పోలీసులకు ప్రీతిజింటా వాంగ్మూలం | Police record Preity Zinta's statement | Sakshi
Sakshi News home page

పోలీసులకు ప్రీతిజింటా వాంగ్మూలం

Jun 24 2014 11:19 PM | Updated on Jul 23 2018 8:49 PM

పోలీసులకు ప్రీతిజింటా వాంగ్మూలం - Sakshi

పోలీసులకు ప్రీతిజింటా వాంగ్మూలం

తన మాజీ ప్రియుడు నెస్ వాడియాపై పెట్టిన వేధింపుల కేసులో బాలీవుడ్ నటి ప్రీతీజింటా మంగళవారం సాయంత్రం ముంబైలోని వాంఖడే క్రికెట్ స్టేడియంలో పోలీసులకు సుమారు గంటన్నరపాటు వాంగ్మూలం ఇచ్చారు.

ముంబై: తన మాజీ ప్రియుడు నెస్ వాడియాపై పెట్టిన వేధింపుల కేసులో బాలీవుడ్ నటి ప్రీతీజింటా మంగళవారం సాయంత్రం ముంబైలోని వాంఖడే క్రికెట్ స్టేడియంలో పోలీసులకు సుమారు గంటన్నరపాటు వాంగ్మూలం ఇచ్చారు. స్టేడియం ఆవరణలోని బీసీసీఐ కార్యాలయంలో రాత్రి 8:20 గంటల వరకూ ఆమె నుంచి పోలీసులు వాంగ్మూలం నమోదు చేసుకున్నారు. అనంతరం 20 నిమిషాలపాటు నాటి ఘటన పరిణామక్రమాన్ని పోలీసులు అంచనా వేయడంలో సాయపడ్డారు. మే 30న ఈ స్టేడియంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టోర్నమెంట్‌లో భాగంగా కింగ్స్-11 పంజాబ్ (ప్రీతి, వాడియా ఈ జట్టు సహ యజమానులు), చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా వాడియా తనను వేధించినట్లు, తన గౌరవానికి భంగం కలిగించినట్లు ప్రీతీజింటా ఈ నెల 12న పోలీసులకు ఫిర్యాదు చేయడం తెలిసిందే.

 

వాడియాపై ఫిర్యాదు చేసిన అనంతరం ప్రీతి అమెరికా వెళ్లిపోవడంతో ఈ సంఘటన కచ్చితంగా ఏ ప్రదేశంలో జరిగింది? ఆ సమయంలో చుట్టూ ఎవరున్నారు? అనే విషయాలపై మరోసారి వాంగ్మూలం నమోదు చేసుకునేందుకు స్వదేశం తిరిగి రావాల్సిందిగా పోలీసులు ప్రీతిని కోరారు. దీంతో ఆదివారం ముంబై చేరుకున్న ప్రీతి మంగళవారం సాయంత్రం స్టేడియానికి వచ్చి పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement