breaking news
green fodder
-
పాడికి ఆధారం పచ్చిమేతే!
పాడి-పంట కడప అగ్రికల్చర్: పాడికి ఆధారం పచ్చిమేతే అన్నారు పెద్దలు. పచ్చిమేత లేనిదే పాడి లాభసాటి కాదు. కేవలం చొప్ప పైన మాత్రమే ఆధారపడితే ప్రయోజనం ఉండ దు. పచ్చిమేత మేపితే పశువులు ఆరోగ్యంగా ఉంటా యి. సకాలంలో ఎదకు వచ్చి చూలు కడతాయి. పాల ఉత్పత్తి కూడా పెరుగుతుంది. అయితే ఒక్క వర్షాకాలం లో మినహా మిగిలిన అన్ని కాలాలలోనూ పాడి రైతులు తగినంత పశుగ్రాసం లభించక ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. దీనికి కారణం... పాడి పశువులకు కావాల్సిన పచ్చిమేతలో కేవలం మూడో వంతు మాత్రమే అందుబాటులో ఉండడం. ఈ పరిస్థితిని అధిగమించాలంటే రైతు లు విధిగా పశుగ్రాస పైర్లు వేసుకోవాలి. ప్రస్తుతం అడపాదడపా కురుస్తున్న వర్షాలు పశుగ్రాసాల సాగుకు అనువుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో పచ్చిమేతల సాగుపై వైఎస్ఆర్ జిల్లా పశు గణాభివృద్ధి శాఖ అసిస్టెంట్ డెరైక్టర్ డాక్టర్ హేమంత్ కుమార్ అందిస్తున్న సూచనలు... ఎలా ఉండాలి? మనం పండించే పశుగ్రాస పైరు రుచికరంగా, ఎక్కువ మాంసకృత్తులను కలిగి ఉండాలి. పశువులకు ఏ మాత్రం హాని కలిగించకుం డా, సులభంగా జీర్ణం కావాలి. తక్కువ కాలంలో, ఎక్కువ దిగుబడిని ఇవ్వగలగాలి. ఎరువుల అవసరం తక్కువ ఉండే పశుగ్రాసాన్ని ఎంచుకోవాలి. కోసిన తర్వాత నిల్వకు అనువుగా ఉండాలి. పశుగ్రాసాలు రెండు రకాలు. అవి ధాన్యపు జాతి పశుగ్రాసాలు, కాయ జాతి పశుగ్రాసాలు. ధాన్యపు జాతి పశుగ్రాసాల్లో పిండి పదార్థాలు, కాయ జాతి పశుగ్రాసాల్లో మాంసకృత్తులు ఎక్కువగా ఉంటాయి. పంటకాలాన్ని బట్టి పశుగ్రాసాలను ఏక వార్షికాలు, బహు వార్షికాలుగా విభజించారు. రైతులు తమకు అనువైన పశుగ్రాసాన్ని ఎంచుకొని సాగు చేయాలి. ఇవి ధాన్యపు జాతి పచ్చిమేతలు మొక్కజొన్న, సజ్జ వంటివి ధాన్యపు జాతికి చెందిన ఏక వార్షిక పచ్చిమేతలు. మొక్కజొన్న పైరు రుచికరంగా, ఎక్కువ పోషకాలను కలిగి ఉంటుంది. ఎకరానికి 16-20 కిలోల విత్తనాలు వేసుకుంటే 70 రోజులకు 12-16 టన్నుల గ్రాసాన్ని ఇస్తుంది. అధిక పాల ఉత్పత్తి పొందడానికి, సైలేజీ (పాతర గడ్డి)కి బాగా అనువుగా ఉంటుంది. సజ్జను పశుగ్రాసంగా సాగు చేయాలనుకుంటే ఎకరానికి 5 కిలోల విత్తనాలు కావాలి. ఇందులో అలసంద, పిల్లిపెసరను కూడా మిశ్రమ పంటగా వేసుకోవచ్చు. ఈ పైరు 40 రోజులలో కోతకు వస్తుంది. 10-12 టన్నుల దిగుబడి ఇస్తుంది. బెట్ట పరిస్థితులను తట్టుకొని మంచి దిగుబడులను అందిస్తుంది. కాయ జాతి పచ్చిమేతలు ఇవే పిల్లిపెసర, లూసర్న్ గడ్డి, అలసంద వంటివి కాయ జాతి పచ్చిమేతలు. పిల్లిపెసర సాగుకు ఎకరానికి 10 కిలోల విత్తనాలు అవసరమవుతాయి. ఇది బలవర్ధకమైన పశుగ్రాసం. పాల దిగుబడి బాగుంటుంది. 50 రోజులకు ఒకసారి చొప్పున రెండు కోతలు తీసుకోవచ్చు. 8-10 టన్నుల పచ్చిమేత వస్తుంది.లూసర్న్ గడ్డి మొక్క 80 సెంటీమీటర్ల ఎత్తు వరకూ పెరుగుతుంది. ఎకరానికి 3-5 కిలోల విత్తనాలు అవసరమవుతాయి. 50 రోజులకు ఒకసారి చొప్పున ఐదు కోతలు తీసుకోవచ్చు. 8-10 టన్నుల దిగుబడి వస్తుంది. ఇక అలసంద మొక్కలోని అన్ని భాగాలూ పశువులు తినడానికి ఉపయోగపడేవే. ఎకరానికి 12-15 కిలోల విత్తనాలు వేసుకుంటే 65 రోజుల్లో కోతకు వచ్చి 6-8 టన్నుల గ్రాసాన్ని అందిస్తుంది. మిశ్రమ పంటగా వేస్తే 6 కిలోల విత్తనాలు సరిపోతాయి. ఇవి కూడా... మెట్ట/బంజరు భూములకు అనువైన పశుగ్రాసం అంజన్ గడ్డి. ఇది నల్లరేగడి భూముల్లో ఎక్కువగా పెరుగుతుంది. ఎకరానికి 2- 3 కిలోల విత్తనాలు సరిపోతాయి. పైరు వేసిన 80 రోజులకు మొ దటి కోత కోసుకోవచ్చు. ఆ తర్వాత ప్రతి 60 రోజులకూ పచ్చిమేతను పొందవచ్చు. ఈ పైరు 15-20 టన్నుల పచ్చిమేతను అం దిస్తుంది. మాగాణి, మెట్ట ప్రాంతాలకు అనువైన పశుగ్రాసపు చెట్టు అవిశ. దీని ఆకులు, కొమ్మలు పశువులకు మంచి పోషకాల తో కూడిన ఆహారాన్ని ఇస్తాయి. ఎకరానికి 5 వేల మొక్కలు నాటా లి. 60 రోజులకు ఒకసారి చొప్పున 8 సార్లు ఆకులు, కొమ్మలు కోసుకోవచ్చు. ఎకరానికి 15-20 టన్నుల దిగుబడి లభిస్తుంది. ఇక సుబాబుల్ చెట్టు ఆకులే కాకుండా కొమ్మలను కూడా పశువులు ఇష్టంగా తింటాయి. ఎకరానికి 2-4 వేల మొక్కలు వేసుకోవాలి. ఆరు నెలలకు మొదటి కోత తీసుకోవచ్చు. అనంతరం 60 రోజులకు ఒకసారి చొప్పున 6 కోతలు కోసుకోవచ్చు. 15-20 టన్నుల దిగుబడి వస్తుంది. ఏ పశుగ్రాసమైనా దానిని ఛాప్ కట్టర్తో చిన్న చిన్న ముక్కలుగా కోసి పశువులకు వేస్తే వృథా కాదు. పచ్చిమేతపై కొద్దిగా బెల్లపు నీటిని చల్లితే పశువులు ఇష్టంగా తింటాయి. -
పాలిహౌస్లో పచ్చిమేత!
150 చదరపు అడుగుల్లోనే 10 పశువులకు గడ్డి సాగు పాలకు పచ్చిమేతకు అవినాభావ సంబంధం ఉంది. పాల దిగుబడి బాగుండాలంటే పాడి పశువులకు రోజూ పచ్చిమేత మేపాల్సిందే. ముఖ్యంగా వేసవిలో పచ్చిమేత అవసరం మరీ ఎక్కువ. పచ్చిమేతను ఏడాది పొడవునా సమకూర్చుకునే క్రమంలో పాడి రైతులు ఎన్నో వ్యయ ప్రయాసల పాలవుతుంటారు. ఈ ఇక్కట్ల నుంచి గట్టెక్కించే మార్గం వెదికే కృషిలో ఓ యువ పాడి రైతు సఫలీకృతుడయ్యాడు. అతి తక్కువ స్థలంలో, తక్కువ నీటితో నాణ్యమైన సేంద్రియ పశుగ్రాసాన్ని.. ఏడాది పొడవునా, సులభంగా పెంచవచ్చని నిరూపిస్తున్నారు నలమాటి రామారావు. తూర్పు గోదావరి జిల్లా మండపేట మండలం ఏడిద వాస్తవ్యులైన రామారావు ఆధునిక హైడ్రోపోనిక్ పద్ధతికి తన వినూత్న ఆలోచనను జోడించి.. చిన్న రైతులకు అనుసరణీయమైన రీతిలో సులభంగా పశుగ్రాసం సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఎమ్మెస్సీ ఎనలిటిక్ కెమిస్ట్రీ చదివి డెయిరీ ఫారం నిర్వహిస్తున్న క్రమంలో ఎదురైన ఇబ్బందులే ఆయనను పశుగ్రాసం సాగులో ప్రయోగాల దిశగా అడుగులు వేయించాయి. పాడి పశువులతోపాటు మేకలు, గొర్రెలకూ వేయొచ్చు.. స్వగ్రామంలోనే రామారావు 30 పశువులతో డెయిరీ ఫారాన్ని నిర్వహిస్తున్నారు. పచ్చిమేత కోసం గతంలో మూడున్నర ఎకరాల విస్తీర్ణంలో పశుగ్రాసం పెంచేవారు. కూలీల కొరత, నీటి కొరత.. ఒకటేమిటి నిత్యం ఇబ్బందులు ఎదురయ్యేవి. ఈ సమస్యలను అధిగమించేందుకు ప్రారంభించిన అన్వేషణలో ఇంటర్నెట్ ద్వారా ‘హైడ్రోపోనిక్’ విధానం గురించి తెలుసుకున్నారు. దీనికి స్వదేశీ సాంకేతికతను జోడించి ప్రయోగాలు చేశారు. ఆయన కృషి చక్కని ఫలితాలనిచ్చింది. పిడికెడు కూడా మట్టి అవసరం లేకుండా, ఎరువుల ఖర్చు లేకుండా, తక్కువ నీటితో ట్రేలలో నాణ్యమైన సేంద్రియ పశుగ్రాసాన్ని పెంచుతున్నారు రామారావు. వరి, మొక్కజొన్న, గోధుమ, సజ్జ, రాగులు, పిల్లి పెసర, అలసంద, శనగ తదితర పది రకాల ధాన్యపు జాతి, గడ్డి జాతి పశుగ్రాసాలను సాగు చేస్తున్నారు. పాడి పశువులతో పాటు మేకలు, గొర్రెలు, గుర్రాలు వంటి పశువులకూ ఇలా పెంచిన పచ్చిమేతను మేపుకోవచ్చనేది ఆయన భావన. ప్రత్యేక ప్లాస్టిక్ ట్రేలలోనే పెంచాలి! రామారావు సొంత మేడపైన 275 చదరపు అడుగుల విస్తీర్ణంలో పాలిహౌస్ను ఏర్పాటు చేసుకొని పశుగ్రాసం సాగు చేస్తున్నారు. ఇనుప ర్యాక్లలో యూవీ స్టెరిలైజ్డ్ మెటీరియల్తో తయారు చేసిన ప్రత్యేక బ్యాక్టీరియా రహిత ట్రేలను ఏర్పాటు చేశారు. విత్తనాలను రెండు రోజులు నీటిలో నానబెట్టి, మొలకలు వచ్చిన తర్వాత ట్రేలలో నింపుతున్నారు. తగిన ఉష్ణోగ్రత, తేమ తగ్గినప్పుడల్లా సూక్ష్మపోషకాలతో కూడిన ప్రత్యేక ద్రావణాన్ని కలిపిన నీటిని పిచికారీ చేసేలా ఆటోమేటిక్ వ్యవస్థను ఏర్పాటు చేయడం విశేషం. రామారావే స్వయంగా ఈ ద్రావణాన్ని తయారు చేశారు. దీంతో, వారం రోజుల్లో నవనవలాడే పచ్చని పశుగ్రాసం పెరుగుతోంది. ఈ పద్ధతిలో పచ్చిగడ్డిని పాలిహౌస్లోనే పెంచాలనేమీ లేదని, కొన్ని జాగ్రత్తలు పాటిస్తే రేకుల షెడ్లలోనూ పెంచుకోవచ్చని రామారావు చెబుతున్నారు. ఒకటి నుంచి ఎన్ని ఎక్కువ పాడి పశువులున్న రైతులకైనా ఇది ఎంతో ఉపకరిస్తుందన్నారు. సాధారణ పచ్చిమేతలో ఉండే పోషకాల కన్నా ఈ విధానంలో పెంచిన పచ్చిగడ్డిలో అధిక పోషక విలువలున్నట్టు తమ లేబరేటరీ పరీక్షల్లో తేలిందన్నారు. పశుగ్రాసం పెంచుతున్న పాలిహౌస్ను రాష్ట్ర పశుసంవర్ధక శాఖ డెరైక్టర్ డా. డి.వెంకటేశ్వర్లు, పాడి పరిశ్రమ ప్రముఖులు ఇటీవల పరిశీలించి రామారావును అభినందించడం విశేషం. - పెనుబోతుల విజయకుమార్, న్యూస్లైన్, మండపేట, తూ.గో. జిల్లా 20% వరకు పెరిగిన పాల దిగుబడి - మేడపైన లోకాస్ట్ పాలిహౌస్లో హైడ్రోపోనిక్ పద్ధతిలో పచ్చిగడ్డి సాగుకు శ్రీకారం - తేమ, ఉష్ణోగ్రతను బట్టి నీటిని పిచికారీ చేసే - ఆటోమేటిక్ వ్యవస్థ ఏర్పాటు - పొలం, ఎరువులు అక్కర్లేదు.. 50 పశువులకు ఒక కూలీ చాలు! నిరంతరాయంగా పచ్చిగడ్డి సాగుకు అనువైన పద్ధతి పాడి రైతుల సమస్యల పరిష్కారం కోసమే ఈ ప్రయోగం చేపట్టి, రెండున్నరేళ్ల తర్వాత విజయం సాధించా. పోషకాలతో కూడిన పచ్చిగడ్డిని ట్రేలలో పెంచేందుకు సూక్ష్మపోషకాలతో కూడిన ప్రత్యేక ద్రావణాన్ని రూపొందించా. పేటెంట్ కోసం దరఖాస్తు చేస్తున్నా. 4 నెలలుగా ఈ పచ్చిగడ్డినే మా పశువులకు మేపుతున్నాం. పాల దిగుబడి గేదెల్లో 12%, ఆవుల్లో 20% పెరిగింది. గేదె పాలలో వెన్న 15% పెరిగింది. ఎటువంటి రసాయనాలూ వాడకుండా పూర్తిగా సేంద్రియంగా, ఏడాది పొడవునా నిరంతరాయంగా పశుగ్రాసం సాగుకు ఇది అనువైన పద్ధతి. - నలమాటి రామారావు(85199 90000), ఏడిద, మండపేట మండలం, తూర్పు గోదావరి జిల్లా ఇది ఉత్తమ ప్రత్యామ్నాయం.. పశుగ్రాసాల పెంపకానికి స్థలం, తగిన వసతి లేని చోట ప్రత్యామ్నాయంగా ఈ విధానం ఎంతో ఉత్తమం. ఉత్పత్తి వ్యయాన్ని ఇంకా తగ్గించగలిగితే మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. - కె.గాబ్రియేల్, ప్రిన్సిపాల్, పశుసంవర్ధక శాఖ శిక్షణ కేంద్రం, మండపేట ఇవీ ప్రత్యేకతలు...! పాలిచ్చే పశువుకు రోజుకు 30 కేజీల సాధారణ పచ్చిగడ్డి అవసరం. హైడ్రోపోనిక్ పద్ధతిలో పెంచిన పచ్చిమేత 10 కిలోలు చాలు. దీన్ని 20 కేజీలు వేస్తే ఇక దాణా అక్కర్లేదు. అయితే, ఎలా పెంచిన పచ్చిగడ్డి వేసినా.. ప్రతి పశువుకు రోజుకు 6 కిలోల ఎండుగడ్డి కూడా వేయడం అవసరం. - 10 పాడి పశువులకు సరిపోయే పచ్చిగడ్డి పెంచడానికి సాధారణంగా ఎకరం పొలం అవసరం. ఈ పద్ధతిలో 150 చదరపు అడుగుల స్థలం సరిపోతుంది. - ఒక్కో పాడి పశువుకు పొలంలో పచ్చిగడ్డి సాగుకు రూ. 110-150 ఖర్చవుతుంది. ఈ పద్ధతిలో రూ. 70-90 ఖర్చవుతుంది. - పొలంలో కిలో పచ్చిగడ్డి సాగుకు 80 లీటర్ల నీరు ఖర్చవుతుంది. ఈ పద్ధతిలో రెండు లీటర్లు చాలు. - 10 పశువులకు పొలంలో గడ్డి కోసి వేయడానికి ఒక కూలీ అవసరం. ఈ పద్ధతిలో 50 పశువులకు ఒక కూలీ చాలు. - హైడ్రోపోనిక్ పద్ధతిలో గడ్డి సాగుకు పొలం అవసరం లేదు. కాబట్టి రైతుకు కౌలు మిగులుతుంది. - ఈ పద్ధతిలో రసాయనిక ఎరువులు వాడనవసరం లేదు. కానీ, ట్రేలలో కిలో పచ్చిమేత ఉత్పత్తికి రూపాయి ఖరీదైన సూక్ష్మపోషకాల ద్రావణం వాడాల్సి ఉంటుంది. కేజీ పశుగ్రాసం ఉత్పత్తికి రూ. 5 నుంచి 7లు ఖర్చవుతాయి. - పొలంలో గడ్డి కోసిన తర్వాత మళ్లీ పెరగడానికి 45 రోజులు పడుతుంది. ఈ పద్ధతిలో గింజలు వేసిన వారం రోజుల్లో పశుగ్రాసం అందుతుంది. - 1, 2 పాడి పశువుల కోసమైతే రేకుల షెడ్డు లేదా ఒక గదిలో ఇనుప ర్యాక్లు ఏర్పాటు చేసి హైడ్రోపోనిక్ పద్ధతిలో పచ్చిగడ్డి పెంచుకోవచ్చు. - పాలీహౌస్లో 10 పశువులకు సరిపోయే పచ్చిగడ్డి సాగు ప్రారంభానికి రూ. 2.2 లక్షల పెట్టుబడి అవసరమవుతుంది. 50 పశువులకు సరిపోయే పచ్చిగడ్డి సాగు ప్రారంభానికి రూ. 9 లక్షలు ఖర్చవుతాయి. తదనంతరం గింజలు, విద్యుత్తు, సూక్ష్మపోషకాల ద్రావణం ఖర్చు మాత్రమే. - ఈ పద్ధతిలో మొక్కజొన్నలతో పచ్చిగడ్డి సాగు రైతుకు అన్ని విధాలా అనుకూలం. ఒక పాడి పశువుకు (దాణా లేకుండా) రోజూ 20 కిలోల పచ్చిగడ్డి వేయాలనుకుంటే.. 5 కిలోల మొక్కజొన్నలు అవసరమవుతాయి. ట్రేలలో పచ్చిగడ్డిని పరిశీలిస్తున్న డా. డి.వెంకటేశ్వర్లు, తదితరులు