-
భారత్కు ట్రంప్ వాణిజ్య దెబ్బ
వాషింగ్టన్: భారత్కు కల్పించిన ప్రాధాన్య వాణిజ్య హోదా(జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్స్–జీఎస్పీ)ని ఈ జూన్ 5వ తేదీ నుంచి రద్దు చేస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. దాంతో ఈ హోదా కింద భారత్కు అమెరికా నుంచి అందుతున్న సుమారు రూ.39 వేల కోట్ల(560 కోట్ల డాలర్లు) విలువైన వాణిజ్య రాయితీలు రద్దవుతాయి. తన మార్కెట్లలోకి అమెరికా ఉత్పత్తులకు సమానమైన అవకాశం కల్పిస్తామని భారత్ హామీ ఇవ్వదని అమెరికా నిర్ధారణకు రావడంతో అమెరికా ఈ చర్య తీసుకుంది. వర్థమాన దేశాల ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా అమెరికా చాలా ఏళ్ల నుంచి ఈ జీఎస్పీ హోదా విధానాన్ని అమలు పరుస్తోంది. ఈ హోదా పొందిన దేశాల నుంచి అమెరికా ఎలాంటి సుంకాలు విధించకుండా వేలాది ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటుంది.‘భారత్ తన మార్కెట్లలో అమెరికాకు సమానమైన, సహేతుకమైన అవకాశం కల్పి స్తామని హామీ ఇవ్వదని నేను నిర్ధారణకొచ్చా. అందుకే భారత్కు కల్పించిన జీఎస్పీ హోదాను రద్దుచేస్తున్నాం’ అని ట్రంప్ అన్నారు. కాగా, తమకు జీఎస్పీ హోదాను రద్దు చేసినప్పటికీ ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాల బలోపేతానికి అమెరికాతో కలిసి పని చేస్తూనే ఉంటామని భారత్ పేర్కొంది. అమెరికా చర్యపై స్పందిస్తూ భారత వాణిజ్య మంత్రిత్వ శాఖ శనివారం ఒక ప్రకటన జారీ చేసింది. జీఎస్పీ హోదా కింద భారత్ దాదాపు 2వేల ఉత్పత్తులను అమెరికాకు ఎలాంటి సుంకాలు చెల్లించకుండా ఎగుమతి చేసేది. ఈ హోదా కింద అమెరికా 2017లో 570 కోట్ల డాలర్ల విలువైన ఉత్పత్తులను భారత్ నుంచి సుంకాలు లేకుండా దిగుమతి చేసుకుంది. హోదా పొందాలంటే అమెరికా కంపెనీలు, పౌరులకు అనుకూలంగా వచ్చే మధ్యవర్తిత్వ తీర్పులను గౌరవించడం, అంతర్జాతీయ గుర్తింపు పొందిన కార్మిక హక్కులను గౌరవించడం,మేథో హక్కులను పరిరక్షించడం, అమెరికా కంపెనీలకు సమానమైన, సహేతుకమైన అవకాశం కల్పించడం వంటి నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. -
జీఎస్పీ హోదా రద్దుపై మరో ఆలోచన లేదు
వాషింగ్టన్: ఇండియాకు ప్రాధాన్య వాణిజ్య హోదా (జీఎస్పీ)ని తొలగించే విషయంలో మరో ఆలోచన లేదనీ, ఇది ఇప్పటికే ముగిసిన అంశమని అమెరికా సీనియర్ అధికారి ఒకరు గురువారం చెప్పారు. అలాగే డేటాను భారత్ లోనే భద్రపరచాలన్న నిబంధన, ఇండియాలోని మార్కెట్కు అమెరికా కంపెనీలకు యాక్సెస్ కల్పించడం తదితర అంశాల్లో తమ అభ్యంతరాలకు భారత్ పరిష్కారం చూపాల్సిన అవసరం ఉందని కూడా ఆయన అన్నారు. జీఎస్పీ హోదా ఉన్న దేశాల నుంచి వచ్చే దాదాపు 2 వేల వేర్వేరు వస్తువులపై పన్ను విధించకుండానే అమెరికాలోకి దిగుమతి చేసుకుని, ఎగుమతి చేస్తున్న దేశాల ఆర్థికాభివృద్ధికి తోడ్పడటం కోసం ఈ జీఎస్పీ విధానాన్ని అమెరికా గతంలో తీసుకొచ్చింది. అయితే ఈ ఏడాది మార్చి 4న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓ ప్రకటన చేస్తూ, భారత్కు జీఎస్పీ హోదాను రద్దు చేసేందుకు తాము మొగ్గుచూపుతున్నట్లు తెలిపారు. 60 రోజుల నోటీస్ కాలం మే 3న ముగిసింది. దీంతో భారత్కు జీఎస్పీ హోదాను రద్దుచేస్తున్నట్లుగా ఇక ఏ క్షణమైనా అధికారిక నోటిఫికేషన్ను అమెరికా విడుదల చేయొచ్చు. -
‘ట్రంప్ నిర్ణయం ఎవరికి నష్టం?’
సాక్షి, న్యూఢిల్లీ : అమెరికా విదేశాల నుంచి దిగుమతి చేసుకునే సరకులపై సుంకం మినహాయింపు దేశాల (జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రివరెన్సెస్) జాబితా నుంచి టర్కీతోపాటు భారత్ పేరును కూడా తొలగించాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆ దేశాధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇటీవల ప్రకటించిన విషయం తెల్సిందే. ఈ నిర్ణయం వల్ల భారత దేశానికి ఎలాంటి నష్టం ఉంటుంది ? అలాంటి నిర్ణయం భారత్ కూడా తీసుకుంటే ఆ ప్రభావం అమెరికాపై ఎలా ఉంటుంది ? ఈ నిర్ణయాల వల్ల వాస్తవానికి ఎవరు నష్టపోతారు ? ఇరు దేశాల ప్రభుత్వాలా ? లేదా ఇరు దేశాల వినియోగదారుల ? అసలు అమెరికా ఈ నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? అందుకు దారి తీసిన పరిస్థితులు ఏమిటీ? అమెరికా సుంకం మినహాయింపు జాబితా కింద భారత దేశం నుంచి 1500 రకాల సరకుల దిగుమతులపై సుంకం విధించడం లేదు. అంటే ఎలాంటి సుంకం చెల్లించకుండానే భారత వ్యాపారులు ఆ వస్తువులను అమెరికాలో విక్రయించుకోవచ్చు. భారత్ ఎగుమతి చేస్తున్న సరకుల్లో మధుబని ప్రింట్లు, టీ షర్టుల నుంచి ఉక్కు వరకు ఉంది. అయితే ఉక్కుపైన పరిమితి పన్ను ఉంది. ఇందుకు బదులుగా అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్న సోయాబిన్, ఆల్మండ్స్ నుంచి ఖరీదైన బైకుల వరకు భారత ప్రభుత్వం పన్ను మినహాయింపులు ఇస్తోంది. సుంకం మినహాయింపు కింద భారత్ 2017–18 ఆర్థిక సంవత్సరం నుంచి 560 కోట్ల డాలర్ల సరకులను అమెరికాకు ఎగుమతి చేసింది. వీటిపై 19 కోట్ల డాలర్ల సుంకం మినహాయింపు లభించింది. వాస్తవానికి 2017–18, నుంచి 2018–19 ఆర్థిక సంవత్సరాల్లో (2018, డిసెంబర్ వరకు) భారత్ దాదాపు 8,700 కోట్ల డాలర్ల విలువైన సరకులను అమెరికాకు ఎగుమతి చేసింది. దాంతో పోల్చుకుంటే సుంకం మినహాయింపు కింద ఎగుమతి చేసిన సరకుల విలువ చాలా తక్కువ. అమెరికా ఈ రెండు ఆర్థిక సంవత్సరాల్లో భారత్కు దిగుమతి చేసిన సరకుల విలువ దాదాపు 5,300 కోట్ల డాలర్ల మాత్రమే. గత జూన్ నుంచే భారత్ బెదిరింపులు భారత్ కొత్త సుంకం విధానం కింద అమెరికా నుంచి దిగుమతి చేసుకునే 30 సరకులపై సుంకం మినహాయింపు ఇస్తోంది. వీటిపై కూడా సుంకాలను విధిస్తామని గత జూన్ నెల నుంచే అమెరికాను భారత్ హెచ్చరిస్తూ వస్తోంది. అంతకుముందే అమెరికా నుంచి పాల ఉత్పత్తుల దిగమతిని భారత్ నిషేధించింది. కారణం, అమెరికాలోని ఆవులు మాంసాహారాన్ని తింటాయి కనుక. ఇందుకు ప్రతీకారంగా గుండె రక్తనాళాల్లో అమర్చే స్టెంటుల దిగుమతిపై టారిఫ్లను పెంచుతామని అమెరికా హెచ్చరించింది. టారిఫ్లు తక్కువగా ఉండడం వల్లనే మోదీ ప్రభుత్వం స్టెంట్ల ధరలపై నియంత్రణ ధరలను తీసుకొచ్చింది. అయితే అమెరికా ఇప్పటి వరకు వీటిపై సుంకం టారిఫ్లను పెంచలేదు. 800 సీసీ పైనున్న టూ వీలర్స్, ముఖ్యంగా హార్లీ డేవిడ్సన్ వాహనాలపై భారత్ అధిక సుంకం విధించడం పట్ల ట్రంప్ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేయడంతో భారత్ వాటిని తగ్గించింది. ఈ-వాణిజ్యంలో కూడా ఇరు దేశాల మధ్య మినహాయింపులు కేవలం సరకుల ఎగుమతులు, దిగుమతులకే పరిమితం కాలేదు. ఈ-వాణిజ్యంలో కూడా మినహాయింపులు ఉన్నాయి. అమెరికాలో ఈ-వాణిజ్య నిబంధనలను సవరించిన కారణంగానే అమెజాన్, వాల్మార్ట్ కంపెనీలు భారత్లో రిటేల్ వ్యాపారాన్ని నిర్వహించ కలుగుతున్నాయి. అయితే ఇలాంటి విదేశీ సంస్థలపై భారత్ ఆంక్షలు విధించింది. విదేశీ ఈ రిటేలర్లు ‘ఇన్వెంటరీ మోడల్’ లో సరకులను అమ్మరాదు. అంటే ముందుగా ఆర్డర్లు తీసుకొని వాటిని ఉత్పత్తి చేసి ఆ తర్వాత సరఫరా చేయడం చేయరాదు. రెడీగా ఉన్న సరకులను అమ్మాలి. రిలయెన్స్ లాంటి భారతీయ రిటేలర్స్ రెడీగా ఉన్న ఉత్పత్తులను అమ్మవచ్చు. ఇన్వెంటరీ పద్ధతిలో సరకులను సరఫరా చేయవచ్చు. భారత్ తాము ఎగుమతి చేస్తున్న ఉక్కుపై మరింత టారిఫ్ను తగ్గించాలని ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తోంది. ఇలా దేశాల మధ్య మార్కెట్ యుద్ధం ఎంతో కాలం నుంచి నడుస్తోంది. మనకే నష్టం ఎక్కువ అమెరికా ఎలాగు నిర్ణయం తీసుకున్నది కనుక, అలాంటి నిర్ణయం భారత్కూడా తీసుకొని అమెరికా దిగుమతి ఉత్పత్తులపై సుంకం విధించాల్సి వస్తుంది. మనమే అమెరికాతో ఎక్కువ ఎగుమతి వ్యాపారం చేస్తున్నాం కనుక మనమే ఎక్కువ నష్టపోవాల్సి వస్తోంది. ముఖ్యంగా స్టీల్ ఎగుమతి పడిపోయే ప్రమాదం ఉంది. పరస్పర సుంకాల వల్ల ప్రభుత్వ ఖజానాలకు పెద్ద నష్టం వాటిల్లక పోవచ్చు. కానీ వినియోగదారులు ఎక్కువ ధరలు పెట్టి సరకులను కొనాల్సి వస్తుంది కనుక వాళ్ల జేబులకు చిల్లులు పడుతాయి. అమెరికా అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగి ఉంది, అక్కడి వినియోగదారులకు ఆదాయం ఎక్కువ. అలా చూసినా భారత వినియోగదారులే ఎక్కువ నష్ట పోవాల్సి వస్తోంది. స్వేచ్ఛా వాణిజ్యం పేరిట ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల మధ్య ఇలా ఇచ్చి పుచ్చుకునే రాయతీలు కొనసాగడం వల్లనే గత 30 ఏళ్లల్లో ప్రపంచ స్థూల ఉత్పత్తి రేటు ఊహించనంతగా పెరిగిందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. -
మా సుంకాలు తక్కువే...!
