breaking news
brahman
-
రాయ్బరేలీ బీజేపీ లోక్సభ అభ్యర్థి కుమార్ విశ్వాస్?
కాంగ్రెస్లోని గాంధీ కుటుంబానికి కంచుకోటగా ఉన్న యూపీలోని రాయ్బరేలీ లోక్సభ స్థానం నుంచి బీజేపీ ఈసారి బ్రాహ్మణ అభ్యర్థిని బరిలోకి దింపాలని యోచిస్తున్నదని సమాచారం. ఈ నేపధ్యంలో బీజేపీ అభ్యర్థులుగా కుమార్ విశ్వాస్, బీజేపీ మాజీ జాతీయ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ, జాతీయ అధికార ప్రతినిధి సుధాన్షు త్రివేది, ఎస్పీ ఎమ్మెల్యే మనోజ్ పాండే పేర్లు వినిపిస్తున్నాయి. రాయ్బరేలీ, అమేథీలను యూపీలో కాంగ్రెస్కు కంచుకోటలుగా పరిగణిస్తారు. అయితే 2019లో అమేథీ నుంచి బీజేపీ తన అభ్యర్థిగా స్మృతి ఇరానీని పోటీకి దింపి, కాంగ్రెస్ కంచుకోటను బద్దలుకొట్టింది. రాయ్బరేలీ స్థానాన్ని సొంతం చేసుకునేందుకు బీజేపీ గత రెండేళ్లుగా ప్రయత్నాలు సాగిస్తోంది. ఇదేస్థానం నుంచి కాంగ్రెస్ మహిళా నేత ప్రియాంక గాంధీ వాద్రా పోటీ చేస్తారనే చర్చ జరుగుతోంది. ఈ నేపధ్యంలో బీజేపీ రాయ్బరేలీ నుంచి ప్రముఖుడిని రంగంలోకి దింపేందుకు సిద్ధమైంది. కుమార్ విశ్వాస్ 2014లో ఆమ్ ఆద్మీ పార్టీ టిక్కెట్పై అమేథీ నుంచి పోటీ చేశారు. విశ్వాస్ను ఎన్నికల్లో దింపడం ద్వారా బలమైన పోటీ ఇవ్వవచ్చని బీజేపీ భావిస్తోంది. దీనికితోడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కుమార్ విశ్వాస్ ప్రసంగం ఆయన బీజేపీ నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తారని సూచనలిస్తోంది. ఇటీవల ప్రధాని మోదీ ద్వారకలో పర్యటించినప్పుడు ఆయనను కుమార్ విశ్వాస్ ప్రశంసించారు. -
అసామాన్య సామాన్యుడు
‘హేమాడ్ పంత్!’ అని తనని సాయి సంబోధించడమేమిటి? ఇంతకీ ఆయనెవరు? అని ఒక్కక్షణం అన్నా సాహెబు ఆలోచించాడు. ‘యదు’ అనే పేరుగల వంశం ఒకటుంది. ఆ వంశంలో పుట్టిన అందర్నీ ‘యాదవులు’ అని పిలుస్తారు. అలాంటి యాదవ వంశాల్లో ఎవరు ఏ ప్రాంతానికి చెందిన వారైతే వాళ్లని ఆ ప్రాంతానికి చెందిన యాదవులు సుమా! అని గుర్తించేందుకు వీలుగా ఆ ప్రాంతపు పేరుని ఈ యాదవ వంశానికి ముందు తగిలించేవారు. అలా ఏర్పడినదే దేవగిరి ప్రాంతానికి చెందిన యాదవుల వంశం – దేవగిరి యాదవ వంశం. ఆ రాజులు తమకు చక్కని ఆలోచననీయగల కొందరు మేధావుల్ని మంత్రులుగా నియమించుకున్నారు. అలా నియమించుకున్న మంత్రులందరికీ పైవాణ్ని ముఖ్యమంత్రి అని వ్యవహరిస్తుండేవారు. అలా దేవగిరి యాదవ వంశీయులకి రాజుగా ఉండేవానికి ముఖ్యమంత్రి హోదాలో నియమింపబడ్డ మహనీయుడు హేమాడ్ పంత్. ఈ మాటకి సరైన మాట – హేమాద్రి పంతు. పంతు అనే పదం బ్రాహ్మణుల పేర్లకి చివర ఉండటంగాని, లేదా ఆయన పేరు ఏదైనప్పటికీ ‘పూజ్యుడైన బ్రాహ్మణుడా!’ అనే అర్థంతో సంబోధిస్తూ పంత్జీ అనేవారు. ఈయన బ్రాహ్మణ జాతికి చెందినవాడు కాబట్టి ఏదో కులగౌరవం కోసం పంతు అని పిలవబడ్డ పిలుపు కాదిది. నిజంగా బ్రాహ్మణ ధర్మాన్ని చక్కగా ఆచరించిన వాడూ, గొప్ప పండితుడు హేమాద్రి పంత్. పైగా ఆయన తన పాండిత్యానికి గుర్తుగానూ, ఎవరికీ ఏవిధంగానూ తన పాండిత్యం అర్థం కాకపోయినా ఫరవాలేదు గాని, ఉత్తమ గ్రంథాన్ని లోకానికందించాలనే ఉత్తమ స్ఫూర్తితోనూ ‘చతుర్వర్గ చింతామణి రాజ ప్రశస్తి’ అనే గ్రంథాన్ని రచించి జాతికి సమర్పించాడు కూడా. ‘ఇంతటి గొప్పవాడూ, ఇంకా ఇప్పటికీ తెలియని ఎన్నెన్నో గొప్పదనాలు కలవాడూ అయిన హేమాద్రి పంతుతో తనని సమానం చేస్తూ సాయి తనని హేమాద్రి పంతు అని పిలవడమేమిటి?’.. అని ఆలోచించిన అన్నా సాహెబు ఓ దృఢ నిర్ణయానికొచ్చాడు. సహజంగా ఎవరైనా ఓ చేయరాని పని చేసినా, మాట్లాడరాని తీరులో మాట్లాడినా అలాంటివారిని ఎగతాళి చేస్తూ ‘అతనికేం! అతను అపర కాళిదాసు’ అంటూంటారు. అయితే తనని అలా ఎగతాళి చేస్తూ ‘హేమాద్రి పంతు’ అనలేదు సాయి. దానిక్కారణం సాయి స్వభావం. ఎదుటివారిని తక్కువ చేస్తూ, వేళాకోళం చేస్తూ మాట్లాడే తీరు కాదు. పోనీ! తనని ప్రశంసిస్తూ ‘హేమాద్రి పంతు’ అని సంబోధించాడనుకుందామా? అంటే అంత గొప్పదనాన్ని సాయిని దర్శించినంత ఇంత తక్కువ కాలంలో తానేమీ చూపించలేదు. పైగా తోటి మిత్రులెవరూ కూడా తన పనుల్లో ఏదో గొప్పదనమున్నట్లుగా ఏనాడూ తనతో అన్నదీ లేదు. తనని ‘హేమాద్రి పంతు!’ అని సంబోధించిన కారణంగా తాను ఆ హేమాద్రి పంతు ఎవరా? అని భావించి, ఆయన గురించిన మొత్తం సమాచారాన్ని తీసుకుంటాడు గదా అన్నా సాహెబు అనే ఆలోచనతో సాయి తనని అలా సంబోధించి ఉండవచ్చు. నిజాన్ని నిజంగా ఆలోచించినా హేమాద్రి పంతుని ఇంతకుముందు తెలుసుకోవాలనుకున్నదీ లేదు – తెలిసి ఉన్నదీ లేదు. ఇప్పుడు ఆయన వ్యక్తిత్వం, గొప్పదనం, గాంభీర్యం – అన్నింటికీ మించి – సాయి అంతటివాని చేత ప్రశంసించబడిన హేమాద్రి పంతు కావడం వల్ల.. అన్నా సాహెబుకి గట్టి ఆలోచన వచ్చింది – తాను హేమాద్రి పంత్ను గనుక మార్గదర్శకునిగా తీసుకుంటే సాయికి మరింత దగ్గర కాగలడని. అన్నా సాహెబు తన ప్రవర్తన ఎలా ఉండి ఉందో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకున్నాడు. షిరిడీకి బయలుదేరేముందు మిత్రుని పుత్రుడు మరణిస్తే – ప్రాణాన్ని రక్షించలేని గురువు ఓ గురువా? – అనుకుని ప్రయాణాన్ని మానేసుకున్నాడు. ఆ సందర్భంలో మళ్లీ మరో మిత్రుడు తనకి చివాట్లు పెట్టి సాయి గొప్పదనాన్ని చెప్పి మళ్లీ బయలుదేరదీశాడు. ఏదో జరిగిన సంఘటనని గురువుకి ముడిపెట్టి దాని ఆధారంగా గురువుని తక్కువ చేయడం లేదా విశ్వసించకపోవడం, తన ఆలోచనే గొప్పదనుకోవడం సరికాదన్నమాట. ఈ విషయాన్ని గ్రహించుకున్నాడు. అంటే ఏమన్నమాట? షిరిడీకి వెళ్లడం మానుకున్న తనని మళ్లీ మిత్రుని రూపంలో చివాట్లు పెట్టి బయలు దేరదీసింది సాయేనన్న మాట! దీన్ని అర్థం చేసుకున్నాడు. తాను బయలుదేరి ఎక్కడ రైలు ఆగదో ఆ బండిలోకి ఎక్కి కూచున్నవేళ అజ్ఞాతవ్యక్తిలా వచ్చి వివరాలడిగి షిరిడీకి వెళ్లే మార్గాన్ని చెప్పి సహకరించినవాడూ ఆ సాయేనన్నమాట. దీన్ని తెలుసుకున్నాడు. తనని ప్రతిక్షణంలోనూ ప్రతి కదలికలోనూ ప్రతి మాటలోనూ సాయి పరిశీలిస్తూ ఉన్నాడని. పెరుగుని నీటితో కలిపి చిలికితే ఎలా వెన్న పైకి వస్తుందో అలా ఈ గత అనుభవాలను పరిశీలించుకుంటే అర్థమైంది తనకి – తనని సాయి దగ్గరికి తీసుకుంటున్నాడని. అందుకే ‘హేమాద్రి పంతులా ఉండవలసింది సుమా!’ అని సూచిస్తూ, అలా ఉన్న పక్షంలో మరింత సాయికి చేరువ కాగలనని తెలుపుతూ ఉన్నట్లు అవగతమైంది. అందుకే సాయి చరిత్రను రాసి లోకానికి అందించాలనే భావన, తపన తనకి దృఢమయింది. ఏ విషయాన్నైనా మొక్కుబడిలా రాసేయడానికీ, రాసిన ప్రతి అక్షరంలోనూ తన భక్తి శ్రద్ధలని నింపి రాయడంలోనూ తేడా లేదా? ఒక పాటని ఏదోలా పాడేస్తే అక్షరాలన్నీ నోటినుండి బయటికొచ్చేస్తాయి తప్ప వాటిలో మాధుర్యం ఆర్ద్రతా ఉంటుందా? అలానే సాయి స్వయంగా తనని దగ్గరికి తీసుకుంటున్న ఈ దశలో తాను సాయి చరిత్రను రాస్తే ఆ చరిత్రలోని ప్రతి అక్షరంలోనూ – ఆ చరిత్రను చదివే ప్రతి భక్తునికీ సాయి దర్శనమవుతుందని అర్థం చేసుకోగలిగాడు అన్నా సాహెబు. ఈ స్థితి వ్యక్తికి కలగాలంటే కావలసినవి ‘శ్రద్ధ – సబూరి’ – చలించని నమ్మకం, చెప్పలేనంత ఓపిక. ఇప్పుడీ చరిత్రని చదువుతున్న వారికైనా, సాయి తమకి దగ్గర కావాలంటే షిరిడీకి వెళ్లి సాయిని దగ్గరగా చూడటం వల్ల దగ్గరితనం రాదు. పైననుకున్న శ్రద్ధ సబూరి అనే రెండూ గాని కలిసి ఉన్నట్లైతే దగ్గరతనం దానంటతదే సిద్ధించేస్తుంది. అందుకే ఒకసారి షిరిడీకి వెళ్లినవారికి అదే చివరి ప్రయాణం కాదు. కాబోదు. సాయి అలా కానివ్వడు కూడా! మారాకనే మహాత్ములయ్యారు! ఒక్కసారి ప్రాచీన మహాత్ముల చరిత్రలను పరిశీలిస్తే ఒకప్పుడు మరో తీరు ప్రవర్తనలో ఉన్నవాళ్లే, ఏదో ఒక సంఘటన కారణంగా అకస్మాత్తుగా మారి మహాత్ములయ్యారు. కేవలం దారిదోపిడీలు చేస్తూ మార్గంలో ప్రయాణించేవారిని భయపెట్టి వస్తువుల్నీ, ధనాన్నీ దోచుకుంటూండే ఋక్షుడనే వ్యక్తిని నారదుడు సప్తమహర్షులతో కలిసి చెట్టుకి కట్టేశాడు. నారదుడు అడిగాడు – ‘మా ధనాన్నీ, వస్తువుల్నీ దోచుకుంటూ జీవితాన్ని వెళ్లదీసుకుంటున్నావు కదా! ఇది పాపమని నీకూ తెలుసుకదా! దీనిలో నీ భార్యాపుత్రులకి భాగస్వామ్యం ఉందా? కనుక్కురా!’. ఎక్కడైనా దొంగని ప్రశ్నిస్తే.. పైగా ఇలాంటి ప్రశ్న వేస్తే కనుక్కొస్తాడా? జీవితంలో మార్పు రాబోతోంది. వెళ్లి కనుక్కున్నాడు. భార్య చెప్పింది – భర్త పుణ్యంలో సగం తనది తప్ప పాపంలో ఏమాత్రం భాగస్వామ్యం ఉండదని. అంతే! నారదుని దగ్గర మంత్రోపదేశం పొందడం, తపస్సుకి కూర్చోవడం, ఒంటినిండుగా వల్మీకం (పుట్ట) పెరిగేంత కాలం తపస్సు చేయడం, నారదుడే ‘వాల్మీకి’ అని పిలుచుకోవడం, ఆ బిరుదు పేరుతోనే శాశ్వతుడు అయిపోవడం జరిగింది కదా! ఇక్కడ కూడా అన్నా సాహెబుకి జీవితంలో మార్పు కలిగి ‘హేమాద్రి పంతు’ అనే బిరుదు పేరే ఏర్పడింది. మరాఠీ భాషలో హేమాడ్ పంత్. ఇదే తీరుగా భారతంలో పరాశరుడనే మహర్షి ఉన్నాడు. ఆయన గంగానదిని నావమీద దాటుతూ ఆ నావని నడుపుతూన్న సత్యవతి అనే ఆమెను అడిగాడు – నీ నుండి ఉత్తమ పుత్రుణ్ని పొందదలిచాను తప్పశ్శక్తితో – అని. ఆమె అంగీకరించింది. దానిక్కారణం తపశ్శక్తితో సద్యోగర్భాన్ని (చూస్తుండగా గర్భం రావడం, తొమ్మిది నెలలు మోయడం.. వంటివేమీ లేకుండా సంతానాన్ని కనడం,) ఇస్తున్నప్పుడూ, కన్యత్వం చెడనప్పుడూ సంతానాన్ని – అందునా మహర్షి నుండి పొందడం మంచిదీ, గౌరవకారణమూ కదా! అని. జాలరి అయిన తనకు మహర్షి అనుగ్రహం ఆయనంతట ఆయన ద్వారా కలగడం ఎంత గొప్ప! అని భావించి అంగీకరించింది. గంగకి అవతలి ఒడ్డుకి చేరాక ద్వీపంలో కనడం కారణంగానూ, ప్రపంచాన్ని చీకటి చేసి (కృష్ణం) పుత్రుణ్ని పొందిన కారణంగానూ ఆ సంతానం ‘కృష్ణ ద్వైపాయనుడు’ అని పిలువబడ్డాడు. ఇది ఆయన అసలు పేరు. ఇందాక శ్రీమద్రామాయణ కథలో బిరుదు పేరైన వాల్మీకికి ముందు పేరు ఋక్షుడు అయినట్లుగా, ఇక్కడ కూడా ఈ కృష్ణ ద్వైపాయనుడు – వేదాలను విభజించిన కారణంగా వేద వ్యాసుడు అనే బిరుదు పేరుని పొందాడు. పరిశీలిస్తే చరిత్రలన్నీ ఒకలానే ఉంటాయి. ఋక్షుడు – వాల్మీకి, కృష్ణ ద్వైపాయనుడు – వ్యాసుడు లాగానే అన్నా సాహెబు – హేమాడ్ పంత్గా అయ్యాయి. బాబాని ఎందుకు నమ్మాలి? కోట్ల మంది భక్తులకి బాబా ఆరాధ్య దైవం. బాబా సమాధి కాకముందు చూసినవారెవరూ వారు సమాధి అయ్యేంతవరకూ ఒక్కసారి మాత్రమే చూసి మరల రాకుండా ఉన్నవారు లేరు. అదేదో వింత ఆకర్షణ ఆయనలో ఉండటమే కారణం. జీవితంలో పెద్ద దీర్ఘ సమస్య వచ్చిన సందర్భంలో ఆయన సమాధి దగ్గరకు పోయి నిశ్శబ్దంగా మనసులోనే రోదిస్తూ నిలబడితే, మౌనంగా ఆ సమాధి నుండి సమస్యకి సమాధానం వినిపిస్తుంది. ఆ సమాధానం పట్ల ఎదురుచూపు ప్రారంభమవుతుంది. మొత్తానికి అలాగే ఆ సమస్యా పరిష్కారం జరగడమనేది ఎందరికో అనుభవంతో కనిపించే యథార్థం. తనకున్న ఖ్యాతి, కీర్తి, భక్త జన సంరక్షకుడనే జనుల నమ్మకం కారణంగా బంగారపు మేడలలో నివసించవచ్చు. చిటికె వేస్తే చాలు ఖరీదైన భవనాల పరంపర తన వద్దకి వచ్చి చేరతాయి. అయితే ఆయన ఓ మసీదు గోడకి మాత్రమే ఒరిగి కూర్చుంటారు. ఎవరో ఆయన గురించి బాధపడి ఒక దిండుని అందిస్తే దాన్ని పెట్టుకుని కనిపిస్తారు రేయింబవళ్లూ. ఎందరెందరి జీవితాలకో వడ్డించిన విస్తళ్లని ఏర్పాటు చేయగల శక్తి ఉన్నా, ఆయన మాత్రం నేలమీద ఓ ముతక గోనె సంచిని పరిచి దానిమీద తిరుగలిని ఉంచి, పక్కన చేటలో ఉన్న గోధుమల్ని అప్పుడప్పుడు కొంత కొంత చొప్పున పోస్తూ, తిరుగలిని తిప్పుతూ పిండిని విసురుతూ అప్పుడప్పుడు కనిపిస్తారు. ఒంటరివాడైన బాబాకి ఆ చేటెడు గోధుమలు కావాలా? పైగా పిండిని తానే విసురుకోవాలా? ఎవరిని ఆర్ద్ర దృష్టితో చూసినా ఎన్ని కాలిన రొట్టెలని తెచ్చి సమర్పించుకోరు గనుక! ఓ ఎండ అని లేదు – వాన అనేది లేదు – చలి అనేదాన్ని పట్టించుకునే ధోరణే లేదు. ఏదో ప్రకృతికి అతీతునిగా అక్కడే ఆ వేపచెట్టు మూలంలో కూర్చోవడం ఆశ్చర్యం కాదూ? పరమ రామ భక్తులయినవారు దర్శిస్తే వారికి రామచంద్రమూర్తిగాను, అత్యంత శివభక్తిపరులు దర్శిస్తే సాక్షాత్తూ పరమశివునిలానూ కనిపించి ఉన్న కారణంగానూ, కృష్ణ పరమాత్ముని లాగా అనేక లీలలని చూపి ఉన్న కారణంగా ఆయన్నే కృష్ణుడిగా అందరూ దర్శించారు. అందుకే ఆయన నివసించే మసీదుకి ద్వారక అనే పేరుని పెట్టారు. లోకంలో ద్వారకలు మూడు కాగా, ఒకటి సముద్రంలో మునిగిపోయింది కదా! రెండవది ద్వారకాపురి. ఇక మూడోది సప్త ద్వారక అదే షిరిడీ అని భక్తజనుల దృఢ విశ్వాసం. లక్షలకొలది భక్తులకు ఆహారాన్ని పెట్టగలిగి కూడా భిక్షాటన చేయడం, బంగారపు మందిరాల్లో ఉండగలిగిన శక్తి ఉండి కూడా మసీదు గోడకే ఆనుకుని కూర్చోవడం, భూత భవిష్యత్ వర్తమానాలని తెలియగలిగిన శక్తి ఉండి కూడా ఏమీ తెలియని పిచ్చివానివలె ఉండటం, ఖరీదైన వస్త్రాలను కోకొల్లలుగా రప్పించుకోగలిగి కూడా చిరిగిన వస్త్రాలనే ధరిస్తూ, చిరిగిన చోట సూదీ దారాలతో కుట్టుకున్న వస్త్రాలని వేసుకోవడం, తనకి నిజమైన భక్తుడని అనిపించిన వ్యక్తికి మాత్రమే ఊదీ (విభూతి) ప్రసాదాన్నిస్తూ ఉండటం, అత్యంత భక్తుడైన వానికి మాత్రమే అర్థమయ్యేలా నర్మగర్భంగా మాట్లాడటం... వంటివన్నీ నిజమైన ఫకీరు లక్షణాలు. అన్నీ ఉండి కూడా ఏమీ లేనివానిలా ఉండటం, అన్నీ తెలిసి కూడా తెలియని వానిలా ఉండటం, అనేక సిద్ధ శక్తులున్నప్పటికీ (నీళ్లతో దీపాలను వెలిగించడం వంటివి) అతి సామాన్యునిలా వ్యవహరించడం, అంతటి గొప్పవాడైనప్పటికీ పిల్లలతో ఆటలాడుకుంటూ ఉండటం.. వంటివన్నీ ఆయన్ను లోకానికి అతీత పురుషునిగా తెలియజేస్తూ ఇహలోక భోగాలను అనుభవించగల శక్తి ఉండీ, వాటిని ఇష్టపడని తీరులో ఉన్న కారణంగా ఆయన్ని తప్పక నమ్మితీరాలని చెప్తాయి ఈ ఉదాహరణలన్నీ. ఇక రోహిల్లా కథకి వెళదాం. (సశేషం..) ∙డా. మైలవరపు శ్రీనివాసరావు -
మూడు వరాలు
పూర్వం ఒక ఊరిలో ఒక నిరుపేద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని భార్య కురూపి. తన పేదరికం కన్నా భార్య కురూపిత్వమే అతన్ని అమితంగా బాధించేది. ఒక రోజు అతను నదికి వెళ్లి స్నానం చేసి, సూర్యనమస్కారాలు చేశాడు. ఆ తర్వాత అక్కడే కూర్చుని సూర్యుని వైపు చూస్తూ నిన్నందరూ లోకబాంధవుడనీ, భక్త సులభుడనీ అంటారు కదా! నాకు మాత్రం వరాలనెందుకు ఇవ్వవు? అంటూ ప్రార్థించాడు. అది చూసి జాలిపడ్డ సూర్యుడు ఒక వృద్ధబ్రాహ్మణ రూపంలో అక్కడికి వచ్చాడు. అతనికి మూడు కొబ్బరికాయలిస్తూ, ‘‘నీకు మూడు వరాలిస్తున్నాను. నీకు ఏది కావలిస్తే అది కోరుకుని కొబ్బరికాయ కొట్టు. వెంటనే అది ఫలిస్తుంది. అలాగని అన్నీ ఒక్కసారే కోరుకోనక్కరలేదు. నీకు కావలసినప్పుడు కోరుకోవచ్చు’’ అని చెప్పాడు. అతను పరమానందంతో ఆ కొబ్బరికాయలనందుకున్నాడో లేదో, ఆ బ్రాహ్మణుడు అదృశ్యమైపోయాడు. అతనికి దూరంగా భార్య నీళ్లబిందెతో కనిపించింది. ఎండపొడ ఆమె మీద పడుతోంది. భార్య మరీ అనాకారిగా కనిపించింది. దాంతో ఇక ఉండబట్టలేక, తన భార్య అతిలోక సుందరిగా మారిపోవాలంటూ, ఒక కొబ్బరికాయ కొట్టాడు. అంతే! ఆమె అద్భుత సౌందర్యరాశిగా మారిపోయింది. సరిగ్గా, అదే సమయంలో రాజుగారు రథం మీద వెళుతూ, ఆమెను చూశాడు. ఇంతటి అందగత్తె తన అంతఃపురంలో ఉంటే బాగుండుననిపించి, ఆమెను చెయ్యి పట్టుకుని రథంలో కూర్చుండబెట్టుకుని, అక్కడినుంచి వేగంగా వెళ్లిపోసాగాడు. అది చూసిన బ్రాహ్మణుడు తన భార్య ఒక పెద్ద ఎలుగుబంటిలా మారిపోవాలనుకుంటూ, మరో కొబ్బరికాయ కొట్టాడు. రథంలో ఉన్న ఆమె ఎలుగుబంటిగా మారిపోవడంతో రాజుకు మతిపోయింది. కొంపదీసి ఈమె ఏమయినా మంత్రగత్తె ఏమో అనుకుంటూ, రథం మీదినుంచి ఒక్క తోపు తోసేసి, వేగంగా వెళ్లిపోయాడు. ఆ భల్లూకం బ్రాహ్మణుడి మీదికి రాసాగింది. దాంతో దిక్కుతోచని బ్రాహ్మణుడు తన వద్ద ఉన్న చివరి కొబ్బరికాయ కూడా కొట్టి, ఆమె తిరిగి ఎప్పటిలా మారిపోవాలని కోరుకున్నాడు. వెంటనే అతని భార్య తిరిగి మామూలుగా కురూపిలా మారిపోయింది. భగవంతుడే కనికరించి, మూడు వరాలనిచ్చినా, ఆ మూడు వరాలూ అతని పాలిట నిష్ఫలంగా మారిపోయాయి. అతను బీదవాడిగా, ఆమె అనాకారిలా మిగిలిపోయారు. ఏమైనా, సద్వినియోగం చేసుకునే నేర్పు మనలో లేనప్పుడు, ఎన్ని వరాలనిచ్చినా ప్రయోజనం ఉండదని చెప్పడానికి ఇది ఉదాహరణ. అతను తెలివితేటలను, వివేకాన్ని ఉపయోగించి ఉంటే తన జీవితాన్ని మార్చి వేసే వరాలను కోరుకుని ఉండేవాడు. అందుకే మనిషికి విద్య, వివేకం, వివేచన ముఖ్యమని చెప్పారు పెద్దలు. -
బ్రాహ్మణ కుటుంబాలకు సంక్షేమ ఫలాలు
– జిల్లా కోఆర్డినేటర్ సముద్రాల హనుమంతరావు కర్నూలు (అర్బన్): ఇప్పటి వరకు 30 వేల బ్రాహ్మణ కుటుంబాలు వివిధ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధిపొందాయని బ్రాహ్మణ కార్పొరేషన్ జిల్లా కోఆర్డినేటర్ సముద్రాల హనుమంతరావు తెలిపారు. ఆదివారం స్థానిక సంకల్బాగ్లోని శ్రీవెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఏపీ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హనుమంతరావు మాట్లాడుతూ కార్పొరేషన్ ఏర్పాటైన తర్వాత ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు ఒక లక్ష మంది వరకు బ్రాహ్మణులు లబ్ధిపొంది ఉంటారన్నారు. బ్రాహ్మణుల సంక్షేమం కోసమే కార్పొరేషన్ చైర్మెన్ ఐవైఆర్ కృష్ణారావు అనేక పథకాలను ప్రవేశపెడుతున్నారని చెప్పారు. విద్య, ఉపాధి, వైద్య రంగాలతో పాటు 60 సంవత్సరాలు దాటిన బ్రాహ్మణ వృద్ధులకు నెలకు రూ.1000 పింఛన్ సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. రిజిస్టర్ అయిన వృద్ధాశ్రమాల్లో ఉన్న వారికి రూ.3 వేలు ఇచ్చే విధంగా చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. అర్చకులకు రిటైర్డ్మెంటు లేకుండా చేశామని చెప్పారు. అనంతరం బ్రాహ్మణ సంఘం నేతలు మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి హెచ్కే మనోహర్, జిల్లా అర్చక పురోహితుల సంఘం అధ్యక్షుడు రవిచంద్ర, కార్యదర్శి చెరువు దుర్గాప్రసాద్, హెచ్కే రాజశేఖర్, ఎస్.చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
ఆలోచింపజేసే ‘బ్రాహ్మణ’ చర్చ
కన్నడ హీరో ఉపేంద్రకు తెలుగునాట ఓ ప్రత్యేక క్రేజు, ఉంది. ‘దండు పాళ్యం’ ద్వారా అందరి దృష్టినీ ఆకర్షించిన దర్శకుడు శ్రీని వాస్రాజు కాంబినేషన్లో ఈ ‘ఉప్పి దాదా’ తాజా సినిమా ‘బ్రాహ్మణ’. ఏణ్ణర్ధం క్రితం కన్నడంలో వచ్చిన ‘శివమ్’కు ఇది అనువాదం. కన్నడనాట వివాదం: నిజానికి, కన్నడంలో ఈ సినిమాకు మొదట అనుకున్న పేరు - ‘హరహర మహా దేవ’. ఆ తరువాత పెట్టినపేరు - ‘బసవణ్ణ’. కానీ, ఆ టైటిల్ తమ ధార్మిక విశ్వాసాలకు భంగం కలిగిస్తోందంటూ కర్ణాటకలోని లింగాయత్లు ఆందోళన చేశారు. అసెంబ్లీలో చర్చ వచ్చి, టైటిల్ మార్చాలంటూ ముఖ్యమంత్రి అభ్యర్థిం చారు. ఈ ఒత్తిడికి తలొగ్గి, దర్శకుడు ‘బ్రాహ్మణ’ అని పేరు పెట్టారు. కానీ, ఫిల్మ్ చాంబర్ దానికీ ఒప్పుకోలేదు. ఎట్టకేలకు ‘శివమ్’గా రిలీజ్ చేశారు. కథ ఏమిటంటే... ఏడో శతాబ్దం నుంచి ఇప్పటి దాకా భారత్పైన ముష్క రుల దాడులు అందరికీ తెలిసినవే. చిన్నదైన సినిమా పరిధి చాలని ఈ పెద్ద అంశాన్ని అంతర్లీన నేపథ్యంగా తీసుకొని, మాఫియా కథాంశాన్ని కలిపి, ఈ కథ అల్లుకున్నారు. ఒక పురాతన శివాలయం. దండయాత్రీకుల బారి నుంచి ఆ గుడిని కాపాడిన పూర్వీకుల నుంచి అర్చకత్వం హీరో తండ్రికి వస్తుంది. తండ్రి మరణంతో హీరో అనివార్యంగా అర్చకుడౌతాడు. మంత్రి ముఠా ఇచ్చిన సుపారీతో హీరోను చంపడానికి మాఫియా ముఠా వస్తుంది. హీరో అసలెవరన్నది ఫ్లాష్బ్యాక్. ఏమైందన్నది మిగతా కథ. సెన్సార్ కత్తెర పోటు! విదేశాల్లో చిత్రీకరణలతో నిర్మాణ విలువలున్న ఈ సినిమాలో కథ, కథనమే అటూ ఇటూ అనిపిస్తాయి. గోమాంస భక్షణ, బీఫ్ ఫెస్టివల్, ఆలయాల్ని ధ్వంసం చేసి వాటిపై వెలసిన పరమత మందిరాల లాంటి వివాదాల్ని సినిమాలో ప్రస్తావించారు. కన్నడంలో సెన్సార్ ఒత్తిడి వల్ల 25 కట్స్తో చాలా సినిమానే కోతకు గురైంది. అవి చాలదన్నట్లు, మళ్ళీ తెలుగులో డబ్బింగ్ అవుతున్నప్పుడు మరికొన్ని కట్స్ పడ్డాయి. బసవన్న, అలెక్స్, అర్చకుడు - ఇలా విభిన్న కోణాలున్న పాత్రతో బరువు అంతా ఉపేంద్రపైనే. భారత్పై దాడికి తెగబడే మాఫియా నేత అమానుల్లా ఖాన్గా రవిశంకర్ (సాయికుమార్ సోదరుడు) చేశారు. ఫైట్స్, గాలిలోకి ఎగిరి హీరో చేసే విన్యాసాలు, డైలాగులు, హీరోయిన్ రాగిణి ఐటంసాంగ్, ఫస్టాఫ్లో కామెడీకని వచ్చే లవ్ ట్రాక్ లాంటివన్నీ మాస్కు నచ్చుతాయని నమ్మాలి. దర్శక, హీరోల ఇమేజ్ అందుకు శ్రీరామరక్ష కావాలి! - రెంటాల జయదేవ