breaking news
Cattle transport
-
'గుట్ట'చప్పుడు కాకుండా..
ఆంధ్రా, ఒడిశా బోర్డర్ (ఏఓబీ) అంటే ఒకప్పుడు మావోయిస్టుల కార్యకలాపాలకు పెట్టింది పేరు. కొన్నాళ్లుగా వారి కార్యకలాపాలు తగ్గుముఖం పట్టిన క్రమంలో అందమైన మన్యసీమ కాస్తా స్మగ్లర్లకు అడ్డాగా మారిపోయింది. కాదేదీ స్మగ్లింగ్కు అనర్హం అన్నట్టుగా.. ఇతర రాష్ట్రాలకు అనేక వస్తువులు, జీవరాశులను అక్రమంగా రవాణా చేస్తూ స్మగ్లర్లు రూ.కోట్లు గడిస్తున్నారు. గతంలో ఈ ప్రాంతం నుంచి భారీగా కలప అక్రమ రవాణా జరిగేది. అటవీ శాఖ దాడులు ముమ్మరం చేయడంతో దిక్కు తోచని స్మగ్లర్లు.. ఇతర ఆదాయ మార్గాలపై దృష్టి పెట్టారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ యథేచ్ఛగా తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. చింతూరు: ఆంధ్రా, ఒడిశా సరిహద్దుల్లో గంజాయి, పశువులు, తాబేళ్లు, తెల్లరాయి అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. జిల్లాలోని వై.రామవరంతో పాటు అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్తవీధి (జీకే వీధి) మండలాల సరిహద్దు ప్రాంతాల నుంచి స్మగ్లర్లు ఇతర రాష్ట్రాలకు గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్నారు. చింతూరు మండల సరిహద్దుల నుంచి పశువులు, తాబేళ్లు, తెల్లరాయిని యథేచ్ఛగా తరలిస్తున్నారు. తాజాగా జిల్లా సరిహద్దులను జూదగాళ్లు కోడిపందేలు, పేకాట అడ్డాలుగా మార్చేశారు. గం‘జాయి’గా.. వై.రామవరం, జీకే వీధి మండలాల సరిహద్దుకు ఆవల ఒడిశా రాష్ట్రం మల్కన్గిరి జిల్లా కుర్మనూరు, నిమ్మనూరు, రాశిబేడ, గిల్లమడుగు, సన్యాసిగూడ, అల్లూరుకోట, గుర్రలూరు, దంతుగూడ, పప్పులూరు ప్రాంతాల్లో గంజాయి సాగు విచ్చలవిడిగా జరుగుతోంది. ఈ ప్రాంతాల్లో ఏటా రెండు విడతలుగా గంజాయి పండిస్తున్నారు. అక్కడ పండించిన గంజాయిని 5, 10 కిలోల చొప్పున ప్యాకెట్లుగా చేసి, వాటిని బస్తాల్లో నింపి సరిహద్దులు దాటించి.. చింతూరు మండలం మీదుగా తెలంగాణ, మహారాష్ట్ర, తమిళనాడు తదితర ప్రాంతాలకు అక్రమంగా తరలిస్తున్నారు. దీనిపై అందుతున్న సమాచారం మేరకు పోలీసులు తరచుగా వాహనాల తనిఖీలు చేసి, గంజాయిని పట్టుకుంటున్నారు. అయినప్పటికీ కొందరు స్మగ్లర్లు.. పోలీసుల కన్నుగప్పి గంజాయిని చాకచక్యంగా తరలించుకుపోతున్నారు. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఇక్కడి నుంచి వెళుతున్న గంజాయిని పోలీసులు పట్టుకున్న సంఘటనలు అనేకం ఉన్నాయి. గత ఏడాది చింతూరు పోలీసు సబ్ డివిజన్లో రూ.1.14 కోట్ల విలువైన 2,275 కిలోల గంజాయి పట్టుబడగా.. 24 కేసులు నమోదు చేసి.. 64 మందిని అరెస్టు చేశారు. పోలీసు దాడుల నేపథ్యంలో కొంత మంది స్మగ్లర్లు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటున్నారు. గంజాయిని బస్తాలతో తరలిస్తే పోలీసులకు పట్టుబడుతూండటంతో.. ఇటీవల దానిని ద్రవ రూపంలోకి మారుస్తూ.. లిక్విడ్ గంజాయిని తరలిస్తున్నారు. పలుమార్లు పోలీసులు లిక్విడ్ గంజాయిని పట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. తెల్లరాయి రవాణా ఇలా ఏజెన్సీలో లభించే ఖనిజ సంపదను సైతం స్మగ్లర్లు యథేఛ్ఛగా దోచుకుంటున్నారు. ఒడిశాతో పాటు చింతూరులో విలువైన తెల్లరాయి (క్వార్ట్జ్) లభ్యమవుతోంది. ఒడిశా నుంచి తీసుకొచ్చిన దానితో పాటు స్థానికంగా లభ్యమయ్యే ఈ రాయిని బినామీ పేర్లతో స్టాక్ పాయింట్లో నిల్వ చేస్తున్నారు. అక్కడి నుంచి సరైన ధ్రువీకరణ పత్రాలు లేకున్నా రాత్రి సమయంలో అక్రమంగా రవాణాస్తున్నారు. కళ్ల ముందే జరుగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. తాబేళ్ల రవాణా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం, రావులపాలెంతో పాటు కాకినాడ తదితర ప్రాంతాల్లోని చెరువుల్లో తాబేళ్లు అధికంగా లభిస్తున్నాయి. వీటిని ఒడిశాకు చెందిన స్మగ్లర్లు అధిక మొత్తంలో కొనుగోలు చేసి, రాత్రి పూట వాహనాల్లో రవాణా చేస్తూ చింతూరు మండలం కొత్తపల్లి, పొల్లూరు వద్ద సరిహద్దులను దాటించి ఒడిశాకు అక్రమంగా రవాణా చేస్తున్నారు. ›మామూలు తాబేళ్లతో పాటు ఎంతో అరుదైన నక్షత్ర తాబేళ్లను కూడా రవాణా చేస్తున్నారు. అటవీ శాఖ సిబ్బంది దాడులు నిర్వహిస్తూ తాబేళ్లను పట్టుకుంటున్నా వాటి అక్రమ రవాణాకు మాత్రం అడ్డుకట్ట పడటం లేదు. ఒడిశా నుంచి పశువుల రవాణా చింతూరు మండలంలోని కొత్తపల్లి ప్రాంతాన్ని అడ్డాగా చేసుకుని స్మగ్లర్లు పశువుల అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. ఒడిశాలో పశువులను కొనుగోలు చేస్తున్న స్మగ్లర్లు.. సీలేరు నదిని దాటించి వాటిని కొత్తపల్లికి చేరుస్తున్నారు. అక్కడి నుంచి ఆ పశువులను వాహనాల్లో పరిమితికి మించి కుక్కి మరీ దారుణంగా తెలంగాణ, కేరళతో పాటు ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. వాహనాల తనిఖీ అధికం కావడంతో తరచుగా పశువులు పట్టుబడుతున్నాయి. ఈ క్రమంలో స్మగ్లర్లు రూటు మార్చి పశువులను కాలి నడకన సుదూర ప్రాంతాలకు తీసుకెళ్లి, అక్కడ వాహనాల్లోకి ఎక్కించి రవాణాకు బరితెగిస్తున్నారు. పశువుల అక్రమ రవాణాలో హైదరాబాద్, గోకవరానికి చెందిన వ్యాపారులతో పాటు చింతూరు మండలానికి ఓ వ్యక్తి కీలకపాత్ర పోషిస్తున్నట్లు తెలిసింది. -
'పుష్ప' స్టైల్లో ఆవుల అక్రమ రవాణా
సాక్షి, యాదాద్రి: యాదాద్రి భువనగిరి జిల్లాలో పుష్ప సినిమా రేంజ్లో జరిగిన అక్రమ గోవుల రవాణా ప్రయత్నాన్ని పంతంగి టోల్ ఫ్లాజా వద్ద పోలీసులు పట్టుకున్నారు. లారీ పైభాగంలో ఉల్లిగడ్డల లోడు, కిందభాగంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గూహల వంటి ఖాళీలో గోవులను దాచిపెట్టి తరలించేందుకు ముఠా ప్రయత్నించినట్టు పోలీసులు వెల్లడించారు. సమాచారం అందుకున్న పోలీసులు లారీని ఆపి పరిశీలించగా వైజాగ్ నుంచి హైదరాబాదులోని ఒక కబేళాకు గోవులను తరలిస్తున్నట్టు బయటపడింది. లారీ క్రింద భాగాన్ని పాలిష్ బోర్డులతో కప్పి చిన్న గాలి రంధ్రాలు ఉంచి పైన ఉల్లిగడ్డల సంచులతో పూర్తిగా మూసివేసి ఎవరికీ అనుమానం రాకుండా ముఠా చాకచక్యంగా ఏర్పాట్లు చేసినట్టు అధికారులు తెలిపారు.గోవుల రవాణా చేసిన వారిపై కేసు నమోదు చేసి డ్రైవర్, క్లీనర్ను అదుపులోకి తీసుకున్నారు. మిగతా ముఠా సభ్యుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. -
ఒడిశా టు ఆంధ్రా
చింతూరు: ఒడిశా నుంచి ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాలకు భారీ ఎత్తున పశువుల రవాణా కొనసాగుతోంది. ఒడిశా నుంచి పశువులను తీసుకొచ్చి చింతూరు మండలం కొత్తపల్లి వద్ద సీలేరు నదిని దాటిస్తున్నారు. అనంతరం అటవీ ప్రాంతం గుండా 10 కి.మీ దూరంలోని తులసిపాక గ్రామానికి తీసుకెళ్లి అక్కడి నుంచి లారీల ద్వారా రవాణా చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం, ఖమ్మం జిల్లా పాల్వంచ సంతల్లో ఈ పశువులను విక్రయిస్తామని వ్యాపారులు చెపుతున్నారు. అయితే గో సంరక్షణ చట్టానికి వ్యతిరేకంగా పశువుల రవాణా కొనసాగుతోందని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ చట్టం ప్రకారం ఒక్కో వాహనంలో ఏడు పశువులను మాత్రమే రవాణా చేయాలని, కానీ వ్యాపారులు 20 నుంచి 30 పశువులను తీసుకెళ్తున్నారని అంటున్నారు. దీనిపై ప్రశ్నిస్తే ‘మేం అందరికీ మామూళ్లు ఇస్తున్నాం, మా ఇష్టమొచ్చినట్లు రవాణా చేసుకుంటాం, మీకెందుకు’ అని సమాధానం చెపుతున్నారని, గో సంరక్షణ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న పశువుల రవాణాకు అడ్డుకట్ట వేయాలని జంతు ప్రేమికులు కోరుతున్నారు.


