breaking news
Are katika community
-
మణిపూర్లో ఏం జరిగిందో మీకు తెలుసు!
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఆరె కటిక (ఖటిక్) కులస్తులను షెడ్యూల్డ్ కులాల జాబితాలో చేర్చాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై విచారణకు సుప్రీంకోర్టు తిరస్కరించింది. మణిపూర్లో జరిగిన అల్లర్లను ఈ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం ప్రస్తావించింది. కులాల జాబితాలో సవరణలు చేసే అధికారం కేవలం పార్లమెంట్కు మాత్రమే ఉంటుంది కాబట్టి.. పార్లమెంట్నే ఆశ్రయించాలని సూచించింది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఆరె కటిక కులస్తులను ఎస్సీల జాబితాలో చేర్చాలని కోరుతూ తెలంగాణ ఆరె కటిక (ఖటిక్) అసోసియేషన్ జనవరి 8న సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది.ఇందులో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేర్చింది. కొన్ని రాష్ట్రాల్లో ఆరె కటిక కులస్తులు ఎస్సీ సామాజిక వర్గంలో ఉండగా, మరికొన్ని రాష్ట్రాల్లో వెనుకబడిన తరగతుల (ఓబీసీ) వర్గంలో ఉన్నారని ఆరె కటిక అసోసియేషన్ కోర్టుకు తెలిపింది. దీంతో వేరే రాష్ట్రానికి చెందిన అమ్మాయి లేదా అబ్బాయితో పెళ్లి జరిగినప్పుడు రిజర్వేషన్ల విషయంలో సమస్యలు ఎదురవుతున్నాయని పిటిషన్లో పేర్కొంది. శుక్రవారం జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మాసిహ్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ పిటిషన్పై విచారణ చేపట్టింది. సీనియర్ న్యాయవాది రహీమ్, రాజు సోంకర్లు పిటిషనర్ తరఫున వాదనలు వినిపించేందుకు సిద్ధమవుతుండగా.. ‘అసలు మీ పిటిషన్ విచారణకు ఎలా సమర్థనీయం?’అని జస్టిస్ బీఆర్ గవాయ్ ప్రశ్నించారు. ‘మణిపూర్లో ఏం జరిగిందో మీకు తెలుసు కదా? అక్కడ మైతేయి కులస్తులకు సంబంధించిన కేసులో హైకోర్టు నిర్ణయం తర్వాత ఏం జరిగింది? మణిపూర్లో ఎలా అల్లర్లు జరిగాయో చూశారు కదా?’అంటూ ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. అయితే రిట్ పిటిషన్ను ఉపసంహరించుకుంటామని, హైకోర్టుకు వెళ్లేందుకు అవకాశం కల్పించాలని పిటిషనర్ తరఫు న్యాయవాది ధర్మాసనాన్ని కోరారు. అందుకు సైతం ధర్మాసనం అభ్యంతరం తెలుపుతూ..‘కులాల జాబితాను సవరించడం, కొత్త చట్టాలను రూపొందించడం పార్లమెంట్ చేస్తుంది. హైకోర్టుకు వెళ్లినా మీకు పరిష్కారం దొరకదు. కాబట్టి పార్లమెంట్ను ఆశ్రయించండి’ అని చెప్పింది. దీంతో పిటిషన్ను ఉపసంహరించుకుంటున్నట్లు సీనియర్ న్యాయవాది రహీమ్ చెప్పగా కేసును ముగిస్తున్నట్టు ధర్మాసనం పేర్కొంది. -
బాహుబలి-2కు వ్యతిరేకంగా భారీ ధర్నా..
హైదరాబాద్: రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతున్న బాహుబలి-2 సినిమాను వివాదాలు కూడా అదే స్థాయిలో వెంటాడుతున్నాయి. కట్టప్ప(సత్యరాజ్)కు వ్యతిరేకంగా కన్నడిగల ఆందోళన మొదలు.. ఏపీలో ఆరు షోలకు అనుమతినా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. తాజాగా ఆరెకటిక కుల సంఘం ఆధ్వర్యంలో బాహుబలి-2కు వ్యతిరేకంగా భారీ ధర్నా చేపట్టారు. సోమవారం హైదరాబాద్లోని ప్రాంతీయ సెన్సార్ బోర్డు కార్యాలయం ఎదుట బైఠాయించిన ఆరెకటిక సంఘాలు.. బాహుబలి-2లో తమ కులాన్ని కించపరిచేలా ఉన్న సీన్లను వెంటనే తొలగించాలని డిమాడ్ చేశారు. ఆరెకటిక పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు గోగికార్ సుధాకర్ సహా పలువురు నాయకులు ధర్నాలో పాల్గొన్నారు. ఏమిటి వివాదం?: శుక్రవారం విడుదలైన బాహుబలి–2 సినిమాలో తమ కులాన్ని కించపరిచే విధంగా ‘కటిక చీకటి’ అనే పదాన్ని వాడారని, అది ఆరె కటికల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉందని ఆరెకటిక పోరాట సమితి ఆరోపించింది. అభ్యంతరం చెప్పాల్సిన సెన్సార్ బోర్డు సైతం కటిక చీకటి పదానికి అనుమతినివ్వడం దారుణమని మండిపడింది. దీనికి బాధ్యులైన బాహుబలి దర్శక, నిర్మాతలపై క్రిమినల్ కేసు నమోదు చేయాలంటూ ఆదివారం పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు రాజమౌళి, శోభు, ప్రసాద్లపై ఆరెకటిక పోరాటసమితి రాష్ట్ర అధ్యక్షుడు గోగికార్ సుధాకర్ బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తీవ్ర హెచ్చరికలు: బాహుబలి-2 నుంచి ‘కటిక చీకటి’ పదాన్ని వెంటనే తొలగించకుంటే దర్శకుడు రాజమౌళి ఇంటిని ముట్టడిస్తామని, అప్పటికీ మార్పు రాకపోతే సినిమా థియేటర్ల వద్ద ఆందోళన నిర్వహిస్తామని ఆరెకటిక పోరాట సమితి హెచ్చరించింది. న్యాయసలహా అనంతరం కేసు నమోదు చేయాలా వద్దా నిర్ణయం తీసుకుంటామని సీఐ శ్రీనివాస్ మీడియాకు తెలిపారు.