breaking news
Brent
-
చమురు భగభగ.. భారత్కు సౌదీ ఉచిత సలహా
లండన్: డిమాండ్ మరింతగా మెరుగుపడే దాకా చమురు ఉత్పత్తిపై నియంత్రణలు కొనసాగించాలని చమురు ఎగుమతి దేశాల కూటమి ఒపెక్, దాని అనుబంధ దేశాలు భావిస్తున్న నేపథ్యంలో ముడి చమురు రేట్లు గణనీయంగా పెరుగుతున్నా యి. గురువారం 4% ఎగిసిన ధరలు శుక్రవారం మరో రెండు శాతం పైగా పెరిగాయి. 14 నెలల గరిష్ట స్థాయిని తాకాయి. ఫ్యూచర్స్ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ రేటు బ్యారెల్కు 2.3 శాతం దాకా పెరిగి 68.26 డాలర్లకు చేరింది. అటు నైమెక్స్ క్రూడాయిల్ ధర దాదాపు 2% పైగా పెరిగి 66.23 డాలర్ల స్థాయిని తాకింది. ఒపెక్, దాని అనుబంధ దేశాలు ఏప్రిల్లోనూ ఉత్పత్తి గణనీయంగా పెంచరాదని నిర్ణయించుకున్నాయి. రష్యా, కజకిస్తాన్లకు స్వల్ప మినహాయింపునివ్వడం తప్ప మిగతా దేశాలన్నీ కూడా ఉత్పత్తిపై నియంత్రణ కొనసాగించాలని తీర్మానించుకున్నాయి. ఒపెక్ దేశాలు కనీసం రోజుకు 15 లక్షల బ్యారెళ్ల మేర (బీపీడీ) ఉత్పత్తి పెంచుతాయని మార్కెట్ వర్గాలు భావించినప్పటికీ.. దానికి విరుద్ధంగా 1.5 లక్షల బీపీడీకి మాత్రమే ఒపెక్, అనుబంధ దేశాలు నిర్ణయించడం మార్కెట్ వర్గాలను నిరాశపర్చిందని యూబీఎస్ అనలిస్ట్ జియోవాని స్టానొవో పేర్కొన్నారు. జనవరి 2020: క్రూడ్ గరిష్ట రేటు 65.65 డాలర్లు ఏప్రిల్ 2020: క్రూడ్ కనిష్ట రేటు మైనస్ 40.32 డాలర్లు మార్చి 5 2021: క్రూడ్ గరిష్ట రేటు 66.23 డాలర్లు అంచనాల్లో సవరణలు.. ఒపెక్, అనుబంధ దేశాలు సరఫరాపై నియంత్రణలు కొనసాగించనున్న నేపథ్యంలో విశ్లేషకులు... ముడిచమురు ధరల అంచనాలను కూడా సవరించడం ప్రారంభించారు. రెండో త్రైమాసికంలో బ్రెంట్ క్రూడ్ రేటు మరో 5 డాలర్లు పెరిగి 75 డాలర్లకు (బ్యారెల్కు) చేరవచ్చని, మూడో త్రైమాసికానికి 80 డాలర్లకు చేరొచ్చని గోల్డ్మన్ శాక్స్ అంచనా వేసింది. ఈ ఏడాది ద్వితీయార్ధంలో బ్రెంట్ రేటు 75 డాలర్లకు (బ్యారెల్కు), నైమెక్స్ క్రూడ్ 72 డాలర్లకు (బ్యారెల్కు) చేరొచ్చని యూబీఎస్ అంచనాలను సవరించింది. భారత్కు సౌదీ ఉచిత సలహా.. చమురు రేట్లను స్థిరంగా ఉంచుతామన్న హామీకి కట్టుబడి ఉండాలని, ఉత్పత్తిపై నియంత్రణలను సడలించాలని భారత్ చేసిన విజ్ఞప్తిని ఒపెక్, దాని అనుబంధ దేశాలు తోసిపుచ్చాయి. కావాలంటే గతంలో చౌకగా కొనుక్కున్న చమురును ఉపయోగించుకోవాలంటూ సౌదీ అరేబియా ఉచిత సలహా ఇచ్చింది. ఒపెక్, అనుబంధ దేశాల నిర్ణయంపై జరిగిన విలేకరుల సమావేశంలో సౌదీ అరేబియా ఇంధన శాఖ మంత్రి ప్రిన్స్ అబ్దుల్అజీజ్ బిన్ సల్మాన్.. భారత్ విజ్ఞప్తిపై స్పందించారు. ‘భారత్ విషయానికొస్తే గతేడాది ఏప్రిల్, మే, జూన్లో చౌకగా కొనుగోలు చేసిన చమురును ప్రస్తుతం ఉపయోగించుకోవాలని మా మిత్ర దేశాన్ని కోరుతున్నాము‘ అని ఆయన వ్యాఖ్యానించారు. 2020 ఏప్రిల్-మే మధ్యన భారత్ 16.71 మిలియన్ బ్యారెళ్ల ముడిచమురును కొనుగోలు చేసింది. వైజాగ్తో పాటు మంగళూరు, పాదూరు (కర్ణాటక)లోని వ్యూహాత్మక పెట్రోలియం రిజర్వ్లలో నిల్వ చేసుకుంది. అప్పట్లో బ్యారెల్ క్రూడాయిల్ సగటున 19 డాలర్ల రేటుకే లభించింది. కేంద్రచమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇటీవలే చమురు రేట్లు ఎగియడం .. ఆర్థిక రికవరీ, డిమాండ్ను దెబ్బతీస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. మార్కెట్ పరిస్థితులు మెరుగుపడ్డ తర్వాత ఉత్పత్తి పెంచుతామంటూ ఒపెక్ అప్పట్లో హామీ ఇచ్చిందని.. కానీ ఇప్పుడు డిమాండ్ పెరుగుతున్నా ఉత్పత్తి సాధారణ స్థితికి రావడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. రికార్డు స్థాయిలో పెట్రో రేట్లు.. గతేడాది ఏప్రిల్–డిసెంబర్ మధ్యలో భారత్ దిగుమతి చేసుకునే ముడిచమురు సగటు రేటు బ్యారెల్కు 50 డాలర్ల కన్నా తక్కువే ఉన్నప్పటికీ దేశీయంగా రిటైల్ రేట్లు గరిష్ట స్థాయిలోనే కొనసాగాయి. పెట్రోల్, డీజిల్ రేట్లపై ఎక్సైజ్ డ్యూటీని ప్రభుత్వం పెంచుకుంటూ వస్తుండటం కూడా ఇందుకు కారణం. ప్రస్తుతం ఢిల్లీలోని రేట్ల ప్రకారం పెట్రోల్ ధరలో మూడో వంతు ఎక్సైజ్ డ్యూటీ ఉంటుండగా, డీజిల్ ధరలో 40% దాకా ఉంటోంది. దీనికి రాష్ట్రాల పన్నులూ తోడవడం రేట్లకు మరింతగా ఆజ్యం పోస్తోంది. రాజస్తాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర వంటి కొన్ని రాష్ట్రాల్లో పెట్రోల్ ధర ఇప్పటికే రూ. 100 దాటేసింది. అంతర్జాతీయంగా క్రూడ్ రేట్లు ఇంకా పెరిగితే దేశీయంగా ఇంధనాల రిటైల్ రేట్లు మరింతగా ఎగిసే అవకాశం ఉంది. క్రూడ్ సెగకు కరిగిన రూపాయి 19 పైసల పతనంతో 73 దిగువకు ముంబై: అంతర్జాతీయంగా క్రూడ్ ధరల పెరుగుదల, దేశీయ మార్కెట్ల తాజా బలహీన దోరణి ఎఫెక్ట్ రూపాయిపై పడింది. ఇంటర్బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో శుక్రవారం డాలర్ మారకంలో రూపాయి విలువ 19 పైసలు బలహీనపడి 73.02కు బలహీనపడింది. ఫెడ్ ఫండ్ రేటు (ప్రస్తుతం 0.00–0.25 శాతం శ్రేణి) మరింత తగ్గబోదని అమెరికా సెంట్రల్ బ్యాంక్- ఫెడ్ చైర్మన్ పావెల్ సంకేతాలు ఇచ్చారన్న విశ్లేషణలు, దీనితో ఇక ఈజీ మనీకి ముగింపు పలికినట్లేనన్న అంచనాలు, వ్యాక్సినేషన్ నేపథ్యంలో అమెరికా ఆర్థిక వ్యవస్థ వృద్ధి సంకేతాల నేపథ్యంలో డాలర్ ఇండెక్స్ మూడు నెలల గరిష్టానికి (91.94) చేరింది. -
చమురుకు మళ్లీ కరోనా కాటు
తాజాగా చైనాలో కరోనా వైరస్ సోకిన కేసులు బయటపడంతో ముడిచమురు ధరలకు షాక్ తగిలింది. ఏప్రిల్ తదుపరి గత వారం తిరిగి పతనమైన చమురు ధరలు నేటి ట్రేడింగ్లోనూ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. లండన్ మార్కెట్లో ప్రస్తుతం బ్రెంట్ బ్యారల్ 2 శాతం క్షీణించి 38 డాలర్ల దిగువకు చేరగా.. న్యూయార్క్ మార్కెట్లోనూ నైమెక్స్ బ్యారల్ 3 శాతం వెనకడుగుతో 35.26 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఈ నెల 10 నుంచి చూస్తే చమురు ధరలు 11 శాతం పతనమమ్యాయి. బీజింగ్ వ్యవసాయ మార్కెట్లో సుమారు 25 మందివరకూ కరోనా వైరస్ బారినపడినట్లు వార్తలు వెలువడ్డాయి. మరోపక్క శనివారం అమెరికాలో కోవిడ్-19 కేసులు మళ్లీ ఒక్కసారిగా పెరిగినట్లు వెల్లడైంది. దీంతో రెండో దశలో కరోనా వైరస్ విజృంభించనుందన్న అంచనాలు ఆందోళనలు కలుగజేస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. ఇప్పటికే కోవిడ్-19 ధాటికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు మాంద్య పరిస్థితులను ఎదుర్కొంటున్న విషయం విదితమే. గత వారం పతనం ఆరు వారాల ముడిచమురు ర్యాలీకి గత వారం బ్రేక్ పడింది. ఫలితంగా చమురు ధరలు 8.3 శాతం నష్టపోయాయి. కోవిడ్-19 కారణంగా అమెరికా ఆర్థిక వ్యవస్థ 2020లో ఏకంగా 6.5 శాతం క్షీణత చవిచూడవచ్చని కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ వేసిన అంచనాలు గత వారాంతాన చమురు ధరలను దెబ్బతీశాయి. అమెరికాలో నిరుద్యోగ రేటు 9.3 శాతానికి చేరనున్నట్లు ఫెడ్ తాజాగా వేసింది. దీంతో అమెరికాసహా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు మాంద్యం కోరల్లో చిక్కుకోనున్న అంచనాలు బలపడ్డాయి. ఫలితంగా చమురుకు డిమాండ్ పడిపోనుందన్న ఆందోళనలు తలెత్తాయి. దీనికితోడు గత వారం అమెరికాలో ఇంధన నిల్వలు అనూహ్యంగా పెరిగాయి. ఈ నెల 5తో ముగిసిన వారంలో చమురు నిల్వలు 7 మిలియన్ బ్యారళ్లమేర పెరిగి 538 మిలియన్ బ్యారళ్లను అధిగమించినట్లు యూఎస్ ఇంధన ఏజెన్సీ వెల్లడించింది. దీంతో చమురు నిల్వలు సరికొత్త రికార్డ్ గరిష్టానికి చేరుకున్నట్లు తెలియజేసింది. గతేడాది ఇదే సమయంలో దాదాపు 486 మిలియన్ బ్యారళ్ల నిల్వలు మాత్రమే