breaking news
father vincent ferrer
-
జీవితాలను మార్చిన ఒక్క ప్రయత్నం
ఇది సామాన్యుడు చిందించిన స్వేదం. ఆ స్వేదమే వేల కుటుంబాల జీవితాల్లో అక్షర వెలుగులు విరజిమ్మేందుకు కారణమైంది. రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (ఆర్డీటీ) వ్యవస్థాపకులు ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ ఆశయాలకు అనుగుణంగా సంస్థ ప్రోగ్రాం డైరెక్టర్ మాంఛో ఫెర్రర్ పిలుపు మేరకు ‘స్పందించు సాయమందించు’ అనే కార్యక్రమానికి ఆ స్వేదమే కొత్త ఊపిరిని అందించింది. స్పందించే హృదయముంటే ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్న ఎందరో అభాగ్యులను ఆదుకోవచ్చని నిరూపించింది. హుండీ ఉద్యమం విప్లవంలా ఎగిసి పడేందుకు ఆ స్వేదమే కారణమైంది. చేసే సాయం చిన్నదా పెద్దదా అని ఎవరూ ఆలోచించ లేదు. ఒక్క రూపాయి మొదలు... వందల రూపాయలను హుండీలో వేస్తూ నిరుపేద కుటుంబాల్లో అక్షర జ్యోతులు వెలిగించేందుకు ఎందరో గ్రామీణులు ముందుకు వచ్చారు. సేవ చేయడమే జీవన సారంగా భావించిన ఆర్డీటీ వ్యవస్థాపకుల స్ఫూర్తితో సాగుతున్న ఈ హుండీ మహాయజ్ఞం గురించి ‘సాక్షి ఫోకస్’ మీ కోసం. – అనంతపురం సప్తగిరి సర్కిల్ సేవకు ప్రతిరూపంగా నిలిచిన ఆర్డీటీ సంస్థ జిల్లాలో 1969 నుంచి కార్యకలాపాలను ప్రారంభించింది. నాటి నుంచి నేటి వరకూ జిల్లా వ్యాప్తంగా పేదలను ఆదుకునేందుకు ఎన్నో సేవా కార్యక్రమాలను చేస్తూ వస్తోంది. ఇందుకు సంబంధించిన ఆర్థిక వనరులను స్పెయిన్ దేశస్తులు సమకూరుస్తూ వచ్చారు. ఆ దేశంలోని ప్రతి ముగ్గురిలో ఒకరికి ఇక్కడి ఆర్డీటీ కార్యకలాపాలపై పూర్తి స్థాయి అవగాహన ఉందంటే సంస్థ ఎంత పారదర్శకంగా సేవా కార్యక్రమాలను విస్తృతం చేస్తూ వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. సంస్థ ఆధ్వర్యంలో విద్య, వైద్యం, సొంతింటి కల సాకారం, వ్యవసాయం, క్రీడా, సామాజిక కార్యక్రమాలు నిర్వఘ్నంగా సాగిపోతున్నాయంటే అక్కడి వారి సహాయ సహకారాలు ఎంత గొప్పవో ఊహించుకోవచ్చు. మేము నిజం చేశాం.. హుండీ ఉద్యమం ప్రారంభించిన తొలిరోజుల్లో దీని గురించి ఎక్కడా ప్రచారం అనేది లేదు. గ్రామాల్లో ఆర్డీటీ చైతన్య కార్యక్రమాలు ఏర్పాటు చేసిన సమయంలో మాత్రమే కేవలం మాటల రూపంగా చెబుతూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆర్డీటీ వ్యవస్థాపకులు ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ జయంతిని పురస్కరించుకుని 2012, ఏప్రిల్ 9న పెద్దవడుగూరులో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆ సంస్థ ప్రోగ్రాం డైరెక్టర్ మాంఛో ఫెర్రర్, డైరెక్టర్ సుధీంద్రరావు హాజరయ్యారు. ఆ సమయంలో అక్కడ ఫాదర్ విగ్రహం చుట్టూ గ్రామస్తులు తమ ఇళ్లలో ఉంచుకున్న హుండీలను తీసుకువచ్చి ఉంచారు. ఇలా మొత్తం 127 హుండీలు అక్కడ ఉండడాన్ని గమనించిన మాంఛో ఫెర్రర్ ఆశ్యర్యం వ్యక్తం చేస్తూ.. ఏమిటిది అని స్థానికులను ప్రశ్నించారు. ‘మీరు చెప్పారు.. మేము నిజం చేశాం’ అంటూ స్థానికులు సమాధానమిస్తూ.. రోజు వారి కూలి పనుల ద్వారా తాము సంపాదించిన మొత్తంలో నుంచి కొంత హుండీలో వేస్తూ వచ్చినట్లు వివరించారు. అలా ప్రారంభమైన ఈ ఉద్యమం తర్వాతి కాలంలో జిల్లా అంతటా పాకింది. జిల్లా వ్యాప్తంగా తొలిసారి రూ. 84 లక్షలు సమకూరాయి. ఈ బృహత్తర కార్యక్రమానికి ‘ఇండియా ఫర్ ఇండియా’ అంటూ ఆ రోజున మాంఛో ఫెర్రర్ నామకరణం చేశారు. ప్రస్తుతం ఈ హుండీ ఉద్యమం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ విస్తరించింది. గ్రామీణుల నుంచి ఉద్యోగుల వరకూ.. ఇలా ప్రజల నుంచి సేకరించిన నిధుల వినియోగంపై గ్రామాల్లో కమ్యూనిటీ సమావేశాలు నిర్వహించి స్థానికులతో మాంఛో ఫెర్రర్ నేరుగా చర్చించారు. అనాథ పిల్లలను ఆదుకోవాలని జిల్లా వ్యాప్తంగా అందరూ ప్రతిపాదించడంతో, ప్రజానిధి వినియోగంపై ఓ ప్రత్యేక విభాగాన్నే ఏర్పాటు చేశారు. హుండీల ద్వారా వచ్చే ఆదాయాన్ని ప్రత్యేకమైన ఖాతాలో జమా చేసేలా చర్యలు తీసుకున్నారు. ఆయా గ్రామాల్లో పొగైన మొత్తాన్ని నేరుగా బ్యాంకు ఖాతాలో జమా చేసి, ఆ రసీదును ఆర్డీటీ కార్యాలయంలో అందజేస్తే ఆ విరాళానికి సంబంధించిన రసీదును అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లనూ చేశారు. సమాజంలో ఇది ఎంత మార్పు తెచ్చిందంటే ప్రతి ఒక్కరూ తమ కార్యాలయంలో, వ్యాపార సముదాయాల వద్ద, ఇళ్లలోనూ హుండీలు ఉంచుకునేలా చేసింది. తర్వాతి రోజుల్లో ఉద్యోగులు ప్రతి నెలా తమ వ్యక్తిగత ఖాతా నుంచి కొంత మొత్తాన్ని నేరుగా ఆర్డీటీ ప్రజానిధి ఖాతాలోకి ట్రాన్స్ఫర్ చేసే స్థాయికి చేరుకుంది. ప్రస్తుతం ఈ ఉద్యమంలో 10,032 మంది ఉద్యోగులు భాగస్వాములయ్యారు. వీరిలో 2,518 మంది ఆర్డీటీ సంస్థలో పనిచేస్తున్నవారే ఉన్నారు. ఏటా ఉద్యోగులు తమ వ్యక్తిగత ఖాతాల్లోంచి ప్రతి నెలా రూ.9 లక్షలను అందిస్తున్నారు. సమకూరుతున్న రూ. కోట్లు 2012లో 127 హుండీలతో ప్రారంభమైన ఈ ఉద్యమం 2013 నాటికి 43,817కు చేరుకుంది. ఈ సంఖ్య 2015 నాటికి లక్ష హుండీలకు చేరుకుంది. 2013లో హుండీల ద్వారా రూ.97,63,021 పోగయ్యాయి. 2012 నాటికి ఇది రూ. 2 కోట్లకు దాటింది. గత ఏడాది ఏకంగా రూ. 6,58,72,775 కోట్లకు చేరుకుంది. 2013–18 ఆర్థిక సంవత్సరాలకు కలిపి ఇండియా ఫర్ ఇండియా కార్యక్రమానికి రూ, 24,94,16,578 కోట్లు సమకూరాయి. గత ఐదేళ్లలో వివిధ సేవకార్యక్రమాలకు రూ.18,87,40,036 కోట్లు ఖర్చు చేశారు. 2013లో 289 మందికి పూర్తిస్థాయిలో అన్ని సౌకర్యాలు సమకూర్చారు. 2014లో 413కు మందికి సేవలను విస్తరింపజేశారు. 2015 నుంచి ఏజెన్సీ ప్రాంతాల్లోని చెంచులకు పౌష్టికాహారాన్ని అందించడం ప్రారంభించారు. ఆ ఏడాది 701మంది అనాథలను ఆదుకుంటూనే, ఐదు వేల మందికి పౌష్టికాహారాన్ని అందించారు. 2018 నాటికి 1,590 మంది అనాథలను, 5,550 మందికి పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. జీవితాలను మార్చిన ఒక్క ప్రయత్నం ఆర్టీటీ నిర్వాహకులు అందిస్తున్న స్ఫూర్తిదాయక సేవాకార్యక్రమాలను చూసిన స్పెయిన్ దేశస్తుల్లో కొత్త ఆలోచనా విధానం రేకెత్తింది. దానిని వారు ఆర్డీటీ వ్యవస్థాపకులతో పంచుకున్నారు. పేదరికంతో మగ్గిపోతున్న అనంతపురం జిల్లా వాసుల జీవన స్థితిగతుల్లో మార్పు తీసుకురావాలంటే కేవలం చదువు ఒక్కే మార్గమని భావించి ఆ దిశగా రూపొందించిన కార్యాచరణపై తొలుత పెద్ద ఎత్తున మల్లాగుల్లాలు పడ్డారు. చివరకు ‘మీ ప్రయత్నం మీరు చేయండి. ఇది కార్యరూపం దాలుస్తుందో లేదో తర్వాత చూద్ధాం’ అంటూ స్పెయిన్ దేశస్తులు భరోసానివ్వడంతో హుండీ కార్యక్రమానికి ఆర్డీటీ వ్యవస్థాపకులు రూపకల్పన చేశారు. తర్వాతి రోజుల్లో ఈ కార్యక్రమం ఓ విప్లవమై ఎగిసిపడింది. మా ఇద్దరికీ మీరందరూ.. కడప జిల్లా పోరుమామిళ్లకు చెందిన ఇద్దరు వృద్ధ దంపతులు, వారికి ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. వారిద్దరికీ పెళ్లిళ్లు అయ్యాయి. వీరికి ఓ కుమారుడు, ఓ కుమార్తె జన్మించారు. తమ బాధ్యత తీరిపోయిందనుకుని మురిసిపోతున్న ఆ వృద్ధ దంపతుల జీవితంలో అనుకోను పెనుదూమారం రేగింది. దుబాయ్లో ఉద్యోగం చేస్తున్న కుమారుడు అనారోగ్యంతో మృతి చెందాడు. ఆ బాధ భరించలేక కోడలు ఎటో వెళ్లిపోయింది. వ్యవసాయ పనులతో కుటుంబాన్ని పోషించుకుంటున్న అల్లుడు కూడా రోడ్డు ప్రమాదంలో మరణించాడు. మనస్థాపంతో కుమార్తె ఆత్మహత్య చేసుకుంది. వృద్ధులపై ఆ ఇద్దరు చిన్నారుల భారం పడింది. పూరిగుడిసెలో అత్యంత దయనీయంగా బతుకీడుస్తున్న ఆ వృద్ధ దంపతులు.. చిన్నారుల పొట్ట నింపేందుకు నానా తిప్పలు పడ్డారు. సాయమందించే వారు లేక అర్ధాకలితో జీవించసాగారు. అలాంటి సమయంలోనే వారికి ఆర్డీటీ గురించి తెలిసింది. అయితే ఆర్టీటీ సంస్థ నుంచి సాయం ఎలా పొందాలో కూడా తెలియదు. చెప్పేవారూ లేరు. దీంతో తన దీనస్థితిని వివరిస్తూ ఓ కార్డు ముక్క రాసి ఆర్డీటీ చిరునామాకు పోస్టు చేశారు. స్పందించిన సంస్థ నిర్వాహకులు వెంటనే తన ప్రతినిధులను పోరుమామిళ్లకు పంపింది. వృద్ధ దంపతులను అక్కున చేర్చుకుంది. చిన్నారులను అనంతపురం నగర శివారులోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చేర్పించింది. వీరిద్ధరే కాదు.. ఆ స్కూల్లో మరో 128 మంది అనాథలను ఆర్డీటీ సంస్థ చేర్పించి విద్యాబుద్ధులు చెప్పిస్తోంది. ప్రస్తుతం ఆ చిన్నారులను కదిపితే.. ‘నాకు నా తమ్ముడు.. వాడికి నేను.. మా ఇద్దరికీ మీరందరూ’ అంటూ చెమర్చిన కళ్లతో అంటుంటే చూసే వారి హృదయాలు ద్రవించిపోతున్నాయి. మేము అనాథలం కాదు.. మాది కదిరి. నాన్న ఆనంద్... విద్యుత్ శాఖలో లైన్మెన్గా పనిచేస్తూ మూడున్నరేళ్ల క్రితం కిడ్నీల వ్యాధితో మరణించారు. అమ్మ బాలాజీమణి మానసికరోగి. ఆమె ఎక్కడ ఉంటుందో కూడా మాకు తెలియదు. నాన్న మరణించిన రోజు.. మా చేతిలో చిల్లిగవ్వ లేదు. బంధువులందరూ కలిసి అంత్యక్రియలు జరిపించి వెళ్లిపోయారు. ఇంటిలో నేను, నా చెల్లి సాయిశరణ్య తప్ప ఎవరూ లేరు. దిక్కు తోచలేదు. ఆ సమయంలో ఆర్డీటీ సంస్థకు చెందిన ఓ ఉద్యోగి మమ్మల్ని ఆదుకున్నారు. మా విషయం తెలుసుకున్న తర్వాత మమ్మల్ని సంస్థ ద్వారా చదివిస్తున్నారు. నేను హౌస్ సర్జన్గా పనిచేస్తున్నా.. నా చెల్లి పీజీలో జాయిన్ కావాల్సి ఉంది. ఇప్పుడు మేము అనాథలం కాదు.. మాకు ఓ మహోన్నత కుటుంబం ఉందనే భరోసాతో జీవిస్తున్నాం. – సాయికృప, హౌస్ సర్జన్, అనంతపురం ఆర్డీటీనే చదివిస్తోంది మాది యాడికి మండలం పుప్పాలగుత్తి. నాన్న గుండెపోటుతో 1998లో మరణించాడు. తల్లి అశ్వత్థమ్మ 2008లో కిడ్నీ వ్యాధితో మరణించింది. పెద్దవడుగూరుకు చెందిన మారుతీప్రసాద్ అప్పటి నుంచి సాయం చేస్తూ వచ్చారు. డిగ్రీ వరకూ ఆయనే చదివించారు. ఆర్డీటీ వారికి ఉన్నత చదువుల కోసం దరఖాస్తు చేసుకుంటే వారు ఇండియా ఫర్ ఇండియా పథకం ద్వారా సాయం చేస్తామన్నారు. గత ఏడాది నుంచి వర్సిటీ ఫీజులు, హాస్టల్ ఫీజు వారే చెల్లించారు. ల్యాప్టాప్ కూడా ఇచ్చారు. ప్రతి నెలా ఖర్చుల కోసం రూ.2,500 ఇస్తున్నారు. ఆర్డీటీ సంస్థ లేకుంటే మాలాంటి వారికి బతుకు ఉండేది కాదు. – రాజశేఖర్, ఎంసీఏ విద్యార్థి, జేఎన్టీయూ, అనంతపురం పేదలూ సాయం చేయగలరు స్పందించే హృదయాన్ని కదిలిస్తే ఎదుటి వారి గుండెల్ని కదిలిస్తుందనడానికి ఈ మహత్కార్యామే నిదర్శనం. పేదలకు సాయం పొందడమే తెలుసు అని అంటారు కానీ వారు సాయం చేయగలరని ఈ హుండీ ఉద్యమం ద్వారా బహిర్గతమైంది. వారు అందించింది ఒక్క రూపాయే అయినా.. అది వేలమందికి చేయూతనందించడంలో తిరుగులేనిదిగా నిరూపితమైంది. ఓ మెరుగైన సమాజ నిర్మాణానికి కారణమైంది. – సుధీంద్రరావు, ఆర్డీటీ డైరెక్టర్ ఉప్పెనలా మారింది సాయం చేసేందుకు అవధుల్లేని సమాజాన్ని రూపొందించాం. ఇది చినుకుగా మొదలై నేడు ఉప్పెనలా మారింది. ఇది ఫాదర్ ఫెర్రర్ ఆశయం. ఈ ఆశయానికి రూపునిచ్చింది ఈ జిల్లా వాసులే. దీనిని మహావృక్షంగా భావిస్తే ఆ వృక్షానికి నీటిని అందిస్తోంది సాయం చేస్తున్న వారే. సాయం పొందుతున్న వారందరూ ఆ వృక్షం నీడలో ఉన్నవారే. – మాంఛోఫెర్రర్, ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్ సాయం చేసేందుకు సంప్రదించాల్సిన చిరునామా డైరెక్టర్, ఇండియా ఫర్ ఇండియా, రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్, బెంగుళూరు హైవే, అనంతపురం–515001, సెల్ : 98496 42334 -
మనుషుల్లో దేవుడు
చేతిలో ఓ గొడుగు... ఎవరూ వెంట రాకపోయినా ఒంటరిగా వెళుతున్న స్పెయిన్కు చెందిన ఆ వ్యక్తిని చూసిన వారు ఆశ్చర్యపోయేవారు. కనిపించిన అందరినీ అప్యాయంగా పలకరిస్తూ.. తన స్పర్శ ద్వారా ప్రేమతత్వాన్ని పంచుతున్న ఆయన పట్ల ప్రజల్లో రానురాను భక్తి భావం పెరిగింది. ఏ ప్రాంతానికి వెళ్లిన చిన్న పిల్లలకు చాక్లెట్లు అందిస్తూ వారితో సన్నిహితంగా మెలిగిన ఆయనే ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్. క్రైస్తవ మిషనరీలో భాగంగా ఇక్కడకు వచ్చిన ఆయన.. ఏనాడూ ప్రజల్లో మత వ్యాప్తికి సంబంధించిన అంశాలు మాట్లాడేవారు కారు. బహిరంగంగా తన ఆరాధ్య దైవాన్ని కొలిచేందుకు కూడా ఇష్టపడని ఆయన 1920 ఏప్రిల్ 9న స్పెయిన్ దేశంలోని బార్సిలోనాలో జన్మించారు. తన యుక్త వయసులో స్పానిష్ సైన్యంలో చేరి దేశానికి సేవ చేశారు. క్రిస్టియన్ మిషనరీని ఏర్పాటు చేసేందుకు 1952లో భారతదేశంలో అడుగు పెట్టిన ఆయన ఎన్నో చేదు అనుభవనాలను ఎదుర్కొన్నారు.ఆయన సేవా కార్యక్రమాలకు ఆకర్షితురాలైన నాటి ప్రముఖ పాత్రికేయురాలు అన్నే.. ఆయన వెన్నంటి నడిచారు. అప్పటి ఆంధ్రరాష్ట ముఖ్యమంత్రి కాసుబ్రహ్మానందరెడ్డి ఆహ్వానం మేరకు రాష్ట్రానికి వచ్చిన ఆయనను అనంత కరువు కదిలించింది. 1969లో జిల్లా కేంద్రం అనంతపురానికి చేరుకున్న ఫెర్రర్కు ఎమ్మా బిల్డింగ్లో వసతి కల్పించారు. దానినే కార్యాలయంగా మార్చుకుని జిల్లాలో సేవ కార్యక్రమాలను ప్రారంభించారు. ఇక్కడకు వచ్చిన తర్వాత ఆయన అన్నేను వివాహమాడారు. 