
ఆర్జేడీకి ఎక్కువ సీట్లు వచ్చినా.. నితీశే సీఎం
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి మిత్రపక్షం జేడీయూ కన్నా ఆర్జేడీ ఎక్కువ సీట్లు గెలిచినప్పటికీ జేడీయూ నేత, ప్రస్తుత సీఎం నితీశ్ మళ్లీ సీఎం అవుతారని...
190 సీట్లకన్నా ఎక్కువ గెలుస్తాం: లాలూ
పట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి మిత్రపక్షం జేడీయూ కన్నా ఆర్జేడీ ఎక్కువ సీట్లు గెలిచినప్పటికీ జేడీయూ నేత, ప్రస్తుత సీఎం నితీశ్ మళ్లీ సీఎం అవుతారని ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ స్పష్టంచేశారు. ఆయన గురువారం సాయంత్రం పట్నాలోని తన పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘నేను ఇప్పటికే రేసులో లేను. నేను చేయాల్సి ఉన్న పని చేశాను’ అని స్పందించారు.
అయితే ‘ఉప ముఖ్యమంత్రి పదవి కావాలని ఆర్జేడీ డిమాండ్ చేస్తుందా?’ అన్న ప్రశ్నకు సమాధానం దాటవేస్తూ ‘ముందు ఫలితాలను రానివ్వం డి. అన్ని విషయాలనూ ఆ తర్వాత ఆలోచించవచ్చు’ అని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ల మహాకూటమి మూడింట రెండు వంతుల మెజారిటీ సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీకి 10 నుంచి 40 సీట్ల మధ్య వస్తాయని అభిప్రాయపడ్డారు.
‘మహాకూటమి 190 సీట్లకన్నా ఎక్కువ గెలుచుకుంటుంది. వెనుకబడిన తరగతులు, దళితులు, మైనారిటీలు, అగ్రకులాల్లోని పేద వర్గాల వారిలో 90 శాతం మంది మాకు ఓట్లు వేశారు. రిజర్వేషన్ల విషయంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్భాగవత్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రాన్నంతా రగిలించాయి. బీఫ్ వివాదం రేకెత్తించటం.. బిహారీలనుమోదీ దూషించటం, నన్ను దయ్యం అని తిట్టటం.. ప్రజలు ఈ విషయాలను తీవ్రంగా పరిగణించారు’ అని లాలూ పేర్కొన్నారు.
బిహార్ ఎన్నికల ఫలితాల ప్రాతిపదికగా బీజేపీ అధ్యక్ష పదవికి అమిత్ రాజీనామా చేయనవసరం లేదంటూ రాజ్నాథ్ వ్యాఖ్యలను బట్టి బిహార్లో ఓడిపోతున్నామన్న విషయం వారికి ముందే తెలుసన్నది స్పష్టమవుతోందన్నారు. నితీశ్ తరహాలో బీజేపీ వ్యతిరేక పార్టీలు ఏకం కావాలని విజ్ఞప్తి చేయటానికి భవిష్యత్తులో ఎన్నికలు జరగనున్న పశ్చిమబెంగాల్, యూపీ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు తాను, ఇతర లౌకిక కూటమి నేతలు ప్రయాణిస్తామని చెప్పారు.