Gyanesh Kumar
-
సీఈసీ ఉద్వాసన కోరుతూ విపక్షాల తాజా నోటీస్
న్యూఢిల్లీ: ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) పదవి నుంచి జ్ఞానేశ్ కుమార్ను తప్పించాలంటూ విపక్ష పార్టీలు శుక్రవారం తాజాగా మరో నోటీస్ను రాజ్యసభకు అందజేశాయి. సీఈసీ ఉద్వాసనకు సంబంధించి తీర్మానం కోసం నోటీస్ ఇస్తున్నట్లు కాంగ్రెస్ నేత జైరాం రమేశ్, తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు సాగరికా ఘోష్ రాజ్యసభ ప్రధాన కార్యదర్శికి అందజేసిన లేఖలో పేర్కొన్నారు. వీలైనంత త్వరగా సీఈసీ ఉద్వాసనకు సంబంధించిన తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టాలంటూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మునుద్దేశిస్తూ నేతలు నోటీస్ను అందజేశారు. తమిళనాడు, పశ్చిమబెంగాల్ ఎన్నికలను ప్రభావితంచేసేలా ప్రధాని మోదీ ఏప్రిల్ 18వ తేదీన సందర్భంలేకపోయినా ఉద్దేశపూర్వకంగా జాతినుద్దేశించి ప్రసంగించారని, ఈ విషయమై ఫిర్యాదుచేసినా సీఈసీ పట్టించుకోలేదని నోటీస్లో ప్రస్తావించారు. వృత్తిధర్మం నిర్వర్తించడంలో ఘోరంగా విఫలమవడంతోపాటు అధికార పక్షం పట్ల పక్షపాత ధోరణితో ఆయన వ్యవహరిస్తున్నారని ఆ నోటీస్లో నేతలు పేర్కొన్నారు. నోటీస్పై 73 మంది విపక్షసభ్యులు సంతకాలుచేశారు. 2026 మార్చి 15వ తేదీన, ఆ తర్వాత సైతం సీఈసీ జ్ఞానేశ్ చర్యలు ఆయనలోని పక్షపాత ధోరణిని పలుమార్లు బయటపెట్టాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 324(5), ఆర్టికల్124(4), సీఈసీ, ఇతర ఈసీల (నియామక, సర్వీస్ నిబంధనల)చట్టం,2023లోని 11(2)వ సెక్షన్, జడ్జీల(విచారణ)చట్టం–168లోని నిబంధనలకు పూర్తివిరుద్ధంగా ఆయన వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు ఆయనపై మొత్తంగా 9 ప్రధాన ఆరోపణలున్నాయి. -
పోటెత్తిన ఓటింగ్
కోల్కతా/చెన్నై: ఓటర్లలో వెల్లువెత్తిన చైతన్యానికి సంకేతంగా పశ్చిమ బెంగాల్ తొలి విడత అసెంబ్లీ ఎన్నికల్లో, ఒకే విడతలో జరిగిన తమిళనాడు ఎన్నికల్లో రికార్డు స్థాయిలో ఓటింగ్ నమోదైంది. గురువారం 152 స్థానాలకు జరిగిన బెంగాల్ ఎన్నికల్లో 92.72 శాతం, మొత్తం 234 స్థానాలకు జరిగిన తమిళనాడు ఎన్నికల్లో 85.14 శాతం ఓటింగ్ నమోదు కావడం విశేషం. రెండు రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) సర్వే ద్వారా అర్హత లేని లక్షలాది ఓట్లను తొలగించిన తర్వాత జరిగిన ఈ ఎన్నికల్లో రికార్డుస్థాయిలో ఓటింగ్ నమోదవడం గమనార్హం. శుక్రవారం ఉదయం కల్లా తుది గణాంకాలు రావొచ్చు. బెంగాల్లో అక్కడక్కడా హింసాకాండ చోటుచేసుకోవడం మినహా తొలి విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. కనిష్ట స్థాయిలో హింస జరగడం బెంగాల్ ఎన్నిక చరిత్రలో ఇదే మొదటిసారి అని విశ్లేషకులు చెబుతున్నారు. తమిళనాడులోనూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకపోవడంతో ఎన్నికల సంఘం ఊపిరి పీల్చుకుంది. ప్రజాస్వామ్య ప్రక్రియలో పాలుపంచుకోవడానికి, దేశ పౌరులుగా తమ విధిని నిర్వర్తించడానికి ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద బారులుతీరి ఉత్సాహంగా ఓటువేశారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 6 గంటలకు ముగిసింది. సమయం ముగిసినా పోలింగ్ కేంద్రాల ఎదుట రద్దీ తగ్గలేదు. వరుసలో నిల్చున్నవారందరికీ ఓటు వేసే అవకాశం కల్పించారు. రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. స్వాతంత్య్రం తర్వాత అత్యధిక ఓటింగ్ దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత పశ్చిమ బెంగాల్, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక ఓటింగ్ నమోదు కావడం ఇదే మొదటిసారి. ఈ నెల 9న జరిగిన అస్సాం, పుదుచ్చేరి ఎన్నికల్లోనూ మునుపెన్నడూ లేని రీతిలో అత్యధిక ఓటింగ్ నమోదైంది. అస్సాంలో 85.38 శాతం, పుదుచ్చేరిలో 89.83 శాతం నమోదయ్యింది. బెంగాల్, తమిళనాడులో ఇప్పటిదాకా 2011 నాటి ఎన్నికల ఓటింగే అత్యధికం. అప్పట్లో బెంగాల్లో 84.72 శాతం, తమిళనాడులో 78.29 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. ఆ రికార్డును ఈసారి ఓటర్లు తిరగరాశారు. రెండు రాష్ట్రాల్లో పురుషుల కంటే మహిళలే అత్యధికంగా ఓటింగ్లో పాల్గొన్నారు. తమిళనాడులో పురుషులు 83.57 శాతం మంది ఓటువేయగా, మహిళలు 85.76 శాతం మంది ఓటువేశారు. బెంగాల్లో పురుషులు 90.92 శాతం, మహిళలు 92.69 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటింగ్లో సరికొత్త రికార్డు సృష్టించిన రెండు రాష్ట్రాల ఓటర్లకు సెల్యూట్ చేస్తున్నామని ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ అన్నారు. బెంగాల్లో ఎస్ఐఆర్ ద్వారా 91 లక్షల ఓట్లను తొలగించారు. ఈ నేపథ్యంలో అర్హులైన ఓటర్లలో 91.78 శాతం మంది ఓటు వేశారు.పశ్చిమ బెంగాల్లో స్వల్ప హింస బెంగాల్లో తొలి విడత ఎన్నికల సందర్భంగా హింసాకాండ చోటుచేసుకుంది. అధికార టీఎంసీ, విపక్ష బీజేపీ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. ఉద్రిక్తత పరిస్థితులను సైతం లెక్కచేయకుండా జనం భారీగా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. హింసాత్మక ఘటనలు ఓటర్ల ఉత్సాహాన్ని తగ్గించలేకపోయాయి. 2021లో 82.30 శాతం ఓటింగ్ నమోదు కాగా, గురువారం 92 శాతం దాటేసింది. బెంగాల్ ప్రజలు తమ హక్కులను కోల్పోకుండా ఉండేందుకే అధిక సంఖ్యలో ఓటు వేశారని టీఎంసీ పేర్కొంది. ఈ ఎన్నికల్లో ఓటు వేయకపోతే పౌరులుగా తమ హక్కులను, పౌరసత్వాన్ని కోల్పోతామని ప్రజలు ఆందోళనకు గురయ్యారని, అందుకే ఆ ప్రమాదం తలెత్తకుండా అధిక సంఖ్యలో పాల్గొన్నారని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. బీర్భూమ్లోని ఖరిసోల్లో ఈవీఎంలలో టీఎంసీకి వేసిన ఓట్లను బీజేపీకి అనుకూలంగా నమోదు చేస్తున్నారని అధికార పార్టీ నాయకులు ఆందోళనకు దిగారు. దాంతో అధికారులు పోలింగ్ను తాత్కాలిక నిలిపివేశారు. స్థానికులకు, భద్రతా