు. దాడి తర్వాత పెరిగిన వ్యతిరేకత.. జూన్లో గాల్వన్ వ్యాలీలో చైనా సైనికుల దాడిలో భారత జవాన్లు వీర మరణం పొందిన సంఘటన తర్వాత చైనా ప్రొడక్ట్స్ పట్ల భారతీయుల్లో వ్యతిరేకత అధికమైంది. వచ్చే ఏడాది కాలంలో చైనా ఉత్పత్తులను బహిష్కరిస్తామని 87 శాతం మంది వెల్లడించారు. దేశీయంగా తయారైన ప్రొడక్ట్స్ ఖరీదు ఉన్నప్పటికీ నాణ్యత మెరుగ్గా ఉంటుందని అత్యధికులు ఈ విషయాన్ని వ్యక్తపరిచారు. పండుగల సమయంలో లైట్లు, ఇతర ప్లాస్టిక్ వస్తువులు ఒకసారి మాత్రమే వినియోగించేవి కావడంతో నాణ్యత ప్రధాన అంశం కాదని చాలా మంది అభిప్రాయపడ్డారు. -
రుద్రం.. శత్రు రాడార్లు ఇక ధ్వంసం
బాలాసోర్: భారత్, చైనా మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఎలాంటి ముప్పునైనా ఎదుర్కోవడానికి మన దేశం అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది. వరసగా క్షిపణి పరీక్షలు నిర్వహిస్తూ భారత వాయుసేనను బలోపేతం చేస్తోంది. శత్రు దేశాల రాడార్లను సర్వ నాశనం చేసే యాంటీ రేడియేషన్ క్షిపణి రుద్రం–1ను భారత్ విజయవంతంగా ప్రయోగించింది. భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీఒ) పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ క్షిపణిని ఒడిశా తీరంలోని బాలాసోర్ నుంచి శుక్రవారం ఉదయం 10.30 గంటలకు విజయవంతంగా పరీక్షించింది. సుఖోయ్–30 యుద్ధ విమానం నుంచి ప్రయోగించిన ఈ క్షిపణి కచ్చితంగా తన లక్ష్యాలను ఛేదించడం ఒక మైలురాయిగా నిలి చిపోయింది. దూర ప్రాంతాల నుంచి శత్రువుల రాడార్ వ్యవస్థ, ట్రాకింగ్, రక్షణ, కమ్యూనికేషన్ వ్యవస్థలను నాశనం చేయడానికి ఈ క్షిపణిని అభివృద్ధి చేశారు. రుద్రం ప్రయోగం విజయంపై రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్ హర్షం వ్యక్తం చేసి, శాస్త్రవేత్తలను అభినందించారు. ఇప్పటికే నిర్భయ, శౌర్య వంటి క్షిపణుల్ని ప్రయోగించి చూసిన భారత్ ఈ యాంటీ రేడియేషన్ క్షిపణి ప్రయోగంతో శత్రు దేశాల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. రుద్రం ప్రత్యేకతలు ► దీన్ని సుఖోయ్–30ఎంకేఐ యుద్ధ విమానాలతో ప్రయోగించవచ్చు. ► శత్రువుల రాడార్, సమాచార వ్యవస్థను పూర్తిస్థాయిలో నిర్వీర్వం చేయగలదు. ► 0.6 మాక్ నుంచి 2 మాక్ వేగంతో ఈ క్షిపణి ప్రయాణిస్తుంది. అంటే ధ్వని వేగం కంటే రెండు రెట్లు ఎక్కువ వేగంతో ప్రయాణించగలదు. ► న్యూ జనరేషన్ యాంటీ రేడియేషన్ మిస్సైల్ (ఎన్జీఏఆర్ఎం) 500 మీటర్ల నుంచి 1,500 మీటర్ల ఎత్తు నుంచి ప్రయోగించవచ్చు. 