breaking news
in-charge collector
-
ఆ ఒక్కరోజు సమగ్ర కుటుంబ సర్వే
- అందరూ అందుబాటులో ఉండాల్సిందే.. - కుటుంబ సర్వే’ పై అధికారుల కసరత్తు - అధికారులను అప్రమత్తం చేసిన ఇన్చార్జి కలెక్టర్ ముకరంపుర : సమగ్ర కుటుంబ సర్వే ప్రామాణికంగా అర్హులకు సంక్షేమ ఫలాలు అందించాలనే సదుద్దేశంతో ప్రభుత్వ నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గతంలో ఎప్పుడూ లేనట్టుగా ఒక్క రోజులోనే రాష్ట్రం మొత్తం సర్వే నిర్వహించాలని నిర్ణయించడంతో 19వ తేదీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఉద్యోగులంతా భాగస్వాములై ప్రతీ ఇంటిగడప తొక్కనున్నారు. ఆ రోజు అందరూ స్థానికంగా అందుబాటులో ఉంటేనే భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు ఉండవని అధికారులు సూచిస్తున్నారు. అందుబాటులో ఉండేలా అందరికీ అవగాహన కల్పించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు ఆదివారం ఇన్చార్జి కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆర్డీవోలు, తహశీల్దార్లను అప్రమత్తం చేశారు. ఆయా నియోజకవర్గాల్లో ఎన్ని ఇళ్లు ఉన్నాయి? ఎంత మంది సిబ్బంది ఉన్నారు? సర్వేకు ఎంత మంది అవసరం అనే అంశాలను యుద్ధప్రాతిపదికన నివేదిక రూపంలో పంపించాలని ఆదేశించారు. కసరత్తు సర్వేకోసం ప్రభుత్వ శాఖలు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వివరాలు సేకరించే పనిలో జిల్లా యంత్రాంగం నిమగ్నమైంది. నాలుగో తరగతి ఉద్యోగులనుంచి ఉన్నతాధికారుల వరకు 30,878 మంది ఉద్యోగులున్నట్లు జాబితా సిద్ధం చేశారు. సగటున ఒక్కో ఉద్యోగి 26 కుటుంబాల వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. గ్రామాలు, మండల కేంద్రాలు, పురపాలక, నగరపాలక సంస్థల వారీగా క్రోడీకరించి వివరాలను ఎన్నికల బ్యాలెట్లు, ఈవీఎంల మాదిరిగా సీల్ వేసి వారం రోజుల సమయంలో డాటాను ప్రభుత్వ వెబ్సైట్లో అప్లోడ్ చేయనున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో 9.70 లక్షల ఇళ్లు ఉన్నాయి. మరో 50 వేల నుంచి లక్షలోపు ఇళ్లు పెరిగే అవకాశముంది. 9.70 లక్షల కుటుంబాలకు 37,307 మంది సిబ్బంది అవసరమవుతారని అంచనా.. గతంలో జరిగిన సర్వేలో ఒక్కొక్కరు 40 కుటుంబాలు సర్వే చేసినట్లు అధికారులు చెబుతున్నా.. అవన్నీ తప్పుల తడకలేనని కొత్త ప్రభుత్వం కొట్టిపారేసింది. ఈ క్రమంలో లెక్కాపత్రం పక్కాగా ఉండాలని, పారదర్శకంగా సర్వే చేయకపోతే తగిన చర్యలకు బాధ్యులవుతారని సీఎం హెచ్చరికలు జారీ చేశారు. ప్రభుత్వం 70 అంశాలతో రూపొందించిన ఫార్మాట్లోని ప్రశ్నలకు కుటుంబసభ్యులు నిజాయతీగా సమాధానమిస్తే మేలు జరిగే అవకాశముంది. కుటుంబసభ్యులు తప్పుడు సమాచారమిచ్చినా క్రిమినల్ చర్యలకు ఆస్కారముంది. ఈ సర్వే ప్రామాణికంగా తీసుకుని రేషన్కార్డులు, పింఛన్లు, గృహాలు, భూములు తదితర వాటిని లబ్ధిదారులకు మంజూరు చేస్తారు. ఉపాధి నిమిత్తం, ఇతరత్రా అవసరాల దృష్ట్యా చాలా మంది స్వస్థలాలనుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లారు. దీంతో ఎప్పుడు సర్వే చేసినా వివరాలు సక్రమంగా ఉండక ఇబ్బందులు కలుగుతున్నాయి. ఈ నేపథ్యంలో 19న అందరూ అందుబాటులో ఉండేలా ప్రభుత్వం సెలవు ప్రకటించింది. తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని సూచించింది. అయితే కుటుంబం మొత్తం అందుబాటులో ఉండాలా? లేక ఒక్కరు ఇంటి వద్దే ఉండి సర్వే అధికారులకు వివరాలు చెబితే సరిపోతుందా అనే విషయమై స్పష్టత లేదు. 19నాడు అత్యవసర పని నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేవారి వివరాలు ఎలా తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. నెలల తరబడి వలస వెళ్లేవారి విషయంలో ఏం చేస్తారనేది తెలియడం లేదు. వివరాల సేకరణపై ప్రభుత్వం మరికొంత స్పష్టత ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు. -
మంత్రికి వినతుల వెల్లువ బీసీలకు రుణాలు ఇవ్వండి
కలెక్టరేట్ : వెనుకబడిన తరగుతుల వారిని మరింత వెనుకకునెట్టారని బీసీ యువజన,విద్యార్థి,మహిళా సంఘాల నాయకులు గురువారం తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి,ఇన్చార్జి కలెక్టర్ వెంకటేశ్వర్రావులను కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా బీసీ విద్యార్థిసంఘం రాష్ట్ర నాయకులు శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను పూర్తిగా వంచించిందన్నారు. 2013-2014 సంవత్సరంలో ఏ ఒక్క బీసీకి రుణం ఇవ్వకుండా జీవోలు,నిబంధనల పేరిట అడ్డుకుందన్నారు. జనాభాలో 60 శాతం ఉన్న బీసీలు తలుచుకుంటే ఏమి జరుగుతుందో మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్కు గుణపాఠం ద్వారా తెలిసిపోయిందన్నారు. ఇక మీదట ఏ పార్టీలు, ప్రజాప్రతినిధులు బీసీలను తక్కువగా అంచనావేసినా కాంగ్రెస్కు పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు. జిల్లావ్యాప్తంగా సుమారు రెండు వేల మంది నెలల తరబడి బ్యాంకుల చుట్టు తిరిగి, బ్యాంకు రుణ అర్హత పత్రం, మంజూరు పత్రాలు పొందినప్పటికీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక మాసం చివరి నిమిషంలో నిబంధనల పేరిట బీసీలకు రుణాలు ఇవ్వకుండా అడ్డుకట్ట వేసిందన్నారు. పెండింగ్లో ఉన్నా బీసీలకు రుణాలు అందించాలని,డిమాండ్ చేశారు. అలాగే బీసీ సబ్ప్లాన్ ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో బీసీ విద్యార్థిసంఘం నాయకులు యెండల ప్రదీప్,యువజన సంఘం నాయకులు మధు,మహిళా సంఘం నాయకులు పోదిల శొభ తదితరులు పాల్గొన్నారు.