breaking news
gaddam Ganga Reddy
-
మాజీ ఎంపీ గడ్డం గంగారెడ్డి చిన్నకోడలికి ‘పద్మశ్రీ’
సాక్షి, నిజామాబాద్: జక్రాన్పల్లి మండలం కేశ్పల్లికి చెందిన డాక్టర్ పద్మజారెడ్డికి దేశంలోనే నాలుగో అత్యున్నతమైన ‘పద్మశ్రీ’ పురస్కారం వరించింది. కూచిపూడి విభాగంలో ఆమెకు ఈ అవార్డు దక్కింది. మాజీ ఎంపీ గడ్డం గంగారెడ్డి చిన్న కుమారుడు శ్రీనివాసరెడ్డి భార్య అయిన పద్మజారెడ్డి ఏపీలోని కృష్ణా జిల్లా పామర్రులో జన్మించారు. పామర్రు గ్రామం కూచిపూడి కళకు పుట్టినిల్లయిన కూచిపూడి సమీపంలో ఉంటుంది. దీంతో కూచిపూడి సిద్ధేంద్రయోగి స్ఫూర్తితో డాక్టర్ శోభానాయుడు శిష్యరికంలో పద్మజారెడ్డి నృత్య రీతులు నేర్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో పుట్టి, ఇందూరు కోడలిగా జిల్లాకు వచ్చిన పద్మజారెడ్డి తెలంగాణ సంస్కృతిపై మక్కువ పెంచుకున్నారు. తెలంగాణ సంస్కృతిలో భాగమైన రుద్రమదేవిని ఎక్కువగా ఇష్టపడే పద్మజారెడ్డి సత్యభామ, రుద్రమదేవి పాత్రల ద్వారా కూచిపూడిలో గుర్తింపు పొందారు. ఇందులో భాగంగా డాక్టర్ పద్మజారెడ్డి కూచిపూడిలో ‘కాకతీయం’ అనే తెలంగాణ క్లాసికల్ ఆర్ట్ ఫాంను రూపొందించి ప్రపంచానికి పరిచయం చేశారు. నృత్య రత్నావళిలోని భ్రమరి, పేరిణి, కందుక నృత్యం, లాస్యంగం వంటి ప్రధాన అంశాలతో నృత్య బ్యాలెట్ రూపొందించారు. అదేవిధంగా సామాజిక అంశాలపైనా నృత్యరూపకాలు రూపొందించి సమాజంలో అవగాహన కల్పించే విషయంలో తనవంతుగా కీలక పాత్ర పోషించారు. భ్రూణహత్యలు, జాతీయ సమైక్యత స్ఫూర్తిని రగిలించే నృత్య ప్రదర్శనలు చేశారు. చదవండి: పద్మ పురస్కారాలు మాకొద్దు.. మేం తీసుకోం డాక్టర్ పద్మజారెడ్డి సాధించిన అవార్డుల్లో కొన్ని.. ► భారత ప్రభుత్వం నుంచి సంగీత్ నాటక్ అకాడమీ అవార్డు ► 2006లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేతుల మీదుగా కళారత్న (హంస) అవార్డు ► శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ నుంచి 2005లో డాక్టరేట్ పట్టా ► 1994లో అప్పటి రాష్ట్రపతి శంకర్ దయాల్ శర్మ నాట్యవిశారద అవార్డు అందజేశారు. ► 1990లో కల్కి కళాకార్ అవార్టు ► 2001లో డాక్టర్ సి.నారాయణరెడ్డి చేతుల మీదుగా సంస్కృతి రత్న, అభినయ సత్యభామ అవార్డు అందుకున్నారు. ► అక్కినేని నాగేశ్వరరావు చేతుల మీదుగా ఏఎన్ఆర్ గోల్డ్మెడల్ అందుకున్నారు. ► అమెరికన్ తెలుగు అసోసియేషన్ 2014లో అవార్డు పొందారు. ► యూరోపియన్ తెలుగు అసోసియేషన్ నుంచి అవార్డు ► తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా నుంచి ది డ్యాన్సింగ్ క్వీన్ అవార్డు ► అమెరికన్ తెలుగు అసోసియేషన్ లైఫ్టైమ్ ఆచీవ్మెంట్తో అవార్డుతో సత్కరించింది. ► 1979లో సర్ శ్రీనగర్ సంసద్ నృత్యవిహార్ అవార్డు అందజేశారు. ► 2007లో త్యాగరాజ ఫెస్టివల్ కమిటీ విద్వాన్ మంత్తో సన్మానించింది. ► ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ కల్చరల్ రిలేషన్స్(ఢిల్లీ) జనరల్ అసెంబ్లీ మెంబర్గా 2017 వరకు ఉన్నారు. ► 2012లో నేషనల్ టూరిజం అడ్వయిజరీ కౌన్సిల్ మెంబర్గా వ్యవహరించారు. -
కేశ్పల్లి గంగారెడ్డి కన్నుమూత
