breaking news
FCNR
-
డాలర్ డిపాజిట్లపై వడ్డీ రేట్ల పెంపు
న్యూఢిల్లీ: ప్రవాస భారతీయుల నుంచి డాలర్లను ఆకర్షించే దిశగా కొత్త ఎఫ్సీఎన్ఆర్ (బి) డిపాజిట్లపై బ్యాంకులకు ఆర్బీఐ డాలర్–రూపీ ఫారెక్స్ స్వాప్ సదుపాయాన్ని ప్రకటించిన నేపథ్యంలో బ్యాంకులు సదరు ఖాతాలపై రేట్లను సవరించాయి. ఈ డిపాజిట్లపై బంధన్ బ్యాంక్ ఆకర్షణీయ వడ్డీ రేట్లను ప్రకటించింది. 3 నుంచి 5 ఏళ్ల వ్యవధికి 1 మిలియన్ డాలర్లకు పైగా డిపాజిట్లపై 7.1 శాతం వడ్డీ రేటు ఉంటుందని బ్యాంకు తెలిపింది. 1 మిలియన్ డాలర్ల వరకు డిపాజిట్లపై 7 శాతం ఉంటుందని పేర్కొంది. రూపాయి క్షీణతపరమైన రిసు్కలను అధిగమించి మెరుగైన రాబడులను అందుకునేలా ఎన్ఆర్ఐ కస్టమర్లకు ఇది సహాయకరంగా ఉంటుందని బ్యాంక్ ఈడీ రాజీందర్ కుమార్ బబ్బర్ తెలిపారు.మరోవైపు, బ్యాంక్ ఆఫ్ బరోడా .. తమ లెజెండ్ ఎఫ్సీఎన్ఆర్ (బి) డిపాజిట్ స్కీము కింద డాలర్ డిపాజిట్లపై 6.25 శాతం వరకు, బ్రిటీష్ పౌండ్ స్టెర్లింగ్ .. ఆస్ట్రేలియన్ డాలర్పై 4.75 శాతం, యూరో డిపాజిట్లపై 3.75 శాతం, కెనడియన్ డాలర్ డిపాజిట్లపై 5.15 శాతం వడ్డీ రేట్లను ప్రకటించింది. ఇవి మూడు నుంచి ఐదేళ్ల కాలవ్యవధికి వర్తిస్తాయి. అటు ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కూడా ఈ డిపాజిట్లపై వడ్డీ రేటును 7.13 శాతం వరకు పెంచినట్లు తెలిపింది. ఇక సౌత్ ఇండియన్ బ్యాంక్ ఎఫ్సీఎన్ఆర్ (బి) డిపాజిట్లపై 6.50 శాతం వరకు వడ్డీ రేట్లు ఇస్తున్నట్లు వెల్లడించింది.సాధారణంగా ఈ విధానంలో ప్రవాస భారతీయులు డాలర్ల మారకంలో ఎఫ్సీఎన్ఆర్ (బి) ఖాతాలో డిపాజిట్ చేస్తారు. ఆ డాలర్లను సదరు బ్యాంకు నిర్దిష్ట రిఫరెన్స్ రేటుకు ఆర్బీఐకి విక్రయించి, రూపాయి మారకంలో నిధులు సమకూర్చుకుంటుంది. మెచ్యూరిటీ సమయంలో మళ్లీ అదే రేటుకి ఆర్బీఐ నుంచి డాలర్లను తిరిగి కొనుగోలు చేస్తుంది. ఈ క్రమంలో రూపాయి బలహీనపడితే బ్యాంకు నష్టపోకుండా ఆర్బీఐ ఆ రిసు్కను భరిస్తుంది. -
ఎస్బీహెచ్ ‘ప్లాటినమ్’ సేవింగ్స్ ఖాతా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వరంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ అధికాదాయ వర్గాలను దృష్టిలో పెట్టుకొని ‘ప్లాటినమ్’ పేరుతో కొత్త సేవింగ్స్ ఖాతాను ప్రారంభించింది. ఇండియాలో ఉన్న వారితోపాటు ఎన్నారైలు కూడా ప్రారంభించడానికి అవకాశం ఉన్న ఈ ఖాతాలో మూడు నెలల కనీస నిల్వను లక్ష రూపాయలు లేదా రూ.10 లక్షలు డిపాజిట్ చేయాల్సి ఉంటుందని ఎస్బీహెచ్ మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఈ ఖాతా ప్రారంభించిన వారికి నగదు బదిలీలపై ఎటువంటి రుసుములు లేకపోవడం, ఉచిత అంతర్జాతీయ డెబిట్ కార్డు, రూ. 5లక్షలకు ఉచిత వ్యక్తిగత ప్రమాద బీమా, రుణాలపై ప్రాధాన్యతను ఇవ్వనున్నట్లు బ్యాంకు పేర్కొంది. రుణాలపై ప్రోసెసింగ్ ఫీజులో పావు శాతం తగ్గింపుతోపాటు, చెక్బుక్స్పై ఎటువంటి రుసుములు కూడా వసూలు చేయడం లేదు. ఈ సౌకర్యాలు ప్రస్తుత ఖాతాదారులకు కూడా వర్తిస్తాయని, కాని కనీస నిల్వ లక్ష రూపాయల నిబంధనను పాటించాలి.


