breaking news
Hull
-
మనుషుల ఊపిరితిత్తుల్లో సూక్ష్మ ప్లాస్టిక్
లండన్: భూగోళాన్ని ముంచెత్తుతున్న ప్రమాదకరమైన ప్లాస్టిక్ భూతం ఇప్పుడు మనుషుల శరీరంలోకి సైతం చొరబడుతోంది. మనుషుల ఉపరితిత్తుల్లో సూక్ష్మ ప్లాస్టిక్ రేణువులను ఇంగ్లాండ్లో యూనివర్సిటీ ఆఫ్ హల్కు చెందిన హల్యార్క్ మెడికల్ స్కూల్ సైంటిస్టులు గుర్తించారు. గాలితోపాటు ప్రాణాంతక ప్లాస్టిక్ రేణువులను సైతం మనం పీలుస్తున్నామని వారు చెప్పారు. ఊపిరితిత్తుల్లో ప్లాస్టిక్ తిష్ట వేస్తే శ్వాస వ్యవస్థ దెబ్బతింటుందని, ఫలితంగా తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని హెచ్చరించారు. సముద్రాలు, కొండలు, భూమి అనే తేడా లేదు.. ఎక్కడ చూసినా ప్లాస్టిక్కే కనిపిస్తోంది. వ్యర్థాల్లోకి చేరిన పెద్ద ప్లాస్టిక్ వస్తువులు చిన్నచిన్న ముక్కలుగా విడిపోతున్నాయి. 5 మిల్లీమీటర్ల పరిమాణంలోకీ మారుతున్నాయి. కంటికి కనిపించని సూక్ష్మమైన ఈ ప్లాస్టిక్ రేణువులను వాటర్ ఫిల్టర్లు కూడా అడ్డుకోలేవు. చివరకు ఇవి పీల్చే గాలి, తాగే నీటి ద్వారా శరీరంలోకి చేరుతున్నాయి. 13 లంగ్ టిష్యూ నమూనాలను పరీక్షించగా, 11 నమూనాల్లో 39 మైక్రో ప్లాస్టిక్ రేణువులు కనిపించాయని çపరిశోధకులు చెప్పారు. ఈ అధ్యయనం ఫలితాలను టోటల్ ఎన్విరాన్మెంట్ జర్నల్ సైన్స్లో ప్రచురించనున్నారు. జీవించి ఉన్న మనుషుల ఇతర శరీర భాగాల్లో ప్లాస్టిక్ ఆనవాళ్లను గతంలోనే గుర్తించినప్పటికీ.. ఊపిరితిత్తుల అంతర్భాగాల్లో గుర్తించడం మాత్రం ఇదే మొదటిసారి అని సైంటిస్టులు వెల్లడించారు. ఊపిరితిత్తుల్లో గాలి మార్గాలు చాలా ఇరుగ్గా ఉంటాయని, అందులోకి ప్లాస్టిక్ రేణువులు చేరితే శ్వాసలో సమస్యలు వస్తాయన్నారు. -
పండ్ల పైపొట్టు... ఆరోగ్యానికి తొలిమెట్టు
అరటిపండ్ల లాంటి తొక్క వలిచి తినే పండ్లను మినహాయిద్దాం. ఇక ద్రాక్షలాంటి పండ్లను వలిచే ప్రసక్తే ఉండదు. కానీ... మామిడి, జామ, ఆపిల్, కివీ వంటి పండ్ల మాటేమిటి? తొక్కతో పాటు అలాగే తినేసే అవకాశం ఉన్నా... చాలామంది రుచికి కాస్త అడ్డు అనే వంకతో తొక్కను వలిచే తింటారు. అయితే తొక్కతో పాటు తినగలిగే ఆ పండ్లను తొక్కతోనే తినడం మంచిదంటున్నారు నిపుణులు. పండ్ల లోపలి భాగం రక్షణ కోసం ఏర్పాటైన ఆ పొట్టే... మన ఆరోగ్యానికి కవచం అవుతుందంటున్నారు. రండి ఆ కవచాన్ని తొడుక్కుందాం మనం! పొట్టు తీయకుండా తినగలిగే పండ్లన్నింటినీ పొట్టు వొలుచుకోకుండా తినడమే మేలు. ఎందుకంటే పండ్లలో ఎన్ని పోషకాలు ఉంటాయో, వాటికి మించిన కీలకమైన పోషకాలు అనేకం ఉంటాయి. మలబద్దకాన్ని నివారించే పీచుపదార్థాలు పొట్టులోనే ఎక్కువగా ఉంటాయి. ద్రాక్షపండు పొట్టులో పోషకాలివే... ఈ పండులోని పొట్టులో ఉన్న పోషకాలు చాలా ఎక్కువ. మొత్తం పండులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాల్లో 20 శాతం ఈ పలుచని పొట్టులోనే ఉంటాయి. యాంటీయాక్సిడెంట్ పోషకాలు వయసు పైబడుతున్న కొద్దీ జరిగే అనర్థాలను నివారిస్తాయి. అందుకే ద్రాక్షపొట్టుతో యౌవనం చాలాకాలం నిలుస్తుంది. పొట్టులోని పెక్టిన్ అనే పోషకం సుఖవిరేచనం అయ్యేలా చేస్తుంది. తియ్యగా ఉన్నప్పటికీ ఈ పండు తాలూకు గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ కాబట్టి డయాబెటిస్ రోగులూ నిక్షేపంగా తినవచ్చు. జామపండు పొట్టు... పోషకాలు జామపొట్టులోని పిగ్మెంట్ క్యాన్సర్ నివారణకు తోడ్పడుతుంది. అలాగే 100 గ్రాముల ఈ పండులో 5.4 గ్రాముల పీచు ఉంటుంది. ఈ పీచు సైతం ప్రధానంగా పొట్టులోనే ఎక్కువ. పండులో ఉండే విటమిన్-సితో పోలిస్తే ఈ పండు పొట్టులోని సి- విటమినే ఎక్కువ. ఇది వ్యాధినిరోధకతశక్తిని గణనీయంగా పెంచుతుంది. కాబట్టి వ్యాధులేవీ దరిచేరకుండా ఉండాలన్నా, సాఫీగా మలవిసర్జన జరగాలన్నా జామపండు మేలు. మామిడి తొక్క చేసే మేలెంతో..! మామిడిపండ్ల పొట్టులో ఉండే పోషకాల తీరు చాలా ప్రత్యేకమైనది. ఈ పండు పొట్టులో ‘రెస్వెరట్రాల్’ అనే పదార్థం ఉంటుంది. రెడ్వైన్లో ఉండేది కూడా ఇదే పదార్థం. ఇది కొవ్వులను చాలా వేగంగా కరిగిస్తుంది. అందుకే లావెక్కేవారు పొట్టుతోపాటు మామిడిపండును తింటే బరువు పెరగడం వేగంగా జరగదు. పైగా మామిడి తొక్కలో ఉండే పోషకాలు కొవ్వు కణాలు త్వరగా పెరగకుండా చేస్తాయి. కాబట్టి తొక్కతో తినేవారు చాలాకాలం పాటు చక్కగా స్లిమ్గా ఉంటారు. పండుకంటే పొట్టులోనే ఎక్కువ పోషకాలు ఉండే ఆపిల్ ఆపిల్లో లోపలున్న పండు కంటే తొక్కలోనే పోషకాలు ఎక్కువ. ఆపిల్ తొక్కలో కంటికి మేలు చేసే ‘ఏ-విటమిన్’, వ్యాధినిరోధకశక్తి పెంచే ‘సి-విటమిన్లు’ పండులో కంటే ఎక్కువని యూనివర్సిటీ ఆఫ్ ఇలినాయిస్కు చెందిన అధ్యయనవేత్తలు చేసిన పరిశోధనల్లో తేలింది. ఇక పీచు విషయానికి వస్తే... మొత్తం పండులోకంటే పొట్టులోనే మూడింట రెండు వంతుల పీచు ఉంటుంది. ఆరోగ్యానికి మేలు చేసే క్యాల్షియమ్, పొటాషియమ్, ఫాస్పరస్, ఫోలేట్, ఐరన్ వంటి పోషకాలన్నీ పండు కంటే పొట్టులోనే ఎక్కువ. కివీ పండునూ తొక్కతోనే తినడం మేలు కివీ పండును తినదలచినవారు దీన్ని పొట్టు తీయకుండా తినడం మంచిది. ఈ పొట్టులో యౌవనాన్ని చాలాకాలం పాటు నిలిచేలా చేసే యాంటీ ఆక్సిడెంట్లు, వ్యాధినిరోధకశక్తి పెంచే విటమిన్-సి పుష్కలంగా ఉంటాయి. ఈ విషయం గుర్తుంచుకోండి పొట్టుతో పాటు తినే పండ్లను తప్పనిసరిగా నల్లా (కొళాయి) లాంటి జారే నీటిలో చాలాసేపు శుభ్రంగా కడిగాకే తినాలి. ఎందుకంటే ఇటీవల ద్రాక్ష వంటి పండ్లపై పిచికారీ చేసే రసాయనాలు చాలా ఎక్కువ. కాబట్టి అవన్నీ కొట్టుకుపోయేలా నల్లా నుంచి జారే నీళ్లలో (రన్నింగ్ వాటర్) చాలాసేపు కడిగాకే పండ్లు తినాలని గుర్తుంచుకోండి. సుజాతా స్టీఫెన్ న్యూట్రీషనిస్ట్, సన్షైన్ హాస్పిటల్స్, హైదరాబాద్