ఐఏఎస్ ఇంటి ముందు భార్య ధర్నా
ఇద్దరూ ఆడపిల్లలే జన్మించినందుకు విడాకులివ్వాలని తన భర్త వేధిస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఐఏఎస్ అధికారి, విశాఖ జీసీసీ ఎండీ రమేష్ కుమార్ భార్య స్వప్న శుక్రవారం ఆయన ఇంటి ముందు ధర్నా చేశారు. ఆమెకు మద్దతుగా ఐద్వా కార్యకర్తలు, నాయకులు తరలివచ్చారు.
ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయిన స్వప్నకు 2001లో రమేష్ కుమార్తో వివాహమైంది. తనకు ఇద్దరూ ఆడపిల్లలే కావడంతో సమస్యలు మొదలయ్యాయని ఆమె ఆరోపించింది. తనను, తన పిల్లలను వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. మగబిడ్డ కోసం తన భర్తకు మరో పెళ్లి చేసేందుకుగాను విడాకులు ఇవ్వాలని బెదిరిస్తున్నట్టు వాపోయింది. తనకు న్యాయం చేయాల్సిందిగా పలువురు అధికారులను కలిసినా ఎవరూ పట్టించుకోలేదని స్పప్న చెప్పింది. తన పిల్లలు, తాను కష్టాలు పడుతున్నామని తమకు న్యాయం చేయాల్సిందిగా కోరింది.