breaking news
IIT student commits suicide
-
కార్పొరేట్ కోళ్ల ఫారాల్లో రాలుతున్న మొగ్గలు.. ఐఐటీ చెన్నైలో ఏం జరుగుతోంది?
👉ఐఐటీ లో సీట్ వచ్చిందంటే" లైఫ్" అనే సినిమా సూపర్ హిట్ అయినట్టేనని, మన దేశం లో కోట్లాది మంది పేరెంట్స్ నమ్ముతారు . 👉పరీక్ష రాసేది పన్నెండు లక్షల మంది .. చివరకు సీట్ సాధించేది 16 వేలమంది . 👉అంటే ఐఐటీ లో సీట్ కొట్టిన వారు త్రీ రోజెస్ టీ లాగ, "వేలాది లో ఒక్కరు" . ఐఐటీ లో విద్యా ప్రమాణాలు చాలా బాగుంటాయి. కోర్స్ పూర్తి చేస్తే భారీ శాలరీ ప్యాకేజీ తో మంచి ఉద్యోగం ఖాయం. మరి ఆత్మ హత్యలెందుకు ? ఏదో ఒకటి రెండు అయితే ఏదో అనుకోవచ్చు . ఐఐటీ చెన్నై లో గత రెండు నెలల్లో నాలుగు ఆత్మ హత్యలు . అన్ని ఐఐటీలలో కలిపి నాలుగేళ్లలో నలబై దాకా !ఎందుకిలా ? 1 . ఐఐటీ ఫౌండేషన్ పేరుతో ఆరో తరగతి నుంచే పిల్లల్ని ఆట పాటలకు దూరం చేస్తున్నారు. దీని వల్ల , వీరిలో గ్రోత్ హార్మోన్ లోపం; హ్యాపీ హార్మోన్స్ తగినంత ఉత్పత్తి కావు. విపరీతమైన ఒత్తిడి వల్ల కార్టిసోల్ ఉత్పత్తి అవుతుంది. దీని వల్ల చిరాకు, అసహనం , నిద్ర లేమి , ఆత్మ న్యూనతా భావం, అభద్రత, కుంగుబాటు లాంటి నెగటివ్ మానసిక ఉద్వేగభావాలు కలుగుతాయి. ఒక అంచనా ప్రకారం IITలో చదివే విద్యార్థుల్లో ప్రతి ముగ్గురిలో కనీసం ఒకరు డిప్రెషన్ లాంటి మానసిక రోగాలతో బాధ పడుతున్నారు. 2. క్రీడలకు దూరం కావడం వల్ల క్రీడా స్ఫూర్తి కొరవడుతోంది. చిన్న సమస్యకు కుంగిపోతున్నారు ౩. తెలుగు, ఇంగ్లీష్, హిందీ.. ఈ సబ్జెక్టుల్లో అంతర్లీనంగా లైఫ్ స్కిల్స్ పాఠాలుంటాయి. IIT ఫౌండేషన్ లో కేవలం గణితం, భౌతిక శాస్త్రంపై దృష్టి నిలపడం జరుగుతోంది. కేవలం పరీక్ష కోసం తూతూ మంత్రంగా లిటరేచర్ అలాగే సోషల్ స్టడీస్ ను చదవక పోవడం వల్ల , ఇంగిత జ్ఞానం, సామజిక, భావోద్వేగ తెలివితేటలు లోపిస్తున్నాయి . పరిష్కారం : ✔️ప్రపంచం లో ఎన్నో ఉత్తమ విద్యా సంస్థలున్నాయి . వాటికీ ప్రవేశ పరీక్షలున్నాయి . ఆ పరీక్షల కోసం మహా అంటే ఆరు నెలలు ప్రిపేర్ అయితే సరిపోతుంది . చిన్నప్పటి నుంచి సంపూరణాత్మక విద్య పొందిన విద్యార్థులకు ఈ ప్రిపరేషన్ కూడా పెద్దగా అవసరం లేకుండా పోతుంది. ❌దీనికి భిన్నంగా IIT JEE పరీక్షను రూపొందించారు. ఏళ్ళ తరబడి గణితాన్ని భౌతిక శాస్త్రాన్ని చదివిన వారికి.. అది కూడా క్రీడలు అల్ రౌండ్ డెవెలప్మెంట్ లాంటి వాటిని పక్కన పెట్టి, కోచింగ్ కోళ్లుగా మారిన వారికి మాత్రమే, ఈ పరీక్ష లో విజయం దక్కేలా ఆ పరీక్షను డిజైన్ చేసారు. ఐఐటీ కోచింగ్ వేల కోట్ల ఇండస్ట్రీ. ప్రత్యక్ష పరోక్ష పాత్రధారులు ఎంతో మంది. లబ్ది దారులు ఎంతో మంది. ఏదో అద్భుతం జరిగితే తప్పించి వ్యవస్థ మారదు . ఆరో తరగతి నుంచే కోట్లాది పిల్లల బాల్యం బుగ్గి పాలవుతోంది. ఇంటర్ .. అది ముగిసాక పరీక్ష రాసేవరకు బతుకు పరమ దుర్భరం. బ్రిటిష్ కాలం నాడు పోర్ట్ బ్లెయిర్ లోని సెల్యూలర్ జైలు. నేడు కోట .. ఇంకా తెలుగు నాట కార్పొరేట్ కోళ్ల ఫారాలు. కోటలో కోటి కన్నీటి కథలు. తెలుగు నాట కోళ్ల ఫారాలలో ఎనెన్నో వ్యధలు. అర్జెంటు గా అమెరికాకు వెళ్ళిపోవాలి . అక్కడి డాలర్ లు ఇక్కడికి పంపిస్తే నాలుగు సైట్స్ కొనాలి. అందరితో గొప్పలు చెప్పుకోవాలి . అటు పై 65 వచ్చే వరకు రెండేళ్లకు ఒక సారి అక్కడికెళ్లి వచ్చి నలుగురికి కబుర్లు చెప్పాలి.. ఇదీ ఆలోచన ... .ఇదీ తీరు ఐఐటీ లో చేరొద్దన్నా ? అమెరికా కు వెళ్లొదనా ? ✔️కానే కాదు. ఐఐటీ లు ప్రపంచ స్థాయి సంస్థలు . ఉత్తమ విద్యా ప్రమాణాలు . ✔️అమెరికాకో మరో చోటుకు వెళ్లడం సహజం. మనది నేడు విశ్వ గ్రామం . రానున్నది రోబో యుగం . ❌అమెరికాకో మరో దేశానికి వెళిపోతేనే సమస్యలు పరిష్కారం అయిపోతాయి .. అక్కడికి పొతే సమస్యలే ఉండవు అనుకోవడమే పెద్ద సమస్య . సమస్యలు లేని చోటు సమాధి ఒక్కటే .. సమస్యలు లేని జీవితం నరకం అని తెలుసుకోకపోవడం వీరి అజ్ఞానం. తాను సాధించలేని దాన్ని పిల్లల ద్వారా సాకారం చేసుకోవాలని అనుకోవడం. పిల్లల ఆప్టిట్యూడ్ పట్టించుకోక పోవడం. అన్నిటికీ మించి "కోచింగ్ కోసం .. కోచింగ్ ద్వారా ... కోచింగ్ మూలంగా" సాగే ఐఐటీ సీట్ ల భర్తీ ✔️ఐఐటీ లు సంతోష కర జీవనాన్ని సాగించడానికి ఒక మార్గం. ఎవరూ కాదనలేని సత్యం . కానీ ఐఐటీ లో సీట్ సాధించడమే జీవితం. ఆ ప్రయత్నం లో పిల్లల మానసిక శారీరిక ఆరోగ్యం ఎంత నాశనం అయినా ఫరవాలేదు అనుకొనే సగటు మధ్య తరగతి పేరెంట్ మనస్తత్వం మారనంత వరకు... ఇండియా లో బాల్యం శాపమే ! వాసిరెడ్డి అమర్ నాథ్, విద్యావేత్త, మానసిక శాస్త్ర పరిశోధకులు చదవండి: మహిళల ఘన విజయం: విత్తనం పరిరక్షణకు‘చిరు’యత్నం -
ఐఐటీలో కలకలం
చెన్నై, సాక్షి ప్రతినిధి, చిన్నమండెం : చదువులో చురుకుదనం. మెరిట్ విద్యార్థి. ప్రతిష్టాత్మకమైన సంస్థ ద్వారా స్కాలర్ షిప్పు. ఎంటెక్ పూర్తికాగానే రూ.50 వేల జీతంతో సిద్ధంగా ఉన్నతమైన ఉద్యోగం. ఎంతో ఉజ్వలమైన భవిష్యత్తు కలిగిన చెన్నై ఐఐటీ విద్యార్థి నరం నాగేంద్రకుమార్ రెడ్డి (23)కి మరి ఏమి కష్టం వచ్చిపడిందో తెలియదు కానీ చేజేతులా ప్రాణాలు తీసుకుని కన్నవారికి కడుపుకోత మిగిల్చాడు. జిల్లాలోని చిన్నమండెం మండలం కేశవపురం గ్రామానికి చెందిన రైతు దంపతులు నరం నారాయణరెడ్డి, కాంతమ్మలకు నాగేంద్రకుమార్ రెడ్డి ఒక్కడే కుమారుడు. వ్యవసాయం ద్వారా వచ్చే అరకొర ఆదాయంతో జీవిస్తూ కుమారున్ని చదివించుకున్నారు. నగేంద్రకుమార్రెడ్డి కర్నూలు జిల్లా పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో మంచి మార్కులతో బీటెక్ (త్రిబుల్ఈ) పూర్తి చేశాడు. ఇతని ప్రతిభను గుర్తించిన ఎల్అండ్టీ సంస్థ రూ.13 వేల స్కాలర్షిప్పుతో పాటు చెన్నై ఐఐటీలో ఎంటెక్ సివిల్ చది విస్తోంది. ఎంటెక్ పూర్తికాగానే రూ.50 వేల జీతంతో ఉద్యోగం ఇచ్చేందుకు సిద్ధమైంది. మరో నాలుగు నెలల్లో ఎంటెక్ పూర్తి కానుంది. ఈనెల 19, 20 తేదీలు శని, ఆదివారాలు కాలేజీకి సెలవు కావడంతో స్వగ్రామం వెళ్లి సోమవారం ఉదయం ఐఐటీకి చేరుకున్నాడు. హాస్టల్లోని ఇతర విద్యార్థులంతా సోమవారం క్లాసులకు వెళ్లగా నాగేంద్రకుమార్ రెడ్డి మాత్రం గదిలోనే ఉండిపోయినట్లు సమాచారం. రాత్రి 9 గంటలైనా ఇతను ఎక్కడా కనపడక పోవడంతో ఇతర విద్యార్థులు నాగేంద్రకుమార్ రెడ్డి ఉంటున్న ఐఐటీ హాస్టల్ గది (నెంబరు 60015) వెంటిలేటరు నుంచి చూశారు. ఫ్యాన్కు ఉరివేసుకుని వేళాడుతున్న దృశ్యం కనిపించడంతో హతాశులయ్యారు. హాస్టల్ నిర్వాహకులు వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు. అర్ధరాత్రి 2 గంటల సమయంలో తండ్రి నారాయణ రెడ్డికి సమాచారం ఇవ్వగా మంగళవారం ఉదయం ఆయన చెన్నైకి చేరుకున్నాడు. పోస్టుమార్టం జరుగుతున్న రాయపేట ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ.. శని, ఆదివారాలు తమ వద్ద సంతోషంగా గడిపాడని చెప్పారు. అదే ఉత్సాహంతో చెన్నైకి బయలుదేరాడన్నారు. ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకునేంత తీవ్రమైన పరిస్థితులు తన కుమారునికి ఏవీ లేవని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ప్రేమ వ్యవహారం, విఫలం వంటివి ఏమైనా ఉంటే తనకు చెప్పేవాడన్నారు. మంగళవారం పోస్ట్మార్టం ముగించి మృతదేహాన్ని తండ్రికి అప్పగించారు. కొట్టూరుపురం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎప్పుడూ తపించేవాడని తోటి విద్యార్థులు చెప్పారు. పోటీ పరీక్షలు సైతం రాశాడన్నారు. ఎంటెక్లో ఓ సబ్జెక్ట్లో ఫెయిలయ్యాడని, అందువల్ల దిగులుతో ప్రాణాలు తీసుకుని ఉండవచ్చని మరికొందరు అనుమానం వ్యక్తం చే శారు. అందరితో చక్కగా మాట్లాడే నాగేంద్రకుమార్రెడ్డి మృతి చెందాడని తెలియగానే స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. బంధువులు, గ్రామస్తులు అతని ఇంటి వద్దకు చేరుకుని కంట నీరు పెట్టారు. తమ కుమారుడు ఆత్మహత్య చేసుకునేంత పిరికి వాడు కాదని తల్లి కాంతమ్మ గుండెలవిసేలా విలపించింది.