breaking news
current woes
-
కరెంటు కష్టాలకు ఇక చెల్లు
మెదక్ జిల్లాలో లో ఓల్టేజీ సమస్యను నియంత్రించి, నాణ్యమైన విద్యుత్ను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక బద్ధంగా కృషి చేస్తోందని నీటి పారుదల శాఖ మంత్రి హరీష్రావు వెల్లడించారు. మంగళవారం స్థానిక విద్యుత్ డీఈ కార్యాలయ ప్రాంగణంలో రూ. 1.72 కోట్లతో నిర్మించిన 33/11 కేవీ సబ్ స్టేషన్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, సిద్దిపేట సబ్ స్టేషన్ను నాలుగు నెలల్లోనే నిర్మించడం అభినందనీయమన్నారు. జిల్లాకు కేంద్రం రూ. 82 కోట్లను మంజూరు చేసిందని, ఆ నిధుల్లో సిద్దిపేటకు రూ. 6 కోట్లు మంజూరయ్యాయన్నారు. వీటి ద్వారా నూతన లైన్ల నిర్మాణం, ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు తదితర విద్యుత్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. మార్చి 31 లోగా ఈ నిధులను వినియోగించుకోవాలని, లేకపోతే నిధులు వెనక్కి వెళ్లే ప్రమాదం ఉందన్నారు. సిద్దిపేట నియోజకవర్గంలో విద్యుత్ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని, అందులో భాగంగానే రంగధాంపల్లి, పుల్లూరు, చౌడారంలో 33/11 కేవీ సబ్ స్టేషన్లు మరో మూడు నెలలో పూర్తి కానున్నాయన్నారు. చిన్నకోడూరు మండలం చంద్లాపూర్లో రూ. 25 కోట్లతో 133 కేవీ సబ్స్టేషన్ను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. జిల్లాలో ఇప్పటికే 34 సబ్స్టేషన్ల పనులు ప్రారంభంలో ఉన్నాయని, మరో 30 సబ్స్టేషన్ల నిర్మాణానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామన్నారు. భవిష్యత్లో జిల్లాకు విద్యుత్ సమస్య ఉత్పన్నం కాకుండా చర్యలు చేపడుతామన్నారు. కార్యక్రమంలో ఎస్ఈ సదాశివరెడ్డి, డీఈ శ్రీనివాస్రెడ్డి, ఏడీఈ ప్రశాంత్, ఏఈలు రమేష్, వెంకటేష్, శ్రీనివాస్లు పాల్గొన్నారు. సేవాభావంతో వైద్యం చేయాలి సిద్దిపేట పట్టణంలో కార్పొరేట్ స్థాయి వైద్యం అందుబాటులోకి రావడం అభినందనీయమని, అయితే తక్కువ ఖర్చుతో కార్పొరేట్ వైద్యం అందుబాటులోకి తెచ్చేలా కార్పొరేట్ ఆస్పత్రులు పని చేయాలని మంత్రి హరీష్రావు కోరారు. మంగళవారం మంత్రి పట్టణంలో సూపర్ స్పెషాలిటీ దంత వైద్యశాల, సురక్ష ఆస్పత్రిని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సిద్దిపేటలో హైదరాబాద్ తరహాలో సురక్ష ఆస్పత్రి ఏర్పాటు చేయడం హర్షణీయమన్నారు. ప్రాణాపాయ స్థితిలో హైదరాబాద్కు పరుగులు తీసే బాధ లేకుండా స్థానికంగా కార్పొరేట్ వైద్యంతో కూడిన ఆస్పత్రిని ఏర్పాటు చేయడానికి ముందుకు రావడం పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు భూపాల్రెడ్డి, సుధాకర్రెడ్డి, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ రాజమణి తదితరులు పాల్గొన్నారు. -
కరెంట్ కష్టాలకు టీడీపీ, కాంగ్రెస్లే కారణం
నల్లగొండ : తెలంగాణలో కరెంటు కష్టాలకు గతంలో అధికారంలో ఉన్న టీడీపీ, కాంగ్రెస్ పార్టీలే కారణమని రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. సోమవారం స్థానిక టీఆర్ఎస్ నాయకుడు దుబ్బాక నర్సింహారెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి జగదీష్రెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రెండు నెలల పసిపాపగా ఉందని, కరెంటు కోతలతో సంబంధం లేదన్నారు. రైతులు కేసీఆర్ దిష్టిబొమ్మలకంటే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆంధ్రా ముఖ్యమంత్రి చంద్రబాబు దిష్టిబొమ్మలు దగ్ధం చేయాలన్నారు. విద్యుత్ కోతల కారణంగా రైతులు ధర్నాలు చేస్తే పోలీసులు లాఠీలు ఎత్తవద్దన్నారు. కాంగ్రెస్ నాయకులు ఇళ్లు, రేషన్కార్డులలో అవినీతికి పాల్పడ్డారని, వారి పాపాలను టీఆర్ఎస్ మోయవద్దనే ఉద్దేశంతోనే విచారణలు చేపడుతున్నట్టు తెలిపారు. టీడీపీ, కాంగ్రెస్ హయాంలో జానారెడ్డి మంత్రిగా అధికారంలో ఉన్నా ఫ్లోరైడ్ విముక్తి కోసం ఎలాంటి చర్యలూ తీసుకోలేదన్నారు. పోలీసుశాఖకు ముఖ్యమంత్రి కేసీఆర్ 340 కోట్ల రూపాయలు కేటాయించారన్నారు. చంద్రబాబు, వెంకయ్యనాయుడు అన్యాయం చేశారు.. ఖమ్మం జిల్లాలోని ఏడు గిరిజన మండలాలను ఆంధ్రా ప్రాంతంలో కలిపి చంద్రబాబునాయుడు, వెంకయ్యనాయుడు అన్యాయం చేశారన్నారు. గతంలో చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏడేళ్లు వర్షాలు లేక రాష్ట్రంలో కరువు వచ్చిందన్నారు. ప్రస్తుతం కూడా ఆంధ్రాకు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు ఇక్కడే తిష్టవేసి ఉన్నందువల్లనే వర్షాలు రావడం లేవని ప్రజలు అనుకుంటున్నారని తెలిపారు. ప్రతిపక్షాలు రైతులను రెచ్చగొడుతున్నాయి : మంత్రి గుంటకండ్ల జగదీష్రెడ్డివిద్యుత్ విషయంలో ప్రతిపక్షాలు రైతులను రెచ్చగొడుతున్నాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్రెడ్డి అన్నారు. పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య బఫూన్లాగా, బీజేపీ అధ్యక్షుడు కిషన్రెడ్డి విచిత్రంగా మాట్లాడుతున్నారన్నారు. విద్యుత్ విషయంలో రైతాంగం ప్రతిపక్షాల మాటలు నమ్మవద్దన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు నరేందర్రెడ్డి, నాయకులు దుబ్బాక నర్సింహారెడ్డి, నోముల నర్సింహయ్య తదితరులు పాల్గొన్నారు.