breaking news
End of the campaign
-
రేపే పోలింగ్
సాక్షి, సంగారెడ్డి: సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి తెరపడింది. మైకుల హోరు మూగబోయింది. మండు టెండల్లో అభ్యర్థుల చల్లని పలకరింపులకు బ్రేక్ పడింది. మద్యం దుకాణాలు మూతబడ్డాయి. సోమవారం సాయంత్రం 4 గంటల నుంచి ప్రచారానికి ఫుల్స్టాప్ పడింది. ఈ నెల 30న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఇక పోలింగ్కు ఒకే రోజు మిగిలి ఉండడంతో ఓటర్లకు ప్రలోభాలు మిన్నంటాయి. అభ్యర్థులు గెలుపు కోసం ఆఖరి ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇప్పటివరకు జరిగిన ప్రలో భాలు ఓ వంతు అయితే, చివరి 24 గంటల్లో అంతకు మించి ప్రలోభాలకు గురిచేసేందుకు అభ్యర్థులు సన్నాహాలు చేసుకున్నారు. అత్యంత విశ్వసనీయ వర్గీయుల ద్వారా ఓటర్లకు డబ్బులు, మద్యం, ఇతర కానుకలను చకచక ఓటర్లకు చేరవేస్తున్నారు. ఎన్నికల నిఘా అధికారుల కళ్లు గప్పి ఈ తంతు సాఫీగా సాగిపోతోంది. గోల్డెన్ అవర్స్.. ప్రత్యర్థులతో హోరాహోరీగా తలపడుతున్న ప్రధాన పార్టీల నేతలు తమ గెలుపోటములపై ‘లెక్కలు’ వేసుకుంటున్నారు. తమ గెలుపునకు గండికొట్టే ఓటర్లను బుట్టలో వేసుకునేందకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అదే విధంగా వివిధ కారణాలతో దూరమైన పలు వర్గాల ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు చివరి ప్రయత్నాలు చేస్తున్నారు. ఓటమిపై అనుమానాలు కలిగిస్తున్న సమూహాలపై దృష్టి పెట్టి నోట్ల కట్టలు, లిక్కర్తో తమవైపు మరల్చుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఓట్ల సంఖ్యను బట్టి ఒక్కో ఓటుకు గరిష్టంగా రూ.వెయ్యి లెక్కన లక్షల రూపాయల ప్యాకేజీలను అంటగడుతున్నారు. వివిధ మార్గాల ద్వారా పోగుచేసిన ధనం, మద్యాన్ని రహస్య ప్రదేశాల నుంచి బయటకు తీసుకొచ్చి విచ్చలవిడిగా పంపిణీ చేస్తున్నారు. సోమ, మంగళవారం రాత్రి వేళల్లో ఓటర్లకు నోట్లు చేర వేసేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేసుకున్నారు. పెరిగిన దూకుడు ప్రధాన పార్టీల అగ్రనేతల సుడిగాలి పర్యటనలతో ఆయా పార్టీల అభ్యర్థుల్లో దూకుడు పెరిగింది. చివరి ఘడియలే కీలకం కావడంతో హోరాహోరీ ప్రయత్నాలు చేస్తున్నారు. ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ, ఆ పార్టీ ముఖ్యనేతలు గులాం నబీ ఆజాద్, జైరాం రమేశ్, దిగ్విజయ్ సింగ్, బీజేపీ అగ్రనేత సుష్మా స్వరాజ్, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, టీడీపీ అధినేత చంద్రబాబుల సుడిగాలి పర్యటనలతో జిల్లాలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. దీంతో కొత్తగా ఏర్పడనున్న తెలంగాణ రాష్ట్రంలో తొలి లోక్సభ సభ్యుడిగా, తొలి శాసనసభ్యుడిగా చరిత్రకెక్కడానికి ఆయా పార్టీల అభ్యర్థులు ఉవ్విళ్లూరుతున్నారు. -