న్యూఢిల్లీ: భారత్ భారీగా దిగుమతి సుంకాలు విధిస్తోందన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపణలను కేంద్రం తోసిపుచ్చింది. ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) నిబంధనలకు అనుగుణంగానే భారత్ సుంకాలు ఉంటున్నాయని స్పష్టం చేసింది. ‘అధిక టారిఫ్లు విధిస్తున్నామన్న ఆరోపణలను అంగీకరించబోము. దిగుమతి సుంకాలు డబ్ల్యూటీవో నిర్దేశిత శ్రేణిలోనే ఉన్నాయి. కొన్ని వర్ధమాన దేశాలు, సంపన్న ఎకానమీల స్థాయిలోనే ఉన్నాయి‘ అని కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి అనూప్ వాధ్వాన్ మంగళవారమిక్కడ విలేకరులకు చెప్పారు. అదే సమయంలో ఏవో కొన్ని ఉత్పత్తులపై మాత్రమే కొంత అధిక టారిఫ్లు ఉండొచ్చని, అయితే అన్ని దేశాల్లోనూ ఇలాంటివి సాధారణమేనని వాణిజ్య శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. హార్లే డేవిడ్సన్ బైక్స్ వంటి అమెరికన్ ఉత్పత్తులపై భారీగా దిగుమతి సుంకాలు విధిస్తున్న భారత్ .. ఒకరకంగా ’టారిఫ్ల రాజా’ అంటూ ట్రంప్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అనూప్ వాధ్వాన్ వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది. జీఎస్పీ ప్రయోజనాలు కొంతే.. వాణిజ్యంలో భారత్కి ఇస్తున్న ప్రాధాన్యతాపరమైన ప్రయోజనాలను ఉపసంహరించాలన్న అమెరికా ప్రతిపాదనతో ఎగుమతులపై పెద్దగా ప్రభావమేమీ ఉండబోదని అనూప్ వాధ్వాన్ వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించి సాధారణ ప్రాధాన్య వ్యవస్థ (జీఎస్పీ) కింద భారత్ గతేడాది 5.6 బిలియన్ డాలర్ల మేర ఎగుమతులు చేసినప్పటికీ, ప్రాధాన్యతా హోదాపరంగా ఒనగూరిన ప్రయోజనాలు సుమారు 190 మిలియన్ డాలర్లు మాత్రమేనని ఆయన∙చెప్పారు. అమెరికా కోరుతున్న మేరకు విస్తృతమైన వాణిజ్య ప్యాకేజీపై భారత్ కసరత్తు చేస్తున్నప్పటికీ.. ఆ దేశం జీఎస్పీని ఉపసంహరించాలని నిర్ణయించుకుందని అనూప్ చెప్పారు. ఈ ప్యాకేజీలో మెడికల్ డివైజ్లు, డెయిరీ ఉత్పత్తులు, వ్యవసాయ ఉత్పత్తులు మొదలైనవన్నీ ఉన్నాయన్నారు. అమెరికా డిమాండ్లపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని, అయితే ప్రజా ఆరోగ్యంతో ముడిపడి ఉన్న విషయాల్లో మాత్రం రాజీపడే ప్రసక్తే లేదని అనూప్ వాధ్వాన్ స్పష్టం చేశారు. ఆయా రంగాలకు ప్రభుత్వం తోడ్పాటునివ్వాలి: ఎఫ్ఐఈవో జీఎస్పీ ప్రయోజనాలు ఒక్క శాతం నుంచి ఆరు శాతం శ్రేణిలోనే ఉంటున్నాయని, దీన్ని తొలగించినంత మాత్రాన ఎగుమతులపై పెద్దగా ప్రతికూల ప్రభావమేమీ పడదని ఎగుమతి సంస్థల సమాఖ్య (ఎఫ్ఐఈవో) వ్యాఖ్యానించింది. అయితే, కొంత అధిక ప్రయోజనాలు పొందుతున్న రంగాలకు ఒకవేళ జీఎస్పీ తొలగించిన పక్షంలో ప్రభుత్వం కొంత మేర తోడ్పాటునివ్వాలని ఎఫ్ఐఈవో ప్రెసిడెంట్ గణేష్ కుమార్ గుప్తా చెప్పారు. బిల్డింగ్ మెటీరియల్, టైల్స్, చేతి పనిముట్లు (స్పానర్లు, డ్రిల్లింగ్ పరికరాలు), ఇంజనీరింగ్ ఉత్పత్తులు, టర్బైన్స్, సైకిళ్లు మొదలైన ఉత్పత్తుల ఎగుమతులకు జీఎస్పీపరమైన ప్రయోజనాలు ఉంటున్నాయి. మినహాయింపులు ఎత్తివేస్తే.. వాటి ధరలు పెంచాల్సి రావడం వల్ల దేశీ సంస్థలు అంతర్జాతీయంగా పోటీపడలేని పరిస్థితి నెలకొంటుందని గుప్తా చెప్పారు. తగ్గుతున్న వాణిజ్య లోటు.. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 2016–17లో 64.5 బిలియన్ డాలర్లుగా ఉండగా.. 2017–18లో 74.5 బి. డాలర్ల స్థాయికి చేరింది. అమెరికా నుంచి చమురు, గ్యాస్, బొగ్గు తదితర ఉత్పత్తుల కొనుగోళ్లను పెంచిన నేపథ్యంలో భారత్తో అగ్రరాజ్యం వాణిజ్య లోటు 2017, 2018లో గణనీయంగా తగ్గినట్లు కేంద్ర వాణిజ్య శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ‘గతేడాది వాణిజ్య లోటు పరిమాణం దాదాపు 4 బి. డాలర్లు తగ్గింది. భారత్లో ఇంధనానికి, పౌర విమానాలకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఇది మరింతగా తగ్గుతుంది. అమెజాన్, ఉబెర్, గూగుల్, ఫేస్బుక్ వంటి అమెరికన్ ఈ–కామర్స్, సర్వీసుల కంపెనీలు భారత మార్కెట్లో భారీగా అవకాశాలు అందిపుచ్చుకుంటున్నాయి‘ అని పేర్కొంది. ఇక, కొన్ని ఐటీ ఉత్పత్తులపై దిగుమతి సుంకాలు తగ్గించాలన్న అమెరికా డిమాండ్పై స్పందిస్తూ.. ప్రస్తుతం టారిఫ్లు ఒక మోస్తరు స్థాయిలోనే ఉన్నాయని, దిగుమతులను నిలిపివేసేంత భారీగా లేవని స్పష్టం చేసింది. జీఎస్పీ వివాదమిదీ.. జీఎస్పీ కింద వాణిజ్యానికి సంబంధించి అమెరికా ప్రాధాన్యమిస్తున్న వర్ధమాన దేశాల్లో భారత్ కూడా ఒకటి. దీని కింద అమెరికా మార్కెట్లోకి ఎలాంటి సుంకాలు లేకుండా కొన్ని ఉత్పత్తులను ఎగుమతి చేసేందుకు భారత్కు వీలు ఉంటోంది. సాధారణంగా 3,700 ఉత్పత్తులకు జీఎస్పీ ప్రయోజనాలు పొందే అవకాశం ఉన్నప్పటికీ.. భారత్ 1,900 ఉత్పత్తులు (రసాయనాలు మొదలైనవి) మాత్రమే ఎగుమతి చేస్తోంది. అయితే, జీఎస్పీ హోదా ఇస్తున్నప్పటికీ.. ప్రతిగా భారత మార్కెట్లో తమకు సముచిత, సమానమైన అవకాశాలు లభించడం లేదంటూ అమెరికా భావిస్తోంది. దేశీయంగా స్టెంట్లు మొదలైన మెడికల్ డివైజ్ల రేట్లు భారీగా ఉండటంతో.. ధరలపై పరిమితులు విధించాలన్న భారత నిర్ణయంపై అమెరికన్ కంపెనీలు అభ్యంతరాలు వ్యక్తం చేయడం వంటివి దీనికి కారణం. డెయిరీ, మెడికల్ డివైజ్ల తయారీ సంస్థల నుంచి ఫిర్యాదులు రావడంతో .. భారత్కి ఇస్తున్న జీఎస్పీ ప్రయోజనాలపై 2018 ఏప్రిల్లో అమెరికా పునఃసమీక్ష ప్రారంభించింది. ఆ తర్వాత సమీక్ష పరిధిలోకి ఐటీ ఉత్పత్తులు, వ్యవసాయోత్పత్తులు మొదలైన వాటన్నింటినీ చేర్చింది. చివరికి భారత్కి ఇస్తున్న జీఎస్పీని ఉపసంహరించాలని అమెరికా నిర్ణయించింది. భారత్తో పాటు టర్కీకి కూడా దీన్ని వర్తింపచేయాలని నిర్ణయం తీసుకుంది. అమెరికన్ కాంగ్రెస్, భారత ప్రభుత్వం నోటిఫికేషన్స్ ఇచ్చిన తర్వాత 60 రోజుల్లో అమల్లోకి రావొచ్చని అమెరికా వాణిజ్య ప్రతినిధి కార్యాలయం యూఎస్టీఆర్వో) వెల్లడించింది. -
ప్రాధాన్యహోదా తొలగిస్తాం
