breaking news
green climate
-
గ్రీన్ ప్రాజెక్టుల్లో పెట్టుబడి వనరులపై కేంద్రం దృష్టి
న్యూఢిల్లీ: పర్యావరణ పరిరక్షణకు దోహదంచేసే (గ్రీన్ క్లైమేట్) ప్రాజెక్టుల్లోకి మరిన్ని పెట్టుబడులు తీసుకురావడంపై కేంద్రం దృష్టి సారిస్తోంది. ఇందులో భాగంగా తగిన మిశ్రమ ఫైనాన్స్ ఇన్స్ట్రమెంట్ల ద్వారా నిధులు సమీకరించడానికిగాను ఆర్థిక సంస్థలకు అనుమతి ఇచ్చే అవకాశాలను ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిశీలిస్తోందని వర్గాలు తెలిపాయి. 2070 నాటికి కర్బన్ ఉద్గారాలను నికర సున్నాకి తగ్గించాలనే ప్రధానమంత్రి లక్ష్యానికి అనుగుణంగా ఈ కసరత్తు జరుగుతున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. గత ఏడాది కేంద్ర క్యాబినెట్ ఇందుకు సంబంధించి ఒక కీలక విధానాన్ని ఆమోదించింది. మెరుగైన వాతావరణం నెలకొల్పాలన్న లక్ష్యంలో భాగంగా గ్లాస్గో సదస్సులో ప్రధానమంత్రి ప్రకటిత ’పంచామృతం’ వ్యూహానికి అనుగుణంగా క్యాబినెట్ ఆమోదించిన జాతీయ విధాన రూపకల్పన ఉంది. ఈ విధానం ప్రకారం, ఉద్గారాల తీవ్రతను 2005 స్థాయి నుండి 2030 నాటికి 45 శాతం తగ్గించడానికి భారత్ కట్టుబడి ఉంది. 2030 నాటికి శిలాజ రహిత ఇంధన వనరుల నుండి 50 శాతం విద్యుత్ శక్తి స్థాపిత సామర్థ్యాన్ని సాధించాలన్నది లక్ష్యం. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఆయా లక్ష్యాల సాధన దిశలో సస్టైనబుల్ ఫైనాన్స్, క్లైమేట్ ఫైనాన్స్పై జారీ చేయాల్సిన మార్గదర్శకాల కోసం ఇంటర్నేషనల్ సస్టైనబిలిటీ అండ్ స్టాండర్డ్స్ బోర్డ్ (ఐఎస్ఎస్బీ)తో సెక్యూరిటీస్ అండ్ ఎక్సే్ఛంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సంప్రతింపులు జరుపుతున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఐఎస్ఎస్బీ రాబోయే రెండు నెలల్లో క్లైమేట్ ఫైనాన్స్ కోసం ప్రమాణాలను ప్రకటించే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. కాగా, అంతర్జాతీయంగా ఉద్ఘారాలను తగ్గించడానికి చేసే నియమ నిబంధనవాళి, ఇన్స్ట్రమెంట్లు అభివృద్ధి చెందిన– చెందుతున్న దేశాల మధ్య వివక్ష చూపేవిగా ఉండరాదని కూడా భారత్ కోరుకుంటోందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. -
మిషన్ కాకతీయకు ‘గ్రీన్ క్లైమేట్’ నిధులు
గ్రీన్ క్లైమేట్ ఫండ్ నుంచి రూ. వెయ్యి కోట్లు గ్రాంట్, రూ. వెయ్యికోట్లు రుణం మరో రూ. 2 వేల కోట్లు ఇచ్చేందుకు నాబార్డు సుముఖం నాబార్డు అధికారులతో సీఎస్ రాజీవ్శర్మ సమీక్ష సాక్షి, హైదరాబాద్: మిషన్ కాకతీయ పనులకు ఐక్యరాజ్యసమితి ఏర్పాటు చేసిన గ్రీన్ క్లైమేట్ ఫండ్ (జీసీఎఫ్) నుంచి రూ. రెండు వేల కోట్లు ఆర్థిక సాయం అందనుంది. అందులో రూ. వెయ్యి కోట్లు గ్రాంటుగా, మరో రూ. వెయ్యి కోట్లు రుణంగా సమకూరనుంది. దీంతోపాటు జీసీఎఫ్కు దేశంలో నోడల్ ఏజెన్సీగా ఉన్న నాబార్డు సైతం మిషన్ కాకతీయకు మరో రూ.2వేల కోట్లు ఇవ్వనుంది. ఈ మేరకు నాబార్డు ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వానికి హామీ ఇచ్చారు. పర్యావరణ హిత ప్రాజెక్టు..: అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పర్యావరణ సమతుల్యతను కాపాడే, కర్బన ఉద్గారాలను తగ్గించే కార్యక్రమాలకు చేయూతనివ్వడానికి ఐక్యరాజ్యసమితి 100 బిలియన్ డాలర్లతో జీసీఎఫ్ను ఏర్పాటు చేసింది. మన దేశంలో అలాంటి కార్యక్రమాలను గుర్తించి నిధుల కోసం ప్రతిపాదించేందుకు జీసీఎఫ్కు నాబార్డు నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తోంది. చెరువులను పునరుద్ధరించే ‘మిషన్ కాకతీయ’ కర్బన ఉద్గారాలను గణనీయంగా తగ్గించే కార్యక్రమంగా ఇప్పటికే గుర్తింపు పొందిన నేపథ్యంలో... దీనికి ఆర్థిక సాయం చేసేందుకు జీసీఎఫ్ ముందుకు వచ్చింది. నాబార్డు ప్రతినిధులు దీనిపై ఇప్పటికే నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్రావుతో పలు దఫాలుగా చర్చలు జరిపారు. తాజాగా సోమవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్శర్మతో సమావేశమయ్యారు. ఇక్రిశాట్ ప్రతినిధులతో పాటు శాఖ ముఖ్య కార్యదర్శి జోషి, ఓఎస్డీ శ్రీధర్రావు దేశ్పాండే తదితరులు ఇందులో పాల్గొన్నారు. చెరువుల పునరుద్ధరణ, వాతావరణ మార్పులకు అనుగుణంగా వ్యవసాయ పద్ధతులను అనుసరించడం, ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం తదితర అంశాలతో డీపీఆర్ను తయారు చేయాలని సమావేశంలో నిర్ణయించారు. ‘మిషన్ కాకతీయ’ ప్రాజెక్టుకు రూ.12వేల కోట్లు అవసరమని అంచనా వేయగా... రాష్ట్ర ప్రభుత్వం రూ.8వేల కోట్లు సమకూరుస్తుందని రాజీవ్శర్మ హామీ ఇచ్చారు. మిగతా నిధుల్లో జీసీఎఫ్ రూ.2వేల కోట్లు, నాబార్డు మరో రూ.2వేల కోట్లు సమకూర్చుతాయని హామీ ఇచ్చాయి. ఇక వీటితోపాటు హైదరాబాద్ నగరంలో ఉన్న అన్ని చెరువులను పునరుద్ధరించి, వాటిని మంచినీటి సరస్సులుగా మార్చడం, సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో పరిసరాలను శుభ్రపర్చడం, వంటింటి చెత్తను ఉపయోగించి బయోగ్యాస్ను ఉత్పత్తి చేసి హాస్టళ్లకు సరఫరా చేయడం తదితర ప్రాజెక్టులను సైతం జీసీఎఫ్ కింద చేర్చాలని ప్రభుత్వం ప్రతిపాదించింది.