ఈ ఏడాది వైజాగ్ స్టీల్ ఐపీవో లేనట్లే!
హైదరాబాద్: ఈ ఏడాదిలో ప్రభుత్వ రంగ సంస్థ రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్(వైజాగ్ స్టీల్) పబ్లిక్ ఇష్యూని చేపట్టకపోవచ్చు. స్టాక్ మార్కెట్ పరిస్థితులు ప్రతికూలంగా మారడంతో వైజాగ్ స్టీల్ ఐపీవో ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలించకపోవచ్చునని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. వెరసి ఐపీవో చేపట్టేంతవరకూ ‘నవరత్న’ హోదా పొడిగింపు విషయమై కంపెనీ కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించే అవకాశమున్నదని స్టీల్ శాఖలోని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. సమీప కాలానికి మార్కెట్లు పుంజుకుంటాయని తాము భావిం చడం లేదని ఆ అధికారి చెప్పారు. సెంటిమెంట్ బాగా బలహీనపడిందని వ్యాఖ్యానించారు. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో డిజిన్వెస్ట్మెంట్ శాఖ ఐపీవోను చేపట్టే అవకాశాలు తక్కువేనని వివరించారు. కంపెనీకి 2010 నవంబర్ 16న నవరత్న హోదా లభించింది. షరతుల ప్రకారం ఈ హోదాను పొందిన రెండేళ్లలోగా పబ్లిక్ ఇష్యూని పూర్తి చేసుకోవాల్సి ఉంది.