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఈ క్షిపణి సమర్థవంతంగా ఛేదిస్తుంది ► గగనతలం నుంచి ఉపరితలంపై ఉన్న లక్ష్యాలను ఛేదించే ఈ వ్యూహాత్మక క్షిపణిలోని పాసివ్ హోమింగ్ హెడ్ శత్రు దేశ రక్షణ వ్యవస్థ రేడియేషన్ను తట్టుకుంటూ లక్ష్యాలను ఛేదిస్తుంది. ► ఐఎన్ఎస్–జీపీఎస్ ద్వారా దూరంలోని లక్ష్యాలను కచ్చితత్వంతో ఛేదిస్తుంది. ► దీని ప్రయోగానంతరం శత్రుదేశాలు తమ రాడార్ వ్యవస్థను నిలిపివేసినా, ఇది లక్ష్యాలను నాశనం చేయగలదు. ► 2017లో అమెరికా ఈ తరహా యాంటీ రేడియేషన్ క్షిపణిని నావికా రంగంలో ప్రవేశపెట్టింది. అగ్రరాజ్యం సాధించిన మూడేళ్లలోనే భారత్ అలాంటి క్షిపణిని విజయవంతంగా ప్రయోగించడం విశేషం. -
గల్వాన్ ఘటన దురదృష్టకరం: చైనా
న్యూఢిల్లీ: తూర్పు లద్దాఖ్లోని వాస్తవాధీన రేఖ వెంబడి గల్వాన్ ప్రాంతంలో భారత్, చైనా మధ్య జూన్లో జరిగిన ఘర్షణలపై డ్రాగన్ దేశం విచారం వ్యక్తం చేసింది. ఆ ఘటన అత్యంత దురదృష్టకరమైనదని పేర్కొంది. అలా జరిగి ఉండాల్సింది కాదంటూ పశ్చాత్తాపం వ్యక్తం చేసింది. చైనా, భారత్ యువత పాల్గొన్న ఒక వెబినార్కు బుధవారం హాజరైన భారత్లో చైనా రాయబారి సన్ వీడాంగ్ చరిత్ర పరంగా చూస్తే ఇది చాలా చిన్న ఘటన అని వ్యాఖ్యానించారు. రెండు దేశాలు ఘర్షణాత్మక వాతావరణాన్ని చూడాలని అనుకోవడం లేదని, ఇక మీదట ఇలా జరగకుండా రెండు దేశాలు సరైన దారిలో ప్రయాణిస్తున్నాయని అన్నారు. భారత్, చైనా సరిహద్దుల్లో ఏప్రిల్ నుంచి అడపాదడపా మొదలైన ఉద్రిక్తతలు జూన్లో తారస్థాయికి వెళ్లాయి. అప్పుడు చోటు చేసుకున్న ఘటనలో భారత్ సైనికులు 20 మంది ప్రాణాలు కోల్పోతే, చైనా వైపు ప్రాణ నష్టం ఎంత జరిగిందో ఆ దేశం అధికారికంగా వెల్లడించలేదు. భారత్, చైనా మధ్య 70 ఏళ్లుగా దౌత్య సంబంధాలు కొనసాగుతు న్నాయని, ఎన్ని పరీక్షలు , అడ్డంకులు ఎదురైనా మళ్లీ ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక బంధాలు బలోపేతమవుతున్నాయని సన్ వీడాంగ్ అన్నారు. చర్చల ద్వారా సమస్యల పరిష్కారం ఏ సమస్యకైనా చర్చల ద్వారా సరైన పరిష్కారం లభిస్తుందని రాయబారి వీడాంగ్ అన్నారు. చైనా భారత్ని ప్రత్యర్థి కంటే భాగస్వామిగానే చూస్తుందని, పొరుగు దేశం నుంచి ప్రమాదాలని కాకుండా అవకాశాలనే రాబట్టుకునే ప్రయత్నం చేస్తుందన్నారు. భారత్, చైనా మధ్య ఆర్థికంగా కూడా సంబంధాలు అత్యంత దృఢంగా ఉన్నాయని సన్ వీడాంగ్ వివరించారు. -
డాక్టర్ కావడం కంటే... మనిషి కావడమే కష్టం!