నమోదయ్యాయి. నిజానికి 1.45 మిలియన్ బ్యారళ్ల తగ్గుదల నమోదుకావచ్చని విశ్లేషకులు అంచనా వేశారు. చైనా ఎఫెక్ట్ చమురును అత్యధికంగా దిగుమతి చేసుకునే చైనాలో తిరిగి కరోనా వైరస్ కలకలం సృష్టించడంతో ఇంధన డిమాండ్ తగ్గనున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. కోవిడ్-19 ప్రభావంతో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలు మాంద్యంబారిన పడనున్న అంచనాలు పెరుగుతున్నట్లు తెలియజేశారు. అమెరికాసహా పలు దేశాలలో కరోనా వైరస్ మరోసారి వ్యాపించవచ్చని.. ఇది సుదీర్ఘ లాక్డవున్లకు దారితీయవచ్చని కొంతమంది నిపుణులు ఇటీవల అంచనా వేస్తున్నారు. ఇది అంతర్గతంగా సెంటిమెంటును బలహీనపరుస్తున్నట్లు ఇంధన వర్గాలు తెలియజేశాయి.కాగా.. ధరలకు స్థిరత్వాన్ని ఇచ్చేందుకు రష్యాసహా ఒపెక్ దేశాలు రోజుకి 9.7 మిలియన్ బ్యారళ్లమేర చమురు ఉత్పత్తిలో కోతలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. జులై చివరివరకూ ఉత్పత్తిలో కోతలను అమలు చేయనున్నాయి. . -
డీజిల్ ధరలపై త్వరలో నియంత్రణ ఎత్తివేత?
న్యూఢిల్లీ: డీజిల్ అమ్మకంపై నష్టం రికార్డు స్థాయిలో తగ్గిపోయింది. డీజిల్ ఉత్పత్తి వ్యయం, విక్రయ ధరల మధ్య వ్యత్యాసం ఈ నెల తొలి పక్షంలో లీటరుకు రూ.2.80 ఉండగా, ఇప్పుడది రూ.1.62కు తగ్గిపోయింది. రూపాయి మారకం విలువ బలపడుతూ, లీటరు రేటును నెలకు 50 పైసల చొప్పున పెంచుతుంటే వచ్చే సెప్టెంబరుకల్లా డీజిల్ ధరలపై ఆంక్షలను ప్రభుత్వం తొలగించనుంది. ధరలను ప్రతినెలా స్వల్పంగా పెంచడం ద్వారా సబ్సిడీలను ఎత్తివేయాలన్న మునుపటి యుపీఏ ప్రభుత్వ నిర్ణయాన్ని నరేంద్ర మోడీ సర్కారు కొనసాగిస్తోంది. గతేడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 16 విడతల్లో లీటరు డీజిల్ ధరను రూ.10.12 పెంచారు. మే ద్వితీయార్థంతో పోలిస్తే ఈ నెల ప్రథమార్థంలో అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు తగ్గాయని అధికారులు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. గత నెలలో మోడీ ప్రభుత్వం అధికారాన్ని చేపట్టినపుడు లీటరుపై రూ.4.41 చొప్పున నష్టం వచ్చింది. పెట్రోలు ధరలపై కంట్రోలును 2010 నుంచి ఎత్తివేశారు. దీంతో ఉత్పత్తి వ్యయానికి తగ్గట్లుగా పెట్రోలు ధరలు ఉంటున్నాయి. డీజిల్, కిరోసిన్, వంటగ్యాస్ సిలిండర్లను సబ్సిడీపై విక్రయిస్తున్నందువల్ల చమురు మార్కెటింగ్ కంపెనీలకు ప్రస్తుతం రోజుకు రూ.249 కోట్లు నష్టం వస్తోంది. గత పక్షంలో ఇది రూ.262 కోట్లుగా ఉంది.