ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో సమర్థులైన, వాగ్ధాటి నైపుణ్యంగల వారితో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కొత్తగా మీడియా బృందాలను రూపొందించారు.
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో సమర్థులైన, వాగ్ధాటి నైపుణ్యంగల వారితో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కొత్తగా మీడియా బృందాలను రూపొందించారు. అధికార ప్రతినిధుల జాబితాలో మార్పులు జరిగాయి. కేంద్ర మంత్రులు చిదంబరం, సల్మాన్ ఖుర్షీద్, గులాంనబీ ఆజాద్, ఆనంద్శర్మతోపాటు ఏఐసీసీ సెక్రటరీ జనరల్ ముఖుల్ వాస్నిక్లు పార్టీ తరఫున సీనియర్ అధికార ప్రతినిధులుగా ఇకపై వ్యవహరించనున్నారు.
రెండు జాబితాల్లోనూ రాహుల్ అనుచరులకు తగిన చోటు లభించింది. పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఆమె తనయుడు రాహు ల్ కలసి ఈ సారి జాబితాలను ఖరారు చేశారు. 13 మంది అధికార ప్రతినిధులు, 24 మంది మీడియా ప్యానలిస్ట్లతోపాటు.. జాతీయ మీడియాలో రాష్ట్రాల అంశాలపై మాట్లాడేందుకు మరో 30 మంది టెలివిజన్ ప్యానలిస్ట్లను నియమించినట్లు పార్టీ ప్రతినిధి అజయ్ మాకెన్ వెల్లడించారు. 13 మంది పార్టీ అధికార ప్రతినిధుల జాబితాలో.. ఇటీవలే భార్య సునందపుష్కర్ అనుమానాస్పద మృతితో వార్తలకెక్కిన శశి థరూర్కు కూడా చోటు లభించింది. వివాదాస్పద సీడీ వివాదంతో అధికార ప్రతినిధి స్థానం నుంచి తప్పుకున్న అభిషేక్ సింఘ్వికి మళ్లీ చోటు కల్పించారు.