breaking news
assistant professor david raju
-
రిషితేశ్వరి ఆత్మహత్యకు అప్పటి ప్రిన్సిపలే కారణం
విద్యార్థులతో కలిసి మద్యం తాగేవారు దళితుడిని కాబట్టే నన్ను విధుల నుంచి తొలగించారు ఆర్కిటెక్చర్ మాజీ అసిస్టెంట్ {పొఫెసర్ డేవిడ్ రాజు గుంటూరు: ఆర్కిటెక్చర్ కాలేజీ అప్పటి ప్రిన్సిపల్ బాబురావు అసభ్యకరమైన చర్యలే రిషితేశ్వరిని ఆత్మహత్యకు పురిగొల్పాయని అదే కాలేజీ మాజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డేవిడ్ రాజు ఆరోపించారు. మంగళవారం డేవిడ్ రాజు ‘సాక్షి’తో మాట్లాడుతూ ఫ్రెషర్స్డే పార్టీలో ఇద్దరు విద్యార్థులు మద్యం తాగి తనపై అసభ్యకరంగా ప్రవర్తించారని రిషితేశ్వరి తన డైరీలో కూడా రాసుకుందని తెలి పారు. ప్రిన్సిపల్ విద్యార్థులతో కలిసి మద్యం తాగటమేంటని ప్రశ్నించారు. యూనివర్సిటీలో ఓపెన్ ఎయిర్ ఆడిటోరియం ఉండగా హాయ్ల్యాండ్లో ఫ్రెషర్స్ డే నిర్వహించటమేంటని ప్రశ్నించారు. అక్కడ జరిగిన కార్యక్రమానికి ప్రిన్సిపల్ తప్ప అధ్యాపకులనెవరినీ రానివ్వలేదని, అధ్యాపకులు వెళ్లి ఉంటే ఇలాంటివి జరిగేవి కాదన్నారు. ఫోన్లలో అసభ్యంగా మాట్లాడతారని, డ్రాయింగ్ వేసుకుంటుంటే వెనుక నుంచి చేతులు వేస్తారని ఆడపిల్లలు బాబురావు ప్రవర్తనపై మా దగ్గర ఏడ్చి మరీ ఫిర్యాదు చేసేవారన్నారు. ఆడపిల్లలకు రక్షణ లేదని గతంలో యూనివర్సిటీ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశామని, కానీ వారు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవన్నారు. బాబురావు మద్యం తాగి కాలేజీకి వస్తున్నాడని అధ్యాపకులు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారని తెలిపారు. ఆయన ఆగడాలపై 2014 మార్చిలో రాష్ట్ర గవర్నర్కూ మెయిల్ పంపామని తెలిపారు. ఇన్ని జరిగినప్పటికీ ఆయనపై చర్యలు తీసుకోకపోవటం వల్లనే విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడాల్సి వచ్చిందన్నారు. ఆర్థికపరమైన అవకతవకలకు పాల్పడటంతో బాబురావు చెక్పవర్ తీసివేశారని మరలా ఉద్దేశపూర్వకంగానే మళ్లీ చెక్పవర్ ఇచ్చారని ఆరోపించారు. కులం ముసుగులో బాబురావు అరాచకాలను కాపాడుతున్నారని పేర్కొన్నారు. విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఆయన అరాచకాలను బయటపెడుతున్నాననే దళితుడినైన తనను విధుల నుంచి శాశ్వతంగా తొలగించారని, అసభ్యకరమైన పనులు చేసిన బాబురావు అగ్రకులస్తుడు కావటం వల్లనే కేవలం విధుల నుంచి బహిష్కరించారని పేర్కొన్నారు. -
ప్రిన్సిపాల్ కారణంగానే రిషితేశ్వరి ఆత్మహత్య!
ఆర్కిటెక్చర్ కాలేజి ప్రిన్సిపాల్ బాబూరావు విద్యార్థులతో కలిసి తాగారని, ఒక రకంగా ఆయనవల్లే రిషితేశ్వరి ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందని నాగార్జున యూనివర్సిటీకి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ డేవిడ్ రాజు తెలిపారు. ఆయన మంగళవారం నాడు 'సాక్షి'తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే... ఆడపిల్లలకు రక్షణ లేదని ఉన్నతాధికారులకు ఇంతకుముందు ఫ్యాకల్టీ అంతా కలిసి ఫిర్యాదు చేశాం. కానీ, మా ఫిర్యాదుల మీద చర్యలు తీసుకున్నట్లు మాకైతే ఎప్పుడూ కనిపించలేదు. ఫ్రెషర్స్ డే పార్టీలో జరిగిన అవమానాల గురించి కూడా డైరీలో రాసుకుంది కదా.. దాంట్లో చాలా ఉన్నాయి. ఫ్రెషర్స్ డే పార్టీకి ఒక్క ప్రిన్సిపాల్ బాబూరావు మాత్రమే వెళ్లారు. వేరే ఫ్యాకల్టీ ఎవరూ వెళ్లలేదు మిగిలిన ఫ్యాకల్టీ కూడా వెళ్లి ఉంటే విద్యార్థులు అసభ్యంగా ప్రవర్తించే ధైర్యం చేసేవాళ్లు కారు ప్రిన్సిపాల్ తానొక్కరే వెళ్లాలని అనుకోవడం వల్లే ఇలా జరిగింది. యూనివర్సిటీలో ఓపెన్ ఎయిర్ థియేటర్ ఉంది.. అక్కడ చేసుకోవచ్చు కానీ అలా చేయలేదు రోజూ యూనివర్సిటీకి ఆయన ఎలా వచ్చేవారు, ఆరోజు పార్టీకి ఎలా వెళ్లారు? ఆరోజు వేసుకున్న డ్రస్ ఎలా ఉంది, అసలు ఎందుకు తాగాల్సి వచ్చింది? రోజూ తాగి వస్తున్నారన్న ఫిర్యాదులు ఉన్నా.. ఫ్రెషర్స్ డే పార్టీ రోజు విద్యార్థులతో కలిసి తాగడం ఎందుకు? ఆయన మద్యం తాగి వస్తున్నారని మేం లిఖితపూర్వకంగా కూడా ఫిర్యాదు చేశాం. చివరిదశలో.. 2014 మార్చిలో గవర్నర్కు కూడా మెయిల్ పంపించాం. అప్పట్లో ప్రిన్సిపాల్ చెక్ పవర్ తీసేశారు. కానీ తర్వాత మళ్లీ ఆ చెక్ పవర్ ఇచ్చేశారు కులం ముసుగులోనే ప్రిన్సిపాల్ ఇలా ఇదంతా చేస్తున్నారు ఆయన మాట వినడంలేదని నన్ను ఆయన హెచ్చరించారు. మాట వినకపోతే దెబ్బతింటావని అన్నారు అనధికారికంగా తనకు నచ్చినచోట ఫ్రెషర్స్ డే పార్టీ చేయడమే రిషితేశ్వరి మరణానికి ఒక రకంగా కారణమైంది. విద్యార్థులు తాగి విచక్షణారహితంగా ప్రవర్తించడం వల్లే ఆమె ఆత్మహత్యకు పాల్పడాల్సి వచ్చింది. ప్రిన్సిపాల్ చేసే అసభ్య కార్యకలాపాలు యూనివర్సిటీలో అయితే వెంటనే తెలిసిపోతాయి కాబట్టి, దాచేందుకే వేదిక మార్చారు ఆ విషయాన్ని ఫ్యాకల్టీ ఎవరికీ కనీసం తెలియజెప్పలేదు కూడా. చాలామంది పిల్లలు ప్రిన్సిపాల్ ప్రవర్తన గురించి మా దగ్గర బాధపడి, ఏడ్చారు. ఫోన్లు చేసి అసభ్యంగా మాట్లాడతారని చెప్పారు. డ్రాయింగ్ వేసుకుంటుంటే వెనక నుంచి చేతులు వేస్తారని బాధపడ్డారు.