సిబ్బందికి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కొందరు రాళ్లతో దాడికి దిగారు. పారామిలిటరీ బలగాలు రంగ ప్రవేశం చేయడంతో పరిస్థితి సద్దుమణిగింది. దక్షిణ దినాజ్పూర్లోని కుమార్గంజ్లో బీజేపీ అభ్యర్థి సువేందు సర్కార్పై దాడి జరిగిందని, అసన్సోల్ దక్షిణ నియోజకవర్గంలోని రహమత్ నగర్ సమీపంలో బీజేపీ ఎమ్మెల్యే అగి్నమిత్ర పాల్ కారుపై రాళ్లతో దాడి చేసి వెనుక కిటికీని పగలగొట్టారని ఆరోపణలు వచ్చాయి. నవోడాలో ఏజేయూపీ నాయకుడు హుమాయున్ కబీర్ కాన్వాయ్పై కొందరు రాళ్లు విసిరారు. దీంతో అతడి మద్దతుదారులకు, ప్రత్యర్థులకు మధ్య ఘర్షణచోటుచేసుకుంది. లాభ్పూర్, చంచల్. మురారైలలో హింసాత్మక, బెదిరింపు ఘటనలు జరిగాయి. వేర్వేరు పారీ్టల కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణల్లో పలువురు గాయపడ్డారు. డోమ్కల్లో ఓటర్లు పోలింగ్ బూత్ల వద్దకు చేరుకోకుండా కొందరు అడ్డుకొనే ప్రయత్నం చేశారు. మొత్తం పోలింగ్ ప్రక్రియ చాలావరకు ప్రశాంతంగా ముగిసినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఎన్నికల్లో అక్రమాలకు సంబంధించి వందలాది ఫిర్యాదులు అందినట్లు తెలియజేసింది. జిల్లాల వారీగా చూస్తే ముర్షిదాబాద్, బంకూర, కూచ్ బెహార్లో 90 శాతానికి పైగా ఓటింగ్ నమోదయ్యింది. అత్యల్పంగా కలింపాంగ్లో 81 శాతం నమోదయ్యింది. బెంగాల్ ఎన్నికలు అంటేనే హింసాకాండకు మారుపేరుగా చెబుతుంటారు. ఈసారి అలాంటి పరిస్థితి లేకపోవడం విశ్లేషకులను ఆశ్చర్యపర్చింది. రాష్ట్రంలో మిగిలిన 142 స్థానాలకు ఈ నెల 29న రెండో విడతలో ఎన్నికలు జరుగనున్నాయి. తమిళనాడులో అంతా ప్రశాంతం అధికార డీఎంకే, విపక్ష అన్నాడీఎంకే, కొత్తగా రంగప్రవేశం దళపతి విజయ్ నేతృత్వంలోని టీవీకే మధ్య జరిగిన త్రిముఖ ఎన్నికల పోరులో 85.14 శాతం మంది ఓటర్లు పోలింగ్లో పాల్గొన్నారు. అన్నాడీఎంకే–బీజేపీ కూటమిని లక్ష్యంగా చేసుకుని నియోజకవర్గాల పునర్విభజన విషయంలో తీవ్రంగా పోరాడిన డీఎంకే అధికారాన్ని నిలబెట్టుకోవడానికి హోరాహోరీగా పోరాడింది. విజయ్ పార్టీ తమిళగ వేట్రి కళగం(టీవీకే), తమిళ జాతీయవాది సీమాన్కు చెందిన నాన్ తమిళర్ కట్చి(ఎన్టీకే) ఎన్నికల రంగంలో గట్టి పోటీదారులుగా నిలిచాయి. డీఎంకే–కాంగ్రెస్, అన్నాడీఎంకే–బీజేపీ కూటములు తమ విజయం పట్ల ధీమాగా ఉన్నాయి. అత్యధికంగా కరూర్ స్థానంలో 91.86 శాతం, అత్యల్పంగా కన్యాకుమారిలో 75.50 శాతం ఓటింగ్ రికార్డయ్యింది. చెదురు ముదురు ఘటనల మినహా రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. కొన్నిచోట్ల ఈవీఎంలు మొరాయించినా, తక్షణం మరమ్మతులు చేసి ఓటింగ్ను కొనసాగించారు. కొన్ని ప్రాంతాల్లో ప్రజలు ఓటింగ్ను బహిష్కరించారు. చెన్నైలోని మైలాపూర్లో ఓటర్లకు డీఎంకే డబ్బులు పంపిణీ చేస్తోందని బీజేపీ ముఖ్యనేతలు అన్నామలై, వనతి శ్రీనివాసన్ ఆరోపించారు. అధికార డీఎంకే పార్టీ ఉదయించే సూర్యుడి చిహ్నాన్ని బహిరంగంగా ప్రదర్శించడం ద్వారా ఓటర్లను ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తోందని బీజేపీ నేత డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రి స్టాలిన్, డిప్యూటీ సీఎం ఉదయ నిధి స్టాలిన్ తమ కుటుంబంతో సహా చెన్నైలో ఓటు వేశారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామి సేలం సిలువం పాళయం నెడుంకుళం పంచాయతీ పరిధిలోని యూనియన్ ప్రైమరీ స్కూల్ పోలింగ్ బూత్లో కుటుంబంతో సహా వచ్చి ఓటు వేశారు. టీవీకే అధినేత విజయ్ చెన్నై నీలాంకరై పోలింగ్ బూత్లో గట్టి భద్రత నడుమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. సంగీత దర్శకుడు ఇళయరాజా, తమిళ సినీ నటులు రజనీకాంత్, కమలహాసన్, అజిత్, సూర్య, జ్యోతిక దంపతులు, కార్తీ, అర్జున్, విక్రమ్, ధనుష్, విజయ్ సేతుపతి, శివకార్తికేయన్, విశాల్, మణిరత్నం, సంగీత దర్శకుడు అనిరుద్, నటీమణులు త్రిష, కీర్తి సురేష్, రాధిక, తదితరులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. భారీ ఓటింగ్ మాకే అనుకూలం: అన్నాడీఎంకే తమిళనాడులో 2021లో 73.63 శాతం ఓటింగ్ నమోదు కాగా, స్టాలిన్ సారథ్యంలోని డీఎంకే విజయం సాధించింది. 2011లో 78.29 శాతం ఓటింగ్ నమోదైంది. ఆ ఎన్నికల్లో జయలలిత నేతృత్వంలోని అన్నాడీఎంకే జయకేతనం ఎగురవేసింది. వరుసగా రెండుసార్లు గెలిచింది. ఈసారి 85 శాతానికిపైగా ఓటింగ్ నమోదు కావడాన్ని తమకు సానుకూలాంశంగా అన్నాడీఎంకే–బీజేపీ కూటమి నాయకులు భావిస్తున్నారు. తమిళనాట ఎస్ఆఐర్ ద్వారా ఓట్లను తొలగించారు. 2025 అక్టోబర్లో 6.41 కోట్ల మంది ఓటర్లు ఉండగా, ప్రస్తుతం వారి సంఖ్య 5.73 కోట్లకు తగ్గింది. 2021 ఎన్నికల సమయంలో 6.29 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. అంటే గత ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికల్లో ఓటర్ల సంఖ్య 56 లక్షల మేర తగ్గినట్లు స్పష్టమవుతోంది. తమిళనాట ఓటింగ్ సరళి తమిళనాడులో 1957లో అత్యల్పంగా 47 శాతం ఓటింగ్ నమోదైంది. ఆ తర్వాత 1960వ దశకం నుంచి నేటి వరకు సగటు ఓటింగ్ శాతం 70కి దరిదాపుల్లోనే ఉంది. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం పాత రికార్డులు చెదిరిపోయాయి.👉 : (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
బయటకు వెళ్లిపొండి
న్యూఢిల్లీ: ఎన్నికల ప్రక్రియపై దృష్టిసారించాల్సిన ఎలక్షన్ కమిషన్ రాష్ట్ర అధికారులు బీజేపీ నేతలతో అంటకాగుతున్నారంటూ తృణమూల్కాంగ్రెస్ చేసిన ఆరోపణలతో ఆ పార్టీ నేతలు, ప్రధాన ఎన్నికల కమిషన్ సభ్యుల మధ్య జరిగిన సమావేశం కొన్ని నిమిషాల్లోనే రసాభాసగా మారి అర్ధంతరంగా ముగిసింది. తర్వాత అటు ఈసీ, ఇటు టీఎంసీ నేతలు పరస్పర ఆరోపణలు గుప్పించుకున్నారు. సమావేశంలో వాగ్వాదం జరగడానికి మీరే కారణమని రెండు వర్గాలూ వాదించుకున్నాయి. ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయం ఈ వాగ్వాదానికి వేదికగా మారింది. బీజేపీ ముఖ్యులతో ఎన్నికల అధికారులకు సత్సంబంధాలు, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్)లో లోపాలను ఎత్తిచూపుతూ తృణమూల్ చీఫ్, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ రాసిన పలు లేఖలను టీఎంసీ ప్రతినిధి బృందం ఈసీకి అందజేసింది. భేటీ సందర్భంగా రాజ్యసభ సభ్యుడు డెరెక్ ఒబ్రియాన్, సాగరికా ఘోష్, ఎంపీలు సాకేత్ గోఖలే, మేనకా గురుస్వామిల ప్రతినిధి బృందం ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) జ్ఞానేశ్కుమార్ సారథ్యంలోని ఎన్నికల సంఘానికి ఈ లేఖలను ఇచ్చారు. ఈ సందర్భంగా బెంగాల్లోని నందిగ్రామ్లో స్థానిక బీజేపీ నేతతో చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్కు ఉన్న అనుబంధం సహా ఆరు ఘటనల సాక్ష్యాధారాలతో టీఎంసీ నేతలు అందించారు. ఎస్ఐఆర్ పేరిట లక్షలాది నిజమైన ఓటర్ల పేర్లను జాబితాను నుంచి తొలగించారని టీఎంసీ నేతలు వాదించారు. మమత రాసిన 9 లేఖలను సీఈసీకి ఇచ్చారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎన్నికల అధికారులను రాష్ట్రం నుంచి బదిలీచేయాలని డిమాండ్చేశారు. భేటీ అర్ధంతరంగా ముగిశాక మీడియాతో ఓబ్రియాన్ మాట్లాడారు. ‘‘ఆరోపణలున్న అధికారుల సమక్షంలో పారదర్శకంగా ఎన్నికలు ఎలా జరుపుతారు? అని ప్రశ్నించాం. అందుకు సీఈసీ సమాధానం చెప్పాల్సిందిపోయి మీరంతా బయటకు వెళ్లండి అని గెంటేశారు. గతంలో 8–9 సార్లు ఎలక్షన్ కమిషన్తో భేటీ అయ్యాం. ప్రతిసారీ సీఈసీనే మాట్లాడారు. ఎవరినీ మాట్లాడనివ్వట్లేరు. అందుకే ఈసారి తిరిగొచ్చేటప్పుడు ఆయనను అభినందించా. పదవి నుంచి తొలగించాలని ఏకంగా పార్లమెంట్లో మీకు వ్యతిరేకంగా నోటీసులు జారీఅయ్యాయి అని చెప్పి బయటికొచ్చేశా’’అని ఓబ్రియాన్ వెల్లడించారు. ఇష్టారీతిన మాట్లాడారు: ఈసీ వాగ్వాదంపై ఈసీ తన వాదనను తర్వాత ‘ఎక్స్’ఖాతాలో పోస్ట్చేసింది. ‘‘టీఎంసీ ప్రతినిధి బృందంతో ఈసీ ఉన్నతాధికారులు నిక్కచ్చిగా మాట్లాడారు. టీఎంసీ ఎంపీ ఓబ్రియాన్ గట్టిగా అరుస్తూ ఎలక్షన్ కమిషనర్లలో ఎవరినీ మాట్లాడనివ్వలేదు. హోదా మరచి అనుచితంగా ప్రవర్తించారు. ఆరోపణల అంశంపై సీఈసీ మాట్లాడబోతే ఆయననూ ఓబ్రియాన్ అడ్డుకున్నారు. దాంతో సీఈసీ ఆగ్రహంతో బయటకు వెళ్లండి అని చెప్పాల్సి వచ్చింది. పోలింగ్కేంద్రాల్లో రిగ్గింగ్, బూత్ జామింగ్, సోర్స్ జామింగ్ వంటి చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడవద్దని ఈసీ హెచ్చరించింది. ప్రతినిధి బృందంలో ముందుగా అనుమతి పొందిన వ్యక్తులు ఎందుకు రాలేదని నిలదీశాం. వాళ్లలో అసహనం పెరిగింది’’అని ఈసీ పేర్కొంది. ఈసీ వివరణపై టీఎంసీ ఆగ్రహం వ్యక్తంచేసింది. ‘‘ముక్కుసూటిగా మాట్లాడటంతోనే మాకు కోపం వచ్చిందని ఈసీ చెబుతోంది. మరి ఇంతే ముక్కుసూటిగా బీజేపీ నేతలకు ఆదేశాలిచ్చే దమ్ము ఈసీకి ఉందా?’’అని టీఎంసీ నాయకురాలు సాగరికా ఘోష్ ప్రశ్నించారు. -
సీఈసీ జ్ఞానేశ్ కుమార్పై అభిశంసన తీర్మానానికి నోటీసు?
ఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్వర్పై అభిశంసన తీర్మానానికి నోటీసు ఇవ్వాలని విపక్ష ఇండియా కూటమిలోని కాంగ్రెస్తో పాటు ఇతర భాగస్వామ్య పార్టీలు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఎస్ఐఆర్ (ఓటరు ప్రత్యేక సవరణ)కు నిరసనగా కాంగ్రెస్, టీఎంసీతో పాటు ఇండియా కూటమి విపక్షాలు ఈ తీర్మానాన్ని ముందుకు వచ్చినట్లు సమాచారం. ఈ అభిశంసన తీర్మానంపై మొత్తం 193 మంది విపక్ష ఎంపీలు సంతకాలు చేశారు. వీరిలో 130 మంది లోక్సభ సభ్యులు, 63 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. ఓటరు ప్రత్యేక సవరణ (సర్) పేరుతో ఎన్నికల సంఘం ఏకపక్షంగా విపక్ష పార్టీల ఓటర్లను తొలగిస్తోందని. ఈ చర్య ప్రజాస్వామ్యానికి విరుద్ధమని, ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేస్తోందని ఇండియా కూటమి నేతలు తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ అమలుపై నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో, ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్పై అభిశంసన తీర్మానం విపక్షాల ఆగ్రహానికి ప్రతీకగా నిలిచింది. ఈ తీర్మానం ద్వారా విపక్షాలు ఎన్నికల సంఘం తీరుపై తమ అసంతృప్తిని స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ఇకపై ఈ అభిశంసన తీర్మానం పార్లమెంట్లో ఎలా ముందుకు సాగుతుందో, ప్రభుత్వం దీనిపై ఏ విధంగా స్పందిస్తుందో అన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. -
సీఈసీని తొలగించాలంటూ నోటీసు
న్యూఢిల్లీ: లోక్సభ స్పీకర్ ఓం బిర్లా తొలగింపునకు ఇటీవల తీర్మానం ప్రవేశపెట్టిన విపక్షాలు.. తాజాగా ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) తొలగింపునకు సైతం నోటీసు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. వివిధ రాష్ట్రాల్లో చేపట్టిన ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో అధికార పక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ సీఈసీ జ్ఞానేశ్ కుమార్ విపక్షాలు మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో జ్ఞానేశ్కుమార్ను పదవి నుంచి తొలగించాలంటూ ప్రతిపక్షాలు సిద్ధం చేసిన నోటీసుపై మొత్తం 193 మంది ఎంపీలు సంతకాలు చేశారు. ఇందులో 130 మంది లోక్సభ సభ్యులు కాగా, 63 మంది రాజ్యసభ ఎంపీలని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. శుక్రవారం ఈ నోటీసును లోక్సభకు లేదా రాజ్యసభ చైర్మన్కు అందజేసే అవకాశాలున్నాయంటున్నారు.ముందుగా ఎవరికి ఇచ్చేదీ స్పష్టం కావాల్సి ఉంది. సీఈసీ తొలగింపు కోరుతూ ఇవ్వనున్న నోటీసుపై సంతకాలు చేసేందుకు పెద్ద సంఖ్యలో ఎంపీలు ముందుకు వచ్చారని ప్రతిపక్ష నేత ఒకరు తెలిపారు. నోటీసుకు అవసరమైన సంఖ్యలో సంతకాలను ఇప్పటికే సేకరించినప్పటికీ, గురువారం కూడా ఎంపీలు కొందరు ఆసక్తి కనబరిచారన్నారు. సీఈసీ తొలగింపును కోరాలంటే లోక్సభలో కనీసం 100 మంది, అదే రాజ్యసభలో అయితే 50 మంది ఎంపీలు సంతకాలు చేస్తే సరిపోతుందని నిపుణులు అంటున్నారు.ప్రతిపక్ష ఇండియా కూటమి సభ్య పారీ్టలతోపాటు, అధికారికంగా ఆ కూటమిలో చేరని ఆప్కు చెందిన ఎంపీలు కూడా నోటీసుపై సంతకాలు చేశారని ఆ నేత వివరించారు. ఓటరు జాబితా సర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) విషయంలో సీఈసీ జ్ఞానేశ్ కుమార్ అధికార పక్షానికి అనుకూలంగా, వివక్షా పూరితంగా వ్యవహరిస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. భారీ సంఖ్యలో ఓట్ల తొలగింపుపై జరిగే విచారణను ఆయన అడ్డుకుంటున్నారంటున్నాయి. కాగా, సీఈసీని తొలగించాలంటూ పార్లమెంట్లో నోటీసు జారీ చేయనుండటం ఇదే మొదటిసారి కానుంది. తొలగింపు తీర్మానాన్ని పార్లమెంటులోని ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు. తీర్మానం ఆమోదం పొందాలంటే, సభలోని మొత్తం సభ్యులలో మెజారిటీ (50% కంటే ఎక్కువ) ఉండటంతో పాటు, ఆ సమయంలో సభకు హాజరై ఓటేసిన వారిలో రెండింట మూడొంతుల మెజారిటీ తప్పనిసరి. -
అర్హులెవ్వరినీ తొలగించం
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో అర్హత కలిగిన ఏ ఒక్క ఓటరు పేరు కూడా ఓటరు జాబితా నుంచి తొలగించబోమని ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ స్పష్టం చేశారు. స్వేచ్ఛాయుతంగా, నిష్పాక్షికంగా, శాంతియుతంగా ఎన్నికలను నిర్వహించడమే ఎన్నికల కమిషన్(ఈసీ) ప్రధాన ప్రాధాన్యతని ఆయన పేర్కొన్నారు. బెంగాల్లో ఎన్నికల సన్నద్ధతపై రాజకీయ పార్టీలు, ఉన్నతాధికా రులతో ఈసీ వరుస సమీక్షా సమావేశాలు నిర్వ హించిన అనంతరం మంగళవారం కోల్కతాలో ఈసీలోని ఇతర సభ్యులతో కలిసి జ్ఞానేశ్ కుమార్ మీడియాతో మాట్లాడారు.ఢిల్లీ వెళ్లాక రాష్ట్ర ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేస్తామ న్నారు. బెంగాల్లో సర్ అమలు పలు వివాదాలకు, ఉద్రిక్తతలకు దారితీయడంపై ఆయన స్పందిస్తూ.. అనర్హులైన వారిని జాబితా నుంచి తొలగించడమే కాదు, అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు హక్కును కాపాడేందుకు తాము కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 6 వేల మందికి పైగా శతాధిక వృద్ధులతోపాటు కొత్తగా నమోదైన 18–19 ఏళ్ల గ్రూపులోని 5.23 లక్షల మంది యువజనులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారని సీఈసీ జ్ఞానేశ్ కుమార్ వివరించారు. -
ఎన్నికల సంఘం కొత్త యాప్ ప్రారంభం
న్యూఢిల్లీ: ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ గురువారం కొత్త యాప్ ‘ఈసీఐనెట్’ను ప్రారంభించారు. ఓటర్లు, అధికారులు, రాజకీయ పార్టీలకు సరైన సమాచారం అందించడానికే ఈ యాప్ను తీసుకొచ్చినట్లు ఆయన తెలిపారు. దీంతో తప్పుడు సమాచారాన్ని తిప్పికొట్టడానికి వీలవుతుందన్నారు. ఎన్నికల వ్యవస్థపై ఢిల్లీలో జరిగిన అంతర్జాతీయ సదస్సులో ఆయన మాట్లా డారు. ఇలాంటి యాప్ను తయారు చేసుకోవడానికి ఇతర దేశాల ఎన్నికల సంఘాలకు సహకరిస్తామని చెప్పారు. వారి చట్టాల ప్రకారం, వారి భాషల్లోనే యాప్ను రూపొందించుకోవచ్చని సూచించారు. ఎన్నికల సంఘానికి సంబంధించి ప్రస్తుతం 40కిపై గా మొబైల్, వెబ్ అప్లికేషన్లు ఉన్నాయి. వీటన్నింటికీ ఒకే గొడుగు కిందకు తీసుకొస్తూ ‘ఈసీ ఐనెట్’ యాప్ను అభివృద్ధి చేశారు. ఎన్నికలకు సంబంధించిన అన్ని రకాల కార్యకలా పాల సమా చారం ఇందులో ఉంటుంది. వేర్వేరు యాప్లను డౌన్లోడ్ చేసుకొనే అవసరం ఇకపై ఉండదు. కొత్త యాప్తో ఓటర్ల డేటాను సులువుగా తెలుసు కోవచ్చు. ఓటర్ హెల్ప్లైన్ యాప్, ఓటర్ టర్నౌట్ యాప్, సీవిజిల్, సువిధ, సాక్ష్యం, కేవైసీ వంటి యాప్లను ఎన్నికల సంఘం ఉపసంహరించుకుంది. -
తొలగించిన ఓటర్ల జాబితాను ఈసీని కోరుతాం
