ఊరూవాడా ప్రతిధ్వనిస్తోన్న సమైక్య భేరి | United movement raises in all seemandhra regions | Sakshi
Sakshi News home page

ఊరూవాడా ప్రతిధ్వనిస్తోన్న సమైక్య భేరి

Aug 18 2013 2:16 AM | Updated on Sep 1 2017 9:53 PM

ఊరూవాడా ప్రతిధ్వనిస్తోన్న సమైక్య భేరి

ఊరూవాడా ప్రతిధ్వనిస్తోన్న సమైక్య భేరి

వేర్పాటు ప్రకటన వెనక్కి వెళ్లే వరకు సీమాంధ్ర జిల్లాల్లో సమైక్యపోరాటం ఆగేలా కనిపించడం లేదు. పద్దెనిమిది రోజులుగా ఉద్ధృతంగా సాగుతున్న ఉద్యమం రోజురోజుకీ స్వరూపం మార్చుకుంటూ మరింత బలపడుతోంది.

సాక్షి నెట్‌వర్క్:  వేర్పాటు ప్రకటన వెనక్కి వెళ్లే వరకు సీమాంధ్ర జిల్లాల్లో సమైక్యపోరాటం ఆగేలా కనిపించడం లేదు. పద్దెనిమిది రోజులుగా ఉద్ధృతంగా సాగుతున్న ఉద్యమం రోజురోజుకీ స్వరూపం మార్చుకుంటూ మరింత బలపడుతోంది. స్వచ్ఛందంగా ప్రజలు చేపట్టిన పోరాటానికి ఐదురోజులుగా సకల జనుల సమ్మె తోడవడంతో కోస్తా, రాయలసీమ జిల్లాల్లో పాలన స్తంభిస్తోంది. ప్రభుత్వకార్యాలయాలు, స్కూళ్ల మూసివేత కొనసాగుతోంది. ఆర్టీసీ బస్సులు డిపోల నుంచి బయటకు కదలడం లేదు. ఎన్జీవోలకు సమ్మెకు బాసటగా ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనప్రదర్శనలు, మానవహారాలు, సోనియా, దిగ్విజయ్‌సింగ్, బొత్స, చిరంజీవి,  కేసీఆర్‌ల దిష్టిబొమ్మల దహనాలు, శవయాత్రలు శనివారం కూడా అన్నిచోట్లా హోరెత్తాయి.  పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు ఫైర్‌స్టేషన్ సెంటర్‌లో సమైక్య ఉద్యమం చేపట్టిన పాలవ్యాపారులకు సంఘీభావం ప్రకటించేందుకు వచ్చిన టీడీపీ నేత అంబికా కృష్ణను నిరసనకారులు అడ్డుకున్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు స్పష్టమైన వైఖరి ప్రకటించనందున ఆ పార్టీకి రాజీనామా చేసిన తర్వాతే ఉద్యమంలో పాల్గొనాలని అంబికాకృష్ణకు తేల్చిచెప్పారు. టీడీపీకి చెందిన అనంతపురం జిల్లా పెనుకొండ, పుట్టపర్తి ఎమ్మెల్యేలు బీకే పార్థసారథి, పల్లె రఘునాథరెడ్డిలకు హిందూపురం పట్టణంలో చేదు అనుభవం ఎదురైంది. వారి వాహనాలను ఉపాధ్యాయ జేఏసీ నాయకులు అడ్డుకుని చంద్రబాబుతో సమైక్యనినాదం చేయించాలని పట్టుబట్టారు. పార్ధసారధి నిరసనకారులను సముదాయించే యత్నం చేయగా, ‘చెవిలో పువ్వు పెట్టే మాటలొద్దు. తెలంగాణకు అనుకూలంగా లేఖ ఎలా ఇచ్చారని మీ పార్టీ అధినేత చంద్రబాబుపై ఒత్తిడి తెండి’ అని స్పష్టం చేశారు. అనంతపురంఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో మంత్రులు రఘువీరారెడ్డి, శైలజానాథ్ దిష్టిబొమ్మలను దహనం చేశారు.

 రోడ్డుపై ఊడ్పులు ఊడ్చి...
 తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో వ్యవసాయ శాఖ ఉద్యోగులు రోడ్డుపై ఊడ్పులు ఊడ్చి నిరసన తెలిపారు. రామచంద్రపురం పట్టణంలోకి వచ్చే అన్ని రహదారులను జేఏసీ ఆధ్వర్యంలో దిగ్బంధించారు. కాకినాడ, తునిలలో ఆర్టీసీ జేఏసీ నేతలు ఆర్టీసీ బస్సులతో ర్యాలీలు నిర్వహించారు.  వైఎస్సార్ కాంగ్రెస్ చేపట్టిన బస్సు యాత్ర రాజమండ్రి, అమలాపురం పార్లమెంటు నియోజక వర్గాల్లో కొనసాగింది. రాజమండ్రి బస్సు యాత్రలో  ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు, సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, అమలాపురం బస్సు యాత్రలో పార్టీ జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి, సీజీసీ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు, మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు కొల్లి నిర్మల కుమారి పాల్గొన్నారు.

 యానాం బంద్
 కేంద్రపాలిత ప్రాంతమైన పాండిచ్చేరి పరిధిలోని యానాంలో తెలుగువారు సమైక్యంగా ఉండాలంటూ బంద్ పాటించారు. పశ్చిమగోదావరి జిల్లాలో సమైక్యాంధ్రకు మద్దతుగా వైఎస్సార్సీపీ గోపాలపురం నియోజకవర్గ సమన్వయకర్త తలారి వెంకట్రావు చేపట్టిన ఆమరణ నిరాహారదీక్ష  మూడో రోజుకు చేరింది.  ఏలూరు ఫైర్‌స్టేషన్ సెంటర్‌లో వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని అనంతపురం జిల్లా ధర్మవరానికి చెందిన వికలాంగుడు కేతా శ్రీనివాసరావు మోటారు సైకిల్‌పై చేస్తున్న యాత్ర భీమవరం చేరుకోగా, జేఏసీ నాయకులు స్వాగతం పలికి అతన్ని అభినందించారు. బొత్స ఇంటి ముట్టడిలో ఉద్రిక్తత
 సీమాంధ్ర ప్రజాప్రతినిధులు తక్షణమే తమ పదవులకు రాజీనామాలు చేయాలని డిమాండ్  చేస్తూ విజయనగరంలో ఉపాధ్యాయ పోరాట సమితి ఆధ్వర్యంలో  మంత్రి, పీసీసీ చీఫ్ బొత్ససత్యనారాయణ ఇంటిని ముట్టడించారు. కోట జంక్షన్ నుంచి  ర్యాలీగా వస్తున్న ఉపాధ్యాయులపై పోలీసులు దురుసుగా వ్యవహరించడంతో అర్ధగంటసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

 15 వేలమందితో ర్యాలీ
 నెల్లిమర్లలో ఉదయం 9.30నుంచి మధ్యాహ్నం 12.30 వరకూ  విజయనగరం-పాలకొండ రహదారిని సమైక్యవాదులు దిగ్బంధించారు. స్థానిక ఆర్వోబీ నుంచి చంపావతి బ్రిడ్జి వరకూ 3 కిలోమీటర్ల మేర 15 వేల మంది ప్రజలు ర్యాలీ నిర్వహించారు.

 వంగపండు ఆటాపాటా
 పార్వతీపురంలో ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో వినూత్న తరహాలో నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా ప్రజాగాయకుడు వంగపండుప్రసాదరావు తన  ఆటాపాటాతో అలరించారు. చీపురుపల్లిలో మహిళా ఉపాధ్యాయులు ప్రధాన రహదారి మోకాళ్ళపై నడిచి  నిరసన తెలిపారు.

 శింగరకొండ దేవాలయం మూత
 ప్రముఖ పుణ్యక్షేత్రమైన ప్రకాశం జిల్లా శింగరకొండ దేవాలయాన్ని గంటపాటు మూసివేసి నిరసన తెలిపారు. దేవాదాయశాఖ సిబ్బంది ఆలయం బయట ధర్నాకు దిగారు. ఒంగోలు డిపో ఆర్టీసీ అధికారులు బస్సులు నడపడానికి ప్రయత్నించగా కార్మికులు అడ్డుకున్నారు.

 ఒంటెలతో ప్రదర్శన
 విశాఖ జిల్లా వేపగుంటలో వైఎస్సార్‌సీపీ నాయకులు ఒంటె లతో ప్రదర్శన నిర్వహించారు.  విజయమ్మ చేపట్టనున్న ఆమరణ నిరాహార దీక్షకు మద్దతుగా వైఎస్సార్‌సీపీ నేతలు విశాఖ ఎంవీపీకాలనీలో బైక్ ర్యాలీ నిర్వహించారు. విశాలాంధ్ర బస్సు యాత్ర విశాఖ చేరుకుంది. యాత్ర కార్యదర్శి రవితేజ ఏయూలోని విద్యార్థుల దీక్షలకు సంఘీభావం ప్రకటించారు.

 విజయమ్మ దీక్షకు మద్దతుగా రేపు ఏజెన్సీ బంద్
 విజయమ్మ దీక్షకు మద్దతుగా విశాఖ ఏజెన్సీలోని 11మండలాల్లో సోమవారం బంద్ పాటిస్తున్నట్లు పాడేరు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సమన్వయకర్త సీకరి సత్యవాణి తెలిపారు. విజయమ్మ చేపడుతున్న దీక్షకు ఏపీ ఎన్జీవోల అసోసియేషన్ విశాఖ జిల్లా  చోడవరం యూనిట్ శనివారం మద్దతు ప్రకటించింది. విశాఖ జీవీఎంసీ గాంధీ బొమ్మ వద్ద సమైక్యాంధ్ర కోసం ఆదివారం నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నట్టు మాడుగుల ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు ప్రకటించారు.  శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరులో వైఎస్సార్‌సీపీ నేతలు 150 ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు. విజయవాడలో ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు భారీ ప్రదర్శన నిర్వహించారు. నూజివీడులో సమైక్యవాదులు కిలో ఉల్లిని రూ.10లకు విక్రయించారు.  

 రోడ్డుపై వరినాట్లు
 గుంటూరు నగరంలో వ్యవసాయశాఖ జిల్లా యంత్రాంగం నిరసన ప్రదర్శనతో పాటు రోడ్డుపై వరినాట్లు వేశారు. ఆదర్శరైతులు సైతం ట్రాక్టర్లు కట్టుకుని ప్రదర్శన, మానవహారాల్లో పాల్గొన్నారు. మాచర్లలో వైఎస్‌ఆర్ సీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ప్రదర్శన, రాస్తారోకో  చేపట్టారు.

 విధులు బహిష్కరించిన మున్సిపల్ కమిషనర్
 చిలకలూరిపేటలో మున్సిపల్ కమిషనర్, తహశీల్దార్, గెజిటెడ్ అధికారులు విధులు బహిష్కరించి సంఘీభావం తెలిపారు. విజయమ్మ దీక్షకు ఆచార్య నాగార్జున యూనివర్శిటీ విద్యార్థి యూనియన్ సంఘీభావం ప్రకటించింది. పొన్నూరులో టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర క్విట్ సోనియా నినాదంతో శనివారం నిరవధిక నిరాహార దీక్షను ప్రారంభించారు. గుంటూరులో ఆదివారం నుంచి  తాను నిరవధిక నిరాహార దీక్షకు దిగుతున్నట్లు ఎమ్మెల్సీ, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నన్నపనేని రాజకుమారి శనివారం  చెప్పారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో వివిధ పాఠశాలల విద్యార్థులు చేపట్టిన భారీ ర్యాలీలో నరసన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ పాల్గొన్నారు.

 బీజేపీ కార్యాలయం ముట్టడి
 అనంతపురం నగరంలోని బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించి బీజేపీ పదాధికారుల సమావేశాన్ని సమైక్యవాదులు అడ్డుకున్నారు. ఎస్కేయూలో జేఏసీ నేతలు రక్తదానం చేసి నిరసన తెలిపారు. కర్నూలులో న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి కోట్ల, మంత్రి టీజీ వెంకటేష్ కార్యాలయాలను ముట్టడించారు.

 బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ
 మంత్రాలయంలో బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ, రాఘవేంద్ర సర్కిల్‌లో మానవహారం నిర్మించారు.   శ్రీకష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో ఈ నెల 19 నుంచి నిర్వహించనున్న ఎంసెట్ కౌన్సెలింగ్ విధులకు హాజరు కావడం లేదని బోధన, బోధనేతర సిబ్బంది  శనివారం అడ్మిషన్ల డెరైక్టర్ ప్రొఫెసర్ దశరథరామయ్యకు లేఖ ఇచ్చారు.

 మహిళా భేరి
 సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా తిరుపతిలో ఎమ్మెల్యే కరుణాకరరెడ్డి నేతృత్వంలో శనివారం వేలాది మందితో మహిళా భేరి నిర్వహించారు. విభజన వద్దంటూ మహిళలు గళమెత్తారు. చిత్తూరు జిల్లా మదనపల్లెలో ముస్లిం మైనారిటీలు సుమారు 3వేల మంది శాంతియుత ర్యాలీ నిర్వహించారు.  సమ్మె నోటీసు తిరస్కరించినందుకు ఎస్సీడీసీఎల్ సీఎండీ రమేష్ దిష్టిబొమ్మను ట్రాన్స్‌కో ఉద్యోగులు దహనంచేశారు.

 సోనియాది తొందరపాటు నిర్ణయం: ఎంపీ రాయపాటి
 తెలంగాణవాదుల డిమాండ్లకు తలొగ్గి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా తొందరపాటు నిర్ణయం తీసుకున్నారని  గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు విమర్శించారు. గుంటూరులోని హిందూ కళాశాల సెంటర్‌లో చేపట్టిన రిలే నిరాహార దీక్షలను శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోకుండా ముందడుగు వేసిన పక్షంలో రాజకీయాల నుంచి శాశ్వతంగా నిష్ర్కమిస్తానని ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement