రాఖీ పండుగను పురస్కరించుకుని వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డికి ఆయన సోదరి షర్మిల రాఖీ కట్టారు. రాఖీ పండుగ సందర్భంగా షర్మిల బుధవారం ప్రత్యేక ములాఖత్ ద్వారా చంచల్గూడ జైలులో జగన్ను కలిశారు. జగన్ను కలుసుకోవడానికి షర్మిల జైలు వద్దకు వచ్చే సమయానికి అక్కడ పెద్దఎత్తున మహిళలు వచ్చారు.
సాక్షి, హైదరాబాద్: రాఖీ పండుగను పురస్కరించుకుని వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డికి ఆయన సోదరి షర్మిల రాఖీ కట్టారు. రాఖీ పండుగ సందర్భంగా షర్మిల బుధవారం ప్రత్యేక ములాఖత్ ద్వారా చంచల్గూడ జైలులో జగన్ను కలిశారు. జగన్ను కలుసుకోవడానికి షర్మిల జైలు వద్దకు వచ్చే సమయానికి అక్కడ పెద్దఎత్తున మహిళలు వచ్చారు. జగన్కు రాఖీ కట్టేందుకు జైలు అధికారులు వారిని అనుమతించకపోవడంతో అక్కడే బైఠాయించి తమ నిరసనను తెలియజేశారు. వైఎస్ఆర్ అమర్ హై, జై జగన్ నినాదాలు చేశారు. ఆ సమయంలో అక్కడికి చేరుకున్న షర్మిల వారందరితో మాట్లాడి సముదాయించారు. రాఖీలు కట్టడానికి అక్కాచెల్లెళ్లు మీకోసం వచ్చారని జగనన్నకు తెలియజేస్తానని, మీ అభిమానాన్ని అన్నకి వివరిస్తానని చెప్పి ఊరడించారు.
దీంతో కొందరు షర్మిల, వైఎస్ భారతిలకు, జగన్ కటౌట్లకు రాఖీలు కట్టారు. మరికొందరు జగన్కు అందజేయాలంటూ రాఖీలను ఆయన సతీమణి భారతికి ఇచ్చారు. ములాఖత్ తర్వాత షర్మిల వారితో మాట్లాడుతూ... రాఖీ కట్టేందుకు ఎంతో మంది అక్కాచెల్లెళ్లు వచ్చారని, జైలు బయట ఉన్నారని చెప్పినప్పుడు జగనన్న సంతోషించారని తెలిపారు. అందరి క్షేమ సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారని చెప్పారు. జైలు వద్దకు వచ్చిన వారిలో పార్టీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోహన్కుమార్, నాయకులు సుమతీ మోహన్, అలేఖ్యరెడ్డి, సూరజ్ ఎస్దానీ, డాక్టర్ ప్రకాశ్ వంజరి, డాక్టర్ వరలక్ష్మి, హిమజానాయుడు, ఇబ్రహీం, నహదీ తదితరులు ఉన్నారు.