breaking news
attempt for suicide
-
బతికించేవారే.. బతకలేక..
జనాలచేత దేవుడిలా పిలిపించుకునే ఆ వృత్తి పట్ల విపరీతమైన మక్కువ.. చిన్నప్పుడే ఎవరైనా నువ్వు ఏం అవుతావని అడిగితే డాక్టర్ అని చెప్పేవారే ఎక్కువ.. అలాంటిది ఇప్పుడు ఎంబీబీఎస్ చదివినవారు దయనీయ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. లక్షలు పోసి ఎంబీబీఎస్ చదివినా.. పీజీ సీటు రాకపోవడంతో నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. ఫలితంగా పెళ్లి కూడా కాకపోవడం.. మరోవైపు కన్నవాళ్లకు భారమయ్యామనే ఆవేదనలో కూరుకుపోతున్నారు. దీంతో ఎంతోమందికి ప్రాణాలు పోయాల్సినవారు.. చేజేతులా ప్రాణాలు తీసుకుంటున్నారు. సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్కు చెందిన హర్షకుమార్.. 2017లో ఎంబీబీఎస్ పూర్తి చేశాడు. తండ్రి ప్రభుత్వ ఉపాధ్యా యుడు కావడంతో ఎలాగైనా తన కొడుకును డాక్టర్గా చూడాలనుకొని హర్షకుమార్ను అప్పట్లో రూ.40 లక్షలు అప్పు చేసి మేనేజ్మెంట్ కోటా కింద ఓ ప్రైవేటు మెడికల్ కాలేజీలో చేర్పించాడు. ఎంబీబీఎస్ పూర్తయిన తర్వాత పీజీ సీటు రావడం గగనంగా మారింది. దీంతో అప్పులు, వడ్డీలు పెరుగుతూ వచ్చాయి. పైసా సంపాదన లేదు. దీంతో తండ్రికి భారంగా మారాననే భావనతో హర్షకుమార్ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. రంగారెడ్డి జిల్లాకు చెందిన రామచంద్రయ్యకు మెడికల్ షాపు ఉంది. కొడుకు సంజయ్కుమార్ను డాక్టర్గా చూడాలనుకుని మేనేజ్మెంట్ కోటా కింద రూ.50 లక్షలతో ఓ ప్రముఖ ప్రైవేటు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చేయించాడు. 2016లో ఎంబీబీఎస్ పూర్తయింది. ఆ తర్వాత సంజయ్కుమార్ పీజీ కోసం రెండేళ్లు కష్టపడ్డాడు. కానీ క్లినికల్ సబ్జెక్టులో సీటు రాలేదు. పైగా తండ్రి అప్పు చేసి చదివించడం, 30 ఏళ్లు దగ్గరవుతున్నా పెళ్లి కాకపోవడంతో గతేడాది ఆ యువ వైద్యుడు విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. రమేశ్బాబు వరంగల్ జిల్లాలో వ్యవసాయం చేస్తాడు. మధ్య తరగతి కుటుంబం. కొడుకు అరవింద్ తెలివైన విద్యార్థి. ఎంసెట్లో మంచి ర్యాంకు రావడంతో కన్వీనర్ కోటా కింద సీటు వచ్చింది. ఫీజు తక్కువే కావడంతో కుటుంబం మొత్తం ఎంతో ఆనందపడింది. ఎంతో ఉత్సాహంగా అరవింద్ ఎంబీబీఎస్ పూర్తి చేశాడు. తర్వాత మెడికల్ పీజీ కోసం రెండేళ్లు కష్టపడ్డాడు. కానీ సీటు రాలేదు. పెళ్లి కూడా కాలేదు. దీంతో అవమాన భారం భరించలేక తీవ్ర డిప్రెషన్కు వెళ్లిన అరవింద్ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పీజీ సీట్లు చాలా తక్కువ.. రాష్ట్రంలో 23 ప్రభుత్వ, ప్రైవేటు, మైనారిటీ మెడికల్ కాలేజీల్లో 4,900 వరకు ఎంబీబీఎస్ సీట్లున్నాయి. కానీ పీజీ సీట్లు 1,600 మాత్రమే ఉన్నాయి. వాటిల్లో క్లినికల్ సీట్లు వెయ్యి వరకే ఉన్నాయి. మిగిలినవి నాన్ క్లినికల్ సీట్లు. వీటిల్లో ఎవరూ చేరరు. దీంతో వాటిల్లోని అనేక సీట్లు మిగిలిపోతాయి. విదేశాల్లో ఎంబీబీఎస్ పూర్తి చేసి రాష్ట్రానికి వచ్చే విద్యార్థులు మరో వెయ్యికి పైగా ఉంటారు. అంటే ఏడాదికి రాష్ట్రంలో ఎంబీబీఎస్ పూర్తి చేసే వారు 6 వేల మంది ఉంటారు. ఎంబీబీఎస్ సీట్లతో పోలిస్తే పీజీ సీట్లు మాత్రం ఆరో వంతే ఉన్నాయి. దీంతో ఏటా ఎంబీబీఎస్ చదివిన వారికి పీజీలో సీటు వచ్చే పరిస్థితి లేకుండా పోతోంది. ఎంబీబీఎస్తో ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో సరైన జీతం లభించట్లేదు. వైద్య నిరుద్యోగులు రాష్టంలో పేరుకుపోతున్నారు. వైద్య ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం దాదాపు 40 వేల మంది ఎంబీబీఎస్ పూర్తి చేసిన విద్యార్థులు రాష్ట్రంలో ఖాళీగా ఉన్నారని అంచనా. దేశవ్యాప్తంగా 32 వేల పీజీ మెడికల్ సీట్లు ఉన్నాయి. వాటి కోసం ఈ ఏడాది నీట్ పరీక్షకు ఏకంగా 1.4 లక్షల మంది ఎంబీబీఎస్ విద్యార్థులు హాజరయ్యారు. పీజీ స్పెషలైజేషన్ లేకపోతే సొంత క్లినిక్ పెట్టుకోవడానికి, కార్పొరేట్ ప్రైవేటు ఆసుపత్రుల్లో పనిచేసేందుకు అవకాశం ఉండదు. పైగా ప్రైవేటు ఆసుపత్రుల్లో ఎంబీబీఎస్ విద్యార్థులకు రూ.15 నుంచి రూ.20 వేల జీతమే ఇస్తారు. డిప్రెషన్లోకి.. పీజీ సీటు రాకపోవడం, ఎంబీబీఎస్ చదువు దేనికీ పనికిరాకపోవడంతో యువ వైద్యులు డిప్రెషన్లోకి వెళ్తున్నారు. దేశవ్యాప్తంగా ప్రతీ రెండు ఎంబీబీఎస్ సీట్లకు ఒక పీజీ సీటు ఉండాలన్న కేంద్ర నిర్ణయం ఆచరణ రూపం దాల్చట్లేదు. దీంతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. విదేశాల్లో ఎంబీబీఎస్ చదివిన విద్యార్థుల పరిస్థితి మరీ ఘోరంగా మారింది. వారు అక్కడ ఎంబీబీఎస్ పూర్తి చేసుకుని మన దేశంలో ఎగ్జిట్ అర్హత పరీక్ష పాస్ కావడమే గగనంగా మారింది. 2015–2018 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా 61,500 మంది ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ పరీక్ష రాశారు. వీరిలో 8,700 మంది మాత్రమే పాసయ్యారు. అంటే కేవలం 14.14 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఎగ్జిట్ పరీక్ష పాసైన వారిలో పీజీ సీటు పొందేవారు 5 శాతం కూడా ఉండట్లేదని కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం వర్గాలు అంటున్నాయి. స్తోమత లేకున్నా చదివిస్తున్నారు.. కొందరు తల్లిదండ్రులు తమ ఆర్థిక స్తోమత సహకరించకున్నా వైద్య విద్యపై పిచ్చితో పిల్లలను ఎంబీబీఎస్ చదివిస్తున్నారు. మేనేజ్మెంట్ సీటుకు రూ.కోటి వరకు పెట్టి చదివించే పరిస్థితి నెలకొంది. భూమి అమ్మడం లేదా అప్పులు చేయడం ద్వారా తమ పిల్లలను చదివిస్తున్నారు. గతంలో ఫీజు మొత్తం ఒకేసారి చెల్లించాలన్న నిబంధన ఉండేది. ఇప్పుడు ఏడాది వాయిదా ఉండటంతో మొదటి ఏడాది ఎలాగోలా చెల్లించి.. రెండో ఏడాది చూద్దాంలే అని చదివిస్తున్నారు. కానీ రెండో సంవత్సరం వచ్చే సరికి ఫీజు చెల్లింపు తలకు మించిన భారం అవుతోంది. తెచ్చిన అప్పుల భారం పెరిగిపోతోంది. కొందరైతే చివరి రెండు వాయిదాలు చెల్లించలేక మధ్యలోనే చదువు మాన్పించేస్తున్నారు. పీజీ కోసం రెండు మూడేళ్లుగా కోచింగ్ తీసుకునే వారెందరో ఉన్నారు. కోచింగ్ ఫీజులు, ఖర్చులు భారంగా మారుతున్నాయి. చివరకు ఫలితం అనుకూలంగా రాకపోవడంతో డిప్రెషన్కు లోనవుతున్నారు. కలలు కల్లలవుతున్నాయి: డాక్టర్ కరుణాకర్రెడ్డి, వీసీ కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఎంబీబీఎస్ చదివిన విద్యార్థులకు పీజీ సీట్లు రాకపోవడంతో డిప్రెషన్లోకి వెళ్తున్నారు. తల్లిదండ్రులు స్తోమతకు మించి అప్పులు చేసి మేనేజ్మెంట్ సీట్లలో చేర్పించడంతో ఈ పరిస్థితి నెలకొంటోంది. ఎంబీబీఎస్ మేనేజ్మెంట్లో చేశాక, పీజీ మేనేజ్మెంట్ కోటాలో సీటు కొనడం అంటే సాధారణ మధ్య తరగతి వారికి అసాధ్యం. కాబట్టి తల్లిదండ్రులు పిల్లల సామర్థ్యాన్ని గమనించాలి. అప్పులు చేయడం సరికాదు. పీజీ రాకుంటే డిప్రెషన్లోకి: డాక్టర్ విజయేందర్, జూడాల నేత వేలాది మంది అప్పులు చేసి ఎంబీబీఎస్ చదివిన వారు తర్వాత పీజీ రాక డిప్రెషన్లోకి వెళ్తున్నారు. కార్పొరేట్ ప్రైవేటు ఆసుపత్రుల్లో సరైన జీతాలు ఇవ్వట్లేదు. బయట క్లినిక్ పెట్టుకునే అవకాశాల్లేవు. 30 ఏళ్లు దాటుతున్నా పెళ్లి కావట్లేదు. ఇవన్నీ కలిపి యువ వైద్యులను తీవ్ర డిప్రెషన్లోకి నెట్టేస్తున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లోని ఖాళీలనూ నింపట్లేదు. -
ఎస్సైపై కత్తితో దాడి.. దొంగ ఆత్మహత్యాయత్నం
టి.నగర్: తనను అరెస్టు చేసేందుకు సిబ్బందితో వచ్చిన ఎస్పైను ఓ వ్యక్తి కత్తితో పొడిచాడు.. ఆపై తాను ఆత్మహత్యకు యత్నించాడు. ఈ హఠాత్పరిణామం చెన్నై అమింజికరై అన్నానగర్ ప్రాంతంలో జరిగింది. వివరాలిలా ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఒంటరిగా వెళుతున్న మహిళలు, వాహన చోదకుల నుంచి సెల్ఫోన్లు చోరీ చేస్తున్న ఘటనలు జరుగుతున్నట్లు అమింజికరై పోలీసులకు సమాచారం అందింది. అమింజికరై మార్కెట్ ప్రాంతంలో సెల్ఫోన్ల దొంగ దాగి ఉన్నట్లు ఆదివారం రాత్రి పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఎస్సై శ్రీనివాసన్ తన సిబ్బందితో ఆ ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ ఒక దుకాణం వద్ద దాగి ఉన్న నిందితుడిని పోలీసులు చుట్టుముట్టారు. ఈ క్రమంలో ఎస్ఐ శ్రీనివాసన్పై అతడు కత్తితో దాడి జరిపాడు. దీంతో ఆయన తీవ్ర గాయాలతో కింద పడిపోయాడు. పోలీసులు ఎస్సైను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అనంతరం దొంగను పోలీసులు చుట్టుముట్టగా వారిపైనా కత్తితో దాడికి యత్నించాడు. అతికష్టంమీద పోలీసులు అతనిని పట్టుకోగా గొంతు కోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. వెంటనే అతడినికూడా ఆస్పత్రికి తరలించారు. విచారణలో పట్టుబడిన వ్యక్తి మణికంఠన్ (25) అని, సెల్ఫోన్ల చోరీకి పాల్పడేవాడని తెలిసింది. అతని వద్ద ఉన్న బైక్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఐ శ్రీనివాసన్ను మెరుగైన వైద్యం కోసం అమింజికరైలో గల ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
పోలీసుల తీరుపై ఎమ్మెల్యే కిలివేటి ఆగ్రహం
అవమానంతో పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం నాయుడుపేట: పోలీసుల తీరుపై ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన రాయపాటి శేఖర్ను సోమవారం పరా మర్శించారు. మెరుగైన వైద్యం అందించేందుకు బాధితుడిని నెల్లూరుకు అంబులెన్స్లో పోలీసులను వెంటబెట్టి పంపించారు. సీఐ రత్తయ్య టీడీపీకి ఏకపక్షంగా వ్యవహరించడం వల్లనే ఇలాంటి పరిస్థితి దారి తీసిందని ఎమ్మెల్యే ఆందోళన వ్యక్తం చేశారు. టీడీపీ పార్టీకి సీఐ.. నా ప్రజా స్వామ్యాన్ని పరిరక్షించే సీఐ.. నా అని టీడీపీ నాయకులను ప్రశ్నించారు. ఈ విధంగా వ్యవహరిస్తున్న సీఐ తీరు మార్చుకోవాలని చెప్పారు. పోలీసులు రోజురోజుకు ఏకపక్షంగా కేసులు నమోదు చేయడం, వేధింపులకు గురిచేయడం నిత్యకృత్యమయిందని వాపోయారు. ఇప్పటికైనా పోలీసుల తీరులో మార్పు రాకపోతే అందుకు ప్రతిఫలం అనుభవించాల్సి వస్తుందని హెచ్చరించారు. ప్రశ్నించినందుకే దాడి... మల్లాం క్రాసురోడ్డు వద్ద బ్రాందీషాపు ముందు వైపు ఉన్న కూల్డ్రింక్ దుకాణాన్ని ఆదివారం రాత్రి మూసివేయాలంటూ పోలీసులు హకుం జారీ చేయడంతో పాటు షాపు యజమానులపై విచక్షణా రహితంగా దాడి చేశారు. తొలుత పోలీసులు దారుణంగా దూషిస్తుండటంతో యజమాని రాయపుకృష్ణ అలా ఎందుకు మాట్లాడతారంటూ ప్రశ్నించారు. మాకే ఎదురు తిరుగుతావా..? అంటూ సీఐ చేయి చేసుకునే ప్రయత్నం చేశారు. సీఐ చేతిని అడ్డుకున్న షాపు యజమాని కృష్ణని పోలీసులు చితకబాదారు. బీటెక్ చదివి షాపులో పనిచేస్తున్నరాయపు శేఖర్ను కూడా అదుపులోకి తీసుకున్నారు. అర్ధరాత్రి వరకు స్టేషన్లో ఇద్దరినీ తీవ్రంగా కొట్టారు. శేఖర్ను మాత్రం ఇంటికి పంపి కృష్ణను స్టేషన్లోనే ఉంచారు. కొంతమంది పోలీసులతో సీఐ దగ్గరుండి కృష్ణను కుళ్ల పొడిపించి పడవేశారు. సోమవారం ఉదయం శేఖర్ను స్టేషన్కు పిలిపించి కేసు నమోదు చేశారు. రెండు రోజుల కిందట పోలీసుల అదుపులో ఉన్న మద్యం బాబులు ఐదుగురితో పాటు శేఖర్ను కూడా సూళ్లూరుపేట కోర్టులో హాజరుపరుస్తున్నట్లు తెలిపారు. కానిస్టేబుల్ను వారి వెంట పంపకుండా మీరే కోర్టులో హాజరై జరిమానా కట్టి రావాలంటూ ఎస్సై ఆంజనేయరెడ్డి ఆదేశాలు జారీచేశారు. శేఖర్ కోర్టుకు వెళ్లడం అవమానంగా భావించి జాతీయరహదారి సమీపానికి వెళ్లి శివాలయం వద్ద పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గ్రామస్తులు అందోళన .. తమ బిడ్డలను పోలీసులు చిత్రహింసలు పెట్టడమే కాక ఆత్మహత్యాయత్నానికి కారకులైన పోలీసుల చర్యలకు నిరసనగా గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. తంబిరెడ్డి సుబ్రమణ్యంరెడ్డి, ఫ్లోర్ లీడర్ షేక్ రఫీ, కౌన్సిలర్లు కువ్వాకుల శ్రీనివాసులు, ఆలయ కమీటీ చైర్మన్ కట్టా వెంకటరమణారెడ్డి, ముప్ళాళ్ల జనార్ధన్రెడ్డి, దొంతాలి రాజశేఖర్రెడ్డి, గంధవల్లి సిద్దయ్య, మైలారి నాగరాజు, పాలేటి నాగార్జున, పేట చంద్రారెడ్డి తదితరులు ఉన్నారు.