మెడికల్ మెమరీస్: అది 1964వ సంవత్సరం. భారత్-చైనా యుద్ధవాతావరణం ఇంకా కొనసాగుతూనే ఉంది. భారత్-పాక్ల మధ్య యుద్ధ మేఘాలు దట్టంగా కమ్ముకుని ఉన్నాయి. అప్పుడు మేం గుంటూరు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్. ఆర్మీ నుంచి మా కాలేజీకి ముగ్గురు ఉన్నతాధికారులు వచ్చారు. మేమా సమావేశానికి హాజరయ్యాం. మాలో ఆసక్తిగలవారిని ‘ఎమర్జెన్సీ కమిషన్డ్ ఆఫీసర్స్’గా ఎంపిక చేసుకునేందుకు ఆ అధికారులు వచ్చారని అర్థమైంది. ‘‘మీరు ఆర్మీలో డాక్టర్గా చేరదలచుకుంటే నేరుగా ఎంపిక చేసుకుంటాం. ఫైనల్ ఇయర్ పరీక్ష కూడా రాయనవసరం లేదు. ఆ తర్వాత హౌస్సర్జెనీ చేయాల్సిన పని కూడా లేదు. నేరుగా సెకండ్ లెఫ్ట్నెంట్ కమాండెంట్ హోదాలో తీసుకుంటాం. పోస్ట్గ్రాడ్యుయేషన్ చేయదలచుకుంటే మూడేళ్ల సర్వీసు తర్వాత అర్హత పరీక్షకు హాజరుకావచ్చు. అర్హత సాధిస్తే, మీరు పోస్ట్గ్రాడ్యుయేషన్ చేసే సమయంలో ఆర్మీ సగం వేతనం చెల్లించడంతో పాటు, ఆర్నెల్ల స్టడీ లీవ్ కూడా ఇస్తుంది’’ అంటూ సైన్యం డాక్టర్ల జీతభత్యాలూ, ఇతర సదుపాయాల గురించి ఆకర్షణీయంగా వివరించారు. ఇంతలో మా క్లాస్లో ఎప్పుడూ హెచ్చులకుపోయే ఓ విద్యార్థి లేచి... కాస్త స్టైలిష్గా ‘వాటీజ్ ద ప్రిస్టేజ్ ఆఫ్ ఎ డాక్టర్ ఇన్ ఆర్మీ’ అని అడిగాడు. (సైన్యంలో డాక్టరుకు ఉండే ప్రత్యేక గౌరవం ఏమిటి అనేది అతడి ఉద్దేశం). అతడి ధోరణీ, ఆ బాడీలాంగ్వేజీ ఎప్పుడూ అంతే. ఆ తర్వాత ఆ మిలటరీ అధికారి తన రీతిలో ‘‘యూ సీ... సోల్జర్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ ద ఆర్మీ. టు హెల్ప్ హిమ్, దేర్ ఈజ్ దోభీ, బార్బర్ అండ్ డాక్టర్’ (సైన్యంలో అందరికంటే ప్రముఖుడు సైనికుడే. అతడికి సహాయపడేందుకే బట్టలుతికేవారూ, క్షురకర్మ చేసేవారూ, డాక్టర్లూ ఉంటారు) అని జవాబిచ్చాడు. అంతే... ఒక్క క్షణం హాలంతా నిశ్శబ్దం! అంతలోనే అందరం తేరుకుని సైనికుడి ప్రాధాన్యం గురించి ఆయన చెప్పిన తీరును అభిమానించాం. బాగా ఆలోచించాక... ‘‘వైద్యరంగంలోనూ అంతే... వ్యాధిగ్రస్తుడే ప్రాముఖ్యం ఉన్న వ్యక్తి. అతడికి సేవలందించేందుకే ఈ నర్సులూ, పారామెడికల్ సిబ్బంది, డాక్టర్లూ ఉంటారు. నిజానికి ఆ వ్యాధిగ్రస్తుడే లేకుండా మిగతావారి ఉనికికి అర్థమే లేద’’నిపించింది. దీన్ని ఆకళింపు చేసుకున్నప్పట్నుంచీ నేనందించే వైద్యసేవల్లోనూ అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ వచ్చాను. ఇక మరో సంఘటన... మేము హౌస్సర్జన్స్గా ఉండగా వార్డుల్లో పోస్ట్గ్రాడ్యుయేట్ విద్యార్థులు పేషెంట్ల గూర్చి శ్రద్ధ తీసుకుంటూ ఉండేవారు. ఒకరోజున మా సీనియర్స్ వార్డులోకి వస్తూనే... ‘‘ఆ జీజే వేగాటమీకు ఎలా ఉంది? ఈ స్ట్రాంగ్యులేటెడ్ హెర్నియా ఎలా ఉన్నాడు’’ అని అడిగాడు. ‘‘అందరూ బాగానే ఉన్నారు. కానీ కొంచెం ఫీవర్...’’ అంటూ నేనేదో చెబుతున్నాను. మా సంభాషణ వింటున్న మా ప్రిన్సిపల్ డాక్టర్ చలపతినాయుడు మా ముగ్గుర్నీ తన రూమ్లోకి రమ్మన్నారు. ఆయనంటే మాకెంతో భక్తిశ్రద్ధలు. ఆయనకు స్టూడెంట్స్ పట్ల ఎంతో వాత్సల్యం. ఆయన స్టూడెంట్స్ను ‘‘ఏరా’’ అన్నా... అది మాకు గర్వంగా అనిపించేది. ఆయనంటే మాకున్న గౌరవం అలాంటిది. ‘‘ఏంరా! మీరు మాట్లాడుకుంటున్న పేషెంట్లు హెర్నియా, జీజే, హైడ్రోసిల్లు కాదురా. వాళ్లూ మనలాంటి మనుషులే. రైతులో, కూలీయో అయి, గౌరవపూర్వకమైన వృత్తిలో ఉంటారు. మనకూ (డాక్టర్లకూ) ఎప్పుడైనా జబ్బులు రావచ్చు. మిమ్మల్ని జబ్బుపేరుతో పిలిస్తే ఎలా ఫీలవుతారు? ముందు వాళ్ల పేర్లు తెలుసుకోండి. గౌరవించడం నేర్చుకోండి. మీకు వాళ్ల పేర్లే తెలియదంటే, వాళ్లు మనలాంటి మనుషులన్న ధ్యాసే లేదన్నమాట. డాక్టరంటే మందులిచ్చేవాడు మాత్రమే కాదు. అతడూ మనిషి. ముందు మంచి మనిషిగా ఉండటం నేర్చుకోండి’’ అన్నారు. కాస్త తేరుకొని ఆలోచిస్తే ఆయన చెప్పిన విషయంలో ఎంత వాస్తవం ఉందో అర్థమైంది. ఎంతో అనుసరణీయమనిపించింది. ఆరోజు నుంచీ ఒక డాక్టర్గా కంటే ఒక మనిషిగా ఉండటానికే ప్రాధాన్యమిచ్చా. డాక్టర్గా ఉండటం కంటే మనిషిగా వ్యవహరించడం చాలా కష్టమైన పని! - నిర్వహణ: యాసీన్ రోగి లేకపోతే... డాక్టరెందుకు? వ్యాధిగ్రస్తుడే ప్రాముఖ్యం ఉన్న వ్యక్తి. అతడికి సేవలందించేందుకే ఈ నర్సులూ, పారామెడికల్ సిబ్బంది, డాక్టర్లూ ఉంటారు. నిజానికి ఆ వ్యాధిగ్రస్తుడే లేకుండా మిగతావారి ఉనికికి అర్థమే లేదు. - డా॥ఎ.పి. విఠల్, ప్రజా వైద్యశాల వ్యవస్థాపకులు, సూర్యాపేట 9848069720


