breaking news
Female cricketers
-
కివీస్ క్రికెట్లో ‘సమ’శకం.. పురుషులతో సమానంగా మహిళా క్రికెటర్లకు వేతనాలు
క్రైస్ట్చర్చ్: ప్రపంచ క్రికెట్లో సమ, నవ శకానికి న్యూజిలాండ్ క్రికెట్ (ఎన్జెడ్సీ) నాంది పలికింది. అంతర్జాతీయ క్రికెట్లో ఆధిపత్యం చలాయిస్తున్న పురుష క్రికెటర్లతో సమానంగా మహిళా క్రికెటర్లకు మ్యాచ్ ఫీజులు, కాంట్రాక్టులు ఇవ్వనున్నట్లు ఎన్జెడ్సీ ప్రకటించింది. దీనికి సంబంధించిన విధాన నిర్ణయాన్ని వెలువరించింది. వచ్చే ఐదేళ్ల కాంట్రాక్టులో నూతన సమాన వేతనాలను ఒక్క అంతర్జాతీయ క్రికెట్కే పరిమితం చేయకుండా ఎన్జెడ్సీ బోర్డు దేశవాళీ క్రికెట్లోనూ ప్రవేశపెట్టడం నిజంగా కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టడమే! ఇప్పుడు కివీస్ స్టార్లు విలియమ్సన్ సహచరులకు ఎంత మొత్తం లభిస్తుందో... సోఫీ డివైన్ బృందం కూడా అంతే మొత్తం మ్యాచ్ ఫీజులు, వేతన భత్యాలు పొందుతుంది. శాసించే చోట సమానత్వం అంతర్జాతీయ క్రికెట్ అంటేనే పురుషుల క్రికెట్. అది ప్రపంచకప్ అయినా... యాషెస్ సిరీస్ అయినా... ఆసియా కప్ అయినా పురుషాధిక్యమే మైదానంలో మెరుపుల్ని మెరిపిస్తుంది. వారి బ్యాంకు ఖాతాల్లో రూ.కోట్లను జమచేసుకుంటుంది. ఇలా శాసించే చోట సమానత్వం కొత్త ఒరవడే కాదు... ఆ బోర్డు చేసే సాహసమే! పురుషుల సిరీస్లకు వచ్చేంత రాబడి మహిళల ప్రపంచకప్కు రాదు. అయినప్పటికీ న్యూజిలాండ్ సమాన చెల్లింపుల విధానంతో ఏకంగా ఐదేళ్లు కాంట్రాక్టు ఇవ్వడం అనేది క్రికెట్లో పెద్ద సంచలనం. ఎన్జెడ్సీ ఫీజులను పరిశీలిస్తే ఒక్కో టెస్టుకు 10,500 న్యూజిలాండ్ డాలర్లు (రూ. 5 లక్షల 11 వేలు), ఒక్కో వన్డేకు 4,000 డాలర్లు (రూ. లక్షా 94 వేలు), ఒక్కో టి20 మ్యాచ్కు 2,500 డాలర్లు (రూ. లక్షా 21 వేలు) చెల్లిస్తారు. అయితే న్యూజిలాండ్ అమ్మాయిల జట్టు 2004 నుంచి ఇప్పటివరకు ఒక్క టెస్టు కూడా ఆడలేదు. -
మహిళా క్రికెటర్లకు రైల్వే శాఖ ప్రమోషన్లు
న్యూఢిల్లీ: మహిళల ప్రపంచకప్ క్రికెట్లో అత్యద్భుతంగా రాణించిన భారత క్రికెటర్లకు రైల్వే శాఖ నేరుగా పదోన్నతి కల్పించనుంది. ప్రస్తుతం జట్టులోని 15 మంది క్రీడాకారిణులలో 10 మంది రైల్వే ఉద్యోగులే ఉండటం విశేషం. ఇందులో కెప్టెన్ మిథాలీ రాజ్తో పాటు హర్మన్ప్రీత్ కౌర్, ఏక్తా బిష్త్, పూనమ్ రౌత్, వేద కృష్ణమూర్తి, పూనమ్ యాదవ్, సుష్మా వర్మ, మోనా మేష్రమ్, రాజేశ్వరి, నుజ్హత్ పర్వీన్ ఉన్నారు. ‘భారత జట్టుకు రైల్వే మంత్రి సురేశ్ ప్రభు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే మా పాలసీ ప్రకారం వారికి నజరానా కూడా ఇవ్వనున్నాం’ అని రైల్వే క్రీడాభివృద్ధి కార్యదర్శి రేఖా యాదవ్ తెలిపారు. మరోవైపు హర్మన్ప్రీత్కు పంజాబ్ ప్రభుత్వం రూ. 5 లక్షల నజరానా ప్రకటించడంతోపాటు డీఎస్పీ ఉద్యోగం ఆఫర్ చేసింది.