తల్లిని చేసి పరారైన యువకుడు
అమలాపురం టౌన్ (అమలాపురం) : అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకున్నాడు. కల్లబొల్లి కబుర్లు చెప్పి వెంట వచ్చేలా చేసుకున్నాడు. చివరకు ఆమెను గర్భవతిని చేసి పరారయ్యాడు. చివరికి ఆ అమాయకురాలు.. మగబిడ్డకు జన్మనిచ్చింది. ఏమైందని అడుగుతుంటే.. ఓ కుర్రాడు వచ్చాడు.. తర్వాత కనిపించకుండా వెళ్లిపోయాడని ఆమె పొత్తిళ్లలో బిడ్డను పెట్టుకుని అమాయకంగా చెబుతోంది. అమలాపురం రూరల్ మండలంలో మిక్చర్ కాలనీకి చెందిన 23 ఏళ్ల ఆమె అమలాపురం పట్టణంలో ఒక షాపులో పనిచేసేది. తండ్రి చనిపోయాడు.
తల్లి కూలి పనికి వెళుతుంది. అక్కకు పెళైంది. ఇద్దరు తమ్ముళ్లు వడ్రంగి మేస్త్రుల వద్ద హెల్పర్లు. ఎనిమిది నెలల క్రితం భీమవరానికి చెందిన ఓ యువకుడు కూలీ పనికి అమలాపురం వచ్చాడు. ఆమెకు మాయ మాటలు లైంగికదాడి చేశాడు. ఆమె గర్భం దాల్చ డంతో అతడు పరారయ్యాడు అమలాపురం ప్రభుత్వ ఏరియా ఆస్పతిలో మగ బిడ్డకు జన్మనిచ్చింది.
స్టేట్మెంట్ తీసుకున్న పోలీసులు..
విషయం తెలుసుకున్న పోలీసులు ఆస్పత్రికి వచ్చి బాధితురాలి నుంచి స్టేట్మెంట్ తీసుకున్నారు. ఆస్పత్రిలో బిడ్డను జాగ్రత్తగా చూసుకోవాలని... లేకుంటే బిడ్డను మాయం చేసేవారు ఉంటారని ఆమెకు పోలీసులు జాగ్రత్తలు చెప్పారు. ఇదిలా ఉండగా, బాధితురాలి ప్రాంతానికి చెందిన ఒకరిద్దరు ఈ విషయాన్ని బయటకు తెలియకుండా జాగ్రత్తలు తీసుకుంటూ రాజీ చేసే ప్రయత్నాలు చేస్తుండటం అనుమానాలకు తావు ఇస్తోంది.
ఈ విషయంపై రూరల్ సీఐ జి.దేవకుమార్ను వివరణ కోరినప్పుడు ‘బాధితురాలు, ఆమె కుటుంబం నుంచి ఫిర్యాదు అందలేదని, ప్రస్తుతానికి ఆమె నుంచి స్టేట్మెంట్ రికార్డు చేశామని చెప్పారు. ఫిర్యాదు వస్తే దర్యాప్తు చేసి బాధితురాలికి న్యాయం చేసేలా ప్రయత్నిస్తానని అన్నారు. ఐసీడీఎస్ లేదా స్త్రీశిశు సంక్షేమ శాఖ అధికారులు స్పందించి ఈ తల్లీబిడ్డకు రక్షణ కల్పించాలని పలువురు కోరుతున్నారు.