కోల్కతా: పశ్చిమబెంగాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ)ఎస్ఐఆర్) సర్వే సమయంలో తొలగించిన 1.31 కోట్ల ఓటర్లకు సంబంధించిన జాబితా ఇవ్వాలని ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) జ్ఞానేశ్ను కోరుతామని టీఎంసీ సీనియర్ నేత అభిషేక్ బెనర్జీ చెప్పారు. ఈ నెల 31వ తేదీన జ్ఞానేశ్ను కలుస్తామని తెలిపారు. నిర్ణీత సమయంలోగా ఆ జాబితా ఇవ్వాలని అడుగుతామని, తమ డిమాండ్ నెరవేరని పక్షంలో ఢిల్లీలోని ఈసీ కార్యాలయం ఎదుట ఘెరావ్ చేపడతామని హెచ్చరించారు. అర్హులైన ఓటర్ల పేర్లను తొలగించినట్లు తేలితే ఢిల్లీలోనే నిరసనలను కొనసాగిస్తామన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో తొలగించిన ఓటర్ల జాబితాను ఈసీ వెల్లడించక పోవడానికి కారణాలేమిటని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎస్ఐఆర్ సమయంలో కోటిన్నర మంది ఓటర్ల పేర్ల తొలగింపు బీజేపీ టార్గెట్ అని దీనర్థమా అని బెనర్జీ వ్యాఖ్యానించారు. ముసాయిదా జాబితా నుంచి తొలగింపునకు గురైన 58.20 లక్షల ఓటర్లలో రోహింగ్యాలు, బంగ్లాదేశీ వలసదారులు ఎందరున్నారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఎస్ఐఆర్ అనంతరం రాష్ట్రంలోని మొత్తం 10.05 కోట్ల జనాభాలో 5.79 శాతం జనాభా పేర్లను మాత్రమే తొలగించడంపై అనుమానం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ఎస్ఐఆర్ చేపట్టిన రాష్ట్రాల్లో ఇదే అత్యంత తక్కువని ఎత్తి చూపారు. పశ్చిమబెంగాల్లో 50 శాతం వరకు ఓటర్లను గుర్తించలేకపోయినట్లు ప్రకటించిన ఈసీ..89 శాతం మేర ఓటర్ల వివరాలను ఎలా ప్రచురించిందని నిలదీశారు. దీనిపై ఈసీ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. ముఖ్యమైన వ్యక్తులను సైతం చనిపోయిన జాబితాలో ఈసీ చేర్చిందన్నారు. ఇటువంటి ఉదాహరణలెన్నో ఉన్నాయని, వీటిపై ఈసీపై కేసు ఎందుకు నమోదు చేయకూడదు? అంటూ బెనర్జీ నిలదీశారు. మీరు ఎస్ఐఆర్తో గెలవాలనుకుంటే, ప్రజలు ఎఫ్ఐఆర్తో బదులిస్తారని ఆయన ఈసీనుద్దేశించి వ్యాఖ్యానించారు. బంగ్లాదేశ్తో సరిహద్దులు కలిగిన త్రిపుర, మేఘాలయ వంటి ఈశాన్య రాష్ట్రాల్లోనూ ఎస్ఐఆర్ ఎందుకు చేపట్టడం లేదని ఈసీని అడిగారు. -
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ శనివారం చారిత్రక గోల్కొండ కోటను సందర్శించారు (ఫొటోలు)
-
శ్రీశైలం మల్లన్న దర్శనం.. గొప్ప అనుభూతి
శ్రీశైలం టెంపుల్ : జ్యోతిర్లింగ స్వరూపుడైన మల్లికార్జున స్వామివారిని, శక్తి స్వరూపిణి అయిన భ్రమరాంబ అమ్మవారిని దర్శించుకోవడం తమ అదృష్టం, గొప్ప అనుభూతి అని భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ అన్నారు. శుక్రవారం భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారి దర్శనార్థం కుటుంబంతో కలిసి శ్రీశైలం చేరుకున్న ఆయనకు భ్రమరాంబ అతిథి గృహం వద్ద రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్, జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా, జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్, జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తీక్, ఆలయ కార్యనిర్వహణ అధికారి శ్రీనివాసరావు తదితరులు పుష్పగుచ్ఛాలు అందించి ఘనస్వాగతం పలికారు.అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారికి అభిషేకం, భ్రమరాంబదేవికి కుంకుమార్చన తదితర ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. అంతకముందు ఆయన మీడియాతో మాట్లాడుతూ ’ఆంధ్రప్రదేశ్ పౌరులకు నమస్కారం.. అందరూ బాగున్నారా’ అని తెలుగులో సంబోధించారు. శనివారం ఉదయం కూడా మరో సారి స్వామి అమ్మవార్లను భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ దంపతులు దర్శించుకుంటారని దేవస్థాన అధికారులు తెలిపారు.


