breaking news
coal storage
-
కాలుష్య కష్టాలకు చెక్!
విశాఖలో పోర్టు కాలుష్యం తగ్గినప్పటికీ.. బొగ్గు నిల్వల వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పోర్టు నుంచి సుమారు 3 చదరపు కిలోమీటర్ల వరకూ బొగ్గుకి సంబంధించిన నల్లటి రేణువులు విస్తరించి నగరం కలుషితమవుతోంది. దీన్నిఅధిగమించేందుకు విశాఖ పోర్టు ట్రస్టు ఐదేళ్ల ప్రణాళిక సిద్ధంచేసుకుంది. ఏటా రూ.100 కోట్లు చొప్పున రూ.500 కోట్లతో బొగ్గు నిల్వల కోసం గోదాములు నిర్మించాలని వీపీటీ భావిస్తోంది. సాక్షి, విశాఖపట్నం: సుందర విశాఖ నగరంలో కాలుష్యం ఇబ్బంది పెడుతోంది. ఇంటి కాలుష్యం ఓవైపు ఇబ్బంది పెడుతుంటే.. పోర్టు కాలుష్యం మరోవైపు వ్యాధుల బారిన పడేస్తోంది. పోర్టు నుండి బొగ్గు ఎగిరి రావటంతో దుస్తులు వేసుకున్న కొద్ది సేపటికే వాటిపై బొగ్గు పేరుకుపోతుందని ప్రజలు వాపోతున్నారు. ఇంటిలో రోజుకి నాలుగుసార్లు తడిగుడ్డలు పెట్టినా క్షణాల్లో బొగ్గుపడి పేరుకుంటోంది. నగరంలో 40 శాతానికి పైగా ప్రాంతాలు ఈ పరిస్థితితో ఇబ్బంది పడుతున్నాయి. ఈ ధూళికణాల వల్ల ప్రధానంగా శ్వాసకోస వ్యాధులు ప్రబలుతున్నాయి. పోర్టు యాజమాన్యం చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. బొగ్గుకి సంబంధించిన ధూళి కణాలు ఎగిరి ఇళ్లల్లోకి చేరుతున్నాయి. 2002లో పోర్టు ధూళి కాలుష్యంపై విశాఖపట్నం పోర్టు ట్రస్టు చర్యలు ప్రారంభించింది. 4,75,000 చదరపు మీటర్ల పరిధిలో రూ.8 కోట్లతో మెకానికల్ డస్ట్ సప్రెషన్ సిస్టమ్ని ప్రారంభించారు. ఆర్–4, ఆర్–10 కోల్ కార్గో ప్రాంతాల్లో 24 గంటలూ వాటర్ ట్యాంకర్లతో స్ప్రింక్లర్లతో స్ప్రే చేస్తున్నారు. మొత్తం 275 ట్రిప్పుల ద్వారా 4 ఎంఎల్డీ సివరేజ్ ట్రీటెడ్ నీటిని ఈ ప్రక్రియకు వినియోగిస్తున్నారు. దీనికి తోడుగా... 4 మీటర్ల డస్ట్ బ్యారియర్తో కలిపి మొత్తం 11.5 మీటర్ల ఎల్తైన రక్షణ గోడని నిర్మించారు. అయితే.. బొగ్గు కణాల వ్యాప్తి ఇంకా కొనసాగుతూనే ఉంది. లోడింగ్, అన్లోడింగ్ చేసే సమయంలో ఈ కణాలు ఎగిరి నగరంపై ప్రభావాన్ని చూపుతున్నాయి. దీన్ని అధిగమించేందుకు విశాఖ పోర్టు ట్రస్టు చర్యలకు ఉపక్రమించింది. కాలుష్య కారకాల్ని మరింత తగ్గించే దిశగా.... పూర్తిస్థాయిలో బొగ్గు కాలుష్యాన్ని నివారించేందుకు విశాఖ పోర్టు ట్రస్టు ప్రణాళికలు సిద్ధం చేసింది. గతంలో పోర్టు పరిసర ప్రాంతాల్లో పీఎం 10 లెవెల్స్ లీటరుకు 100 ఎంజీ ఉండేది. వీపీటీ తీసుకున్న నివారణ చర్యలతో ఇది ప్రస్తుతం 60 ఎంజీ కంటే తక్కువ నమోదవుతోంది. దీన్ని మరింత తగ్గించేందుకు పోర్టు ముందుకొచ్చింది. నగర ప్రజలు పోర్టు కాలుష్యం వల్ల ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఇటీవల జరిగిన విశాఖ పోర్టు ట్రస్టు 86వ వార్షికోత్సవంలో అధికారులు వెల డించారు. 2018–19లో 25 శాతం బొగ్గు కార్గో... విశాఖ స్టీల్ ప్లాంట్, ఇతర సంస్థలకు అవసరమైన థర్మల్, కోకింగ్ కోల్ని విశాఖ పోర్టు ట్రస్టు నిర్వహిస్తోంది. దీంతో పాటు స్టీమ్ కోల్ నిల్వలు కూడా పోర్టులో ఉంటాయి. 2018–19 ఆర్థిక సంవత్సరంలో 1.85 మిలియన్ టన్నులు థర్మల్ బొగ్గు, 5.80 మిలియన్ టన్నుల కోకింగ్, 8.95 మిలియన్ టన్నుల స్టీమ్ కోల్ నిర్వహణ కార్యక్రమాల్ని పోర్టు నిర్వహించింది. ఇది పోర్టు కార్గో రవాణాలో 25.42 శాతంగా ఉంది. ఇంత పెద్ద మొత్తంలో బొగ్గు కార్గో కార్యకలపాలు జరుగుతున్న నేపథ్యంలో దీని కాలుష్య నివారణపై పోర్టు ట్రస్టు చర్యలకు ఉపక్రమించింది. ఏటా రూ.100 కోట్లతో.... ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్ ప్లాన్స్లో భాగంగా సమగ్ర కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టేందుకు పోర్టు ట్రస్టు సిద్ధమవుతోంది. ఇందుకోసం ఏటా రూ.100 కోట్లతో ఐదేళ్ల ప్రణాళిక రూపొందించింది. మొత్తం రూ.500 కోట్ల వ్యయంతో 100 ఎకరాల విస్తీర్ణంలో గోదాములు నిర్మించనుంది. పోర్టు పరిసరాల్లోనే కోల్ కవర్డ్ స్టోరేజ్ షెడ్లు ఏర్పాటు కానున్నాయి. ఇప్పటికే టార్పాలిన్లు కప్పుతూ లారీల ద్వారా లోడ్స్ తీసుకొస్తున్నారు. ఆ లారీలు నేరుగా షెడ్లలోకి వెళ్లి లోడింగ్, అన్లోడింగ్ చేస్తాయి. దీనివల్ల.. ఆ సమయంలో ఎగిరే బొగ్గు కణాలన్నీ.. షెడ్లలోనే ఉండిపోతాయి. బయటకు ఎగరకుండా ఉంటాయి. దీని వల్ల నగరంలోకి ఎగిరే బొగ్గు రేణువుల శాతం గణనీయంగా తగ్గుతుంది. దీనికి సంబంధించి డిజైన్లను ఏయూ ఆర్కిటెక్చర్ విద్యార్థులు రూపొందించారని విశాఖ పోర్టు ట్రస్టు డిప్యూటీ చైర్మన్ పీఎల్ హరనాథ్ తెలిపారు. ఈ నెలాఖరు కల్లా టెండర్లను ఆహ్వానించనున్నామని వివరించారు. -
‘థర్మల్’ తొలిదశ పూర్తి
వీర్లపాలెం ప్లాంటుపై ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక 10,656 ఎకరాల్లో సర్వే.. ప్లాంటుకు అవసరమయ్యేది 7,500 ఎకరాలే మెయిన్ ప్లాంటుకు 2,200 ఎకరాలు.. గ్రీన్బెల్ట్కు 1,000 ఎకరాలు నల్లగొండ జిల్లాలో 46 చోట్ల ప్రభుత్వ భూమి గుర్తింపు ఆ మేరకు అటవీశాఖకు బదలాయింపు రాష్ట్రవ్యాప్తంగా 10,140 మెగావాట్ల ప్లాంట్ల నిర్మాణానికి ప్రభుత్వం ప్రయత్నాలు సాక్షి ప్రతినిధి, నల్లగొండ: నల్లగొండ జిల్లా దామరచర్ల మండలంలోని వీర్లపాలెం-దిలావర్పూర్ అటవీభూముల్లో ఏర్పాటు చేయతలపెట్టిన 6,800 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రాథమిక దశ పూర్తయింది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి కావాల్సిన భూములను జిల్లా యంత్రాంగం సర్వే చేసి ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపింది. మొత్తం 10,656 ఎకరాల్లో సర్వే చేయగా, థర్మల్ ప్లాంటు ఏర్పాటుకు 7,500 ఎకరాలు సరిపోతుందని అధికారుల అంచనా. ఈ మేరకు అన్ని వివరాలతో కూడిన నివేదికను నల్లగొండ కలెక్టర్ టి.చిరంజీవులు ప్రభుత్వానికి పంపారు. ఇందులో జిల్లా పూర్తి సమాచారంతో పాటు జిల్లాలో ప్రాజెక్టు ఏర్పాటుకు ఉన్న సానుకూలాంశాలు, కావాల్సిన భూముల వివరాలు, అటవీభూములకు ప్రత్యామ్నాయంగా ఇవ్వాల్సిన ప్రభుత్వ భూముల వివరాలు, పునరావాసం, పరిహారం చెల్లింపు తదితర అంశాలను పొందుపర్చారు. 1,314 ఎకరాల పట్టా భూమి థర్మల్ ప్లాంటు ఏర్పాటు కోసం గత నెల 26వ తేదీ నుంచి దామరచర్ల మండలంలోని ముదిమాణిక్యం వీర్లపాలెం, తాళ్లవీరప్పగూడెం, దిలావర్పూర్, కొండ్రపోలు, నర్సాపురం, కల్లేపల్లి, తిమ్మాపురం, కొత్తపల్లి గ్రామాల్లోని 10,656 ఎకరాల్లో సర్వే నిర్వహించారు. ఇందులో 1,314 ఎకరాలు పట్టా భూమి కాగా, మిగిలినదంతా అటవీభూమే. ఈ 1,314 ఎకరాల్లో 339 మంది పట్టాదారులకు సంబంధించిన 405 ఎకరాల భూమి ఉంది. మరో 531 మందికి సంబంధించిన 909 ఎకరాల భూమికి ఆర్వోఎఫ్ఆర్ చట్టం కింద హక్కులు కల్పించాలన్న దరఖాస్తులు పెండింగ్లో ఉన్నా యి. ఇవి, మినహా అటవీభూమి అందుబాటులో ఉందని రెవెన్యూ యంత్రాంగం తేల్చింది. పట్టా భూములకు సంబంధించి 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని నివేదికలో వివరించారు. అటవీభూమికి ప్రత్యామ్నాయంగా ఇవ్వాల్సిన ప్రభుత్వ భూమిని కూడా గుర్తించినట్టు ఆ నివేదికలో పేర్కొన్నారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 46 చోట్ల 7,100 ఎకరాలను గుర్తించామని, వీర్లపాలెం భూములను తమకు బదలాయిస్తే ఆ మేరకు ప్రభుత్వ భూమిని అటవీశాఖకు ఇస్తామని కలెక్టర్ పంపిన నివేదికలో వివరించారు. ప్రాజెక్టు కోసం తలపెట్టిన భూమికి రోడ్డు, రైలుమార్గాలు అందుబాటులో ఉన్నాయని, 30 కి.మీ.దూరంలో మిర్యాలగూడ ఉందని, రాష్ట్ర రాజధాని హైదరాబాద్కు 200 కి.మీ. దూరంలో ఈ స్థలం ఉందని నివేదికలో వివరించారు. దీంతోపాటు ఏడాదంతా ప్రవహించే కృష్ణానది సమీపంలోనే ఉందని, వాతావరణ పరిస్థితులు పూర్తిస్థాయిలో అనుకూలంగా ఉన్నాయని ఆ నివేదికలో వివరించారు. 400 ఎకరాల్లో కాలనీ ఏర్పాటు ప్రధాన ప్లాంటు (టర్బైన్లు) నిర్మాణానికి 2,200 ఎకరాలు, బొగ్గు నిల్వ, సరఫరా ఏర్పాట్లకు 400, బూడిద, ఇతర వ్యర్థాలను వదిలేందుకు 2,000, గ్రీన్బెల్ట్ కింద 1,000 చొప్పున ఎకరాలు అవసరం అవుతాయని, మరో 400 ఎకరాల్లో ప్లాంటు నివాస కాలనీని ఏర్పాటు చేయవచ్చని, మరో 1,500 ఎకరాలు ప్లాంటు మౌలిక సదుపాయాల కల్పనకు ఉపయోగపడుతుందని నివేదికలో పేర్కొన్నారు. ఈ నివేదికనే సీఎం కేసీఆర్ తన తదుపరి ఢిల్లీ పర్యటనలో కేంద్రం ముందుంచుతారని తెలుస్తోంది. మరోవైపు ఈ ప్రాజెక్టును ఎన్టీపీసీ, జెన్కో సంయుక్తంగా చేపట్టాలని నిర్ణయం తీసుకున్నందున, జెన్కో సమగ్ర నివేదిక సిద్ధమవుతోందని, ఇక, ఎన్టీపీసీ బోర్డు ఢిల్లీలో సమావేశమై ప్లాంటు నిర్మాణానికి ఆమోదం తెలిపితే అనుమతుల ప్రక్రియ ప్రారంభం అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అన్నీ సవ్యంగా జరిగి అటవీభూముల బదలాయింపునకు కేంద్రం అంగీకరిస్తే... భూమిని ఏడాదిలోపు ప్రాజెక్టు నిర్మాణదారులకు అప్పగించేస్తామని, దీనిపై సీఎం కేసీఆర్ పట్టుదలతో ఉన్నారని కలెక్టర్ టి.చిరంజీవులు ‘సాక్షి’కి తెలిపారు. భూముల క్రమబద్ధీకరణతో రూ.15 వేల కోట్ల ఆదాయం పెబ్బేరు: రాష్ట్రంలోని ప్రభుత్వ భూములన్నీ క్రమబద్ధీకరించి వేలం వేస్తే సుమారు రూ.15 వేల కోట్ల ఆదాయం సమకూరే అవకాశం ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్శర్మ అన్నారు. మహబూబ్నగర్ జిల్లా పెబ్బేరు మండల కేంద్రంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఈ భూములను గుర్తించి ఆక్రమణలకు గురికాకుండా చూస్తామన్నారు. దీంతోపాటు కొన్ని భూములను వేలం వేసి వాటిద్వారా వచ్చే ఆదాయాన్ని రాష్ట్రాభివృద్ధికి వినియోగించుకుంటామని తెలిపారు. కొత్త రాష్ట్రం ఏర్పాటు కావడం వల్ల ఐఏఎస్ల కొరత ఏర్పడిందని.. వారం రోజుల్లో ఈ సమస్య పరిష్కారం అవుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ విద్యార్థుల భవిష్యత్ను దృష్టిలో ఉంచుకొని ఎంసెట్ నోటిఫికేషన్ జారీ చేశామని, కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొండి వైఖరితో ఇబ్బందులు తలెత్తుతున్నాయని రాజీవ్శర్మ చెప్పారు. త్వరలోనే సమస్యను అధిగమించి ఎంసెట్ నిర్వహిస్తామన్న ధీమా వ్యక్తం చేశారు. పాలమూరు ఎత్తిపోతల పథకం, ప్రాణహిత-చేవెళ్ల తదితర సాగునీటి పథకాలను వీలైనంత త్వరగా పూర్తయ్యేలా చూస్తామన్నారు. వ్యవసాయరంగంలో సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తామని తెలిపారు. గతంలో ఉన్న పింఛన్దారులలో అనర్హులను తొలగించడం వల్ల ఇబ్బందులు ఎదురయ్యాయని.. అర్హులైన ప్రతి ఒక్కరికీ తప్పకుండా పింఛన్ అందుతుందని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఒకేచోట ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందన్నారు. దీంతో పాలనాపరంగా సులభంగా ఉండటంతో పాటు ప్రజలకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందన్నారు.