రేపు ఐదో విడత పోరు
12 రాష్ట్రాల్లో 121 స్థానాలకు ఎన్నికలు ముగిసిన ప్రచారం.. బరిలో 1,769 మంది న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికల ఐదో విడత పోలింగ్కు సంబంధించి 12 రాష్ట్రాల్లోని 121 నియోజకవర్గాల్లో మంగళవారం ప్రచార ఘట్టం ముగిసింది. కర్ణాటకలో 28 సీట్లు, రాజస్థాన్లో 20, మహారాష్ట్రలో 19, ఉత్తరప్రదేశ్లో 11, ఒడిషాలో 11, మధ్యప్రదేశ్లో 10, బీహార్లో 7, జార్ఖండ్లో 6, పశ్చిమబెంగాల్లో 4, ఛత్తీస్గఢ్లో 3, జమ్మూకాశ్మీర్లో 1, మణిపూర్లో 1 చొప్పున స్థానాలకు గురువారం పోలింగ్ జరగనుంది. ప్రధాన పార్టీలకు చెందిన అగ్రనేతలు ఆయా రాష్ట్రాల్లో తమతమ పార్టీల తరఫున ప్రచారానికి విస్తృతంగా పర్యటించారు. 121 లోక్సభ స్థానాల్లో మొత్తం 1,769 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. కేంద్రమంత్రులు సుశీల్కుమార్షిండే, వీరప్పమొయిలీ (కాంగ్రెస్), మాజీ ప్రధానమంత్రి దేవెగౌడ (జేడీఎస్), నందన్ నీలేకని (కాంగ్రెస్), లాలుప్రసాద్ పెద్ద కుమార్తె మీసా భారతి (ఆర్జేడీ) తదితర ప్రముఖులు వీరిలో ఉన్నారు. మేనక ఆస్తులు రూ. 40 కోట్లు.. రెండు కేసులు ఐదో విడత ఎన్నికల్లో బరిలో ఉన్న ప్రముఖుల్లో మాజీ కేంద్రమంత్రి మేనకాగాంధీ యూపీలోని పిలిభిత్ నుంచి పోటీ చేస్తున్నారు. ఆమె తనకు రూ. 40 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయని అఫిడవిట్లో వెల్లడించారు. సంజయ్గాంధీ జంతు సంరక్షణ కేంద్రం చైర్పర్సన్గా ఉన్న మేనక (57).. తనపై ఐపీసీ సెక్షన్ 394 (దోపిడీ చేస్తూ ఉద్దేశపూర్వకంగా గాయపరచటం), సెక్షన్ 506 (నేరపూరిత బెదిరింపులు) కింద రెండు కేసులు ఉన్నట్లు తెలిపారు. వరుణ్ ఆస్తులు రూ. 20 కోట్లు, 3 తుపాకులు ఇక వచ్చే నెల 5న జరగనున్న ఏడో విడత ఎన్నికలకు నామినేషన్లు వేసేందుకు ఈ నెల 19వ తేదీ తుది గడువు కావటంతో.. బీజేపీ అభ్యర్థి వరుణ్గాంధీ మంగళవారం ఉత్తరప్రదేశ్లోని సుల్తాన్పూర్ లోక్సభ నియోజకవర్గంలో నామినేషన్లు దాఖలు చేశారు. తనకు రూ. 20 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయని ఎన్నికల అఫిడవిట్లో వరుణ్ (34) వెల్లడించారు. ఇందులో రూ. 11 కోట్లు తన బ్యాంకు ఖాతాల్లో ఉన్నాయని చెప్పారు. తనకు ఎలాంటి వాహనం లేదని, ఢిల్లీలో సొంత ఇల్లు ఉందన్నారు. ఇక సుల్తాన్పూర్ పొరుగునే ఉన్న అమేథీలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేస్తున్న రాహుల్గాంధీ ప్రత్యర్థిగా ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి కుమార్బిశ్వాస్ నామినేషన్లు వేశారు. బీఎస్పీ, తృణమూల్ కాంగ్రెస్, ఇతర స్వతంత్ర అభ్యర్థులు కూడా అమేథీలో నామినేషన్లు వేశారు. క్రికెటర్ మహ్మద్ కైఫ్ ఫూల్పూర్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్లు వేశారు. తనకు రూ.10 కోట్ల ఆస్తులు ఉన్నట్లు కైఫ్ వెల్లడించారు.