భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం మృతికి ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
దేశం గొప్ప పుత్రుడిని కోల్పోయింది: రాష్ట్రపతి
అబ్దుల్ కలాం మృతికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఒక గొప్ప పుత్రుడిని దేశం కోల్పోయిందని ఆవేదన చెందారు. ‘కలాం మృతి వ్యక్తిగతంగా నాకు తీరని లోటు. ఆయనకు నా గౌరవ నివాళులర్పిస్తున్నాను. ’ అని పేర్కొన్నారు.
మార్గదర్శకుడిని కోల్పోయా: ప్రధాని
ఒక మార్గదర్శకుడిని తాను కోల్పోయానని ప్రధాని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. ‘శాస్త్ర సాంకేతిక, అంతరిక్ష రంగాల్లో విశేష కృషి చేసిన గొప్ప శాస్త్రవేత్త కలాం. భారతదేశానికంతటికీ.. ముఖ్యంగా యువతకు ఆయన స్ఫూర్తి ప్రదాత’ అని పేర్కొన్నారు.
మానవతావాది: నరసింహన్
మాజీ రాష్ట్రపతి అబ్దుల్కలాం మృతి పట్ల గవర్నర్ నరసింహన్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మృతి దేశానికి తీరని లోటన్నారు. ‘‘కలాంతో నాకెంతో అనుబంధముంది. ఆయన రాష్ట్రపతిగా ఉండగా కేంద్రంలో వివిధ హోదాల్లో పని చేశాను’’ అంటూ గుర్తు చేసుకున్నారు.
మానవత్వమున్న శాస్త్రవేత్త: కేసీఆర్
మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మృతి పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం దేశానికి తీరని లోటన్నారు. కలాం హైదరాబాద్లో పలు కీలక పరిశోధనలు చేశారని గుర్తు చేసుకున్నారు. ఆయనది గొప్ప మానవత్వమున్న వ్యక్తిత్వమంటూ కీర్తించారు.
దేశానికి తీరనిలోటు: చంద్రబాబు
కలాం మృతి దేశానికి తీర ని లోటని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. గొప్ప శాస్త్రవేత్తను, మేధావిని, దార్శనికుడిని, స్ఫూర్తి ప్రదాతను దేశం కోల్పోయిందన్నారు.
యుగానికొకరే కనిపిస్తారు: జగన్
మాజీ రాష్ట్రపతి, భరతమాత ముద్దుబిడ్డ అబ్దుల్ కలాం మరణ వార్త తనను కన్నీటి సముద్రంలో ముంచిందని, అలాంటి మహానుభావులు యుగానికొకరు మాత్రమే కనిపిస్తారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు.