breaking news
grass centre
-
మూగరోదన
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్ : కరువుజిల్లాలో పశువులు రోదిస్తున్నాయి. పచ్చగడ్డిని అటుంచితే మండుతున్న ఎండలకు ఎండిన గడ్డికూడా దొరక్క అల్లాడుతున్నాయి. ఆకలితో అలమటిస్తున్న జీవాలు కడుపు నింపుకోవడానికి కంటికి కనిపించినవన్నీ తింటున్నాయి. రోడ్లపై చెత్తబుట్టల్లో పడేసిన పాలిథిన్ కవర్లు తిని ఆకలి తీర్చుకుంటున్నాయి. అవి జీర్ణంకాక చివరకు తనువు చాలిస్తున్నాయి. ఆకలితో పశువులను చంపుకోవడం ఇష్టం లేక చాలా చోట్ల యజమానులుజీవాలను కబేళాలకు తరలిస్తున్నారు. క్షేత్రస్ధాయిలో మూగజీవాలకు పశుగ్రాసం అందుబాటులో ఉంచాల్సిన అధికారులు దానిపై దృష్టిసారించక పోవడంతో ఈ పరిస్థితి నెలకొందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తగ్గిపోతున్న పశు సంపద జిల్లాలో 2,45,043 దావులు, 1,34,259 గేదెలు, 17,83,759 గొర్రెలు, 2,43,819 మేకలు ఉన్నాయి. అయితే వీటికి అవసరమైన మోతాదులో పశుగ్రాసాన్ని సమకూర్చడంలో అ«ధికారులు విఫలమయ్యారు. పశుగ్రాసాన్ని ఉత్పత్తి చేయడం కోసం 2018–19 సంవత్సరానికి గాను 390 మెట్రిక్ టన్నుల పశుగ్రాస విత్తనాలు (పీసీ23 జొన్న రకం) 75 శాతం సబ్సిడీపై పశుసంవర్థశాఖ అ«ధికారులు సుమారు 72వేల మంది రైతులకు పంపిణీ చేశారు. గడ్డి విత్తనాలను పంపిణీ చేసినా సాగు చేసునేందుకు తగినంత సాగునీరు లభించక పోవడంతో పశుగ్రాసం ఉత్పత్తి చేయలేకపోయారు. వీటిలో రెండున్నర మెట్రిక్ టన్నుకు మించి పశుగ్రాసం ఉత్పత్తి కాలేదు. దీంతో కొందరు పాడి రైతులు మేతను బయట కొనుగోలు చేసి పశువులకు అందిస్తున్నారు. ఈ క్రమంలో ఒక్కో ట్రాక్టర్కు రూ.10వేల పైనే వెచ్చిస్తున్నారు. ఇక అంత ఆర్థిక స్థోమత లేని కొందరు రైతులు ఆకలితో అలమటిస్తున్న పశువులను కబేళాలకు తరలిస్తున్నారు. ప్రత్నామ్యాయ మార్గాలు ద్వారానైనా పశుగ్రాసాన్ని సమకూర్చి పశుసంపదను కాపాడవల్సిన సంబంధిత అధికారులు చోద్యం చూస్తున్నారని రైతులు విమర్శిస్తున్నారు. తమ ముందే పశువులు మృత్యువాత పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే పశుగ్రాసాన్ని ఉత్పత్తి చేయడం ప్రస్తుత పరిస్థితుల్లో సాధ్యంకావడం లేదు. అందువల్ల గతంలో మాదిరిగా లభ్యత గల ప్రాంతాల్లో పశుగ్రాసాన్ని కొనుగోలు చేసి జిల్లాలో పశువులకు అవసరమైన మేర సరఫరా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఆ దిశగా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. 92 మెట్రిక్ టన్నుల పశుగ్రాసం కొరత జిల్లాలో ఉన్న పశువులకు మొత్తం 6.57 లక్షల మెట్రిక్ టన్నుల మేత అవసరం ఉంది. ఇందులో ప్రస్తుతం 5.65 లక్షల మెట్రిక్ టన్నుల మేత లభ్యత ఉందనీ 92వేల మెట్రిక్ టన్నుల పశుగ్రాసం కొరత ఉన్నట్లు పశుసంవర్థకశాఖ అధికారులే చెబుతున్నారు. అనధికారింకంగా పశుగ్రాసం కొరతగా ఇంకా ఎక్కువే ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో అవసరం మేరకు పశుగ్రాసం అందుబాటులో ఉండేలా అధికారులు 75శాతం సబ్సిడీపై పీసీ23 జొన్నరకం గడ్డి విత్తనాలను 390 మెట్రిక్ టన్నులు రైతులకు పంపిణీ చేశారు. దీంతో పాటు పశుగ్రాసం వృథాను అరికట్టేందుకు 325 మంది రైతులకు 50 శాతం సబ్సిడీపై గడ్డి కత్తరించే యంత్రాలనూ ఇచ్చారు. కానీ ఎండలకు పశుగ్రాసం ఎదగక మేత అందని పరిస్థితి నెలకొంది. -
గడ్డి కేంద్రాల కోసం ఆందోళన
- పశువులతో మడకశిర తహసీల్దార్ కార్యాలయం ముట్టడి - పాల్గొన్న పీసీసీ చీఫ్ రఘువీరా మడకశిర: గడ్డి కేంద్రాలను ఏర్పాటు చేసి, పశుసంపదను కాపాడాలని డిమాండ్ చేస్తూ పీసీసీ చీఫ్ ఎన్.రఘువీరారెడ్డి ఆధ్వర్యంలో బుధవారం వందలాది పశువులతో మడకశిర తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఉదయం పది నుంచి మధ్యాహ్నం రెండు వరకు ఈ ఆందోళన కొనసాగింది. పశువులను తహసీల్దార్ ఛాంబర్లోకి తోలి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రఘువీరారెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి పశువుల హాస్టళ్లను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని, ఇంతవరకు అతీగతీ లేదని విమర్శించారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను పశువుల్లా కొంటున్నారని తప్పా.. పశువుల కష్టం మాత్రం ఆయనకు తెలియడం లేదన్నారు. మన రాష్ట్రంలో గడ్డి కొరత తీవ్రంగా ఉన్న సమయంలో ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. గడ్డి కేంద్రాలను ఏర్పాటు చేయకూడదని మంత్రి మండలి సమావేశంలో నిర్ణయించడం బాధాకరమన్నారు. డీసీసీ అధ్యక్షుడు కోటా సత్యం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో గడ్డి కేంద్రాలు ఏర్పాటు చేస్తే ఆ కేంద్రాలకు వచ్చే రైతులందరికీ తమ పార్టీ తరఫున ఉచితంగా భోజన సౌకర్యం కల్పిస్తామన్నారు. మడకశిర మాజీ ఎమ్మెల్యే కె.సుధాకర్ మాట్లాడుతూ గడ్డి కేంద్రాల ఏర్పాటులో ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని వీడాలన్నారు. «ధర్నాలో జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సురంగల నాగరాజు, ఏ బ్లాక్ అధ్యక్షుడు దాసరపల్లి దొడ్డయ్య, మార్కెట్యార్డు మాజీ చైర్మన్లు ప్రభాకర్రెడ్డి, నరసింహమూర్తి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు నరసింహమూర్తి, పట్టణ అధ్యక్షుడు నాగేంద్ర, మండల అధ్యక్షుడు మంజునాథ్, గుడిబండ మండల అధ్యక్షుడు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.