వాషింగ్టన్/న్యూఢిల్లీ: భారత్కు వాణిజ్య ప్రాధాన్య హోదా (జీఎస్పీ)ను త్వరలో తొలగించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఈ మేరకు ఆయన అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్కు లేఖ అందజేశారు. అమెరికా కాంగ్రెస్, భారత ప్రభుత్వానికి దీనిపై నోటిఫికేషన్ ఇచ్చిన 60 రోజుల్లో అమల్లోకి వస్తుంది. ట్రంప్ నిర్ణయం ఎలాంటి ప్రభావం చూపనుందనే విషయం ఇప్పుడు భారత్లో చర్చనీయాంశమైంది. అమెరికాకు మన దేశం ఎలాంటి సుంకం చెల్లించకుండా ఏడాదికి రూ.39 వేల కోట్ల విలువైన వస్తువుల్ని ఎగుమతి చేస్తోంది. జీఎస్పీ హోదా తొలగిస్తే మనం ఆ వస్తువుల ఎగుమతికి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అమెరికా వాణిజ్య లోటును తగ్గించే ప్రయత్నాల్లో భాగంగా ట్రంప్ భారత్ వస్తువులపై సుంకాలు విధిస్తామని గతంలో పలుమార్లు హెచ్చరించారు. ఇప్పుడు ఏకంగా వాణిజ్య ప్రాధాన్య హోదాను తొలగించడానికే సిద్ధమయ్యారు. అయితే, దీని వల్ల మనకు వచ్చిన నష్టమేమీ లేదని వాణిజ్య శాఖ కార్యదర్శి అనూప్ వాద్వాన్ అంటున్నారు. జీఎస్పీ కింద భారత్ రూ.39 వేల కోట్ల విలువైన వస్తువుల్ని ఎగుమతి చేస్తే, ఏడాదికి సుమారు రూ.13 వేల కోట్ల ప్రయోజనం కలుగుతోందని ఆయన చెప్పారు. హోదా తొలగింపు రెండు దేశాల మధ్య వాణిజ్య సంబం«ధాలపై కూడా పెద్దగా ప్రభావం చూపించదని అనూప్ అభిప్రాయపడ్డారు. ఏమిటీ వాణిజ్య ప్రాధాన్య హోదా? అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వాణిజ్య కార్యకలాపాలను ప్రోత్సహించడం కోసం జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ (జీఎస్పీ)ను 1976లో అమెరికా రూపొందించింది. దీని ప్రకారం 129 అభివృద్ధి చెందుతున్న దేశాలను గుర్తించి ఆయా దేశాల నుంచి ఎగుమతి అయ్యే 4,800 రకాల ఉత్పత్తులకు సుంకాలు విధించరాదని నిర్ణయించింది. 1974 వాణిజ్య చట్టం విధివిధానాలకు అనుగుణంగా 1976లో ఈ వాణిజ్య హోదాను ప్రవేశపెట్టింది. ఈ హోదా ద్వారా ఎక్కువ లబ్ధి పొందిన దేశాల్లో భారత్ కూడా ఒకటి. ప్రస్తుతం ప్రతీ ఏడాది 2 వేల రకాల వస్తువుల్ని మనం ఎలాంటి పన్నులు లేకుండా అమెరికాకు ఎగుమతి చేస్తున్నాం. అమెరికా విధివిధానాల ప్రకారం వాణిజ్య హోదా అనుభవిస్తున్న దేశం తమ దేశీయ మార్కెట్లలో అమెరికా సులభంగా ప్రవేశించడానికి కూడా వీలు కల్పించాలి. కానీ, భారత్ అలాంటి సూత్రాలు పాటించకుండా అమెరికా ఎగుమతులపై అధికంగా పన్నులు విధిస్తోందని ట్రంప్ అధ్యక్షుడయ్యాక ఆరోపణలు చేస్తున్నారు. కొన్నిటి ధరల నియంత్రణ ఎత్తేయాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
టీ20 వరల్డ్కప్కు ఐర్లాండ్ జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే?
మరో కుటుంబాన్ని ఆదుకున్న స్టార్ హీరో.. వీడియో వైరల్!
ఢిల్లీ బ్యాటర్లు ఊచ కోత.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్
రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాము: కాంగ్రెస్ నేత పవన్ ఖేరా
బాహుబలి కేవలం 10 కోట్ల మంది మాత్రమే: రాజమౌళి కామెంట్స్
బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
తెలంగాణను అసమర్థులు ఏలుతున్నారు: కేసీఆర్
క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
నెల ముందే ప్రమోషన్.. ఇప్పుడు జాబ్ పోయింది: అగ్రరాజ్యంలో టెకీ ఆవేదన
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement