అనుమతులన్నీ.. ఆన్లైన్లోనే
మున్సిపాలిటీల్లో భవన నిర్మాణ అనుమతులు
ఆస్తి మార్పిడి, నల్లా బిల్లులు, ట్రేడ్ లెసైన్స్ల జారీ
♦ ఖాళీ స్థలాల పన్నుల చెల్లింపులకూ అదేపద్ధతి
♦ మున్సిపల్ సిబ్బందికి శిక్షణ పూర్తి
♦ బిల్డింగ్ ప్లానర్లకు శిక్షణ.. సాఫ్ట్వేర్ సిద్ధం
♦ సీడీఎంఏ వెబ్సైట్లో దరఖాస్తులు
వివిధ రకాల అనుమతుల కోసం మున్సిపల్ కార్యాలయానికి వెళితే జాప్యం జరుగుతుందా..? అధికారుల నుంచి స్పష్టమైన సమాధానం లేదా..? అనుమతుల జారీకి డబ్బులు డిమాండ్ చేస్తున్నారా..? కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారా..?. ఇక ఇలాంటి ఇబ్బందులన్నీ దూరం కానున్నాయి. అనుమతుల కోసం దరఖాస్తు చేసుకునే మ్యానువల్ పద్ధతికి బ్రేక్ పడనుంది. ఇక మున్సిపల్ సేవలన్నీ ఆన్లైన్లో అందుబాటులోకి రానున్నాయి. ఇందుకు సంబంధించిన స్టాఫ్వేర్ను కమిషనర్ డెరైక్టర్ అండ్ మున్సిపల్ అడ్మిస్ట్రేటివ్ (సీడీఎంఏ) సిద్ధం చేసింది.
తాండూరు: మున్సిపల్ సేవలన్నింటినీ ఆన్లైన్లోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆన్లైన్ సేవలు అందుబాటులోకి వస్తే అనుమతుల జారీలో అవినీతి, అక్రమాలతోపాటు కాలయాపనకు చెక్ పడనుంది. కార్యాలయానికి రాకుండానే ఆన్లైన్లో అనుమతులను పొందే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. ఈ మేరకు మున్సిపల్ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. భవన నిర్మాణాల అనుమతుల నుంచి ఆస్తిమార్పిడి (ముటేషన్), నల్లా బిల్లులు, ట్రేడ్ లెసైన్స్ల జారీతోపాటు ఖాళీ స్థలాలపై పన్నుల చెల్లింపు సేవలన్నీ ఆన్లైన్లో అందుబాటులోకి రానున్నాయి. మొదటగా భవన నిర్మాణాల అనుమతుల సేవలు ఆన్లైన్లో అందుబాటులోకి తీసుకువచ్చేందుకు అధికారులు ఏర్పా ట్లు పూర్తి చేశారు.
ఈ నెల 10వ తేదీ నాటికి ఈ సేవలు అందుబాటులోకి తె చ్చేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఆస్తిమార్పిడి, నల్లాబిల్లులు, ఖా ళీ స్థలాలపై పన్నుల చెల్లింపుల వివరాలన్నీ మున్సిపల్ (సీడీఎంఏ)వెబ్సైట్లో మున్సిపల్ కమిషనర్లు నమోదు చేశారు. ఈ నెల చివరి నాటికి ఈ సేవలు కూడా ఆన్లైన్లోకి తీసుకువచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఆయా ము న్సిపల్ విభాగాల సిబ్బందికి ఆన్లైన్ సేవలపై శిక్షణ కూడా పూర్తయింది. ఈ నెల 7, 8 తేదీల్లో బిల్డింగ్ ప్లానర్లకు ఈ విషయమై సీడీఎంఏ కార్యాలయం లో శిక్షణ ఇవ్వనున్నారు. ఈ సేవలు అందుబాటులోకి ఆయా అనుమతుల కోసం ప్రజలు ఆన్లైన్లోనే దరఖాస్తు లు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుదారులకు అనుమతులు ఇచ్చింది, లేనిది ఆన్లైన్లో అధికారులు తెలియజేస్తారు.
సిబ్బందికి శిక్షణ పూర్తయింది
భవన నిర్మాణం కోసం దరఖాస్తు చేసుకున్న తరువాత డీటీసీపీకి దరఖాస్తు వెళుతుంది. డీటీసీసీ అధికారులు ధ్రువపత్రాలు పరిశీలిస్తారు. అన్ని సరిగా ఉంటే క్లియరెన్స్ ఇస్తూ సంబంధిత మున్సిపల్ కమిషనర్లకు సమాచారం వెళుతుంది. స్థానికంగా వారు కూడా ఒకసారి వాస్తవ పరిస్థితిని పరిశీలించి ఆమోదం తెలిపితే అనంతరం ఆన్లైన్లో అనుమతులు జారీ అవుతాయి. సీడీఎంఏ వెబ్సైట్ ద్వారానే ఈ ఆన్లైన్ సేవలు కొనసాగుతాయి. ఈ విధానం అమలుకు సిబ్బందికి శిక్షణ కూడా పూర్తయింది. ఈ సేవలతో అవినీతి, అక్రమాలకు తావుండదు. అన్ని అనుమతులు 30 రోజుల్లోనే జారీ అవుతాయి. - సంతోష్కుమార్, మున్సిపల్ కమిషనర్,తాండూరు