-
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు డీలా
న్యూఢిల్లీ: గత కొద్ది నెలలుగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్డీఐలు) వెనకడుగు వేస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) తొలి 9 నెలల్లో(ఏప్రిల్–డిసెంబర్) 13 శాతం క్షీణించాయి. అంతర్గత వాణిజ్యం, పరిశ్రమల ప్రోత్సాహక శాఖ (డీపీఐఐటీ) తాజాగా వెల్లడించిన గణాంకాల ప్రకారం 32.03 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. ప్రధానంగా కంప్యూటర్ హార్డ్వేర్, సాఫ్ట్వేర్, టెలికం, ఆటో, ఫార్మా రంగాలకు ఎఫ్డీఐలు నీర సించాయి. గతేడాది(2022–23) ఏప్రిల్–డిసెంబర్లో 36.74 బిలియన్ డాలర్ల విలువైన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు లభించాయి. అయితే ఈ ఏడాది మూడో త్రైమాసికం(అక్టోబర్–డిసెంబర్)లో 18% ఎగసి 11.6 బిలియన్ డాలర్లను తాకాయి. 7 శాతం డౌన్: తాజా సమీక్షా కాలంలో ఈక్విటీ పెట్టుబడులుసహా మొత్తం ఎఫ్డీఐలు 51.5 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. గతేడాది తొలి 9 నెలల్లో లభించిన 55.27 బిలియన్ డాలర్లతో పోలిస్తే ఇవి 7 శాతం తక్కువ. -
ఎఫ్డీఐ... రికార్డులు
న్యూఢిల్లీ: కీలకమైన పెట్టుబడి కేంద్రంగా భారత్ ఆవిర్భవిస్తోందనడానికి సూచనగా గడిచిన ఇరవై ఏళ్లలో భారీ స్థాయిలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐ) వెల్లువెత్తాయి. తాజాగా కొత్త మైలురాయి అధిగమించాయి. పరిశ్రమ, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహ విభాగం (డీపీఐఐటీ) గణాంకాల ప్రకారం 2000 ఏప్రిల్ నుంచి 2020 సెప్టెంబర్ మధ్య కాలంలో 500.12 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. వీటిలో 29 శాతం మారిషస్ నుంచి ఉన్నాయి. మిగతావి సింగపూర్ (21 శాతం), అమెరికా, నెదర్లాండ్స్, జపాన్ (తలో 7 శాతం), బ్రిటన్ (6 శాతం) నుంచి వచ్చాయి. మారిషస్ నుంచి అత్యధికంగా 144.71 బిలియన్ డాలర్లు, సింగపూర్ నుంచి 106 బిలియన్ డాలర్ల మేర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయి. జర్మనీ, సైప్రస్, ఫ్రాన్స్, కేమ్యాన్ ఐల్యాండ్స్ తదితర దేశాల ఇన్వెస్టర్లు కూడా ఇన్వెస్ట్ చేశారు. 2015–16 నుంచి ఎఫ్డీఐల ప్రవాహం గణనీయంగా పెరిగింది. 2019–20లో రికార్డు స్థాయిలో 50 బిలియన్ డాలర్లు వచ్చాయి. సర్వీసులు, సాఫ్ట్వేర్లో ఎక్కువగా.. సేవల రంగం, కంప్యూటర్ సాఫ్ట్వేర్.. హార్డ్వేర్, టెలికమ్యూనికేషన్స్, ట్రేడింగ్, నిర్మాణ రంగం, ఆటోమొబైల్, రసాయనాలు, ఫార్మా తదితర రంగాలు.. అత్యధిక స్థాయిలో ఎఫ్డీఐలను ఆకర్షించాయి. 1999లో విదేశీ మారక నియంత్రణ చట్టం (ఫెరా) స్థానంలో విదేశీ మారక నిర్వహణ చట్టాన్ని (ఫెమా) అమల్లోకి తెచ్చినప్పట్నుంచీ ఎఫ్డీఐల ప్రవాహం మొదలైందని నాంగియా ఆండర్సన్ ఇండియా పార్ట్నర్ నిశ్చల్ అరోరా తెలిపారు. అప్పట్నుంచీ 500 బిలియన్ డాలర్లు రావడమనేది పటిష్టమైన భారత ఆర్థిక మూలాలు, స్థిరమైన రాజకీయ పరిస్థితులు, 2007–08 నాటి మాంద్యంలోనూ మదుపుదారులకు మెరుగైన రాబడులిచ్చిన ఆర్థిక వృద్ధి సామర్థ్యంపై ఇన్వెస్టర్లకు గల నమ్మకాన్ని సూచిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఏ దేశంలోకైనా ఎఫ్డీఐలు రావాలంటే వ్యాపార నిర్వహణ సులభతరంగా ఉండటం, స్థల .. కార్మిక చట్టాలు.. పన్ను రేట్లును సరళతరంగా ఉండటం, నిపు ణుల లభ్యత, లాజిస్టిక్స్, రాజకీయ స్థిరత్వం వంటి అంశాలు కీలకంగా ఉంటాయని డెలాయిట్ ఇం డియా పార్ట్నర్ రజత్ తెలిపారు. భారత్ ఇప్పటికే ఈ విషయాల్లో చాలా మెరుగుపడిందన్నారు. -
6 నెలల్లో రూ. 2.22 లక్షల కోట్లు!
న్యూఢిల్లీ, సాక్షి: పలు దేశాలను కరోనా వైరస్ పీడిస్తున్న నేపథ్యంలోనూ భారత్ విదేశీ పెట్టుబడులను భారీగా ఆకట్టుకుంటోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి ఆరు నెలల కాలంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్డీఐలు) 15 శాతం వృద్ధి చూపాయి. ఈ విషయాలను పారిశ్రామిక, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక శాఖ(డీపీఐఐటీ) విడుదల చేసిన తాజా గణాంకాలు వెల్లడించాయి. ఏప్రిల్- సెప్టెంబర్ మధ్య కాలంలో దేశంలోకి 30 బిలియన్ డాలర్ల(రూ. 2.22 లక్షల కోట్లు) విదేశీ పెట్టుబడులు ప్రవహించినట్లు తెలియజేశాయి. 2019-20 తొలి ఆరు నెలల్లో ఇవి 26 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఈ ఎఫ్డీఐలలో సింహభాగం అంటే 29 శాతం మారిషస్ నుంచి లభించగా.. 21 శాతం వాటాతో సింగపూర్ తదుపరి స్థానంలో నిలిచింది. యూఎస్, నెదర్లాండ్స్, జపాన్ సైతం 7 శాతం చొప్పున వాటాతో ఈ జాబితాలో చోటు చేసుకున్నాయి. రంగాలవారీగా.. డీపీఐఐటీ గణాంకాల ప్రకారం ఏప్రిల్- సెప్టెంబర్ మధ్య కాలంలో సర్వీసుల రంగం అత్యధికంగా 17 శాతం విదేశీ పెట్టుబడులను ఆకట్టుకుంది. సర్వీసుల రంగంలో ఫైనాన్షియల్, బ్యాంకింగ్, బీమా, ఔట్సోర్సింగ్ సైతం కలసి ఉన్నట్లు డీఐఐఐటీ గణాంకాలు పేర్కొన్నాయి. ఈ రంగాలలో కంప్యూటర్ సాఫ్ట్వేర్, హార్డవేర్ విభాగానికి 12 శాతం ఎఫ్డీఐలు లభించాయి. టెలికం రంగానికి 7 శాతం వాటా దక్కింది. మొత్తం ఎఫ్డీఐలలో రాష్ట్రాలవారీగా గుజరాత్ 35 శాతం వాటాతో అగ్రస్థానాన్ని పొందింది. ఇదేవిధంగా మహారాష్ట్ర 20 శాతం, కర్ణాటక 15 శాతం, ఢిల్లీ 12 శాతం చొప్పున ఎఫ్డీఐలను ఆకట్టుకున్నాయి. కోవిడ్-19ను సమర్థవంతంగా ఎదుర్కొనే బాటలో పలు దేశాల ప్రభుత్వాలు, కేంద్ర బ్యాంకులు సహాయక ప్యాకేజీల ద్వారా లిక్విడిటీని పెంచిన నేపథ్యంలో భారత్కు విదేశీ పెట్టుబడులు పెరుగుతూ వచ్చినట్లు ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం వివిధ రంగాలలోకి విదేశీ పెట్టుబడులను ఆకట్టుకునే బాటలో పలు సంస్కరణలు తీసుకురావడం కూడా ప్రభావం చూపుతున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. కాంట్రాక్ట్ మ్యాన్యుఫాక్చరింగ్, కోల్ మైనింగ్ తదితర రంగాలు భవిష్యత్లో మరిన్ని విదేశీ పెట్టుబడులను ఆకట్టుకునే వీలున్నట్లు అభిప్రాయపడ్డారు. -
ఎఫ్ఐఐల ఫేవరెట్ షేర్ల స్పీడ్
ఈ ఆర్థిక సంవత్సరం(2020-21) రెండో త్రైమాసికంలో దేశీ స్టాక్ మార్కెట్లలో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(ఎఫ్ఐఐలు) భారీగా పెట్టుబడులు కుమ్మరించారు. క్యూ2(జులై- సెప్టెంబర్)లో రూ. 35,000 కోట్లకుపైగా ఈక్విటీ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేశారు. తద్వారా దాదాపు 400 కంపెనీలలో వాటాలను పెంచుకున్నారు. వీటిలో 100 కంపెనీల షేర్లు మార్చి నుంచి చూస్తే 100 శాతంపైగా ర్యాలీ చేశాయి. అయితే కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మార్చిలో స్టాక్ మార్కెట్లు 52 వారాల కనిష్టాలను తాకిన సంగతి తెలిసిందే. దీంతో పలు కౌంటర్లు ఏడాది కనిష్టాలకు చేరాయి. ఈ స్థాయిల నుంచీ పలు షేర్లు లాభాల దౌడు తీస్తున్నట్లు నిపుణులు తెలియజేశారు. మార్చి నుంచి విదేశీ ఇన్వెస్టర్లు వాటాలు పెంచుకున్న సుమారు 385 కంపెనీలలో మార్చి నుంచి చూస్తే.. 107 స్టాక్స్ 100-500 శాతం మధ్యలో జంప్ చేశాయి. మార్చి కనిష్టాల నుంచి రెట్టింపైన కౌంటర్లలో చాలా వరకూ మిడ్, స్మాల్ క్యాప్ విభాగం నుంచే చోటు చేసుకోవడం గమనార్హం. జాబితాలో ఎంఅండ్ఎం, ఇమామీ, ప్రకాష్ ఇండస్ట్రీస్, జిందాల్ పాలీ, అదానీ గ్యాస్, గ్లెన్ మార్క్ ఫార్మా, అదానీ గ్రీన్, అఫ్లే ఇండియా, డిక్సన్ టెక్నాలజీస్ తదితరాలున్నాయి. గత రెండేళ్లుగా మిడ్, స్మాల్ క్యాప్స్ అక్కడక్కడే అన్నట్లుగా నిలిచిపోవడంతో కొద్ది రోజులుగా ర్యాలీ బాట పట్టినట్లు నిపుణులు పేర్కొన్నారు. దీనికితోడు పటిష్ట యాజమాన్యం, నాణ్యమైన బిజినెస్ వంటి అంశాలు కొన్ని కౌంటర్లకు జోష్ నిస్తున్నట్లు చెప్పారు. లార్జ్ క్యాప్స్ కంటే రానున్న ఏడాది కాలంలో లార్జ్ క్యాప్స్ ను మించి దూకుడు చూపగల మిడ్, స్మాల్ క్యాప్స్ వైపు ఎఫ్ఐఐలు చూపు సారించినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. షేర్ల రిటర్నులకు ప్రాధాన్యం ఇవ్వకుండా గుర్తింపు కలిగిన, పటిష్ట వ్యాపార అవకాశాలు అధికంగాగల కంపెనీలను ఎంపిక చేసుకుంటున్నట్లు తెలియజేశారు. నిజానికి 2018 జనవరి నుంచీ మిడ్, స్మాల్ క్యాప్స్ వెనకడుగులో నిలిచిపోయినట్లు మార్కెట్ విశ్లేషకులు ఈ సందర్భంగా వివరించారు. అయితే ఇటీవల బిజినెస్ లు మందగించిన లార్జ్ క్యాప్ కంపెనీల నుంచి పెద్ద కంపెనీలుగా ఆవిర్భవించగల మిడ్ క్యాప్స్ వైపు ఎఫ్ఐఐలు చూపును మరల్చినట్లు తెలియజేశారు. భారీ లాభాలలో ఎఫ్ఐఐలు ఇన్వెస్ట్ చేసిన కొన్ని కంపెనీలు, షేర్ల జోరు తీరు ఎలా ఉన్నదంటే.. ఇండో కౌంట్ ఇండస్ట్రీస్ లో ఎఫ్ఐఐల వాటా క్యూ2లో 5.2 శాతం నుంచి 6.99 శాతానికి ఎగసింది. ఈ షేరు 544 శాతం ర్యాలీ చేసింది. ఈ బాటలో సీజీ పవర్లో వాటా 0.23 శాతం నుంచి 0.3 శాతానికి పెరిగింది. షేరు 459 శాతం దూసుకెళ్లింది. ఆర్తి డ్రగ్స్ లో వాటా 1.82 శాతం నుంచి 2.19 శాతానికి బలపడగా.. షేరు 408 శాతం జంప్ చేసింది. ఇదే విధంగా అదానీ గ్రీన్లో ఎఫ్ఐఐల వాటా 21.52 శాతం నుంచి 22.43 శాతానికి చేరగా.. షేరు 405 శాతం పురోగమించింది. లారస్ ల్యాబ్స్ లో వాటా 4.68 శాతంమేర పెరిగి 20.74 శాతాన్ని తాకింది. షేరు 400 శాతం లాభపడింది. ఇతర కౌంటర్లలో ఇంటలెక్ట్ డిజైన్, మాస్టెక్, టాటా కమ్యూనికేషన్స్, గ్లోబస్ స్పిరిట్స్, మార్క్ సన్స్ ఫార్మా, మజెస్కో 330-254 శాతం మధ్య ఎగశాయి. వీటిలో ఎఫ్ఐఐల వాటా 1.4-0.2 శాతం మధ్య పెరిగింది. -
ఎఫ్పీఐల దన్ను- మార్కెట్ల దూకుడు
ఓవైపు కోవిడ్-19 కారణంగా ఆర్థిక వ్యవస్థ తిరోగమన పథంలో పడినప్పటికీ దేశీ స్టాక్ మార్కెట్లలోకి విదేశీ పెట్టుబడులు వెల్తువెత్తుతున్నాయి. దీంతో తాజాగా మార్కెట్ల ప్రామాణిక ఇండెక్స్ సెన్సెక్స్ ఆరు నెలల తదుపరి 40,000 పాయింట్ల మార్క్ను అధిగమించింది. ఇందుకు ప్రధానంగా విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) దేశీ స్టాక్స్లో కొనుగోళ్లకు ఆసక్తి చూపడం కారణమవుతున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. వివరాలు ఇలా.. ఆగస్ట్లో స్పీడ్ ఈ నెలలో శుక్రవారం వరకూ(3-28) ఎఫ్పీఐలు దేశీ క్యాపిటల్ మార్కెట్లలో రూ. 47,334 కోట్లను ఇన్వెస్ట్ చేశారు. వీటిలో రూ. 46,602 కోట్లను ఈక్విటీ కొనుగోలుకి వెచ్చించగా.. రూ. 732 కోట్లను రుణ సెక్యూరిటీలలో ఇన్వెస్ట్ చేశారు. వెరసి వరుసగా మూడో నెలలోనూ నికర పెట్టుబడిదారులుగా నిలుస్తున్నారు. కాగా.. జులైలో ఎఫ్పీఐల పెట్టుబడులు రూ. 3,301 కోట్లకు పరిమితంకాగా.. జూన్లో రూ. 24,053 కోట్ల విలువైన స్టాక్స్ నికరంగా సొంతం చేసుకున్నారు. వెరసి ఈ ఆర్థిక సంవత్సరం అంటే ఏప్రిల్ నుంచి ఎఫ్పీఐలు ఈక్విటీలలో నికరంగా రూ. 80,000 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. వీటిలో ఆగస్ట్ పెట్టుబడులే అధికంకావడం గమనార్హం! కారణాలున్నాయ్ కరోనా వైరస్ విలయంతో ఈ ఏడాది తొలి క్వార్టర్(ఏప్రిల్-జూన్)లో దేశ ఆర్థిక వ్యవస్థ 19 శాతం క్షీణించవచ్చన్న అంచనాలున్నప్పటికీ రెండో త్రైమాసికం నుంచీ రికవరీ బాట పట్టవచ్చన్న ఆశలు ఎఫ్పీఐలకు ప్రోత్సాహాన్నిస్తున్నట్లు మార్కెట్ నిపుణులు తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వ ప్యాకేజీలు, రిజర్వ్ బ్యాంక్ తీసుకుంటున్న లిక్విడిటీ పెంపు, రేట్ల కోత వంటి చర్యలు దోహదపడనున్నట్లు ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. లాక్డవున్ల ఎత్తివేత తదుపరి పలు రంగాలలో డిమాండ్ కనిపిస్తుండటంతో కంపెనీలు సైతం మెరుగైన ఫలితాలు ప్రకటించే వీలున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇలాంటి పలు అంశాలు.. వర్ధమాన దేశాలలోకెల్లా దేశీ మార్కెట్లను ఆకర్షణీయంగా నిలుపుతున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. వీటికి జతగా గత వారాంతాన యూఎస్ ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ సైతం వడ్డీ రేట్లను నామమాత్ర స్థాయిలోనే మరికొంత కాలం కొనసాగించనున్నట్లు స్పష్టం చేయడంతో ఇకపైన కూడా విదేశీ పెట్టుబడుల రాక కొనసాగవచ్చని కొటక్ సెక్యూరిటీస్, మార్నింగ్ స్టార్, గ్రో తదితర రీసెర్చ్ సంస్థల నిపుణులు ఊహిస్తున్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement