breaking news
crop condition
-
పంటకు నీరిచ్చి ఆదుకోండి
కలెక్టర్ కు అనంత వెంకటరామిరెడ్డి వినతి అనంతపురం అర్బన్ : మరో పది రోజులు నీటిని విడుదల చేసి పామిడి, పెద్దవడగూరు మండలాల పరిధిలో ఉన్న 17 గ్రామాల రైతులను ఆదుకోవాలని వైఎస్సార్కాంగ్రెస్పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి కలెక్టర్ కోన శశిధర్ను కోరారు. శనివారం ఆయన కలెక్టర్ను కలిసి పంటల పరిస్థితిని వివరించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. పామిడి, పెద్దవడగూరు మండలాల పరిధిలోని పొలాలకు హెచ్చెల్సీ( నార్త్ కెనాల్) ద్వారా సాగునీరు సరఫరా అవుతోందన్నారు. 17 గ్రామాలకు చెందిన రైతులు సుమారు 3 వేల ఎకరాలలో వరి, వేరుశనగ సాగు చేస్తున్నారన్నారు. పంట మరో 15 రోజుల్లో చేతికొస్తుందని తెలిపారు. ఈ సమయంలో సాగునీరు ఆపివేయడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని వివరించారు. మిడ్పెన్నార్ రిజర్వాయర్లో ప్రస్తుతం 2.4 టీఎంసీ నీరు నిల్వ ఉందన్నారు. పంటలకు, రిజర్వాయర్లకు సరిపడే నీరు ఉన్నా అధికారులు నిలుపుదల చేయడం సరికాదన్నారు. 250 క్యూసెక్కులు కాకుండా 350 క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తే అటు రైతులకు, ఇటు చాగల్లు రిజర్వాయర్కు నీటి పంపిణీ చేయవచ్చునన్నారు. పంటలకు, రిజర్వాయర్లకు సరిపడే నీరు ఉన్నా అధికారులు నిలుపుదల చేయడం సరికాదన్నారు. నార్త్ కెనాల్ 38వ కిలోమీటర్వద్ద డిస్ట్రిబ్యూటరీల వద్ద మట్టి వేశారని, వెంటనే దానిని తొలగించి పంటలకు నీరివ్వాలని డిమాండ్ చేశారు. ఒకేసారి ఇటు నార్త్ కెనాల్ ఆయకట్టుకు, చాగల్లుకు నీటిని విడుదల చేసేందుకు ఆస్కారం ఉందన్నారు. దీనివల్ల చాగల్లుకు ఎలాంటి ఇబ్బంది రాదని వివరించారు. వ్యక్తుల ప్రయోజనాల కోసం కాకుండా.. రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని పొట్ట, వెన్ను దశల్లో ఉన్న పంటలకు నీరివ్వాలని హితవుపలికారు. కరువు జిల్లాకు అదనంగా నీటిని తీసుకురావడానికి ప్రయత్నం చేయకపోగా వచ్చిన నీటికోసం రాజకీయాలు చేయడం తగదన్నారు. రైతుల శ్రేయస్సు కోసం అందరూ ఆలోచించాలన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ అధికారులతో సమావేశం నిర్వహించి రైతులకు అన్యాయం జరగకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం మాజీ ఎంపీ హెచ్చెల్సీ ఎస్ఈ శేషగిరిరావును కలిసి పరిస్థితిని వివరించారు. దీనిపై ఎస్ఈ సానుకూలంగా స్పందించారు. మరో తడి నీరివ్వడానికి చర్యలు తీసుకుంటామని హామిఇచ్చారు. వైఎస్సార్సీపీ నాయకులు సత్యనారాయణరెడ్డి, నీలం నల్లపరెడ్డి, పామిడి, పెద్దవడుగూరు మండలాలకు చెందిన 17 గ్రామాల రైతులు పాల్గొన్నారు. -
మళ్లీ ఒత్తిళ్లు
కర్నూలు(అర్బన్) : కర్నూలు-కడప (కేసీ) కెనాల్ వాటా నీటిని మళ్లీ తన్నుకుపోయేందుకు అనంతపురం జిల్లా నేతలు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకువస్తున్నట్లు సమాచారం. ఇదే జరిగితే కేసీ ఆయకట్టు కింద ప్రస్తుతం సాగులో వున్న 1.32 లక్షల ఎకరాల్లో వేసిన పంటల పరిస్థితి అగమ్యగోచరంగా మారనుంది. వాస్తవంగా కర్నూలు జిల్లాకు కేసీ వాటాగా 6.5 టీఎంసీల నీరు రావాల్సి వుండగా, అనేక ఒడిదుడకులు, రాజకీయ ఒత్తిళ్ల మధ్య కేవలం 2.50 టీఎంసీల నీటిని మాత్రమే విడుదల చేసేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 10వ తేదీ నుంచి టీబీ డ్యామ్ నుంచి రోజుకు 1600 క్యూసెక్కుల నీరు తుంగభద్ర నదికి విడుదల చేస్తూ వచ్చారు. ఈ నీటి సరఫరా ఈ నెల 19వ తేదీ రాత్రి ఆగిపోయింది. మొత్తం 0.90 టీఎంసీల నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం సుంకేసుల జలాశయంలో వున్న నీరు కేవలం మరో మూడు రోజులకు మించి సరఫరా కాని పరిస్థితి ఉంది. ఇంకా జిల్లాకు 1.60 టీఎంసీల నీరు టీబీ డ్యామ్ నుంచి విడుదల కావాల్సి వుంది. అయితే ఈ నీటిని కూడా మళ్లించుకునేందుకు రాజకీయ పార్టీలకు అతీతంగా అనంతపురం జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు ద్వారా నీటి పారుదల శాఖ ఈఎన్సీపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా జిల్లాకు చెందిన డిప్యూటీ సీఎం, ఎంపీలు, ఎమ్మెల్యేలు పార్టీలకు అతీతంగా కేసీ వాటా నీరు అనంతకు మళ్లకుండా చర్యలు తీసుకోకుంటే కేసీ కెనాల్ కింద చేతికొచ్చిన కోట్లాది రూపాయల విలువ చేసే మిర్చి, పసుపు తదితర పంటలను రైతులు తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితులు నెలకొని ఉన్నాయి. కేసీ కెనాల్ నీటిని అనంతపురం జిల్లాకు మళ్లిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని కేసీ రైతులు హెచ్చరిస్తున్నారు.