breaking news
Free sand smuggling
-
ఇసుకలో మస్కా!
ఓచేత్తో ఉచిత ఇసుక అంటూ ప్రజలను మాయ చేస్తూ... మరోచేత్తో భారీ దందాను ప్రోత్సహిస్తూ జేబులు నింపుకొంటున్నారు పెదబాబు, చినబాబు. అర్హత లేని సంస్థను అడ్డుపెట్టుకుని.. అనుమతుల్లేని తవ్వకాలతో రోజుకు రూ.కోట్లు దండుకుంటున్నారు. ఈ దోపిడీతో కృష్ణా నదీ గర్భం అస్తవ్యస్తంగా మారిపోతోంది. ఇదంతా సీఎం చంద్రబాబు నివాసానికి కూతవేటు దూరంలో బల్లకట్టు నావిగేషన్ చానల్ ముసుగులో సాగుతున్న భారీ దందా.సాక్షి, అమరావతి: పెదబాబు, చినబాబు అండదండలే అర్హతగా... కృష్ణా నదిలో బల్లకట్టు నావిగేషన్ చానల్ పూడికతీత పనుల కాంట్రాక్టు చేజిక్కించుకుంది కృష్ణా–గోదావరి వాటర్ వేస్ సంస్థ. ఇది పైకి మాత్రమే. చేస్తున్నది మాత్రం నిత్యం వేలాది టన్నుల ఇసుక అక్రమ తవ్వకం.. తరలింపు. రాజధాని పనులకు ఇసుక, నావిగేషన్ చానల్ పేరిట అడ్డగోలుగా తవ్వి రోజుకు దాదాపు రూ.4 కోట్లు మింగేస్తోంది. ⇒ కృష్ణా నది మీదుగా గుంటూరు, కృష్ణా జిల్లాల మధ్య రాకపోకలకు ఇబ్రహీంపట్నం–వైకుంఠపురం మధ్య బల్లకట్టు దారి ఉంది. దీనిలో ఇసుక మేటలను తొలగించేందుకు కృష్ణా, గోదావరి వాటర్ వేస్ సంస్థ డిసెంబరులో కాంట్రాక్టు పొందింది. ఇసుక తవ్వకంలో ఎలాంటి అర్హత లేకున్నా కేవలం చినబాబు సన్నిహితులంతా కలిసి దీనికి కాంట్రాక్టు ఇప్పించారు. తాము చెప్పినట్టల్లా సంతకం పెట్టే ఇరిగేషన్ అధికారిని గుంటూరు జిల్లాలో నియమించి అనుమతులు తీసుకున్నారు. నావిగేషన్ చానల్ పరిధిలో ఏడు లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను తవ్వి తీయాలనేది కాంట్రాక్టు. టన్నుకు రూ.215 చొప్పున చెల్లిస్తోంది. వాస్తవానికి టన్ను ఇసుక తవ్వేందుకు రూ.50, లోడింగ్కు రూ.15 మాత్రమే ఖర్చవుతుంది. కానీ, అంతా సొంతవాళ్లే కావడంతో ప్రభుత్వ పెద్దలు అదనంగా రూ.150 కలిపి కాంట్రాక్టర్కు కట్టబెట్టారు. దీంట్లోనే.. కాంట్రాక్టు సంస్థకు నిర్దేశిత 7 లక్షల టన్నులకు రూ.10.5 కోట్లు అప్పనంగా ఇచ్చినట్లయింది. ⇒ ఇప్పటికే 15 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను తవ్వేసినట్లు స్థానిక బోట్స్మెన్ సంఘాలు చెబుతున్నాయి. రాజధాని పనుల కోసమని చెబుతూ రోజుకు 30 వేల టన్నుల ఇసుకను తోడుతున్నారు. ఇందులో సగానికి పైగా హైదరాబాద్, తదితర నగరాలు, పట్టణాలకు అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. వాస్తవానికి రాజధాని పనుల కాంట్రాక్టు సంస్థలకు టన్ను రూ.130కే ఇసుక సరఫరా చేయాలని మొదట ఒప్పుకొన్నారు. కానీ, కాంట్రాక్టు రూ.215కు తీసుకున్నాం కాబట్టి అంతే ఇవ్వాలని వసూలు చేస్తున్నారు. ఇందులోనూ టన్నుకు రూ.85 మిగుల్చుకుంటున్నారు. ఇక హైదరాబాద్కు తరలించే ఇసుకను టన్ను రూ.2,500తో అమ్ముతున్నారు. మొత్తంగా రోజుకు 30 వేల టన్నుల మీద సుమారు రూ.4 కోట్లు.. నెలకు రూ.100–120 కోట్లు అక్రమంగా అర్జిస్తున్నారు. ఈ లెక్కన మార్చి నుంచి ఇప్పటి వరకు.. అంటే ఐదు నెలల్లో రూ.580 కోట్లకు పైగా దోచుకున్నట్లు స్పష్టమవుతోంది. ఈ దందా చూస్తుంటే... బల్లకట్టు కోసం కానే కాదు.. చినబాబు మూటల కోసమేనని స్పష్టమవుతోంది. అంతా ఆ తాను ముక్కలే...కృష్ణా–గోదావరి వాటర్ వేస్ సంస్థ తాతినేని వంశీది చినబాబుకు అత్యంత సన్నిహితుడైన ఎన్ఆర్ఐ డాక్టర్ కీలక పాత్ర అన్ని వ్యవహారాలు చక్కబెడుతున్న కీలక అనుయాయుడు కేఆర్కృష్ణా–గోదావరి వాటర్ వేస్ సంస్థ తాతినేని వంశీ అనే వ్యక్తికి చెందినది. కరకట్టపైనే నివాసం ఉండే, చినబాబుకు అత్యంత సన్నిహితుడైన ఒక ఎన్ఆర్ఐ డాక్టర్, మరికొందరు కలిసి దీన్ని నడిపిస్తున్నారు. వీరికి చినబాబు తరఫున ప్రతినిధిగా ఆయన కీలక అనుయాయుడు కేఆర్ అన్ని వ్యవహారాలు చక్కబెడుతున్నట్లు తెలుస్తోంది. అందరూ ముఠాగా ఏర్పడి ఇసుక అక్రమ తవ్వకాలతో రూ.కోట్లు దండుకుంటున్నారు. ఇది చాలదన్నట్లు ప్రకాశం బ్యారేజీ పూడికతీత పనుల్లోనూ రెట్టింపు మొత్తం దండుకునేందుకు స్కెచ్ వేశారు. రాజధాని పనులు చేస్తున్న బడా కంపెనీల తరఫున ఇదే కంపెనీతో టెండర్లు వేయించి, దాన్ని కూడా సిండికేట్గా దక్కించుకునేందుకు ఎత్తుగడ వేశారు. ఇందులో భాగంగా త్వరలో రూ.286 కోట్ల విలువతో టెండర్ పిలిచేందుకు సీఆర్డీఏ కమిషనర్ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటైంది. ఈ కాంట్రాక్టు కూడా కృష్ణా–గోదావరి వాటర్ వేస్కు ఇచ్చేలా చినబాబు స్కెచ్ వేశారు. అందుకుతగ్గట్టుగానే టెండర్లు పిలిచేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది.అర్హత, అనుభవం లేని సంస్థకు కట్టబెట్టేసి...చినబాబు జేబు సంస్థకు అడ్డగోలుగా అనుమతులులారీలు ఆపితే పేషీ నుంచి వెంటనే ఫోన్లుఅడ్డంకులు వస్తే ఆయన కీలక అనుయాయుడు రంగంలోకిగత ప్రభుత్వంలో పక్కనపెట్టినా.. కూటమి వచ్చాక పచ్చజెండాకృష్ణా–గోదావరి వాటర్ వేస్ సంస్థకు ఇసుక తవ్వే అర్హతలు ఏమాత్రం లేవని బోట్స్మెన్ సంఘాలు చెబుతున్నాయి. డ్రెడ్జింగ్ ఇన్ల్యాండ్ వాటర్వేస్ అథారిటీ చట్టానికి విరుద్ధంగా, రాజ్యాంగ నిబంధనలు ఉల్లంఘించేలా ఉందని వాపోతున్నాయి. తమ ఉపాధి పోతోందని, నదీ గర్భం కుంగుతోందని వారు ఆందోళన వ్యక్తం చేసినా పట్టించుకునేవారే లేరని బోట్స్మెన్ సంఘాల వారు వాపోతున్నారు. వాస్తవానికి డ్రెడ్జింగ్కు అవసరమైన రిజిస్ట్రేషన్లు, బోట్ ఫిట్నెస్ సర్టిఫికెట్లు, సరంగు లైసెన్స్లతో పాటు ఇతర చట్టపరమైన అర్హతలు ఏవీ లేవని తేలడంతో గత ప్రభుత్వంలో ఈ సంస్థకు ఏ పనీ ఇవ్వలేదు. ఇప్పుడు చినబాబు బినామీగా మారడంతో కాంట్రాక్టులు సులభంగా వచ్చేస్తున్నాయి. పేరు ఆ కంపెనీదైనా వ్యవహారాలన్నీ చినబాబు మనుషులే చూసుకుంటున్నారు. అడ్డంకులు వస్తే ఆయన కీలక అనుయాయుడు రంగంలోకి దిగి సర్దుబాటు చేస్తున్నారు. కంపెనీ లారీలు, వ్యవహారాలను ఎవరైనా ఆపితే వెంటనే చినబాబు పేషీ నుంచి ఫోన్లు వెళ్తున్నాయి. నావిగేషన్ చానల్, డ్రెడ్జింగ్ పేరుతో తమ ఇంటి పక్క నుంచే రూ.కోట్లు కురిపించే ఇసుక చానల్ను పెదబాబు, చినబాబు తయారు చేసుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. -
ఇసుక చిచ్చు.. పోలీసులకు ఉచ్చు
► ఉచిత ఇసుక అక్రమ రవాణాపై పోలీసుల ఉదాసీనత ► హోంమంత్రి, పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన టీడీపీ నేతలు తాడేపల్లి రూరల్: మండలంలోని ఇసుక అక్రమ రవాణా వ్యవహారంలో పోలీసులకు ఉచ్చు బిగిసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇసుక అక్రమ రవాణాపై తాడేపల్లి పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీనిపై మంగళగిరి డీఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన వారిపై దురుసుగా ప్రవర్తించారు. దీంతో ఆగ్రహించిన కొందరు పోలీసు ఉన్నతాధికారులతోపాటు ఆంధ్రప్రదేశ్ హోం శాఖా మంత్రికి ఫిర్యాదు చేశారు. ఆంజనేయ డెవలపర్స్ అధినేత జంగాల సాంబశివరావు (తెలుగుదేశం పార్టీ అనుచరులు), టీడీపీ ఉండవల్లి అధ్యక్షుడు దాసరి కృష్ణ తదితరులు ఆదివారం హోం మంత్రి చినరాజప్ప, ఐజీ సంజయ్, గుంటూరు అర్బన్ ఎస్పీ సర్వశ్రేష్ట త్రిపాఠిలకు రాతపూర్వకంగా ఫిర్యాదులు అందజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రవేశపెట్టిన ఉచిత ఇసుక విధానంతో ప్రజలకు ప్రయోజనం ఉందని, దాన్ని ఆసరాగా చేసుకుని తాడేపల్లి మండలంలో కొందరు ఇసుక క్వారీలను తమ ఆధీనంలో ఉంచుకుని ఎక్కువ ధరలకు అమ్ముతున్నారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. వీరి మాట వినకుండా ఎవరైనా వేరేచోట ఇసుక తీసుకుంటుంటే వారిపై పోలీసులు అక్రమ కేసులు బనాయించి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని వివరించారు. పోలీసుల వ్యవహార శైలి చూస్తే వారికీ దీనిలో వాటాలు ఉన్నట్టు అర్థమవుతోందని పేర్కొన్నారు. పోలీసులదీ..అదే తీరు..! మండలంలో పోలీసుల పని తీరు కూడా విమర్శలకు ఊతమిస్తోంది. టీడీపీ మండల సమావేశంలో ఎవరికి ఎంతెంత వాటాలు వెళుతున్నాయో బహిరంగంగా చెప్పడంపై పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అలాగే చిర్రావూరు, గుండిమెడ, ప్రాతూరు ఇసుక రీచ్లలో పోలీసులకు డబ్బులు ఇవ్వాలంటూ లారీకు రూ. 300, ట్రాక్టర్కు రూ. 100 చొప్పున వసూలు చేశారు. లారీ డ్రైవర్లు బహిరంగంగానే ‘పోలీసులకంటూ డబ్బులు వసూలు చేస్తున్నార’ని వ్యాఖ్యానించిప్పటికీ ఆ వసూలు రాజాలపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరించారు. ఒక గ్రామానికి చెందిన ట్రాక్టర్లు, లారీలపైనే కేసులు నమోదు చేయడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని సాక్షాత్తూ కొందరు పోలీసులే వ్యాఖ్యానిస్తున్నారు. వీరికీ, ఇసుక అక్రమ రవాణా చేసే వారికి ఎటువంటి ఆర్థిక లావాదేవీలు లేకపోతే శుక్రవారం రాత్రి 18 లారీలు, 10 ట్రాక్టర్లను పట్టుకుని, మూడు ఇసుక లారీలను, రెండు ట్రాక్టర్లను మాత్రమే కోర్టుకు ఎందుకు హాజరు పరిచేందుకు సిద్ధమయ్యారని పలువురు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం నిషేధించిన ఇసుక రీచ్ల వ్యవహారంలో పోలీసులకు ఉచ్చు బిగుసుకునే విధంగా కనిపిస్తోంది.