⇒ గుండెపోటుతో తుదిశ్వాస విడిచిన మాజీ ఎంపీ ⇒ నేడు నిజామాబాద్లో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు సాక్షి,హైదరాబాద్/జక్రాన్పల్లి (నిజామాబాద్ రూరల్): మాజీ ఎంపీ, పారిశ్రామికవేత్త గడ్డం గంగారెడ్డి (84) సోమవారం తెల్లవారు జామున గుండెపోటుతో మరణించారు. ఆయన కేశ్పల్లి గంగారెడ్డిగా సుపరిచితుడు. హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10లో నివాసముంటున్న ఆయన సోమవారం తెల్లవారుజామున అస్వస్థతకు గురై వెంటనే తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్లో సన్నిహితులు నివాళులర్పించాక ఆయన భౌతికకాయాన్ని నిజామాబాద్కు తరలిం చారు. గంగారెడ్డికి భార్య కాంతమ్మతో పాటు కుమారులు ఆనంద్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, కుమార్తెలు అహల్యారెడ్డి, శశికళారెడ్డి, అవనిజారెడ్డి ఉన్నారు. విదేశాల్లో స్థిరపడ్డ సన్నిహితులు వచ్చాక మంగళవారం నిజామాబాద్లో అంత్యక్రియలు నిర్వహి స్తారు. హైదరాబాద్లో 35 ఏళ్ల కింద ఆధునిక హంగులతో నిర్మించిన సెంట్రల్ కోర్టు హోటల్ గంగారెడ్డిదే. ఆయన తెలంగాణ జిల్లాల్లో తొలితరం పారిశ్రామికవేత్తల్లో ఒకరికిగా పేరు గడించారు. నిజామాబాద్ జిల్లాలో సీనియర్ నాయకుడిగా, ఓటమి ఎరుగని నాయకుడిగా గంగారెడ్డి తనదైన ముద్ర వేశారు. కాగా, ప్రస్తుతం గంగారెడ్డి కుమారుడు ఆనంద్రెడ్డి బీజేపీ రాష్ట్ర కార్యవర్గసభ్యుడిగా, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్నారు. నేడు అంత్యక్రియలు.. నిజామాబాద్లోని సుభాష్నగర్ నుంచి డిచ్పల్లి మండలం మెంట్రాజ్పల్లి ఫౌమ్హౌస్ వరకు గంగారెడ్డి అంతిమయాత్ర కొనసాగ నుంది. అనంతరం అక్కడ అంత్యక్రియలు జరుగుతాయి. గంగారెడ్డి అంత్యక్రియలకు మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి, ఇంద్రకరణ్రెడ్డిలు హాజరుకానున్నారు. కాగా, గంగారెడ్డి మృతి పట్ల కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ, ఎంపీ కవిత సంతాపం తెలిపారు. సీఎం కేసీఆర్ సంతాపం గంగారెడ్డి మృతిపట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం తెలిపారు. తెలంగాణ ఉద్యమం సమయంలో గంగారెడ్డి తన వెన్నంటి నిలిచారని గుర్తుచేసుకున్నారు. గంగారెడ్డి అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. 1991లో తొలిసారి ఎంపీగా ఎన్నిక 1933 జూలై 12న నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం కేశ్పల్లిలో గంగారెడ్డి జన్మించారు. తండ్రి గడ్డం రాజిరెడ్డి. రైతు కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన గంగారెడ్డి తొలిసారిగా 1956 నుంచి 1960 వరకు పడకల్ గ్రామ సర్పంచ్గా పనిచేశారు. అనంతరం టీడీపీ నుంచి తొలిసారిగా 1991లో నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. 1998–2004 మధ్య రెండుసార్లు ఎంపీగా గెలుపొందారు. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా ఉన్న సమయంలో టీడీపీకి రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరారు. 2004 ఎన్నికల్లో డిచ్పల్లి ఎమ్మెల్యేగా గెలిచారు. 1998, 1999లో అర్బన్, రూరల్ డెవలప్మెంట్ సబ్ కమిటీ సభ్యుడిగా పనిచేశారు. కేంద్ర నీటి వనరుల సంప్రదింపుల కమిటీలో సభ్యుడిగా కూడా పనిచేశారు. 2012లో వైఎస్ఆర్ కాంగ్రెస్లో ఆ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో చేరారు. 2014లో ఎన్నికల ముందు బీజేపీలో చేరిన ఆయన అప్పటినుంచి దాదాపు రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు.