dmho koteswari
-
‘స్వచ్ఛ ఆస్పత్రి అభియాన్’ అమలుకు సిద్ధం
ఏలూరు అర్బన్: ఆస్పత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలు, చికిత్సలతో పాటు ఆహ్లాదకర వాతావరణం కల్పించేందుకు స్వచ్ఛ ఆస్పత్రి అభియాన్ పేరిట కొత్త పథకం అమలుకు చర్యలు ప్రారంభించామని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి కె.కోటేశ్వరి తెలిపారు. స్థానిక డీఎంహెచ్వో కార్యాలయంలో బుధవారం స్వచ్ఛ ఆస్పత్రి అభియాన్ పథకంపై ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులకు శిక్షణ ఇచ్చారు. ప్రభుత్వాస్పత్రుల్లో బయోవేస్ట్ మేనేజ్మెంట్, ఆవరణ, పరిసరాలు, వార్డులు, ఆపరేషన్ థియేటర్లు కార్పొరేట్ స్థాయిలో అత్యంత పరిశుభ్రంగా, ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ, కుటుంబ సంక్షేమ శాఖ ఆదేశాలిచ్చిందని చెప్పారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ భాస్కర్ ఆదేశాల మేరకు జిల్లాలో స్వచ్ఛ ఆస్పత్రి అభియాన్ అమలుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లా క్వాలిటీ అధికారి మనోజ్, జిల్లా ప్రభుత్వాస్పత్రి క్వాలిటీ అధికారి, ఝాన్సీ దుర్గారాణి, ప్రాజెక్ట్ అధికారి డాక్టర్, జె.నాగేశ్వరరావు పాల్గొన్నారు. -
జిల్లాలో 32 సంచార వైద్య బృందాలు
నల్లజర్ల: ఆరేళ్లలోపు పిల్లలు, ఇంటర్ వరకు విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు జిల్లాలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నట్టు జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి కోటేశ్వరి తెలిపారు. నల్లజర్ల పీహెచ్సీని బుధవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ఇందుకు 32 సంచార వైద్య బృందాలను నియమించనున్నట్టు తెలిపారు. రాష్ట్రీయ బాల ఆరోగ్య పథకాన్ని అమలు చేసేందుకు బృందాలు సర్వే చేస్తాయన్నారు. మొత్తం 30 రకాల వ్యాధులపై ప్రాథమిక స్థాయిలో క్షేత్ర పరిశీలన చేసి సర్వేలో పొందుపరుస్తారన్నారు. సర్వేలో గుర్తించిన అంశాలే భవిష్యత్తులో విద్యార్థుల ఆరోగ్య చికిత్సలకు కీలకమవుతాయని చెప్పారు. పుట్టుకతో వచ్చే లోపాల విభాగంలో 9, రోగనిరోధక శక్తి విభాగంలో 5,బాల్యంలో వచ్చే వ్యాధుల విభాగంలో 6, వైకల్యంతో కూడిన అభివృద్ధి ఆలస్యాల విభాగంలో 10 వ్యాధులకు చోటు కల్పించామన్నారు. సర్వేలో గుర్తించిన వ్యాధుల ప్రకారం ముందుగా పీహెచ్సీలో అనంతరం ఏరియా ఆస్పత్రి, డీఈఐసీ కేంద్రాల్లో చికిత్స అందిస్తామన్నారు. జిల్లాలో స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 19 అర్బన్ హెల్త్ సెంటర్లను ఈయూపీహెచ్సీలుగా ప్రభుత్వమే నిర్వహించనున్నట్టు చెప్పారు. వర్షాల నేపథ్యంలో వ్యాధుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. -
మాతా, శిశు మరణాలు తగ్గించేందుకు కృషి
ఏలూరు అర్బన్: జిల్లాలో మాతా, శిశు మరణాలు తగ్గించేందుకు జిల్లా వైద్యారోగ్య శాఖలోని అన్ని స్థాయిల ఉద్యోగులు, సిబ్బంది సమష్టి కృషిచేయాలని డీఎంహెచ్వో డాక్టర్. కె.కోటేశ్వరి అన్నారు. స్థానిక డీఎంహెచ్వో కార్యాలయంలో మంగళవారం మల్టీపర్పస్ హెల్త్ ఎక్స్టñ న్షన్ అధికారుల సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో మాతా, శిశుమరణాలను పూర్తిగా నిరోధించే యోచనతో కేంద్రం ప్రధానమంత్రి మాతృత్వ సురక్షిత అభియాన్ పేరిట నూతన కార్యక్రమం అమలు చేస్తుందన్నారు. అదే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా పథకాలను అమలు చేస్తుందన్నారు. ఏఎన్ఎం స్థాయి నుంచి అన్ని స్థాయిల వారు తమ ప్రాంత గ్రామాల్లో ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించి ప్రభుత్వాస్పత్రుల్లో సాధారణ, సురక్షిత ప్రసవాలు ఎక్కువ సంఖ్యలో జరిగేలా ప్రజలను చైతన్యపరచాలని కోరారు. గర్భిణులకు పూర్తిస్థాయి వైద్య సేవలందించాలని, హైరిస్క్ గుర్తించిన సమయాల్లో వారిని అన్ని వసతులు గల ఆస్పత్రుల్లో చేర్పించాలన్నారు. అడిషనల్ డీఎంహెచ్వో పి.ఉమాదేవి, జబార్, డాక్టర్, రోషన్మియా, డాక్టర్, రాథోడ్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కన్సల్టెంట్, డాక్టర్, మిస్బా, డెమో చదలవాడ నాగేశ్వరరావు పాల్గొన్నారు.