1977 నుంచి అనంతలో ఆర్థిక వనరులను అభివృద్ధి పరిచేందుకు స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేశారు. చిన్నపిల్లలకు బలవర్ధక ఆహారం అందించేందుకు చర్యలు తీసుకున్నారు. తాము చేపట్టిన ప్రతి ఒక్క కార్యక్రమంలో ప్రజలను భాగస్వామ్యులను చేయడం ద్వారా ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ ప్రజల మనిషిగా నిలిచిపోయారు. 2009లో జనవరి 8న ఆయన మహానిష్ర్కమణ అనంతరం ఆయన ఆశయసాధనలో ఆర్డీటీ సంస్థ ముందుకెళుతోంది. - అనంతపురం సప్తగిరి సర్కిల్ -
‘అనంత’ ఆశాజ్యోతి
ఆయన ఎక్కడో ఉన్న స్పెయిన్లో పుట్టారు. చిన్నప్పటి నుంచే పేదలకు సేవ చేయాలనే తపన మెండుగా ఉండేది. ఇందుకు సరైన ప్రాంతం కోసం అన్వేషించారు. మన దేశంలోని పేదరికం గురించి తెలిసింది. మరో ఆలోచన లేకుండా ఇక్కడికొచ్చేశారు. అందులోనూ అనంతపురం జిల్లా వెనుకబాటుతనం, కరువు ఆయన్ను కదిలించాయి. దీంతో జిల్లాలోనే స్థిరపడిపోయి అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు. పేదల పాలిట ఆశాజ్యోతి అయ్యారు. ‘అనంత’ ప్రజల హృదయాల్లో ‘ఫాదర్’గా స్థిరపడిపోయారు. ఆయనే రూరల్ డెవలప్మెంట్ ట్రస్టు (ఆర్డీటీ) వ్యవస్థాపకులు ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్. నేడు ఆయన జయంతి. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. - కరువు నేలకు ఆపన్నహస్తం అందించిన మహనీయుడు - పేదల జీవితాల్లో వెలుగులు నింపిన ఆపద్బాంధవుడు - నేడు ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ జయంతి అనంతపురం సప్తగిరి సర్కిల్ : రూరల్ డెవలప్మెంట్ ట్రస్టు (ఆర్డీటీ) గురించి జిల్లాలో తెలియనివారు ఉండరు. జిల్లాతో పాటు కర్నూలు, ప్రకాశం, గుంటూరు, తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్నగర్, నల్గొండ జిల్లాల్లోనూ ఈ సంస్థ సేవలందిస్తోంది. పేదరిక నిర్మూలన, సామాజికంగా వెనుకబడిన వర్గాల అభ్యున్నతి, ప్రజలకు విద్య, వైద్యం తదితర రంగాల్లో సేవా కార్యక్రమాలు చేపడుతోంది. ఈ సంస్థ స్థాపనకు మూలకారకుడు ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్. ఈయన 1920 ఏప్రిల్ 9న స్పెయిన్ దేశంలోని బార్సిలోనాలో జన్మించారు. స్పానిష్ ఆర్మీలో సైనికుడిగా పనిచేశారు. 1952లో మనదేశానికి వచ్చారు. 1958లో రూరల్ డెవలప్మెంట్ అసోసియేషన్ పేరుతో ఉత్తర బొంబాయిలోని మన్మాడ్ ప్రాంతంలో సేవా కార్యక్రమాలను ప్రారంభించారు.12 ఎకరాల్లో పాఠశాలను నెలకొల్పడంతో పాటు బావులను తవ్వించారు. అప్పట్లో ఆయన సేవా కార్యక్రమాలకు కొందరు ఆటంకాలు సృష్టించారు. 1968లో ‘గోబ్యాక్ ఫెర్రర్’ నినాదంతో ఆందోళనలు జరిగాయి. దీంతో ఆయన అప్పటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీని కలిశారు. అదే సమయంలో అక్కడున్న అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి.. ఫెర్రర్తో మాట్లాడుతూ అనంతపురం జిల్లా దుర్భిక్ష పరిస్థితుల గురించి వివరించారు. దీంతో ఫెర్రర్ 1969లో ఆర్డీటీ ద్వారా ‘అనంత’లో సేవా కార్యక్రమాలను ప్రారంభించారు. ఇప్పటికీ ఈ సంస్థ సేవలు నిర్విరామంగా కొనసాగుతూనే ఉన్నాయి. - బత్తలపల్లి, కళ్యాణదుర్గం, కణేకల్లు, అనంతపురంలోని ఆర్డీటీ ఆస్పత్రులు నిత్యం వేలాది మందికి వైద్యసేవలు అందిస్తున్నాయి. - అనంతపురం నగర శివారులో 32 ఎకరాల విస్తీర్ణంతో 2002లో ప్రారంభించిన స్పోర్ట్స్ సెంటర్ (అనంత క్రీడాగ్రామం) క్రికెట్, హాకీ, ఫుట్బాల్, అథ్లెటిక్స్, జూడో, టెన్నిస్ తదితర క్రీడల్లో జాతీయ, అంర్జాతీయ స్థాయి క్రీడాకారులను తయారు చేస్తోంది. - 1,433 సప్లిమెంటరీ విద్యాలయాల ద్వారా 2,801 ప్రాజెక్ట్ గ్రామాల్లో ఆర్డీటీ విద్యను అందిస్తోంది. అలాగే పేద విద్యార్థుల ఉన్నత చదువుకు తోడ్పాటునిస్తోంది. - 8,122 స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేసి మహిళల ఆర్థిక స్వావలంబనకు కృషి చేస్తోంది. - దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతుల వారు, వికలాంగులకు వేలసంఖ్యలో పక్కాగృహాలను నిర్మించి ఇచ్చింది. ఇలా ఎన్నో సేవా కార్యక్రమాల ద్వారా జిల్లా ప్రజల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయిన ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ 2009లో ‘అనంత’లో కన్నుమూశారు. ప్రస్తుతం ఆర్డీటీ నిర్వహణను ఆయన సతీమణి అన్నే ఫెర్రర్, కుమారుడు మాంఛో ఫెర్రర్ చూస్తున్నారు. ‘ఫాదర్’ చూపిన బాటలోనే సంస్థ సేవలను నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నారు. ఫాదర్ ఫెర్రర్ను వరించిన అవార్డులు - 1998లో ప్రిన్స్ ఆఫ్ స్పెయిన్ అవార్డు. అదే ఏడాది ‘యూనివర్సల్ మ్యాన్ ఆఫ్ ది పీస్’ అవార్డు. - 2000లో జనరల్ ఇటాట్ ఆఫ్ క్యాటలోనియా అవార్డును సెయింట్ జార్జ్ క్రాస్ అందించింది. - 2001లో యూనెస్కో ‘లీడింగ్ ఫిగర్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ ది 20 సెంచరీ’ అవార్డుతో సత్కరించింది. - 2009లో స్పానిష్ ప్రభుత్వం ‘గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ సివిల్ మెరిట్’ అవార్డుతో సత్కరించింది.