crucifixion of Jesus
-
మరణములో నుండి జీవములోనికి
దేవుడు తన బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపాడు (ఎఫెసీ 1:20,21). అన్నదే విశ్వసించదగ్గ అపొస్తలుల సువార్త సంబంధిత బోధయై ఉంది.సత్యవాక్యమను రక్షణ సువార్తగా కూడా ఇది ఉంది. లేచాడు అన్నది సువార్త కాదు. సర్వశక్తి సంపన్నుడైన అద్వితీయ సత్య దేవుని చేత యేసు మృతులలో నుండి సజీవంగా లేపబడ్డాడు అనునదే లేఖనానుసార సత్య సువార్త. తండ్రికి విలువిచ్చే క్రీస్తు అపార విధేయతను ఇదే ఘనంగా చాటుతుందనుటలో ఎలాంటి సందేహం అవసరం లేదు. ’వాక్యము నీ వద్దను, నీ నోటను, నీ హృదయములోను ఉన్నది. అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. అదేమనగా – యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడుదువు’ (రోమా 10: 8–10). యేసు సజీవుడుగు దేవుని కుమారుడైన క్రీస్తు అనేది అపొస్తలుల అమూల్య విశ్వాసం. దేవుని కుమారుడు అంటే ఆయన ఆత్మ సంబంధ ఇశ్రాయేలీయుల రాజు అని అర్థం. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్ముతూ ఆయన నామమందు జీవము పొందాలి అన్నదే ప్రతి ఒక్కరి ఆత్మ సంబంధ విజయానికి మూలం. ఈ లోకం మీద విజయం యేసు దేవుని కుమారుడు అనుటలోను , ఆయన్ను దేవ దేవుడు ఈ లోకానికి శరీరధారిగా పంపాడని విశ్వసించుటలోనే విజయం దాగి ఉంది (1యోహాను 5:5 ).మరి క్రీస్తు విజయానికి మూలం ఎక్కడ అన్నది లోతుగా పరీశీలన చేస్తే అది ఒక్క ఆయన విధేయతే అనేది బహు తేటగా వెల్లడవుతూ ఉందన్నది ఆశ్చర్యకర విశేషం.ఆజ్ఞలకు లోబడి పాపం చేయకపోవడం ద్వారా పరిశుద్ధత, దాని విధేయత ఈ రెండూ ఎప్పుడు నిలుపుకొనే వేకువ ప్రార్థనలతో అవిశ్రాంత విన్నపాలతో క్రీస్తు అసాధారణ విజయుడిగా, జగజ్జేతగా చరిత్రకెక్కాడు.దేవుడు తనకు అత్యంత విధేయుడైన తన కుమారుడను మరణంలో నుండి జీవములోనికి దాటించాడు. మరణంలోనుండి జీవములోనికి రావడం, పునరుత్థానం చెందడం ఇలా యేసు మరణాన్ని జయించడం దేవుని గొప్ప సంకల్పం.అయితే తనను మరణం నుండి రక్షింపగల తండ్రియైన దేవునికి ప్రార్థనలు, యాచనలు సమర్పించినందున యేసు అంగీకరించబడ్డాడనేది ఇదే ఆయన సాహసోపేత విజయానికి మూలం అయ్యింది. ఇక్కడ మరణం అంటే సిలువ మరణం కాదు, ఆత్మ సంబంధ మరణం. యేసుకు సిలువ మరణం తప్పదు. ఎందుకంటే ఇది దేవుని సంకల్పం. ఆయన మరి ఎలాంటి మరణం మీద గురిపెట్టి విజయం సాధించాలనుకున్నాడు అన్నది చూస్తే అదే ఆత్మ సంబంధ మరణం. ఆయన పరిశుద్ధుడు గనుక మరణం ఆయన మీద ఏలుబడి చేయుటకు అన్ని కోణాల్లో అన్ని దారులు వెదకి అది బాగా అలసిపోయింది. పారదర్శకంగా పరిశుద్ధ జీవితం ఆచరించి చూపుతూ యేసు మరణానికి సంపూర్తిగా తలవంచాడు. అంతే, మరణం ఆయన ముందు తలవంచి మోకరిల్లి సాగిలపడింది.మతంతో సంబంధం లేని మార్గంమన తోటి ఇరుగు పొరుగు వాని చుట్టురా ఉన్న సమాజం మేలుకై ప్రతి పని, పరిచర్య, సేవా విధానం శుద్ధ హృదయంతో ఆచరించుట ద్వారానే దేవుని మెప్పు పొందగలం. నిత్య సత్య జీవమనే క్రీస్తు మార్గం మతంతో ఎలాంటి సంబంధం లేనిది. ఇదొక ఆత్మ సంబంధ అసాధారణ ఆధ్యాత్మిక జీవన విధానం. ఇందులో వ్యక్తిగతమైన స్వయం స్వశక్తితో కూడిన పాప నివారణ సంబంధిత పరిశుద్ధ అభ్యాస ప్రయత్నాలు మచ్చుకైన కనపడవు. క్రీస్తును బట్టి దేవుని మీద ఆధారపడిన జీవితాలు ఏంతో పురోగమనం సాధించే స్థితిలో ఉంటుంటాయి. తమ మానవ జ్ఞానంతో ముడిపెట్టక తమ మంచి చెడ్డల విచక్షణ విషయమైన జ్ఞానం దేవునికే అప్పగించి అన్నింటా దేవునికే మహిమ చెందేలా ఆయన్ను ఘన పరచుటే అతి శ్రేష్టమైన సద్భక్తి జీవిత విధానం.నిత్యజీవము పొందుటకు నేనేం చేయాలి? అన్నదానికి సమాంతర ప్రశ్నయే ‘మరణంలో నుండి జీవంలోనికి దాటుట ఎట్లు?’ అనేది. మరణంలో నుండి జీవములోనికి దాటుటలో గొప్ప అనుభవం సంపాదించినవాడు, అత్యంత ప్రతిభ, ప్రభావ సంపన్నుడు యేసు మాత్రమే అన్న సర్వసత్యాన్ని బహు తేటగా గ్రహించినవారై మొదటగా ఆయన శిష్యులైన అపొస్తలులు ఆ తదుపరి ఆదిమ సంఘము ఆయన అడుగుజాడలలోనే నడిచి అన్నింటా గెలిచింది. ఆ ఆదిమ సంఘాన్ని అనుసరించి ఒక్కటే క్రీస్తు శరీరమను సంఘాలు నేడునూ పాపం నుండి పరిశుద్ధతలోనికి అనగా మరణంలో నుండి జీవములోనికి విజయవంతంగా దాటుతున్నాయి. అనేకులను దాటించుటలో పేరొందిన గొప్ప సువార్త పరిచర్యను అవి నిరంతరాయంగా చేస్తూ వారివలె ముందుకు కొనసాగిస్తూ విధేయంగా ఎంతో శ్రమిస్తున్నాయి. దేవదేవుడు తనదైన బలాతిశయం చేత యేసును మృతులలో నుండి లేపాడు అన్నదే నేటి పునరుత్థాన దినం. ఇదే క్రైస్తవ నిరీక్షణ జీవితానికి గొప్పదైన పునాది. సమభావపు ఏకత్వం కలిగించే ఒక్కటే నిరీక్షణయందుండుటకు పిలువబడిన వారు ధన్యులు అంటుంది గ్రంథము.‘‘నా మాట విని నన్ను పంపిన వానియందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక ‘మరణములో నుండి జీవము లోనికి’ దాటి యున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను’’– యేసుక్రీస్తు – జేతమ్ -
ఆ రక్త తర్పణం సర్వమానవాళికి నిత్యజీవము
గోధుమ గింజ భూమిలో పడి చనిపోతేనేగాని ఎలా విస్తారమైన పంట నివ్వలేదో క్రీస్తు కూడా యుక్త కాలమున చనిపోవటం ద్వారా మనందరికీ మరణం తర్వాత తిరిగి శాశ్వత జీవం అనే ఆశీర్వాద భాగ్యం లభించింది. సర్వమానవుల కోసం ఒక్కడే ధైర్యంగా సిలువను మోశాడు... నిరపరాధ రక్తం చిందించబడింది... బలిగా తన పరిశుద్ధ రక్తం ప్రానార్పణం గావించాడు... పరలోక భాగ్యాన్ని తృణ్రప్రాయంగా త్యజించాడు... నిత్యజీవానికి బాట వేశాడు... యేసు మరణం మానవాళికి శుభదినం... ఒక్కడే ఒక్కడు... సజీవుడైన క్రీస్తు... నిన్న నేడు నిరంతరం ఉన్నవాడు.చరిత్ర పుటల్లోకి ఒకసారి వెళితే రెండు వేల సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు మరణం అత్యంత హేయమైనది అమానుషమైనదిగా పేర్కొనబడినది. ఆయన ప్రేమించిన శిష్యులే చివరి గడియల్లో ఆయనను విడిచి పారిపోయారు. శిష్యుడైన యూదా ముప్ఫై వెండి నాణాలకు ఆశపడి దైవకుమారుడినే మతపెద్దలకు అమ్మివేశాడు. ఏ ప్రజలైతే తన సొంతవారిగా భావించి వారే తనకు ప్రధానం అనుకున్నాడో వారి మధ్య అనేక అద్భుతాలు చేశాడో విలువైన బోధలు చేశాడో వారే ఏకమై యేసును అతి క్రూరంగా చంపడానికి సిద్ధ పడ్డారు. కేవలం తమ పదవులకు ఎక్కడ అడ్డువస్తాడో అని ఈ ఘాతుకానికి ఒడిగట్టారు యూదా పెద్దలు నాయకులు. వారితో తనకు ఆపద సంభవించనుందని తెలిసి పస్కా పండుగ సమయంలో అందరికోసం బలి పశువుగా మారేందుకు యెరూషలేము చేరుకున్నాడు యేసు. తాను అప్పగింపబడే రాత్రి గెత్సేమనె తోటలో ఒంటరియై తండ్రినిప్రార్థించాడు. మానవాళి విమోచన కోసం చేసే బలియాగం ఎంతో వేదనకరం. యేసు విలపించుచు ప్రార్థించుండగా అతని చెమట రక్త బిందువులుగా మారిపోయింది. అంతకంటే ఆయనను అప్పగించుటకు వచ్చిన వారిలో తన శిష్యుడైన యూదా ముందుండి బోధకుడా నీకు శుభమని చెప్పి ముద్దుపెట్టుకొని మరీ యేసును వారికి అప్పగించాడు. యేసు మాత్రం ‘చెలికాడా! నీ పని కానివ్వు’ అంటూ సంబోధించడం అతనిలో ద్వేషానికి ఏమాత్రం తావులేదనడానికి రుజువుగా నిలిచింది. యేసు ఏ నేరం చేయలేదని తెలిసినా, యూదా మత పెద్దలు కేవలం అసూయ చేత క్రీస్తును సిలువ వేయడానికి సిద్ధమయ్యారని తెలిసినా ఇతనిలో నాకు ఏ నేరం కనబడుటలేదని చెప్పినా, జనసమూహం సిలువ వేయమన్న కేకలే గెలిచాయి. యేసు గలలియ వాడని తెలుసుకొని హేరోదు వద్దకు పంపినా అక్కడా తృణీకారమే ఎదురైంది. తిరిగి పిలాతు వద్దకు పంపబడ్డాడు. పొంతి పిలాతు ఎన్ని సార్లు యేసును విడుదల చేద్దామని ప్రయత్నించినా చివరకు నరహత్య చేసే గజదొంగ బరబ్బాను వదిలివేయండి, కానీ యేసును మాత్రం సిలువ వేయాలని మొండిపట్టు పట్టారు యూదా మతపెద్దలు.క్రీస్తు శ్రమలుసిలువ మరణం కనికరం లేని మరణం. దోషులను అతిక్రూరంగా శిక్షించేందుకు సిలువ మరణం ఏర్పాటు చేసేది అప్పటి రోమా ప్రభుత్వపు పెద్దలు. సిలువ మీద మరణించినవాడు శాపగ్రస్తుడుగా యూదుల ధర్మశాస్త్రంలో రాయబడివుంది. ఏ పాపమెరుగని యేసు మనుష్యజాతి రక్షణ కొరకు పాపంగా చేయబడ్డాడు. సిలువలో రోమా సైనికుల క్రౌర్యం హేళన దూషణతో వారి కర్కశమైన దండన ఎంతో భయోత్పాతం, భీతిని కలిగించేది. ఒక నిలువు చెక్క కమ్మి మీద అడ్డకమ్మెని అమర్చి దానిపై నేరం చేసిన దోషిని పడుకోబెట్టి రెండు అరచేతులు చాపి వాటిలో రెండు పొడవైన మేకులతో గుచ్చి కింద రెండు పాదాలు కలిపి అతి పొడవైన మేకుతో బలంగా చెక్కకు దిగగొట్టేవారు. ఇలా సిలువపై వేలాడబడిన మనిషి ఊపిరి పీల్చుకోవడం ఎంతో దుర్భరంగా ఉండేది. ఊపిరి పీల్చుకోడానికి ప్రయత్నించిన ప్రతిసారి నరకాన్ని ప్రత్యక్షంగా అనుభవిస్తారు. చివరకు ఊపిరితిత్తులు పగిలి చనిపోతారు. ఒక వేళ సాయంత్రంలోగా చనిపోకపోతే రెండు కాళ్ళు తెగనరికి రోమా సైనికులు అక్కడినుంచి వెళ్లిపోతారు.ఈ శ్రమలకు అదనంగా రోమా సైనికులతో పాటు యూదా మత పెద్దలు, పరిసయ్యులు, ప్రజలు చేరి హేళన, వస్త్రహీనత, కొరడా దెబ్బలు, తలపై ముళ్ల కిరీటం... యూదుల రాజంటూ హేళన చేస్తూ ముఖంపై పిడిగుద్దులతో దైవకుమారుడి సుందర సుకుమార దేహం అందవిహీనంగా కురూపిగా మారిపోయింది. పదివేలలో అతిప్రియుడు పరిహాసమొందాడు. అన్యాయపు తీర్పు తర్వాత యేసు మోయలేని సిలువను వీపుమీదపెట్టి కొరడాలతో కొట్టుకుంటూ యెరూషలేము వీధుల్లో తిప్పుతూ కల్వరి కొండకు తీసుకు వస్తారు. యేసుకు ఇరువైపులా ఇద్దరు గజదొంగలను సిలువ వేశారు. అపహాస్యం చేయడానికి ‘యూదుల రాజైన నజరేయుడైన యేసు’ అంటూ రాయించి సిలువకు ఒక ఫలకం తగిలించారు. అతని వస్త్రాన్ని చింపి సైనికులు పంచుకున్నారు. ఒళ్ళంతా రక్తసిక్తమైన యేసుని చూసి ఏమాత్రం కనికరం లేక యూదుల రాజువైతే దిగిరా అంటూ హేళన చేశారు. అంత బాధలోనూ యేసు ఏమాత్రం నోరు తెరువలేదు. మౌనంగా సిలువ బాధను భరించాడు. యేసుక్రీస్తు మరణం ఈ లోకానికి నిత్య జీవం అనే ఆశీర్వాదం తీసుకువచ్చింది. మరణానికి బందీగా మారిన మానవుడు భయం లేకుండా నిర్భయంగా జీవించే ధైర్యాన్ని ఇచ్చింది. మానవునిలో పిరికి ఆత్మను తీసివేసి ధైర్యంగా జీవించమని దీవించే దైవాత్మను అనుగ్రహించింది యేసు మరణం. యేసులో వున్న వారికి ఆయన మరణం ద్వారా నిత్యజీవమార్గం సుగమమైంది. అందుకే ఇది శుభ శుక్రవారం అయింది.ఏడు విలువైన మాటలు... ఆచరణీయ పాఠాలు యేసుక్రీస్తు సిలువ పైన మాట్లాడిన ఏడు మాటలు శుభ శుక్రవారం నాడు ప్రపంచంలోని క్రై స్తవ విశ్వాసులందరూ ధ్యానించడం పరిపాటి. అంతేకాదు ఏసు పలికిన ఈ పలుకులు ఈ లోకంలో మానవుడు లోకకల్యాణం కోసం ఎలా జీవించాలో గొప్ప పాఠాలను నేర్పుతాయి. మానవ జాతికి ఎప్పటికీ ఆదర్శంగా ఆచరణీయంగా నిలుస్తాయి.శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో యేసుప్రాణం విడువ గా అనేక అద్భుతాలు జరిగినట్లుగా లేఖనాలు పేర్కొన్నాయి. ఆ దేశమంతా చీకటి కమ్మింది. సూర్యుడు కాసేపు అదృశ్యం అయ్యాడు. భూమి వణికింది. బండలు బద్దలయ్యాయి. సమాధులు తెరువబడ్డాయి. యెరూషలేము దేవాలయపు తెర పైనుండి కిందికి రెండుగా చినిగిందని లేఖనాలు చెబుతున్నాయి.పాప పంకిలమైన మానవుడ్ని రక్షించడానికి ఆ దేవాదిదేవుని గొప్ప సంకల్పమే సిలువ. ఈ లోకాన్ని ఎంతో ప్రేమించిన దేవుడు మానవులను తమ పాపాలనుంచి రక్షించి మరణానంతరం నిత్యజీవం ఇవ్వడానికి ఎన్నుకున్న ఏకైక మార్గమే సిలువ. సిలువలో నిర్దోషి, నిష్కళంకుడు తన ప్రియ కుమారుడైన యేసు రక్తం ద్వారా గొప్ప విమోచన కార్యం దేవుడు సిద్ధం చేశాడు. యేసు తనకు తానుగా సిలువకు సమర్పించుకున్నాడు.1: తండ్రీ, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము (లూకా 23:34)2: నేడు నీవు నాతోకూడా పరదైసులో ఉందువు (లూకా 23:43)3: అమ్మా, యిదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి ‘ఇదిగో నీ తల్లి అని చెప్పెను. (యోహాను 19:26–27)4: నా దేవా, నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థం (మత్తయి 27:46)5: దప్పిగొనుచున్నాను (యోహాను 19:28)6: సమాప్తమైనది (యోహాను 19:30)7: తండ్రీ, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను (లూకా 23:46)– బందెల స్టెర్జి రాజన్ -
క్రీస్తును ఎలా శిలువ వేశారు?
లండన్: నేడు పవిత్ర శుక్రవారం. అంటే ఏసు క్రీస్తును శిలువ వేసిన రోజు. శిలువ వేయడం అంటే శిలువకు క్రీస్తును ఆనించి చేతులకు, కాళ్లకు మేకులు దిగేయడంగా మనకు తెలుసు. ఇప్పుడు మనకు ఏ క్రీస్తు శిలువ విగ్రహాన్ని చూసిన ఇదే అర్థం అవుతుంది. మరి నిజంగా క్రీస్తును శిలువ వేసినప్పుటు ఆయన చేతులకు, కాళ్లకు మేకులు దిగేశారా? అన్నది ఇప్పుడు చర్చ. చిన్న చిన్న నేరాలు చేసిన వారిని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేసిన వారిని, ప్రజల్లో తిరుగుబాటు లేవదీసిన వారిని శిలువ వేయడం నాటి రోమన్ సంస్కృతి. శిలువ వేయడం అంటే మరణ శిక్ష వేయడమని కూడా కాదు. కొన్ని రోజుల పాటు అన్న పానీయాలు లేకుండా అలా శిలువపై మాడుస్తారు. హింసిస్తారు. కొందరు ఆ శిక్ష ను తట్టుకోలేక చనిపోతారు. బతికున్న వారిని వదిలేస్తారు. మరి ఏసు క్రీస్తును ఎలా శిలువ వేశారు? రోమన్లు శిలువ వేసినప్పుడు చేతులు, కాళ్లకు మేకులు కొట్టేవారనడానికి ఎక్కడా శాస్త్రీయ లేదా చారిత్రక ఆధారాలు లేవు. పురావస్తు తవ్వకాళ్లో శిలువ శిక్ష అనుభవించిన వారి శకలాలు దొరికాయి. వారి చేతులకు, కాళ్లకు మేకులు కొట్టిన ఆనవాళ్లు దొరకలేదు. ఒకే ఒక్క మానవ శకలం అలా దొరికింది. దానికి కూడా కాళ్లకు మాత్రమే మేకులు దిగేసినట్లు ఉంది. చేతులకు లేవు. బ్రిటీష్ మ్యూజియంలో ఇప్పటికీ భద్రంగా ఉన్న నాలుగవ శతాబ్దం నాటి క్రీస్తు శిలువ విగ్రహాల్లో క్రీస్తు చేతులు, కాళ్లకు మేకులు కొట్టిన ఆనవాళ్లు లేవు. భుజం మీద అడ్డంగా ఉన్న కర్రకు మణికట్టు వద్ద చేతులు కట్టేసినట్లు మాత్రమే అవి ఉన్నాయి. రత్నపు రాళ్లపై చెక్కిన ఆ విగ్రహాలను జాగ్రత్తగా చూసినట్లయితే ఈ విషయం మనకు అర్థం అవుతుంది. నాటి కాలం గాస్పెల్స్ (క్రీస్తు జీవితం, ప్రవచనాల ప్రచారకులు) కూడా ఏనాటు క్రీస్తును ఈ విధంగా శిలువ వేశారని చెప్పలేదు. కొత్త టెస్టామెంట్ ప్రకారం మాత్యూ, మార్క్, లూక్, జాన్ అనే గాస్పెల్స్ కొంచెం అటూ ఇటుగా క్రీస్తుకు మేకులు దిగేశారని చెప్పారు. నాటి రోమన్ కాలంలో మనుషులను శిలువ వేసినప్పుడు మేకులు కొట్టేవారు కాదని, చేతులను, కాళ్లను కట్టేసేవారని మనకు ‘మోంటీ పైథాన్స్ లైప్ ఆఫ్ బ్రెయిన్’ హాలివుడ్ పురాతన సినిమా కూడా తెలియజేస్తోంది.


