breaking news
contract killer
-
అల్లుడితో కలిసి కొడుకుని చంపిన తల్లి
ఉదయ్పూర్: రాజస్తాన్లో దారుణం చోటుచేసుకుంది. ఆస్తి కోసం అల్లుడితో కలిసి కన్నా కొడుకునే చంపించింది ఓ తల్లి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రతాప్ఘడ్ జిల్లా చోటిసాద్రి గ్రామానికి చెందిన మోహిత్(21) తన తల్లి ప్రేమ్లత సుతార్తో తరచూ గొడవ పడేవాడు. తండ్రి చనిపోయాక ఈ గొడవ మరింత ముదిరింది. దీంతో విసుగు చెందిన ప్రేమ్లత కూతురి దగ్గరికి వెళ్లి అక్కడే ఉంటుంది. కాగా నెల రోజుల క్రితం ఆమె తన ఊళ్లో ఉన్న భూమిని అమ్మడానికి ప్రయత్నించింది. దీనికి మోహిత్ అడ్డుపడ్డాడు. దీంతో ఎలాగైనా కొడుకు అడ్డుతొలగించుకోవాలని అల్లుడితో కలిసి కుట్రపన్నింది. మోహిత్ను అంతమొందించడం కోసం అదే ప్రాంతానికి చెందిన రౌడీ గణపత్ సింగ్ రాజ్పుత్ను ఆశ్రయించారు. హత్య కోసం అతనితో లక్ష రూపాయలతో ఒప్పందం కుదుర్చుకున్నారు. యాభైవేల రూపాయలు అడ్వాన్స్గా ఇచ్చారు. ఈ నెల 6న మోహిత్ గ్రామానికి దగ్గరలో ఉన్న దాబాకి వెళ్లాడు. అక్కడే ఉన్న గణపత్, అనిల్లు ప్లాన్ ప్రకారం మోహిత్కి మద్యం తాగించారు. మోహిత్ మత్తులోకి వెళ్లాక ఇద్దరు కలిసి గొంతు పిసికి చంపేశారు. సీసీ పుటేజీ సాయంతో నిందితులను అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. -
'మా ఆవిడను చంపాలి.. సాయం చేయండి'
తన భార్యను చంపడానికి కిరాయి హంతకులను మాట్లాడుకుందాం అనుకుని టెక్స్ట్ మెసేజ్ పంపాలనుకున్న ఓ వ్యక్తి.. పొరపాటున దాన్ని కిరాయి హంతకుడికి బదులు తన మాజీ బాస్కు పంపేశాడు. తన భార్యతో పాటు నాలుగేళ్ల కూతురిని కూడా చంపాలనుకోవడంతో జెఫ్రీ స్కాట్ లైటిల్ (42)ను పోలీసులు అరెస్టు చేశారు. ఎవరో షేన్ అనే వ్యక్తికి అతడు ఈ మెసేజ్ పంపాలని అనుకున్నాడు. అయితే అనుకోకుండా అది అతడి మాజీ బాస్కు వెళ్లడంతో కుట్ర మొత్తం ముందే తెలిసిపోయింది. ''హే షేన్, పని ఎలా నడుస్తోంది? మా భార్యను చంపడానికి నువ్వు సాయం చేస్తానని చెప్పావు గుర్తుందా, ఆ ఆఫర్ గురించి నీకు చెబుదామనుకున్నా'' అని మెసేజ్ పెట్టాడు. తన భార్య మరణిస్తే బీమా సొమ్ము వస్తుందని, అది దాదాపు 6.68 కోట్ల రూపాయలు ఉంటుందని, అలాగే తన నాలుగేళ్ల కూతురిని కూడా చంపితే మరో 3.34 కోట్ల రూపాయలు వస్తుందని అతడు తన మెసేజ్లో తెలిపాడు. ఆ మొత్తాన్ని పంచుకోవచ్చని అన్నాడు. తాను తెల్లవారుజామున 5 గంటలకే ఉద్యోగానికి వెళ్లిపోతానని, తన భార్య మధ్యాహ్నం 2 గంటలకు వెళ్తుందని, అందువల్ల దోపిడీ ప్రయత్నంలా చేయొచ్చు లేదా ప్రమాదంలా చిత్రీకరించవచ్చని కూడా సూచించాడు. మొత్తం బీమా సొమ్మును సగం సగం పంచుకుందామని ఆఫర్ ఇచ్చాడు. దాంతో హత్యాయత్నం కేసు కింద లైటిల్ను పోలీసులు అరెస్టు చేశారు. అయితే తాను తన భార్య, కూతుళ్లను చంపాలనుకోలేదని, తాను వేరే మహిళతో మాట్లాడానని ఆమె గొడవ పెట్టుకోవడంతో చిన్నపాటి వివాదం మాత్రమే చెలరేగిందని అన్నాడు. బహుశా తన కూతురు ఆ మెసేజ్ పంపి ఉంటుందని తెలిపాడు. కానీ పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో చివరకు నేరాన్ని అంగీకరించాడు.