breaking news
eb-5 program
-
ఇక ఈబీ - 5 వీసాల వంతు..?
వాషింగ్టన్ : ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అమెరికా కలలు కనే జనాలకు ఒకటే ఆందోళన. ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో తెలియని పరిస్థితులు ఏర్పాడ్డాయి. ఇన్నాళ్లు హెచ్ - 1బీ వీసా మార్పుల గురించి మాట్లాడిన ట్రంప్ తాజాగా మరో బాంబ్ పేల్చారు. అమెరికాలో వ్యాపారం ప్రారంభించాలనే విదేశీ పెట్టుబడిదారులకు జారీ చేసే ఈబీ-5 వీసాలపై ట్రంప్ దృష్టి సారించనున్నట్లు సమాచారం. ఈ వీసా ద్వారా విదేశీయులు అమెరికాలో కనీసం ఒక మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టాలి. అంతేకాక ఓ పదిమందికి తప్పకుండా పర్మినెంట్ జాబ్ కల్పించాలి. ఇలా పెట్టుబడి పెట్టిన విదేశీయులకు గ్రీన్ కార్డు లభిస్తుంది. అయితే ఈ వీసాల దుర్వనియోగం జరుగుతోందని, వీటి వల్ల అక్రమాలు, మోసాలు పెరిగిపోతున్నాయని ట్రంప్ యంత్రాంగానికి అందుతున్న ఫిర్యాదుల నేపథ్యంలో యూఎస్ కాంగ్రెస్ ఈ వీసా విధానంపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈబీ-5 వీసా విధానాన్ని రద్దు చేయడం లేదా సంస్కరణలు చేపట్టడం చేయాలని ట్రంప్ యంత్రాంగం యూఎస్ కాంగ్రెస్ను కోరింది. ఈ సందర్భంగా అమెరికా పెట్టుబడిదారులకు ఉత్తమమైన రక్షణ కల్పించాలని, మోసాలకు గురికాకుండా కావాడాల్సిన అవసరం ఉందని అమెరికా పౌరసత్వ, వలసదారుల సేవల విభాగం డైరెక్టర్ ఎల్ ఫ్రాన్సిస్ సిస్సానా పేర్కొన్నారు. దేశ భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈబీ-5 వీసాల్లో సంస్కరణలు చేపట్టాల్సిన అవసరముందన్నారు ఫ్రాన్సిస్. విదేశీయులు మనీలాండరింగ్కు పాల్పడడానికి, గూఢచర్యం చేయడానికి దేశంలో పెట్టుబడులు పెడుతున్నారని ఆరోపించారు. ఈ ఏడాది, సెప్టెంబర్ 30 నాటికి ఈబీ - 5 వీసా కార్యక్రమం ముగియనుంది. ఈబీ - 5 వీసా విధానం ద్వారా ఏటా పది వేల మంది విదేశీ పెట్టుబడిదారులకు ఈ వీసాలు మంజూరు చేస్తారు. ఇది కూడా దేశాల వారీ కోటా ఆధారంగా ఉంటుంది. కాగా అమెరికాలో ఈబీ-5 వీసా కోసం దరఖాస్తులు చేసుకునే దేశాల్లో చైనా మొదటి స్థానంలో, వియత్నాం రెండో స్థానంలో, భారత్ మూడో స్థానంలో ఉన్నాయి. గత ఏడాది భారత్ నుంచి ఈబీ-5 వీసా కోసం 500 మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఈ ఏడాది 700 మంది దాకా దరఖాస్తు చేసే అవకాశం ఉందని అంచనా. ఈబీ - 5 వీసా కోసం మన దేశం నుంచి ఎక్కువగా చండిఘర్, పంజాబ్, ఢిల్లీ, ముంబై, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి ఎక్కువ పోటి ఉంటుందని తెలిపారు. అయితే దుర్వినియోగం, మోసాలకు పాల్పడుతున్నట్లు వస్తోన్న ఫిర్యాదులు ఎక్కువగా చైనాకు సంబంధించినవని తెలుస్తోంది. -
పెట్టుబడి పెట్టండి.. గ్రీన్ కార్డు పట్టండి!
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు అక్కడ నివసిస్తున్న విదేశీయుల గుండెల్లో దడ పుట్టిస్తున్నాయి. అమెరికా కలలు కల్లలు కాకుండా ఉండటానికి ఉన్న ఒకే ఒక ఆశాకిరణాన్ని అందుకునేందుకు త్వరపడుతున్నారు. అదే ఈబీ-5 ప్రోగ్రాం. ఈ ఏడాది ఏప్రిల్తో ఈబీ-5 వీసా ప్రోగ్రాం ముగిసిపోతోంది. ఈ ప్రోగ్రాం ద్వారా అమెరికాలో పెట్టుబడులు పెడితే చాలు సదరు వ్యక్తి, అతని కుటుంబంతో సహా జీవితకాలం అమెరికాలోనే ఉండొచ్చు. ఈబీ-5 ప్రోగ్రాంలో పెట్టుబడి పెట్టడానికి రెండు మార్గాలు ఉన్నాయి. ఒక మిలియన్ డాలర్లతో స్టార్టప్ ఒక మిలియన్ డాలర్ల మూలధనంతో అమెరికాలో స్టార్టప్ను మొదలుపెట్టాలి. దాంట్లో పది మంది అమెరికన్లకు ఫుల్ టైమ్ ఉద్యోగాలు ఇవ్వాలి. పెట్టుబడి ప్రభుత్వం అప్రూవ్ చేసిన ఈబీ-5 బిజినెస్లో రూ.3.4 కోట్లు పెట్టుబడి పెట్టాలి. ఆ పెట్టుబడి ద్వారా రూరల్లో నివసిస్తున్న పది మంది అమెరికన్లకు ఉద్యోగాలు కల్పిస్తారు. పెట్టుబడిదారుడు కావాలనుకుంటే ఐదేళ్ల తర్వాత తన డబ్బును ఉపసంహరించుకోవచ్చు. దీంతో ఈ ప్రోగ్రామ్లో చేరేందుకు భారతీయులు క్యూ కడుతున్నారు. గత కొద్ది వారాలుగా సరాసరిన వారానికి ముగ్గురు భారతీయులు ఈ ప్రోగ్రాంలో పెట్టుబడులకు సంతకాలు పెట్టేస్తున్నారు. ట్రంప్ ట్రావెల్ బ్యాన్ నిర్ణయం తర్వాత హెచ్1బీ వీసాలపై కూడా ఆంక్షలు తప్పవనే వార్తలు వస్తున్నాయి. దాంతో ఈబీ-5 ప్రోగ్రాంకు దరఖాస్తు చేసుకునే విదేశీయుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. ఇప్పటివరకూ 210 ఈబీ-5 దరఖాస్తులు రాగా.. వాటిలో 42 భారతీయులవే ఉన్నాయి. బెయిన్, రిలయన్స్, ఆదిత్య బిర్లా, మెక్కిన్సే లాంటి కంపెనీల్లో పెద్ద స్ధాయిలో పనిచేస్తున్న ఉద్యోగులు, వ్యాపారకుటుంబాలు ఈ దరఖాస్తులు చేసుకున్నట్లు తెలిసింది.